నగరంలో వ్యాపారి కిడ్నాప్..
మొయినాబాద్: నగరంలో ఓ వ్యాపారిని అపహరించిన కిడ్నాపర్లను మొయినాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వ్యాపార లావాదేవిల విషయయై తోటి వ్యాపారే తన స్నేహితులతో కలిసి కిడ్నాప్కు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర కథనం ప్రకారం.. నగరంలోని హిమాయత్నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ వాసీం(40) హైదరాబాద్, ముంబై, గోవా తదితర ప్రాంతాల్లో స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా యాద్గిర్కు చెందిన సలీం(38) కూడా అదే వ్యాపారం చేయడంతో ఆయనతో పరిచయం ఏర్పడింది. గతేడాది వాసీం ఓ ఓడ(షిప్)కు సంబంధించిన స్క్రాప్ ఇస్తానని చెప్పి సలీంతో రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో సలీం సదరు డబ్బులను మూడు దఫాలుగా ఆన్లైన్లో వాసీం ఖాతాలో వేశాడు. కాగా వాసీం స్క్రాప్ను సలీంకు ఇవ్వలేదు. రోజులు గడిచినా సరుకు అందకపోవడంతో సలీం వాసీంను కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు.
మంగళవారం ఉదయం దాదాపు 10 గంటలకు తన బొలేరో కారులో స్నేహితులు ఫకృద్దీన్, జావెద్, వీరేందర్కుమార్తో కలిసి వాిసీం ఇంటికి వెళ్లాడు. అతడిని కిడ్నాప్ చేసి తమ కారులో ఎక్కించుకొని వెళ్లారు. కారు నంబర్ను నోట్ చేసుకున్న కుటుంబీకులు వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. కంట్రోల్ రూం సిబ్బంది హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లను అప్రమత్తం చేశారు. వాసీంను కిడ్నాప్ చేసిన వాహనం హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు నార్సింగి పీఎస్తో పాటు మొయినాబాద్ ఠాణా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న మొయినాబాద్ పెట్రోలింగ్ వాహనం కానిస్టేబుళ్లు పండరయ్య, చంద్రశేఖర్, సత్తయ్యలు అలాగే కొంత ముందుకు వెళ్లారు.
11 గంటల సమ యంలో గండిపేట చౌరస్తాలో వాసీంను కిడ్నాప్ చేసిన బొలేరో వాహనం దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా వచ్చింది. పోలీసులు తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకుని దుండగుల వాహనాన్ని వెంబడించారు. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాక అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న భాస్కర ఆస్పత్రి దగ్గర ముందుకు వెళ్లి పెట్రోలింగ్ వాహనంతో బొలేరో అడ్డుకున్నారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి వ్యాపారి వాసీంను కాపాడారు. నిందితులతో పా టు బొలేరో వాహనాన్ని మొయినాబాద్ ఠాణాకు తరలించారు. మొయినాబాద్ పోలీసుల సమాచారంతో నారాయణగూడ సీఐ భీంరెడ్డి సిబ్బందితో ఇక్కడికి రాగా సీఐ రవిచంద్ర వ్యాపారితో పాటు దుండగులను వారికి అప్పగించారు.
కిడ్నాపర్ల వద్ద కత్తులు...
దుండగులు పథకం ప్రకారం తమ వెంట కత్తులు తెచ్చుకున్నారు. కిడ్నాప్ చే సిన వ్యాపారిని దూరంగా తీసుకెళ్లి కత్తులతో దాడి చేయాలని పథకం ప న్నినట్లు తెలుస్తోంది. కారు సీటు కింద పెట్టుకుని తీసుకొచ్చిన క త్తులను పోలీసులు స్వాధీనం చే సుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.