breaking news
sambalpur district
-
అతడి వాలకం చూసి.. పెళ్లి వద్దన్న వధువు
భువనేశ్వర్: కాబోయే భర్త మద్యానికి బానిసయ్యాడని తెలిసిన ఓ వధువు ఆ పెళ్లిని నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఈ వివాహం చేసుకోనని తెగేసి చెప్పడంతో ఆఖరి నిమిషంలో వివాహం రద్దు అయ్యింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఒడిశాలో మంగళవారం జరిగింది. పశ్చిమ ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా జుజుమురా సమితి గోవర్ధన్ బడమల్ గ్రామంలో మంగళవారం ఓ వివాహం జరుగుతోంది. వరుడు పూటుగా మద్యం తాగి వచ్చాడు. అతను తూలిపోతూ కనీసం తాళి కూడా కట్టలేకపోయాడు. ఇది చూసిన వధువు అతనితో పెళ్లి వద్దని పీటల మీద నుంచి లేచి వచ్చేసింది. దీంతో అబ్బాయి తరఫు వారు వధువుని కాసేపు బతిమలాడారు. కానీ వధువు మాత్రం పెళ్లి సమయంలో ఇలా తాగివచ్చిన వాడితో తాను జీవితాన్ని పంచుకోలేనని స్పష్టం చేసింది. చేసేదేమిలేక చివరి నిమిషంలో పెళ్లిని రద్దు చేశారు. వరుడు, అతడి కుటుంబ సభ్యులు తమకు ఇచ్చిన కట్నకానులను తిరిగిచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాగుబోతును పెళ్లి చేసుకోనని కరాకండీగా చెప్పేసిన వధువును పలువురు అభినందించారు. -
పడవ మునిగి 10 మంది మృతి, 30 మంది గల్లంతు
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. సంబర్ పూర్ జిల్లా తీతాపల్లి వద్ద హీరాకుడ్ రిజర్వాయర్లో పడవ మునిగి పది మంది మరణించారు. మరో 30 మంది గల్లంతయ్యారు. మృతదేహాలను వెలికితీశారు. మహానదిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లైన్స్ క్లబ్కు చెందిన వారు మూడు పడవల్లో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారందరూ ఒడిశాకు చెందిన వారేనని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. 30 మందిని సహాయక సిబ్బంది రక్షించినట్టు సమాచారం. పడవలో ప్రయాణిస్తున్న చిన్నపిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారు బతికే అవకాశాలు తక్కువని స్థానికులు అంటున్నారు.