breaking news
samajwadi party rift
-
ములాయంకు మరో షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్వాదీ పార్టీలో చెలరేగిన సంక్షోభం ఇంకా ముగియలేదు. పార్టీ వ్యవస్థాపకుడైన తన తండ్రి ములాయం సింగ్కు అఖిలేశ్ యాదవ్ మరోసారి ఝలక్ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ను తొలగించారు. వీరికి ఎటువంటి పదవులు కేటాయించ లేదని ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్స్ లిస్టులో పేర్కొంది. అఖిలేశ్తో ఎటువంటి విభేదాలు లేవని, తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ములాయం ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అయితే సమాజ్వాదీ పార్టీ సంరక్షుడిగా(పాట్రాన్) ములాయంను కొనసాగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీలో అలాంటి పదవి ఏదీలేదని అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురి తెలిపారు. 'ఇలాంటి పదవి కోసం పార్టీ రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు. ములాయం పార్టీ సంరక్షుడి పదవిలో ఉన్నారో, లేదో నాకు తెలియద'ని ఆయన పేర్కొన్నారు. కొడుకుతో విభేదాల కారణంగా పార్టీ అధ్యక్ష పదవిని ములాయం కోల్పోయారు. జనవరి 1 అత్యవసరంగా నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. తన తండ్రికి నామమాత్రమైన సంరక్షుడి పదవిని కట్టబెట్టారు. తాజా పరిణామంపై ములాయం ఎలా స్పందిస్తారో చూడాలి. -
తండ్రికి షరతు పెట్టిన అఖిలేశ్!
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం సమసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. విభేదాలను పరిష్కరించుకునేందుకు తండ్రీకొడుకులు ములాయం సింగ్, అఖిలేశ్ యాదవ్ జరిపిన భేటీ పలప్రదమైనట్టు సమాచారం. తండ్రీకొడుకుల మధ్య రాజీ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ ప్రతిపాదించారని సమాచారం. శివపాల్ యాదవ్ ను ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఢిల్లీకి పంపాలని షరతు విధించినట్టు తెలుస్తోంది. అలాగే టిక్కెట్ల కేటాయింపు అధికారం తనకే ఇవ్వాలని, ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. కుమారుడు విధించిన షరతుకు ములాయం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. సీనియర్ మంత్రి ఆజాంఖాన్ మధ్యవర్తిత్వంతో ములాయం, అఖిలేశ్ మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. అఖిలేశ్ స్వయంగా ఫోన్ చేయడంతో ములాయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి లక్నోకు హుటాహుటిన వచ్చారు.