స్వామిని దర్శించి వెళుతూ
నగరి వద్ద రోడ్డు ప్రమాదం నలుగురి మృతి
మృతులు తమిళనాడు వాసులు
అందరూ ఒకే కుటుంబీకులు
మృతుల్లో దంపతులు, మృతురాలి సోదరులు
నగరి, న్యూస్లైన్: వారు కంచి వాసులు. వ్యాపార లావాదేవీలతో నిత్యం తీరిక లేకుండా గడిపేవారు. అయితే కుటుంబీకులు అందరూ కలిసి వెళ్లి తిరుమల వెంకన్నను దర్శించుకోవాలనుకున్నారు. పనులన్నీ పక్కన పెట్టి తిరుమల వెళ్లారు. శ్రీవారిని శనివారం రాత్రి దర్శించుకున్నారు. గదిలో బస చేసి ఉదయాన్నే బయలుదేరాలనుకున్నారు. ఇంతలోనే మనసు మార్చుకున్నారు. ఇక్కడే విధి చిన్నచూపు చూసింది. వాహనం బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు.
ఈ ఘటన నగరి రూరల్ మండలం తడుకుపేట వద్ద శనివారం రాత్రి రెండు గంటల సమయంలో చోటు చేసుకుంది. సీఐ నాగేశ్వర రెడ్డి కథనం మేరకు.. కాంచీపురానికి చెందిన పట్టునూలు వ్యాపారి వీజీ.రమేష్షా (55), ఆయన భార్య రత్నాబాయ్ (54), సుగం ధ ద్రవ్యాల విక్రయదారులు పీఎస్.రవి (52) అలియాస్ కందస్వామి, ఆయన భార్య లక్ష్మీబాయ్ (45), పీ.ఎస్.కన్నన్(51) ఆయన భార్య పద్మబాయ్ (44), వీరి కుమార్తె హేమలత (22) శనివారం తిరుమల వెళ్లారు. స్వామి వారిని దర్శించుకుని వచ్చేసరికి రాత్రి అయింది. ఉదయాన్నే కంచికి బయలుదేరాలనుకున్నారు.
ఇంతలోనే మనసు మార్చుకుని కంచికి క్వాలిస్ వాహనంలో పయనమయ్యారు. వాహనాన్ని రమేష్ షా నడిపారు. నగరి రూరల్ మండలం తడుకుపేట జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా రాత్రి రెండు గంటల సమయంలో వాహనం అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రత్నాబాయ్, పీఎస్.రవి, పీఎస్.కన్నన్ అక్కడికక్కడే మృతి చెందారు. వీజీ.రమేష్షా నగరి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీబాయ్, పద్మబాయ్, హేమలతలను చెన్నైకి తరలించారు. సీఐ నాగేశ్వరరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకేసారి తనువు చాలించిన దంపతులు, సోదరులు
పట్టునూలు వ్యాపారి వీజీ రమేష్షా భార్య రత్నాబాయ్కి రవి, కన్నన్లు సోదరులు. శనివారం నాటి ప్రమాదంలో రమేష్ షా దంపతులు, రవి, కన్నన్ మృతి చెందారు. బంధువులు ఆక్రందనలు చేస్తూ ఆస్పత్రికి పరుగులు తీశారు. వీరిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
ఆమె ఆక్రందనే కాపాడింది
ప్రమాదం జరిగిన స్థలం నివాసాలకు దూరంగా ఉంది. రాత్రిపూట రోడ్డు పక్కనపడ్డ వాహనం కనిపించకపోవడంతో క్షతగాత్రులకు సాయం చేసే వారు కరువయ్యారు. వాహనంలో ప్రయాణించిన హేమలత ఫోన్ ద్వారా కంచిలోని బంధువులకు సమాచారం అందించింది. వారు వచ్చే వరకు జాప్యం చేయక హెల్ప్.. హెల్ప్ అంటూ అరవ సాగింది. నైట్ రౌండ్స్ చేస్తున్న ఏఎస్ఐ ఆ అరుపు విని అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స జరిగేలోపు ఆస్పత్రికి చేరుకున్న బంధువులు వీరిని చెన్నైకి తీసుకెళ్లారు.