breaking news
Rural Employment Guarantee
-
కొత్త అవతారంలో నరేగా!
ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా నిరుడు డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించిన వీబీ– జీ రాం జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకొచ్చింది. ఇది రద్దయిన ఉపాధి హామీ పథకం (నరేగా)కు సరికొత్త అవతారం. గత పథకంలోని ‘హక్కుల ప్రాతిపదిక’ను మార్చొద్దనీ, రాష్ట్రాలపై ఆర్థిక భారం పడే విధానానికి స్వస్తిచెప్పి, గతంలో మాదిరే కేంద్రమే భరించాలని పౌరసమాజ కార్యకర్తలతోపాటు కొన్ని రాష్ట్రాలు కూడా కోరాయి. అయితే నరేగా కన్నా ఇదెన్నో రెట్లు మేలని కేంద్రం చెబుతోంది. గత పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి వంద రోజుల పని దినాలకు అనుమతించగా, తాము మరో 25 రోజులు పెంచామని... కూలీల వేతనాలు పెరిగాయని, వారానికోసారి చెల్లింపులు, ఇతర సంస్కరణలు తీసుకురావటంతో అవినీతికి ఆస్కారం ఉండబోదని కేంద్రం చెబుతోంది. పాత పథకంలో ప్రతి 15 రోజులకొకసారి చెల్లించాలన్న నిబంధన ఉన్నా, బ్యాంకింగ్ సదుపాయాలు అంతంతమాత్రమే కావటంవల్ల నిరుపేద కుటుంబాలు నెలల తరబడి వేచిచూడాల్సివచ్చేది. ఈలోగా రోజులు గడవటానికి అధిక వడ్డీ రేట్లకు అప్పులు చేసే వారు. ఇప్పుడు వారానికొకసారి వేతనాలిస్తామంటున్నా ఈ లోటుపాట్లు సరిదిద్దకపోతే నిరుపయోగమే. గ్రామీణ కూలీలకు మరో 25 రోజులు పనిదొరకటం, అందువల్ల అదనపు ఆదాయం రావటం హర్షించదగ్గది. అయితే నరేగాకింద గ్రామాల్లో సంబంధిత పక్షాల సమావేశాల నిర్ణయాల ఆధారంగా చేయించాల్సిన పనులు ఖరారయ్యేవి. తాజా చట్టం ప్రకారం అలాంటి పనులేమిటో కేంద్రం ‘వాస్తవ ప్రమాణాల’ ఆధారంగా నిర్ణయిస్తుంది. దాని కయ్యే వ్యయాన్ని కూడా అంచనా వేస్తుంది. అందులో 40 శాతాన్ని రాష్ట్రం భరిస్తే, మిగి లిన 60 శాతం నిధులు కేంద్రంనుంచి వస్తాయి. చేయించాల్సిన పనులు, వాటి అంచనా వ్యయం ఆధారంగా వివిధ రాష్ట్రాలకు వేర్వేరు కేటాయింపులుంటాయి. కేంద్రం నిర్దేశించిన పనులకన్నా అధికంగా చేయించదల్చుకుంటే అందుకయ్యే మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. పాత పథకంలో నిధుల దుర్వినియోగం మాట వాస్తవం. కనబడని మనుషుల పేర్లతో కైంకర్యం చేసిన ఉదంతాలు అనేకం బయటపడ్డాయి. అందుకే హిందీ రాష్ట్రాల్లో ‘పిశాచ లబ్ధిదారుల’న్న పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడున్న సాంకేతికత అప్పుడు లేదు. మొత్తం కాగితాలపైనే వ్యవహారాలన్నీ నడిచేవి. ఆన్లైన్ వ్యవస్థలు, డిజిటల్ చెల్లింపులు వచ్చాక ఆ బెడద తగ్గింది. ‘నరేగా’ను అవినీతి పేరుతో కొట్టిపారేయటం సరికాదు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2006లో ప్రారంభమైన ఈ పథకం తొలి దశాబ్దకాలంలో దాదాపు కోటిన్నరమంది ప్రజలను దారిద్య్రంనుంచి విముక్తుల్ని చేసింది. ఇది చిన్న విషయమేం కాదు. అలాగే సగటున మహిళలకు 50 శాతం పనులు దక్కేవి. ఈ పథకంవల్ల సాగు పనులకు కూలీల కొరత వస్తున్నదన్న ఫిర్యాదులు ఉండేవి. కానీ జాతీయ గణాంకాలు మాత్రం సాగు పనులు ముమ్మరంగా ఉండే సమయంలో ‘నరేగా’కు డిమాండ్ తక్కువేనని చెబుతున్నాయి. కూలీలకు బేరమాడే శక్తి పెరిగిందనీ, వారి కూలీ రేట్లు పెరిగాయనీ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొత్త పథకంలో రాష్ట్రాలు కూడా వ్యయం భరించాల్సిరావటం ఒకరకంగా విషాదం. ‘నిధులు నిండుకుంటే హక్కులు నీరసిస్తాయ’ని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. ఈ పథ కానికి కేటాయింపుల కోసం రాష్ట్రాలు ముందుగా సంక్షేమ పథకాలకే... మహిళా సంక్షేమా నికే కోత పెడతాయి. గతంలో నిధులు లేక కాదు... అమలుపై ఆసక్తి కొరవడి అత్యధిక పేదరికం ఉండే బిహార్, ఉత్తరప్రదేశ్లు అతి తక్కువ నిధులు వినియోగించాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు నిధుల లేమితో చాలా రాష్ట్రాలు ఆ తోవన పోయినా ఆశ్చర్యం లేదు. మొన్న ఏప్రిల్ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బిహార్లతోపాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణలు నిధుల భారం మోపటాన్ని వ్యతి రేకించాయి. తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కూడా గొంతుకలిపారు. ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయింది. ఎటూ సంక్షేమాన్ని అరకొరగా చేస్తున్నాం... దాన్ని మరింత కత్తిరిస్తే సరిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అను కుంటున్నట్టున్నారు. ఏదేమైనా ఆచరణలో వచ్చే సమస్యల్ని అధ్యయనం చేశాకైనా వీబీ– జీ రాం జీ ని మెరుగుపరచటం మేలు. -
ఉపాధి హామీ రద్దుకు కేంద్రం కుట్ర
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం కుట్ర చేస్తోందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. ఉపాధి హామీ పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ సమష్టిగా జాతీ యస్థాయిలో పోరాటం చేస్తామన్నారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ వ్యవ సాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు–సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీయే తర రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వ కంగానే రాష్ట్రాలకు కఠిన నియమాలు పెడు తూ వేధిస్తోందన్నారు. కేరళ మంత్రి ఎంబీ రాజేశ్ మాట్లాడుతూ.. కూలీల కోసం ఏ సౌక ర్యం కల్పించాలన్నా కేంద్రం అడ్డుపడుతోందని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం అనుసరి స్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ చేపట్టే అందోళనలకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్ర మంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, ప్రధాన కార్య దర్శి వెంకట్రాములు, మేట్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.ప్రసాద్తోపాటు సీపీఎం జాతీ య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’తో శాశ్వత ఆస్తులు
సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించింది. స్థానిక ప్రజలకు శాశ్వత అవసరాలకు ఉపయోగపడేలా ఆస్తుల కల్పన దిశగా పేదలకు పనులు కల్పింస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 515 గ్రామాల్లో కొత్తగా ఆట స్థలాలను తయారు చేశారు. మరో 461 గ్రామాల్లో పార్కులు ఏర్పాటు చేశారు. 6,396 ప్రాంతాల్లో మట్టి రోడ్లు.. 5,007 చోట్ల అంతర్గత రోడ్డు పనులు చేశారు. చిన్నా, పెద్ద తరహా ఆస్తులతో కలిపి దాదాపు ఐదు లక్షల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పనులు చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 275 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 77,70,594 మంది కూలీలకు 22,10,99,729 పని దినాలు కల్పించారు. ఈ పథకం ద్వారా పనులు చేసుకోవడం ద్వారా 46.71 లక్షల కుటుంబాలు రూ.5,084 కోట్ల మేర వేతనాల రూపంలో లబ్ధి పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పనులు కల్పించలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచి్చన 3,85,625 కుటుంబాలకు చెందిన 6,27,989 మందికి పనులు కల్పించడానికి వీలుగా కొత్తగా జాబ్ కార్డులు మంజూరు చేశారు. -
ప్రతి గ్రామం సింగపూర్లా ఉండాలి
గుంటూరు వెస్ట్ : రానున్న నాలుగేళ్లలో జిల్లాలోని ప్రతిగ్రామాన్ని స్మార్ట్సిటీలా తయారు చేయాలని, ఆ గ్రామాలు సింగపూర్లా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలుచేయాలని సూచించారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో శుక్రవారం స్మార్ట్ విలేజ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, ఎన్ఆర్ఇజిఎస్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్విలేజ్లు అంటే గ్రామాల్లోని అన్నివర్గాల వారి జీవనవిధానాలు మెరుగుపడాలని, ప్రతిఒక్కరూ అందమైన గ్రామంలో నివసిస్తున్నామనే భావన కలిగేలా స్మార్ట్విలేజ్లను తీర్చిదిద్దాలన్నారు. గ్రామాలలో అందమైన రోడ్లు, పరిశుభ్రమైన నీరు తదితర సౌకర్యాలను కల్పించాలని, గ్రామాలను గ్రీనరీగా మార్చాలని కోరారు. ప్రతి అధికారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, తన సొంతగ్రామంగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కొంతమంది అధికారులలో అలసత్వం కనిపిస్తున్నదని, అలసత్వాన్ని వీడి ప్రభుత్వ పథకాలను సమర్ధంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఉపాధి హామీలో పనిదినాలు పెంచాలి... ఎన్ఆర్ఇజిఎస్ పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాబ్కార్డుదారులకు పనులు కల్పించాలన్నారు. నిరుద్యోగులు, గర్భిణులు, వికలాంగులతో పనులు చేయించాలని సూచించారు. వారు పనులు చేయలేని పరిస్థితులు ఉంటే వారి తరపువారు పనులు చేసినా సదరు గర్భిణుల ఖాతాలోకి నగదును జమ చేయాలని, పనిదినాలను పెంచాలని ఆదేశించారు. ఇప్పటివరకు కమర్షియల్ భవనాలకు ఇంకుడు గుంతలు తీసుకునే అవకాశం ఉందని, ఇళ్లలో కూడా ఇంకుడుగుంతలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెనాలి ఎంపీడీవో సమావేశం దృష్టికి తీసుకురాగా కమిషనర్ అందుకు అనుమతులు జారీచేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో డిసెంబర్ నెలాఖరు నాటికి 188 గ్రామాలను బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా రూపొందించాలని రామాంజనేయులు సూచించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ జిల్లాలో రూ.70 కోట్లతో 838 గ్రామాలలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీతో నిర్మించేలా పంచాయతీల నుంచి తీర్మానాలు అందాయని తెలిపారు. ఆయా గ్రామాలలో వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ గోపాలకృష్ణ, పీఆర్ ఎస్ఈ జయరాజ్, డీపీవో వీరయ్య, డ్వామా పీడీ కె.బాలాజీనాయక్, వివిధ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలో, ఆర్డబ్య్లూఎస్ ఏఈలు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పరిధిలోకి పంచాయతీ రహదారులు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావు మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో పంట కల్లాలకు ప్లాట్ఫామ్లు గ్రామలకు ఆర్వో ప్లాంట్లు.. గ్రామలకు అధికారాలే కాదు..జవాబుదారీతనం ముఖ్యమే.. హైదరాబాద్: అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా పంట కల్లాల ప్లాట్ఫామ్లు, గిడ్డంగులను గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రైతులు పంటల సమయంలో తమ ధాన్యాన్ని రహదారులపై ఎండబెడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే కల్లాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే గ్రామాల్లో శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ల(ఆర్వో) నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన కూడా ఉందన్నారు. గృహ నిర్మాణానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంత్రి తారక రామారావు ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు... మేజర్ పంచాయతీల్లో 250 మెట్రిక్ టన్నులు, మండల కేంద్రాల్లో 500 మెట్రిక్ టన్నుల గిడ్డంగులు నిర్మిస్తామని వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కల్పించే పని దినాలు చట్టం నిర్దేశించిన దానికంటే తక్కువగా ఉన్నాయని, పనిదినాల సంఖ్య పెంచడం వల్ల.. కూలీలకు వేతనాలతోపాటు, మెటీరియల్ కాంపోనెంట్ పెరగడం వల్ల.. ఎక్కువ ఆస్తుల కల్పనకు వీలు కలుగుతుందని తెలిపారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ప్రభుత్వ పరిధిలోకి రహదారులు గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయతీ పరిధిలోని రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తే..అది రెవెన్యూ వ్యయంగా పరిగణిస్తున్నందున, ఆ రహదారులను ప్రభుత్వ అధీనంలోకి తెస్తే మరిన్ని నిధులు వ్యయం చేయడానికి వీలవుతుందని అన్నారు. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని గత ప్రభుత్వాలు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల కేంద్రం నుంచి పీఎంజీఎస్వై నిధులు రావడం లేదని, ప్రస్తుతం ఆ తప్పును సరిచేసే పనిలో ఉన్నామన్నారు. అధికారాలే కాదు.. బాధ్యతనూ గుర్తెరగాలి... అధికార వికేంద్రీకరణ కోరుతున్న పంచాయతీలు బాధ్యత, జవాబుదారీతనం కూడా పెంచుకోవాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీల్లో ఆస్తిపన్ను, మంచినీటి బిల్లులు చెల్లించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధ్దిని సొంత అభివృద్ధిగా ప్రజలు భావించాలని సూచించారు. సర్పంచులు కేవలం అధికారమే కావాలంటే కాదని, బాధ్యత గుర్తెరగాలని చెప్పారు. వందకోట్లు ఖర్చు చేస్తే..మూడు వేల సింగిల్ విలేజ్ స్కీమ్స్కు తాగునీటి పథకాలు పూర్తి చేయొచ్చని, అలాగే వెయ్యికోట్లు నిధులు ఇస్తే.. సమగ్ర మంచినీటి పథకాలు పూర్తి చేసే అవకాశం ఉన్నందున వాటికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆదర్శ పంచాయతీల అధ్యయనానికి ఇతర రాష్ట్రాలకు సర్పంచులను పంపిస్తామని తెలిపారు. ఈ-పంచాయతీలు...: పంచాయతీల్లో బ్రాడ్బాండ్ నెట్వర్క్ ఉన్న వాటిని ఈ-పంచాయతీలుగా మారుస్తామన్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాలోని 57 పంచాయతీల్లో అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తు తం ఈ-సేవ కేంద్రాల ద్వారా 340 సేవలను అందిస్తున్నామని, వాటి లో 50 సేవలను పంచాయతీలను అందించినా ప్రయోజనం ఉంటుందన్నారు. ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీనిని ‘జీ టు పీ’(గవర్నమెంట్ టు పీపుల్)గా పిలువనున్నట్లు తెలిపారు. విలీనం చేయాల్సిందే.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలంటే శివార్లలోని పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాగాలంటే వీటి విలీనం తప్పనిసరి అని పేర్కొన్నారు.


