breaking news
saripalli
-
సంచార సన్నాయి..
చినపోలమ్మ జాతర.. కనులపండుగ్గా జరుగుతోంది. ఊక పోస్తే ఊక రాలనంత జనం. ఆడవాళ్ళంతా తల మీద ఘటాలతో ఊగిపోతున్నారు. మగవాళ్ళంతా కోళ్లు, గొర్రెలు పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. డప్పుల మోతలు.. యువకుల చిందులు.. కలగలుపుగా ధూళి రేగుతూ జాతర ఘనంగా జరుగుతోంది.కిట్టడు మహా గొప్పగా, చాలా నేర్పుగా గాల్లోకి తారాజువ్వలు వదులుతున్నాడు. వాడు వదిలిన తారాజువ్వ సాయంత్రపు నీరెండలో ఇంద్రధనుస్సు రంగులను తలపిస్తోంది. ‘బాణసంచా కట్టాలంటే కిట్టడే కట్టాల! వాటిని మళ్ళీ వాడే వదలాల..’ జనం కిట్టడిని ప్రశంసలతో ముంచుతున్నారు. అందరి నోట కిట్టడే నానుతున్నాడు. రకరకాల బాణసంచా పేల్చి కిట్టడు తన ప్రతిభను చాటుకుంటున్నాడు.ఊరంతా సంబరంగా పొలిమేరకు చేరుకుంది. కిట్టడు కట్టిన బాణసంచలో అసలైంది నాగుపాము మందుగుండు. వెదుర్లతో పెద్ద ఎత్తున పాము ఆకారంలో కట్టి దానికి మందుగుండు జతచేసి కాల్చడానికి సిద్ధంగా ఉంచాడు. జనాలంతా తమ మొక్కులు చెల్లించుకుని, కిట్టడు కట్టిన నాగుపాము బాణసంచా కోసం ఆత్రుతగా ఎదురు చూడసాగారు. కిట్టడు దానిని వెలిగించడానికి వెళ్ళాడు. వత్తి ఎంత ముట్టిస్తున్నా వెలగడం లేదని రెండు మూడుసార్లు వెలిగించే ప్రయత్నం చేసి దాన్ని వదిలేసి వేరే దగ్గర ముట్టిద్దామని మరొక వత్తిని వెతికే పనిలో పడ్డాడు.ఇంతలోపు విధి వక్రించిట్టుగా ముందు ముట్టించిన వత్తి వేడికి నెమ్మదిగా రాజుకొని అంటుకుంది. అది గమనించి అక్కడ నుంచి కిట్టడు వెళ్ళేలోపే అందరూ ఊహించని ప్రమాదం జరిగింది. బాణసంచా వెలిగి నాగుపాము పగబట్టినట్లుగా కిట్టడి మీద విరుచుకు పడింది. నల్లగా బలంగా ఉన్న కిట్టడు.. శరీరం కాలిపోయి కమిలిపోయి నెత్తురోడి పడి ఉన్నాడు.‘గంగిరెద్దోలమయ్య మేము.. గరీబోలమయ్యా.. ఊరు వాడ తిరిగేము మేము గూడు లేక ఉన్నాము’ అనే పాటని సన్నాయి రాగంతో వీధిలో ఇంటింటికీ వెళ్ళి వినిపిస్తున్నాడు బసవన్న. కొంతమంది బియ్యం వేశారు. అయినా చాలామంది ఇళ్లల్లో టివీలు చూసుకుంటూ ‘చెయ్యోటం కాదు..’, ‘మళ్ళీ రా..’, ‘పనిలో ఉన్నాను..’ అనే మాటలే జోలిలో బియ్యం కన్నా ఎక్కువ వినిపించాయి. బసవన్న దిగులుగా ఊరు చివర బడి పక్కనున్న మర్రిచెట్టు నీడలో ఏర్పాటు చేసుకున్న గుడారం వైపు అడుగులు వేశాడు. చెట్టు దగ్గరకు చేరుకొని ఎద్దును చెట్టు మొదలకు కట్టి, దాని ముందు ఎండు గడ్డి పరకలు వేసి అక్కడే చతికిలపడ్డాడు. చెట్టు ఆకుల సందుల్ని చీల్చుకొని వస్తున్న ఎండ బసవన్న శరీరం మీద పడుతూ తన తాపాన్ని చూపించింది. ఒక్కసారిగా బసవన్నకు తన గతం గుర్తుకొచ్చింది..ఒకప్పుడు ఎద్దును పట్టుకొని బసవన్న వీధిలోకి వెళ్తే జోలి నిండిపోయేది. సంక్రాంతి సమయంలో మంచి గాత్రంతో బసవన్న పాడుతుంటే ప్రతివాళ్ళు తమ గురించి పాడించుకొని తమకు తోచింది తృణమో పణమో ఇచ్చేవారు. కాలం పగబట్టిన పాములా మారింది. మనుషులంతా ఎవరి పనుల్లో వాళ్ళు తలమునకలైపోయారు. ఎవరూ తమ జాతివారిని పట్టించుకోకపోగా అనుమానంగా, అవమానంగా చూడడం బసవన్నలో మరింత దిగులును పెంచింది.‘మాలాంటి గంగిరెద్దులోళ్ళు ఈదిలోకి వస్తున్నారంటే సాలు సిన్న పిల్లల్ని, కొత్త కోడల్ని దాసిపెట్టేత్తనరు. మేమేదో సిల్లంగి పెట్టేత్తామేమోనని భయపడతన్రు.. ఊరు ఊరు తిరుగుతూ జనాలని పొగిడి వాళ్లిచ్చే బియ్యం, డబ్బులు పుచ్చుకొని బతకడమే తెలుసును గానీ వాళ్ళ దయాభిక్ష మీద బతుకుతూ వాళ్ళకి ఎలా హాని తలపెడతామనుకుంతున్నారో’ అనే ఆలోచన బసవన్నలో మరింత అభద్రతా భావాన్ని పెంచి గోరుచుట్టు మీద రోకలి పోటులా అనిపించింది.ఎండ నడినెత్తికి ఎక్కింది. ఆలోచనల్లో నుంచి బసవన్న బయటికి వచ్చాడు. ఉదయాన్నే బొట్టుబిళ్లలు, కాటుకలు, పిన్నీసులు, తిలకాలు, అద్దాలు, పైన్లు (దువ్వెన్లు) అమ్ముకొద్దామని వెళ్లిన సోములమ్మ నిరుత్సాహంగా గుడారానికి చేరుకొంది. గబగబా గిన్నెలు కడిగి పొయ్యి మీద ఎసరు పెట్టింది. చెట్టుకానుకొని ఉన్న బడిలో మాస్టారు పిల్లలకి చెబుతున్న ‘రాకెట్ అంతరిక్ష ప్రయాణం’ అనే సై¯Œ ్స పాఠం బయటకి స్పష్టంగా వినిపిస్తోంది. బసవన్న ముగ్గురు పిల్లలు మర్రిచెట్టు దగ్గర మట్టిలో ఆడుకుంటున్నారు.ఊర్లో ఇచ్చిన పిండివంటలు కిట్టడికి, ఆమాసకి, పిక్కురుదానికి ఇచ్చి సోములమ్మ నీళ్ళు తేవడానికి బడి బోరింగ్ కాడికి వెళ్ళింది. నిర్జీవంగా ఎద్దు పక్కన కూర్చున్న బసవన్న దీర్ఘంగా ఆలోచనల్లో కూరుకుపోయాడు. నీళ్ళకుండ పట్టుకొస్తున్న సోములమ్మ భర్తను చూసి కుండ దించి దిగాలుగా ఉన్న భర్త పక్కన కూర్చుని ‘ఏమయ్యా.. అలా వున్నావు, ఒంట్లో ఏమైనా నీరసంగా వుందా..?’ అని అడిగింది.సోములమ్మ ప్రశ్నతో బసవన్న ఆలోచనలు చెరిగిపోయి ఈ లోకంలోకి వచ్చాడు. ‘ఏమీలేదే, కానీ..!’ ‘ఏవయిందయ్యా..!’ రెట్టించి అడిగింది సోములమ్మ.ఆమె వంక దిగులుగా చూస్తూ ఖాళీగా ఉన్న జోలిని చూపించి ‘పిల్లల్ని ఎలా పెంచాలో, మనం ఎలా బతకాలో తెల్డం లేదు. మా తాత, మా అయ్యల కడుపు నింపిన ఈ వుత్తి ఇప్పుడు మన కడుపులు నింపడం లేదే..’ అన్నాడు బసవన్న.‘అవునయ్యా.. ఊరు మొత్తం తిరిగినా బొట్లు, పిన్నీసులు కూడా అమ్ముడుపోవడం లేదు’ అంది సోములమ్మ. దూరంగా ఆడుకుంటున్న పిల్లలను చూసింది సోములమ్మ. బక్కచిక్కిన దేహాలతో, చింపిరి బుర్రలతో, కారుతున్న చీమిడి ముక్కులతో తమ తిరుగుడు బతుక్కి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కనిపిపించారు.భార్యవైపు చూస్తూ ‘ఒకప్పుడంటే రేడియో ఒకటే కాబట్టి మనం ఈదిలోకి ఎల్తే అందరూ అడిగిమరీ పాటలు పాడిచ్చుకుని తోచిందిచ్చేవోల్లు. రోజురోజుకీ పరిత్తితులు మారిపోతున్నాయి సినీమాలు, టీబీలు, సెల్లుపోనులు వొచ్చాక మన పాటలు ఎవరింతారు..? పెతీ ఇంట్లోనూ టీబీ పాటలు, సెల్లు మాటలు తప్ప మనల్నెవులు పట్టించుకుంతారు.. వొస్తువులు పెరిగేకొద్దీ మన అవసరం తగ్గిపోతందే..’ అన్నాడు ఆవేదనగా బసవన్న.సోములమ్మ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆమె మదిలో కూడా అలాంటి బాధే సుడులు తిరుగుతోంది. కాసేపయ్యాక ‘సూడయ్యా.. గంగిరెద్దుల్నేసుకుని నువ్వు, బొట్టుబిళ్లలు, పిన్నీసులు, సవరాలు తీసుకుని నేనూ ఎన్నూర్లు తిరిగినా మన బతుకుల్లో శీకటి తప్ప ఎలుగు రాదు, మన పొట్టా నిండదు. కొత్తకొత్త పేషన్లు వచ్చిన తరువాత మన దగ్గర వస్తువులెవలు కొంతారు? ఇప్పుడింటికో కొట్టు, ఈదికో దుకాణం పెడతంటే పాతాటిని పట్టుకుని ఎవలు ఏలాడతారు’ అంది గుండెల్లో బాధను పంటి కింద నొక్కి పెట్టి పవిట కొంగున దాచిపెడుతూ.ఊరూరూ తిరుగుతూ గడిపే బసవన్న కుటుంబానికి తిండి కరువైపోయింది. ప్రభుత్వ పథకాలు పొందడానికి కావలసిన ఆధారాలు కూడా వాళ్ల దగ్గర లేవు. అటు సమాజం నుంచీ, ఇటు ప్రభుత్వం నుంచీ సాయం పొందే అవకాశం లేకుండా బసవన్న బతుకు రెంటికీ చెడిన రేవడిలా తయారైంది.ఇలాంటి ఒడిదుడుకులతోనే ఊరూరూ తిరుగుతూ తమ బతుకు బండిని నడిపించారు బసవన్న దంపతులు. తమ బతుకే ఇంత దీనావస్థ మధ్య సాగుతుంటే రానున్న కాలంలో తమ పిల్లలకి బతుకే ఉండదని భావించిన బసవన్న తన పదేళ్ళ పెద్దకొడుకు కిట్టడిని దగ్గర్లో ఉన్న పట్టణంలోని బాణసంచా దుకాణంలో పనికి కుదిర్చాడు. మిగిలిన ఇద్దరు చిన్న పిల్లల్ని తమ వెంటే తిప్పుతూ రోజుల్ని గడుపుతున్నారు. కిట్టడు ఐదు సంవత్సరాలపాటు బాణసంచా దుకాణంలో పని బాగా నేర్చుకొని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్నాడు.ఇక తమ వృత్తి కడుపు నింపదని బసవన్న సోములమ్మలు ఒక నిర్ణయానికి వచ్చి పెద్దపల్లిలో ఉండిపోయారు. ఎప్పుడూ వేసుకున్న గుడారం కంటే ఈసారి ఇల్లు కాస్త దుటంగా వేసుకున్నారు. వీధుల్లో గంగిరెద్దు తిప్పడం మానేసి బసవన్న పొలం పనులకు కుదురుకున్నాడు. ఇంకా ఆశ చావని సోములమ్మ ఊర్లు తిరుగుతూ పిన్నీసులు, బొట్లు అమ్మడానికి వెళ్తుంది కానీ తన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా నిరాశే మిగులుతోంది.కిట్టడు ఊర్లో జరిగే పెళ్లిళ్లకు, జాతర్లకు, వారాల పండుగలకు మందుగుండు సామాన్లు కట్టే బేరాన్ని కుదుర్చుకొని తన గుడారం వద్దే సొంతంగా బాణసంచా కట్టడం మొదలుపెట్టాడు. ఆమాసగాడిని, పిక్కురుదానిని బసవన్న పెద్దపల్లిలో ఉన్న బడిలో చేర్చాడు. వాళ్ళిద్దరూ బడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ ధ్యాసంతా ఇంటి దగ్గరే!బడి అలవాటు లేని ఆమాసగాడు బడిలో చెప్పాపెట్టకుండా ప్రతిరోజూ బయటకు వచ్చి చింతచెట్ల కింద, తోటల వెంట రహస్యంగా తిరుగుతూ ఒకరోజు బసవన్న కంటిలో పడ్డాడు. తిరుగుతున్న తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ‘ఒరే ఆమాస..! సదువొక్కటే మనకి ఆయుదం. అదే మన బతుకుల్ని మారుత్తుంది, మనకొక దైర్నాన్నిత్తంది. ఊరూరూ తిరగడం తప్ప అచ్చరం ముక్క రాదు మాకు. కనీసం మీరయినా సదువుకుంటే బతుకులు బాగుంటాయిరా. సుకంగా ఉంటారు. అమావాస్య రోజు పుట్టావని అందరూ నిన్ను ఆమాస అని పిలుత్తుంతే నాకెంత బాధగా వుందో ఆలోశించావా? నువ్వు సదువుకుని గొప్పోడివయితే నీ అసలు పేరుతోనే నిన్నందరూ పిలుత్తారు, గౌరవిత్తారు’ అని చెప్పాడు.ఆమాస తండ్రివంక చూశాడు గానీ ఏమీ మాట్లాడలేదు. అతనికీ చదువుకోవాలనే ఉంది. అయినా స్థిరంలేని బతుకు కావడం వల్ల తిరగడం మీదే ధ్యాస తప్ప స్థిరంగా ఒకచోట కూర్చుని చదవాలంటే ఆమాసకి ఇబ్బందిగానే ఉంది. అయినా తండ్రి చెప్పిన మాట అతనిలో ఆలోచనలకు దారితీసింది.బాణసంచా పేలుడులో నెత్తురోడి పడి ఉన్న కిట్టడిని గ్రామస్థులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయారు. కిట్టడి విషయం తెలిసిన సోములమ్మ గుండెలు బాదుకుంటూ ‘మా తిరంలేని బతుకులకి ఎక్కడికి పోయినా సుకం లేదు. మా పని పోయి ఏదొక పని చేసుకొని బతుకుదామని అనుకున్నా దినం దీరడం లేదని’ ఏడుస్తూ భర్తతో కలిసి ఆసుపత్రికి చేరుకుంది.గాయాల మధ్య మూలుగుతూ బాగా కాలిపోయి ఉన్న కిట్టడిని చూసి నిశ్చేష్టులై భార్యాభర్తలిద్దరూ కూలబడిపోయారు. నర్సు వచ్చి ‘కిట్టడిని పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలి, ఆరోగ్యశ్రీ కార్డు, కోటా కార్డు, ఆధార్ కార్డు తీసుకురమ్మ’ని చెప్పింది. ఆ మాట విని ‘అవెక్కడ దొరుకుతాయ’ ని అమాయకంగా అడిగాడు బసవన్న.‘మీకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులయ్యా’ అంది నర్సు. ‘అలాంటివేవీ మా దగ్గర లేవు తల్లీ.. మేము ఊరూరు తిరుగుతూ జీవనం సాగించేవాళ్ళం. మాకంటూ తిరమైన ఇల్లు, వూరు లేవు తల్లీ.. గంగిరెద్దుకు ముస్తాబు చేసి తిరుగుతూ పొట్టపోసుకునే వాళ్ళమ’ ని చెప్తున్న బసవన్న వంక జాలి నిండిన కళ్లతో చూస్తూ ‘కంప్యూటర్ యుగంలో కూడా స్థిరమైన నివాసాలకు, విద్య, ఉద్యోగాలకు దూరంగా బతుకుతున్నారా?’ అని ఆశ్చర్యంగా బసవన్న వైపు చూసి అతన్ని తీసుకుని పక్కనే ఉన్న మండలాఫీసు వైపు నడిచింది నర్సు. అతని పరిస్థితి చెప్పి సర్టిఫికెట్ల విషయంలో సహాయం చేసింది.కొన్నాళ్ళకి కిట్టడి ఆరోగ్యం కుదుటపడింది. పూర్తిగా మానని గాయాల్ని తల్చుకునే కొద్దీ అతనిలో తెలియని వేదన మొదలయింది. తనను ఇంట్లో కూర్చోబెట్టి రోజూ కూలిపనులకెళ్ళి తిండి పెడ్తున్న తల్లిదండ్రుల కష్టం అతన్ని మరింతగా కుంగదీయసాగింది. ఇంతకాలం పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ శ్రమ అతన్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేసింది. తన తర్వాత పుట్టిన తమ్ముడు, చెల్లెలి భవిష్యత్తు గురించి కిట్టడికి ఆలోచనతో పాటు ఆందోళన కలిగింది. ఒకరోజు తల్లి దగ్గరికెళ్లి ‘అమ్మా మరి నేను ఈ బాంబుల పని సెయ్యడం మానేసి పట్నంలో ఏదైనా పనిలో కుదురుకుంటానే’ అన్నాడు.మొహానికి, చేతులకు గాయాలతో ఉన్న కొడుకు వైపు దిగులుగా చూసింది. ప్రమాదం తాలూకు ఙ్ఞాపకాలు ఆమెనింకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన కొడుకు మళ్ళీ ఊపిరి పోసుకుని తనముందు తిరగడం సంతోషంగానే ఉంది. అయినా మళ్ళీ ‘పని పేరుతో’ కొడుకు దూరమవుతానంటుంటే ఆమెలో ఏదో తెలియని ఆందోళన కలిగింది.కొడుకు వైపు చూస్తూ ‘పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీలు తాగడం మేలు అయ్యా. బతకడం కోసం తలో దిక్కు అయిపోవడం కన్నా, అందరం ఒకే దిక్కులో ఉండి గెంజి తాగి బతకుదాం’ అంది సోములమ్మ. ఏమీ మాట్లాడని కిట్టడు తల్లివైపు చూస్తూ బయటికి నడిచాడు. అతనికంతా అయోమయంగా ఉంది. ఏ పనీ చేయకుండా ఇంట్లో ఖాళీగా, తల్లిదండ్రులకు భారంగా ఉండలేకపోతున్నాడు. ఆలోచనలతోనే గంగిరెద్దులకు గడ్డివేస్తూ వాటివైపు చూశాడు కిట్టడు.ఒక్కసారిగా అతనికి బాలాజీ మాస్టారు గుర్తొచ్చారు.. ‘ఒరే కిట్టా..! మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా..’ అని బాలాజీ మాస్టారు చెప్పిన మాటలు కిట్టడి చెవుల్లో మారుమోగుతున్నట్లుగా అనిపించింది. ఒక్కసారిగా కిట్టడికి మనసులో ఏదో స్ఫురించినట్లయింది. గబగబా గుడిసెలోకి నడిచి తండ్రి సన్నాయి వైపు చూశాడు, ఆప్యాయంగా దానిని తడిమాడు.పోగొట్టుకున్న అపూర్వ వస్తువేదో తనను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని చేతుల్లోకి తీసుకోగానే కిట్టడిలో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పారేసుకున్న వారసత్వ సంపద పరిగెత్తుకుని వచ్చి తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా అనిపించింది. సన్నాయిని పెదవులకు ఆనించి ఊదడం మొదలుపెట్టాడు కిట్టడు. నాభి నుంచి గొంతువరకు ఏదో ఆత్మీయ సంగీతసాగరం ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. తెలియని కొత్త అనుభూతి అతన్ని నిలువెల్లా కుదిపేయసాగింది. సన్నాయి రాగంతో పాటు అతని కళ్లు కూడా గంగాప్రవాహంలా మారాయి.గంగిరెద్దును తీసుకొని కిట్టడు వీధి బాట పట్టాడు. తనకొచ్చిన పాటల్ని అలవోకగా సన్నాయి మీద పలికిస్తున్న కిట్టడు అతి కొద్ది కాలంలోనే జనాల్ని ఆకర్షించాడు. కిట్టడి గొంతు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కసాగింది. జోలి నిండా బియ్యం, చేతి నిండా డబ్బులు రావడంతో అతనిలో ఉత్సాహం రెట్టింపయింది. రోజూ ఇలా కిట్టడు వీధిలో ప్రదర్శిస్తున్న దృశ్యాన్ని ఒకరోజు బాలాజీ మాస్టారు సెల్ ఫోనులో వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు.ఇప్పుడు కిట్టడు పాత కిట్టడిలా లేడు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని తన తండ్రి నుంచి వచ్చిన ‘సన్నాయి కళ’కు కొత్త జీవం పోసే పనిలో నేర్పు సంపాదించాడు. ఖాళీ సమయాల్లో తన తండ్రి బసవన్న చేత గంగిరెద్దుని ఆడించడం, వాటికి శిక్షణ ఇచ్చే విధానం, సన్నాయితో పాటలు పలికించే పద్ధతుల్ని చిన్న చిన్న వీడియోలుగా తీసి వాటిని యూట్యూబ్లో నేరుగా కిట్టడే అప్లోడ్ చేయసాగాడు.ఆ వీడియోలు చూసే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగి కిట్టడి గంగిరెద్దుల కళకి ప్రాచుర్యం లభించింది. పట్టణాల్లో పెద్దపెద్ద డబ్బున్నవాళ్ళ వివాహాల్లో కిట్టడి ప్రదర్శన కళ హుందాగా తయారైంది. కళాశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో కిట్టడి గంగిరెద్దుల కళ వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది.‘ఈ కొత్తకొత్త పరికరాలు వొచ్చి మా వుత్తిని రూపుమాపి కడుపు కాల్చితే.. ఈ సాధనాల్నే వుపయోగించి మా కిట్టడు మళ్ళీ మా వుత్తికి జీవం పోశాడు. ఎన్నాళ్ళుగానో అనుకుంతున్న సొంతింటి కల నెరవేరబోతోంది..’ అనుకుంటూ ‘తన కలని, కళని బతికించిన’ కిట్టడి వైపు బసవన్న ఆప్యాయంగా చూశాడు. – సారిపల్లి నాగరాజు -
సరిపల్లిలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం
కొయ్యలగూడెం: ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఆదివారం జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాలరాజు శిలాఫలకాన్ని, సచివాలయం నిర్మించ తలపెట్టిన సామగ్రిని ధ్వంసం చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ పేరిట ప్రణాళిక ప్రకారం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం వద్దకు చేరుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డిŠ, తెల్లం బాలరాజు ఫ్లెక్సీలను, శిలాఫలకాలను ధ్వంసం చేశారు.సచివాలయ కార్యాలయంలోని సామగ్రిని పగలగొట్టి వీరంగం సృష్టించారు. ఎవరైనా అడ్డుకుంటే అంతుచూస్తామంటూ భవన నిర్మాణ కారి్మకులను బెదిరించారు. పక్కన నిర్మాణంలో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహం, స్మారక మందిరం వద్ద దాడులకు పాల్పడుతున్న సమయంలో సమీపంలోని రైతులు ఎదురు తిరగడంతో విరమించుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు పీఏసీఎస్ అధ్యక్షురాలు మందపాటి శ్రీదేవి తెలిపారు.కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయ భవనంపై దాడి చేస్తున్న కూటమి పార్టీ కార్యకర్త -
TIDCO Houses: వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దిన టిడ్కో ఇళ్ల పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలోని సారిపల్లిలో నిర్మించిన 800 యూనిట్లను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందచేసింది. ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం మున్సిపాలిటీలోని పాత్రునివలస–1లో మరో 800 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. తాగునీరు, రోడ్లు, సెప్టిక్ ట్యాంకులు, ఎస్టీపీలు లాంటి మౌలిక వసతులు కల్పిస్తూ టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతులతో సిద్ధమైన 29,572 యూనిట్లను వరుసగా పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నాడు ఎన్నికలకు ముందు అరకొరగా... రాష్ట్రవ్యాప్తంగా 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 36,064 ఇళ్లను లబ్ధిదారులకు వైఎస్సార్ ప్రభుత్వం ఒక్క రూపాయికే అందిస్తోంది. 365 చ.అ విస్తీర్ణంలోవి 13,968 ఇళ్లు, 430 చ.అడుగుల్లోవి మరో 21,040 యూనిట్లు ఉన్నాయి. వీటిని 50 శాతం రాయితీతో లబ్ధిదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులపై భారం మోపుతూ ఎన్నికల ముందు అరకొరగా టిడ్కో ఇళ్లను చేపట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి మౌలిక సదుపాయాలతో వీటిని సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రోడ్లు, పార్కులతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ, మరీ ముఖ్యంగా ప్రతి నిర్మాణానికి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మించిన తర్వాతే లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఈమేరకు సర్వ హంగులతో టిడ్కో ఇళ్లు సిద్ధమవుతున్నాయి. పేదలపై రిజిస్ట్రేషన్ల భారం పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 98 పట్టణ స్థానిక సంస్థల్లో మూడు విభాగాల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నాటికి 1.32 లక్షలకుపైగా యూనిట్లను లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో చురుగ్గా పనులు సాగుతున్నాయి. మిగిలిన ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అన్ని సదుపాయాలతో పూర్తిచేసి లబ్ధిదారులకు అందించనున్నారు. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనతోపాటు రిజిస్ట్రేషన్లను సైతం ఉచితంగా చేసి ప్రభుత్వం అందిస్తోంది. ఒక్క రిజిస్ట్రేషన్ల రూపంలోనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లకుపైగా భారాన్ని భరిస్తుండటం గమనార్హం. -
అందమైన కలలకు రూపం.. 'నగరవనం'
నెల్లిమర్ల: జిల్లా కేంద్రమైన విజయనగరానికి కూత వేటు దూరంలో చుట్టూ పచ్చని కొండలు..దగ్గర్లోనే నది..సమీపంలోనే వెయ్యేళ్ల క్రితం నిర్మించిన జైన దేవాలయం వీటి మధ్యలో 25 హెక్టార్ల సువిశాలమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నగరవనం సందర్శకుల అందమైన కలలకు మరో రూపం కానుంది. అందమైన నగరవనంలోకి త్వరలోనే సందర్శకులను అనుమతించడానికి సంబంధిత అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే రూ 42 లక్షలతో చిల్డ్రన్ పార్క్, వైల్డ్ లైఫ్ సెంటర్, వాకింగ్ ట్రాక్, రాశి వనం ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ పాత్, సైకిల్ పార్క్, ఓపెన్ ఆడిటోరియం, కాలువ పార్క్ అందుబాటులోకి తీసుకురానున్నారు. నగర వనానికి ప్రహరీ నిర్మించి, రక్షణ కల్పించనున్నారు. నెల్లిమర్ల పట్టణానికి విచ్చేసే ప్రధాన రహదారి నుంచి నెల్లిమర్ల పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారిలో సారిపల్లి సెంట్రల్ నర్సరీ ఉంది. ఈ నర్సరీలో నగర వనం ఏర్పాటు చేయాలని 2015లో అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తికాక, ప్రారంభానికి నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని నగర వనాన్ని ప్రారంభించాలని, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. దీని కొసం అవసరమైన చర్యలు చేపట్టాలని తాజాగా అటవీశాఖ అధికారులకు కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు జారీచేశారు. దీంతో డీఎఫ్ఓ శంబంగి వెంకటేష్ తాజాగా నగర వనాన్ని సందర్శించారు. ఇంకా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించి వచ్చే ఏడాది వేసవి ప్రారంభానికి సందర్శకులను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వనం ద్వారా జిల్లా వాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యమని చెబుతున్నారు. వచ్చే ఏడాది అందుబాటులోకి సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాటుచేస్తున్న నగర వనాన్ని వచ్చే ఏడాది సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. 25 హెక్టార్ల సువిశాలమైన ప్రదేశంలో ఇప్పటికే రూ.42 లక్షలతో పలు సౌకర్యాలు, ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రహరీ, ఆర్చ్ నిర్మిస్తాం. అలాగే ఓపెన్ ఆడిటోరియం, ట్రెక్కింగ్ పాత్, కాలువ, పార్క్ తదితరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతాం. సందర్శకులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం అందించడమే నగర వనం లక్ష్యం. శంబంగి వెంకటేష్, డీఎఫ్ఓ, విజయనగరం (చదవండి: డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్) -
హోరాహోరీగా చెడుగుడు పోటీలు
నరసాపురం రూరల్ : రెండు రోజులుగా సరిపల్లిలో నిర్వహిస్తున్న చెడుగుడు పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. గునుపూడి–ఊనగట్ల జట్ల మధ్య జరిగిన పోటీలో గునుపూడి జట్టు, సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్(తుందుర్రు)– పాలకొల్లు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తుందుర్రు టీమ్, భీమవరం– అభి ఫ్రెండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో భీమవరం జట్లు విజయం సాధించి రెండోరౌండ్కు ఎంపికయ్యాయి. ఆదివారం సాయంత్రానికి ఆరు టీమ్లు లీగ్ దశలోకి వెళతాయని రిఫరీ మహేష్నాయుడు తెలిపారు. ఈ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన 16 జట్లు పాల్గొంటున్నట్టు నిర్వాహకులు చెప్పారు. చికిలే డేవిడ్, చికిలే జీవన్కిశోర్, పాలపర్తి శాంతిరాజు, మైలాబత్తుల విజయ్ప్రసాద్ తదితరుల ఆ«ర్థిక సహాయంతో పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మైలాబత్తుల చక్రవర్తి, చిన్నం వెంకట్ తదితరులు తెలిపారు. కార్యక్రమంలో నల్లి అశోక్, బట్టు నాగేశ్వరరావు, చెల్లం రత్నంరాజు, ఈదా ఆనంద్, సిర్రా చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
సరిపల్లిలో చెడుగుడు పోటీలు ప్రారంభం
నరసాపురం రూరల్ : కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల స్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారం సరిపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సర్పంచ్ కేదాసు రమా కాసుమణి యోగేంద్ర ప్రారంభించారు. తొలి రోజు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. వైఎన్ కళాశాల, పెదగరువు టీముల మధ్య పోటీ జరగగా వైఎన్ కళాశాల టీము విజయం సాధించింది. ఈ పోటీలకు రిఫరీగా మహేష్నాయుడు వ్యవహరిస్తున్నారు.