
తండ్రికి షరతు పెట్టిన అఖిలేశ్!
సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం సమసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి.
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం సమసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. విభేదాలను పరిష్కరించుకునేందుకు తండ్రీకొడుకులు ములాయం సింగ్, అఖిలేశ్ యాదవ్ జరిపిన భేటీ పలప్రదమైనట్టు సమాచారం. తండ్రీకొడుకుల మధ్య రాజీ కుదిరినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని అఖిలేశ్ ప్రతిపాదించారని సమాచారం.
శివపాల్ యాదవ్ ను ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఢిల్లీకి పంపాలని షరతు విధించినట్టు తెలుస్తోంది. అలాగే టిక్కెట్ల కేటాయింపు అధికారం తనకే ఇవ్వాలని, ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. కుమారుడు విధించిన షరతుకు ములాయం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. సీనియర్ మంత్రి ఆజాంఖాన్ మధ్యవర్తిత్వంతో ములాయం, అఖిలేశ్ మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. అఖిలేశ్ స్వయంగా ఫోన్ చేయడంతో ములాయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి లక్నోకు హుటాహుటిన వచ్చారు.