breaking news
Satrucarla Vijayaramaraju
-
పింఛన్ వార్!
♦ కురుపాం టీడీపీలో ముదురుతున్న వర్గపోరు ♦ శత్రుచర్ల వర్సెస్ జగదీష్ ♦ నువ్వానేనా అన్నట్టుగా వారి అనుయాయులు ♦ పరస్పరం ఫిర్యాదులతో రచ్చ రచ్చ ♦ అధికారులపైనా తీవ్రమైన ఒత్తిడి జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఏ నియోజకవర్గం చూసినా... యుద్ధవాతావరణమే కనిపిస్తోంది. కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్సీలు శత్రుచర్ల... ద్వారపురెడ్డి అనుయాయులైన డొంకాడ... దత్తిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరి ఆదేశాలు పాటిస్తే ఏమైపోతామోనని అధికారులు హడలెత్తిపోతున్నారు. ఇరువర్గాల ఒత్తిళ్ల మధ్య ఇరుక్కుపోతున్నారు. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న పింఛన్ల వార్ జిల్లా అధికారులకు తీరని శిరోభారం తెప్పిస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నరేళ్లు ద్వారపురెడ్డి జగదీష్ వర్గం చక్రం తిప్పింది. ఆయన వర్గీయులుగా ఎంపీపీ దత్తి కామేశ్వరి భర్త లక్ష్మణరావు హవా సాగించారు. జన్మభూమి కమిటీలు కూడావీరి చేతిలో ఉండటంతో అంతా వారికి అనుకూలంగానే నడిచింది. ఈ క్రమంలో తమ అనుయాయులైన అనర్హులకు పెద్దపీట వేశారు. ముఖ్యం గా పింఛన్ల విషయంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఇక, రెండున్నరేళ్ల తర్వాత పవర్ సెంటర్ మారింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు హవా మొదలైంది. ఈయనొచ్చాక పాత జన్మభూమి కమిటీలు రద్ద య్యా యి. వారి స్థానంలో తమ వర్గానికి చెందిన కమి టీలు ఏర్పడ్డాయి. ఈయన అనుచరునిగా జెడ్పీటీసీ డొంకాడ మంగమ్మ భర్త, ఏఎంసీ మాజీ చైర్మన్ డొంకాడ రామకృష్ణ ఆధిపత్యం మొదలైంది. ఇప్పుడు వీరి ఆధ్వర్యంలోనే సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా మొదలవ్వడంతో వివాదం ముదిరింది. పింఛన్ల విషయంలో రగడ ఇక్కడి వర్గపోరు పుణ్యమాని పరస్పరం బహిరంగ విమర్శలకు దిగారు. అంతేనా... ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ముఖ్యంగా పింఛన్ల విషయంలో వీరి మధ్య పెద్ద రగడే నడుస్తోంది. దత్తి లక్ష్మణరావు హవా సాగిన రోజుల్లో పింఛన్ల అక్రమాలు జరిగాయని, అనర్హులైన 76మందికి పింఛన్లు మంజూరు చేశారని డొంకాడ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. కొత్త పవర్సెంటర్ వచ్చాక తాజాగా మంజూరైన 141పింఛన్లలో అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఇచ్చేశారని ఇప్పుడు దత్తి లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు. ఇరువర్గీయులు కొన్ని పేర్లు కూడా ప్రస్తావించారు. నలిగిపోతున్న అధికారులు ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికా రుల పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్న చందంగా తయారైంది. ఇరువర్గీ యుల మధ్య నలిగిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే జిల్లా అడిట్ అధికారి, డీఆర్డీఏ అడిషనల్ ప్రాజె క్టు ప్రసాద్ విచారణ చేపట్టారు. చర్యలు తీసుకునే సరికి ఇరువర్గాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. మూ డు పర్యాయాలు విచారణ చేపట్టినా హాజరు కాలేదని చెప్పి ఎంపీపీ స్వగ్రామంలో కొన్ని పింఛన్లు రద్దు చేశారు. ఇది దత్తి లక్ష్మణరావు ఆగ్రహానికి కారణమైంది. పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా పింఛన్లు ఎలా తొలగిస్తారని అధికారులపై విరుచుకుపడ్డారు. అక్కడ ఎంపీడీఓ పైనే కాకుం డా జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ అడిషనల్ పీడీ ప్రసాద్పైనా మండిపడ్డారు. ఆ మధ్య జెడ్పీ సీఈఓ రాజకుమారి డీఆర్డీఏ ఇన్చార్జి పీడీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ కొచ్చి వీరంగమే సృష్టించా రు. సీఈఓ ఛాంబర్లో అడిషనల్ పీడీ ప్రసాద్పై అంతెత్తున లేచారు. పరిస్థితిని గమనించిన సీఈఓ రాజకుమారి జోక్యం చేసుకుని తొలగించిన పింఛ న్లు పునరుద్ధరిస్తామని చెప్పేసరికి శాంతించారు. ఇక, శత్రుచర్ల వర్గానికి చెందిన డొంకాడ రామకృష్ణ కూడా ఫించన్ల విషయంలో అధికారులపై ధ్వజమెత్తినట్టు తెలిసింది.ముఖ్యంగా మండల స్థాయి అధి కారులపై విరుచుకుపడినట్టు విమర్శలు ఉన్నా యి. తాజాగా శత్రుచర్ల వర్గానికి చెందిన 33 పింఛన్లను అనర్హులుగా తేల్చి, వాటిని తొలగించాలని విచారణాధికారి సిఫార్సు చేశారు. ఇప్పుడా పింఛన్లపై ఎంత రాద్ధాంతం జరుగుతుందోనన్న భయం అధికారులకు పట్టుకుంది. మొత్తానికి ఇరువర్గాల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ఇవీ ఆరోపణలు... రాయఘడ గౌరమ్మ భర్త ఉన్నప్పటికీ వితంతు పింఛను ఇచ్చారని, లచ్చిరెడ్డి దాలినాయుడు ల్యాండ్లార్డు అయినా పింఛను ఇచ్చారని, రా యల అప్పలనర్సమ్మ(ఐడీ నంబర్ 328928)కు భర్త ఉన్నా వితంతు పింఛను అందుకుంటున్నారని, గవరమ్మపేట పంచాయతీ వెంకటరా జపురంలో సంగాపు సత్యవతి(ఐడీ 15939)కి భర్త ఉన్నా వితంతు పింఛను మంజూరు చేశారని, పెళ్లి కాకపోయినా ఎజ్జు గంగమ్మకు వితం తు పింఛను ఇచ్చారని, జియ్యమ్మవలసలో పెద్దింటి అప్పలస్వామి(328741)కి వితంతు పింఛను ఇచ్చారని, జియ్యమ్మవలసకు చెందిన దత్తి నారాయణమ్మ రేషన్కార్డు, ఆధార్కార్డుతో సిద్ధాంతం రాముడమ్మకు పింఛను ఇస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. ఒక్క జి య్యమ్మవలసలో దొంగ దివ్యాంగ సర్టిఫికేట్లతో దాదాపు 60 మంది వరకు పింఛన్లు అందుతున్నాయని ఆరోపించారు. ఎంపీపీ సొంత గ్రామమైన వెంకటరాజపురంలో 16 పింఛన్లు అనర్హులకే ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఫిర్యాదుల నేపథ్యంలోనైనా ఇక్కడ అక్రమాలు జరిగాయన్నది స్పష్టమయ్యింది. -
శత్రుచర్ల జీతభత్యాలు రాబట్టండి
-
శత్రుచర్ల జీతభత్యాలు రాబట్టండి
- అధికారులకు హైకోర్టు ఆదేశం - 1999, 2004 మధ్య కాలంలో జీతభత్యాలు వెనక్కి తీసుకోవాలి - ఆయన్ని ప్రాసిక్యూట్ చేయాలన్న అభ్యర్థన కొట్టివేత సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఉమ్మడి హైకోర్టు గట్టి షాక్నిచ్చింది. విజయరామరాజు ఎస్టీ కాదని ఇప్పటికే న్యాయస్థానాలు తీర్పునిచ్చిన నేపథ్యంలో 1999 నుంచి 2004 వరకు శాసనసభ్యునిగా పనిచేసిన కాలానికి ఆయనకు చెల్లించిన జీతభత్యాలన్నింటినీ తిరిగి రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఎస్టీ కాని విజయరామరాజు విజయనగరం జిల్లా, నాగూరు అసెంబ్లీ (ఎస్టీ) స్థానం నుంచి పోటీ చేసినందుకు ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే తనకు కొండదొర (ఎస్టీ) ధ్రువపత్రం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలంటూ విజయరామరాజు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు సోమవారం తీర్పు ఇచ్చారు. 1999 ఎన్నికల్లో నాగూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి విజయరామరాజు పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఎస్టీ కాదని, క్షత్రియ అని, అందువల్ల ఆ ఎన్నికను కొట్టేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. విచారణ జరిపిన హైకోర్టు విజయరామరాజు క్షత్రియ అని తేల్చింది. సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా అంటే 1999 నుంచి 2004 వరకు విజయరామరాజుకు చెల్లించిన జీతభత్యాలన్నింటినీ తిరిగి రాబట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ జయరాజ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జయరాజ్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. వాటిని పరిగణనలోకి తీసుకు న్న న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు, శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీ కాదని కోర్టు లు స్పష్టంగా తేల్చినందున, అతనికి ఎమ్మెల్యేగా చెల్లించిన జీతభత్యాలు లేదా గౌరవ వేతనాన్ని తిరిగి రాబట్టాలని అధికారులను ఆదేశించారు.