breaking news
Second phase of auction
-
మిగిలేది ఎవరు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత ఘట్టం క్లైమాక్స్కు చేరుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణతో పోరు హోరెత్తనుంది. తొలివిడతలో 22 మండలాల్లోని 414 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ కోసం 3513 నామినేషన్లు దాఖలు చేశారు. 3758 వార్డుల కోసం 10,018 మంది తమ నామినేషన్లను సమర్పించారు. 17 గ్రామాల్లో సర్పంచ్ కోసం ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల పరిశీలన ప్రక్రియపై గురువారం రాత్రి వరకు ఉమ్మడి జిల్లాలో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు కాగా, పలు గ్రామాల్లో ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు సింగిల్ నామినేషన్ దాఖలైన 17 గ్రామ పంచాయతీల్లో 15 టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులే. తొలిదశ నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా శుక్రవారం తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల బరిలో ఎంతమంది ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే కీలకం గ్రామపంచాయతీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక భూమిక పోషిస్తున్నారు. వారు సూచించిన నాయకులే పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసేలా చూస్తున్నారు. మొదటి విడతలో 414 గ్రామాల్లో స్పష్టంగా ఈ పరిస్థితి కనిపించింది. ఉమ్మడి కరీంనగర్లో సింగిల్ నామినేషన్ దాఖలైన 17 పంచాయతీల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చక్రం తిప్పారు. చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి తదితర నియోజకవర్గాల్లో నిధులు, అభివృద్ధి మంత్రం ఫలించింది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగే 22 మండలాల్లోని 414 గ్రామాల్లో దాదాపు ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 12 అసెంబ్లీ స్థానాలకు 11 నియోజకవర్గాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవం సాధ్యం కానిపక్షంలో అధికార పార్టీ నుంచి ఒక్కరే అభ్యర్థి ఉండేలా చూస్తున్నారు. మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా గెలుపొందేందుకు మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మాజీ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, రమేష్బాబు, కె.విద్యాసాగర్రావు తదితరులు పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఏకగ్రీవం చేయడం వంటి అంశాల్లో తెరవెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకే పరిమితమవుతూ గ్రామపంచాయతీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. మండల కేంద్రాలుగా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులకు తీవ్ర పోటీ ఉంది. పెద్ద గ్రామపంచాయతీలు కావడం, పన్నుల వసూళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో ఈ స్థానాలకు టీఆర్ఎస్లోనూ తీవ్ర పోటీ నెలకొంటోంది. ఒక్కో మండల కేంద్రం నుంచి ముగ్గురు.. నలుగురు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో మండలస్థాయి నేతలు సైతం ఉండటంతో పార్టీ తరఫున ఎవరికి మద్దతు ఇవ్వాలన్నదానిపై ఎమ్మెల్యేలు దృష్టి సారిస్తున్నారు. ఎక్కువ మంది పోటీదారులున్న మేజర్ గ్రామపంచాయతీల్లో వారిని కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. ఈ క్రమంలో పలు గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని శాసనసభ్యులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నారు. ప్రధానంగా చిన్న గ్రామపంచాయతీలు, తండాలపై దృష్టి సారిస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.10లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని స్థానిక నేతలకు విడమరచి చెబుతున్నారు. ఎమ్మెల్యే, సర్పంచులు ఒకే పార్టీవారుంటే పెద్దఎత్తున నిధులను సులభంగా తీసుకురావచ్చన్న ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మిగతా పార్టీలు గెలిస్తే నిధులు రావని, టీఆర్ఎస్ను గెలిపించాలని గ్రామ ముఖ్యులకు వివరిస్తున్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే పెద్దఎత్తున నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసేలా చూస్తామని ఎమ్మెల్యేలు భరోసా కల్పిస్తున్నారు. మొత్తానికి భారమంతా తమపైనే వేసుకొని పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. అయోమయంలో కాంగ్రెస్, కూటమి గ్రామపంచాయతీ ఎన్నికల్లో అవలంబించే వ్యూహం విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అయోమయ స్థితిలోనే ఉంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా నాలుగు పార్టీలతో ప్రజా కూటమిగా ఏర్పడ్డ పక్షాలన్నీ మళ్లీ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒకే అభ్యర్థికి మద్దతు ఇచ్చే అంశంపై స్పష్టత కొరవడుతోంది. ఉమ్మడి జిల్లాలో మంథని నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి డి.శ్రీధర్బాబు కీలక భూమిక పోషించనున్నారు. జగిత్యాలలో మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినవారే గ్రామపంచాయతీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషించనున్నారు. ఇదే విషయమై ఇటీవల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల సమావేశంలో రసాభాస కూడా జరిగింది. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి, రామగుండంలలో కాంగ్రెస్ మద్దతుదారులు పొన్నం ప్రభాకర్, కటకం మృత్యుంజయం, పాడి కౌశిక్రెడ్డి, ఆరెపెల్లి మోహన్, డాక్టర్ మేడిపల్లి సత్యం, అడ్లూరి లక్ష్మన్కుమార్, రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్లను ఆశ్రయిస్తున్నారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, అవలంబించే వ్యూహాలపై మరోమారు సమావేశం ఏర్పాటు చేసి చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రజాకూటమిలో భాగస్వాములైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు మాత్రం ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్రీయాశీలకంగా ముందుకు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో బీజేపీకి కరీంనగర్, పెద్దపల్లి, చొప్పదండి, వేములవాడ తదితర నియోజకవర్గాల్లో కొంత పట్టుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వీలైనన్ని సర్పంచి స్థానాలను గెలుచుకోవాలని చూస్తోంది. -
రెండో విడత వేలంతో రూ.200 కోట్లు రాబడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) గురువారం నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలం ద్వారా ఖజానాకు సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. హెచ్ఎండీఏ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 30 ప్లాట్లకు సంబంధించి గురువారం పరిశ్రమల భవన్లో ఈ వేలం విధానం ద్వారా అమ్మకం జరిపారు. 133 ఎకరాలను వేలానికి పెట్టగా 33 ఎకరాలను కొనుగోలుదారులు ఈ వేలం ద్వారా సొంతం చేసుకున్నారు. పారిశ్రామిక, గృహ అవసరాల కోసం నిర్వహించిన వేలంలో పలు ప్లాట్లకు గరిష్ట ధర దక్కింది. ఖానామెట్లో గరిష్టంగా ఎకరానికి రూ.29 కోట్ల చొప్పున.. కున్ మోటారెన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదే ప్రాంతంలో మరో ప్లాటుకు ఎకరాకు రూ.18.20 కోట్లు పలికింది. గృహ అవసరాల కోసం ఉద్దేశించిన ప్లాట్లలో అత్యధికంగా షేక్పేట మండలం అల్ హమ్రా కాలనీలో చదరపు గజానికి రూ.76,200 చొప్పున 920 గజాలకు రూ.7 కోట్ల మేర ధర పలికింది. మిగతా ప్రాంతాల్లోనూ భూములు అధిక ధరలకు అమ్ముడయ్యాయని, దశలవారీగా మరికొన్ని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. కాగా రెండో విడత వేలంలో 54 ప్లాట్లను వేలం వేస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసినా.. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ భూములపై కోర్టు కేసుల నేపథ్యంలో వేలం నిలిచిపోయింది. ఈ భూములను కూడా వేలం వేస్తే ప్రభుత్వానికి మరో రూ.500 కోట్ల మేర ఆదాయం లభించే అవకాశముందని టీఎస్ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. తొలి విడతలో అత్యధికంగా రూ.29.2 కోట్లు గత ఏడాది నవంబర్ 25న 27 భూముల తొలి విడత వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి, వేలం వేయగా.. ఎనిమిది చోట్ల భూముల అమ్మకాలకు స్పందన లభించింది. తొలి విడతలో జరిగిన భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.329 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అత్యధికంగా ఎకరాకు రూ.29.28 కోట్లు కోట్ చేసి ఐదెకరాలను దక్కించుకుంది. రాయదుర్గంతో పాటు మణికొండ, కోకాపేట ప్రాంతాల్లోనూ నివాస స్థలాల వేలానికి మంచి స్పందన లభించింది. 2007-08లో జరిగిన వేలం ద్వారా సగటున ఎకరాకు రూ.18 కోట్ల నుంచి రూ.23 కోట్ల మేర పలికింది.