Recurve section
-
భారత్ చేజారిన కాంస్యం
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత రికర్వ్ పురుషుల, మహిళల జట్లు పతకం సాధించడంలో విఫలమయ్యాయి. ధీరజ్ బొమ్మదేవర (ఆంధ్రప్రదేశ్), అతాను దాస్ (బెంగాల్), తరుణ్దీప్ రాయ్ (సిక్కిం)లతో కూడిన భారత పురుషుల జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా... దీపిక కుమారి (జార్ఖండ్), అంకిత (బెంగాల్), అన్షిక కుమారి (బిహార్)లతో కూడిన భారత మహిళల జట్టు మాత్రం రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్లు మధుర (మహారాష్ట్ర), రిషభ్ యాదవ్ (హరియాణా) సెమీఫైనల్ చేరుకొని పతకాల వేటలో నిలిచారు. క్రిస్టియన్ స్టాడర్డ్, బ్రాడీ ఎలీసన్, జాక్ విలియమ్స్లతో కూడిన అమెరికా జట్టుతో కాంస్య పతక మ్యాచ్లో భారత పురుషుల జట్టు 3–5 సెట్ పాయింట్లతో ఓడిపోయింది. తొలి సెట్ను అమెరికా 57–56తో నెగ్గి 2 పాయింట్లు సాధించింది. రెండో సెట్ 56–52తో అమెరికా ఖాతాలోనే వెళ్లింది. అమెరికా ఆధిక్యం 4–0కు పెరిగింది. మూడో సెట్ను భారత్ 55–54తో గెలిచి 2 పాయింట్లు సంపాదించింది. నాలుగో సెట్లో రెండు జట్లు 56–56తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. ఓవరాల్గా అమెరికా 5–3తో విజయాన్ని ఖరారు చేసుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు భారత జట్టు 5–4తో (53–51, 55–58, 55–56, 54–53, 29–27) కజకిస్తాన్పై గెలిచింది. నాలుగు సెట్ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... భారత్ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో (58–56, 57–56, 55–53)తో ఇటలీపై నెగ్గింది. సెమీఫైనల్లో టీమిండియా 4–5తో (51–54, 50–56, 56–55, 55–53, 25–26) ‘షూట్ ఆఫ్’లో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టు 4–5తో (49–50, 52–54, 52–45, 55–48, 26–27)తో ‘షూట్ ఆఫ్’లో అలెజాంద్రా వలెన్సియా, వాలెంటీనా వాజ్క్వెజ్, మోంటాయ అల్ఫారోలతో కూడిన మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది. చికిత, జ్యోతి సురేఖలకు నిరాశ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ క్రీడాకారిణి తనిపర్తి చికిత, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి నిరాశపరచగా... మధుర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మధుర 142–141తో జ్యోతి సురేఖను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్ల్లో చికిత 134–138తో అదెల్ జెక్సెన్బినోవా (కజకిస్తాన్) చేతిలో, అదితి 129–140తో కార్సన్ క్రాహి (అమెరికా) చేతిలో ఓడిపోయారు.పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో రిషభ్ డెన్మార్క్కు చెందిన మథియాస్ ఫులర్టన్పై గెలిచాడు. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 147–147తో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లోనూ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే రిషభ్ సంధించిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో అతనికి సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. -
మూడో స్థానంలో ధీరజ్
పురుషుల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన ధీరజ్ బొమ్మదేవర 693 పాయింట్లతో మూడో స్థానాన్ని పొందాడు. 684 పాయింట్లతో తరుణ్దీప్ రాయ్ ఏడో స్థానంలో, 672 పాయింట్లతో ప్రవీణ్ జాధవ్ 25వ స్థానంలో నిలిచారు.మహిళల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫయింగ్ రౌండ్లో భారత క్రీడాకారిణులు అంకిత (664 పాయింట్లు), భజన్ కౌర్ (657 పాయింట్లు), దీపిక కుమారి (656 పాయింట్లు) వరుసగా 15వ, 29వ, 30వ స్థానాల్లో నిలిచారు. -
World Archery Youth Championship: ‘పసిడి’ కోమలిక
వ్రోక్లా (పోలాండ్): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్ రికర్వ్ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరి రోజు భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. అండర్–21 జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ ఇలియా కెనాలెస్ (స్పెయిన్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో కోమలిక అండర్–18 విభాగంలోనూ ప్రపంచ చాంపియన్గా నిలిచింది. దీపిక కుమారి తర్వాత అండర్–21, అండర్–18 విభాగాల్లో విశ్వవిజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్గా కోమలిక గుర్తింపు పొందింది. జూనియర్ మిక్స్డ్ ఫైనల్లో కోమలిక–సుశాంత్ సాలుంఖే (భారత్) ద్వయం 5–3తో ఇలియా కెనాలెస్–యున్ సాంచెజ్ (స్పెయిన్) జోడీని ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. ధీరజ్ జట్టుకు స్వర్ణం... జూనియర్ పురుషుల టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్తో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. ధీరజ్, సుశాంత్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–3తో స్పెయిన్ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్మయ్, అమిత్ కుమార్, విక్కీ రుహాల్లతో కూడిన భారత జట్టు 5–3తో ఫ్రాన్స్పై నెగ్గింది. క్యాడెట్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్మయ్–తామ్నా జంట (భారత్) 6–2తో జపాన్ జోడీని ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. క్యాడెట్ మహిళల టీమ్ కాంస్య పతక పోటీలో భారత్ 5–3తో జర్మనీపై గెలిచింది. క్యాడెట్ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో మంజిరి అలోన్ 6–4తో క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. క్యాడెట్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్లో బిశాల్ చాంగ్మయ్ 6–4తో దౌలక్కెల్దీ (కజకిస్తాన్)పై గెలిచాడు. శనివారం కాంపౌండ్ విభాగంలో భారత్కు మొత్తం ఏడు పతకాలు లభించాయి. ఓవరాల్గా ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆర్చర్లు 15 పతకాలు గెలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. -
పురుషుల ఆర్చరీ జట్టుకు దక్కని రియో బెర్త్
అంటల్యా: ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో భారత పురుషుల ఆర్చరీ జట్టుకు స్థానం లేకుండా పోయింది. వరల్డ్ కప్ స్టేజి 3 క్వార్టర్స్లో అతాను దాస్, జయంత తాలూక్దార్, మంగళ్ సింగ్ చాంపియాలతో కూడిన జట్టు 4-5 తేడాతో మలేసియా చేతిలో కంగుతింది. ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఇది తుది టోర్నీ. బెర్త్ దక్కించుకోవాలంటే టాప్-3లో నిలవాల్సి ఉండగా చాంపియా పేలవ ఫామ్తో జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరోవైపు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగం సెమీస్లో అతాను దాస్ 0-6తో యు బోంచన్ (కొరియా) చేతిలో ఓడాడు. అయితే కాంస్యం కోసం ఆదివారం పోటీపడనున్నాడు.