ఒక టీచర్... ముగ్గురు విద్యార్థులు
- రెడ్డిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఇదీ పరిస్థితి..
- పాఠశాలపై దృష్టిసారించని అధికారులు
ఆమదాలవలస : ఆ పాఠశాలకు ఓ గొప్పదనం ఉంది. ఏంటి అవార్డులు ఏమైనా వచ్చాయనుకుంటున్నారా ఏంటి కానేకాదు. ఆ పాఠశాలలో కేవలం ముగ్గురంటే ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రెడ్డిపేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో... ఉండేది ముగ్గురు విద్యార్థులే అయినే వారికోసం ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయూలు వ్యయం చేస్తోంది. సుమారు మూడు ఏళ్లుగా ఈ పాఠశాలలో ఇదేతంతు జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ దీనిపై సరైన దృష్టి పెట్టలేదు. ఈ పాఠశాలకు ఒక వంట భవనం, తాగునీటి బోరు, వంట పనివారు మిగతా అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా : ఉపాధ్యాయుడు
ఈ విషయంపై పాఠశాలలో పనిచేస్తున్నా ఏకైక ఉపాధ్యాయుడు విశ్వేశ్వరరావును సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. 2011లో నేను ఈ పాఠశాలలో చేరినపుడు 14 మంది పిల్లలే ఉన్నారు. క్రమేపి పిల్లల సంఖ్య తగ్గింది.
పక్క పాఠశాలకు విద్యార్థులను మార్చుతాం : ఎంఈవో
ఈ విషయమై ఎంఈవో ఈశ్వరరావును ప్రశ్నించగా ఈ విషయం కమిషనర్ నూకేశ్వరరావు దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ పాఠశాలలో విద్యార్థులను సమీప గ్రామమైన సొట్టవానిపేటలోని పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.