breaking news
Rani Rudramadevi
-
పోరాట పటిమ... రుద్రమ!
రుద్రమదేవి... దక్షిణ భారతదేశాన్ని ఏలిన ఓ మహా సామ్రాజ్ఞి. అందుకు గుర్తుగా వరంగల్ కోట శిథిలాలు, శాసనాలు, కొన్ని కట్టడాలు - తవ్వించిన చెరువులు, హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఓ విగ్రహం.ఇంకా అయితే తెలుగు వాచకంలోనో, చరిత్రలోనో ఒక పాఠం. గూగుల్ సెర్చ్లో మహా అయితే రెండు పేజీల సమాచారం.ఇంతే అయితే ‘రుద్రమదేవి’ని ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు తలుచుకోవలసిన అవసరం ఉండేది కాదు. తనకి స్త్రీవాదం తెలియకపోయినా పురుషాధిక్య ప్రపంచం ఎలా ప్రవర్తిస్తుందో జీవితమంతా తెలుసుకుంటూనే ఉంది. ఆడపిల్ల పుడితే ఖర్చు పెరిగిందని ఏడ్చే తల్లిదండ్రులున్న ఈ సమాజంలో - తన శత్రువుల మీద పగ తీర్చుకునే ఓ మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్న గణపతిదేవ చక్రవర్తి (తన తండ్రి), ఆమె పుట్టినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు?తాను ఎదుగుతున్నప్పుడు తండ్రి బాధ, నిరాశ ఏదో క్షణాన చవిచూసే ఉంటుంది రుద్రమదేవి.ఆ వేదనని దిగమింగుకుని - తండ్రిని బంధించిన దేవగిరి సేనలని ఒకానొకనాడు జయించింది. దేవగిరి ప్రభువు మహదేవుడు కాళ్ల బేరానికొచ్చేంత ఎదిగింది. ఓ మనిషికి అయినా తను తనలా బతకలేకపోవడాన్ని మించిన శాపం ఉండదు. కాని అత్యంత సుకుమారమైన, ఆనందకరమైన స్త్రీ వేషధారణ పక్కనబెట్టి, పురుష వేషంలో రుద్రదేవుడిగా పాలించాల్సిన స్థితి వచ్చింది. అలాంటి క్లిష్టమైన మానసిక ఘర్షణ ఎవరైనా ఎదుర్కొని ఉంటారా?!గుండె ధైర్యానికి స్త్రీ పురుష భేదం లేదు. పైన ధరించే కవచాలో, వస్త్రాలో స్త్రీయా పురుషుడా అని నిర్ణయించవచ్చు.13వ శతాబ్దపు మధ్యయుగం అంటే ఆడవాళ్లని పరిచారికలుగానో, పడకటింటి సుఖంగానో చూసే కాలం. ఒకవైపు రుద్రమదేవి పరిపాలనలోకి రావడానికి ముందు - ఢిల్లీ సామ్రాజ్యాన్ని రజియా సుల్తానా నాలుగేళ్లపాటు పరిపాలించి, ఘోరంగా విఫలమయ్యింది.మరోవైపు పల్నాటి యుద్ధానికి కారణం - నాయకురాలు నాగమ్మే అని జనం మొత్తుకుంటున్నారు.‘నస్త్రీ స్వాతంత్రమర్హతి’ అని మనుధర్మాలు చెవిలో పోరు -ఇంట్లోనే భార్య పెత్తనం భరించలేని మగ మనస్తత్వాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. అలాంటిది 800 ఏళ్ల క్రితం.. 40 సంవత్సరాల పాటు రుద్రమదేవి ఓరుగల్లు కేంద్రంగా దక్షిణ భారతదేశాన్ని పాలించిందంటే - అనునిత్యం ఎలాంటి సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొని ఉంటుంది? పెళ్లయితే ఆడపిల్లకి ఇంటిపేరు మారిపోతుంది. కాని రుద్రమదేవికి భర్త నిడదవోలు రాజు చాళుక్య వీరభద్రుడు అయినా, ఒక్కనాడు కూడా చాళుక్య రుద్రమదేవి కాలేదు. ఆనాడు - ఈనాడూ కాకతీయ రుద్రమదేవే. తన అస్తిత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటూ వచ్చిందో? మగాడి పరిపాలనకి, ఆడదాని పరిపాలనకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. యుద్ధాల కన్నా జీనవ పరిస్థితులు మెరుగుబడేలా చేసింది రుద్రమదేవి. కాకతీయ రాజవంశం తవ్వించిన చెరువులతో పాటు ఏ కాలంలో ఎలాంటి పంటలు పండాలో సూచించే వ్యవసాయ శాస్త్రం అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఆ రోజుల్లోనే ప్రసూతి వైద్యశాలలు ఏర్పరిచింది. ఆడవాళ్లపై అత్యాచారం చేస్తే బీజచ్ఛేదం చేయించేది. ఏళ్ల తరబడి విచారణలు, సాక్ష్యాలు, మానవతావాదం పోరాటాల గురించి ఆగిందే లేదు.రాజ్యాధికారం కోసం భర్త వేధించినా, సహించిందే తప్ప, లొంగలేదు. సంసారం కోసం దేశాన్ని తాకట్టు పెట్టలేదు. తండ్రిని ఎంతగా ప్రేమించి, గౌరవించిందంటే గణపతి దేవుడు చనిపోయినప్పుడు - తండ్రితో పాటు సహగమనానికి సిద్ధపడింది. (అది చూసి పొరబడ్డ తొలి తెలుగు చరిత్రకారుడు ఏకామ్రనాథుడి నుంచి విదేశీ యాత్రికుడు మార్కోపోలో వరకూ గణపతి దేవుడు, రుద్రమదేవి భార్యాభర్తలని తప్పుగా అర్థం చేసుకుని రాసినవాళ్లున్నారు)‘రుద్రమదేవి’ గురించిన రెండున్నర గంటల సినిమా తీసినా ఆవిడ గురించి చెప్పడానికి సరిపోలేదు. అలాంటిది రుద్రమదేవిని ఈ ఒక్క పేజీలో ఆవిష్కరించడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ ఒక విషయం చెబుతున్నాను - ‘రుద్రమదేవి’ సినిమాలో ‘రుద్రమదేవి’ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని మాటలు రాశాను. ‘ఒక తల్లిపాలు తాగినవాళ్లు అన్నదమ్ములయితే - ఒకే నది నీళ్లు తాగేవాళ్లు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కాలేరా?’ ఈ మాట రుద్రమదేవి అందో లేదో తెలీదు. కాని మహారాణి అయినా ఒక అమ్మ కాబట్టి - ఆడది కాబట్టి ఖచ్చితంగా అనే ఉంటుంది. లేకపోతే శత్రుసైన్యాన్ని చంపి, వాళ్ల రక్తంతో బలికూడు తినే ఆ కిరాతకపు మధ్యయుగపు రోజుల్లో ఆగర్భ శత్రువు దేవగిరి మహదేవుణ్ని రుద్రమదేవి ఎందుకు క్షమించి ఉంటుంది? స్త్రీకి మాత్రమే ప్రత్యేకమైన సున్నితమైన మనసు, మాతృత్వ భావన అది. ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ లాంటి వేడుక రుద్రమదేవి కాలంలో జరుపుకున్నారు. అదే దసరా తర్వాత వచ్చే కౌముదీ ఉత్సవం.ఆ శరత్కాలపు పౌర్ణమి రాత్రి ఆడవాళ్లకి కావల్సినంత స్వేచ్ఛావిహారం. మగవారు ఆ రోజు బయట తిరగడానికి వీల్లేదు. ఆటలు, పాటలు, అలంకరణలు, వేడుకలు, ఏమైనా లేడీస్ నైటవుట్. అలా ఈ మహిళా దినోత్సవం రోజున అయినా ఆడవాళ్లని వేధించకుండా - వారి మనసుకి నచ్చినట్లు ఉండనివ్వగలరా? ఆ కౌముదీ ఉత్సవం నాడయినా - ఈ మహిళా దినోత్సవం నాడయినా - ఆడవాళ్లు ఏం కోరుకుంటారో నేను కొంత ఊహించగలను. వాళ్ల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇచ్చే స్వేచ్ఛ - వారి ఆనందానికి, సంతోషానికి అడ్డురాని కట్టుబాట్లు - వారి రక్షణకి ఆటంకం కలిగించని సామాజిక పెంపకం- ఈ లోకమంతా పచ్చగా - యుద్ధాలు, రక్తపాతాలు, ద్వేషాలు, హింసలు లేని - గలగల నవ్వుల ఓ రసమయ జీవన గీతాన్ని!! ఇంట్లోనే భార్య పెత్తనం భరించలేని మగ మనస్తత్వాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఉన్నాయి. అలాంటిది 800 ఏళ్ల క్రితం.. 40 సంవత్సరాల పాటు రుద్రమదేవి ఓరుగల్లు కేంద్రంగా దక్షిణ భారతదేశాన్ని పాలించిందంటే - అనునిత్యం ఎలాంటి సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొని ఉంటుంది? -
అందుకే ఈ సాహసం చేశా! : దర్శకుడు గుణశేఖర్
‘‘ఇది మన సినిమా అని తెలుగు వారందరూ గర్వపడేలా ఉంటుంది. నాకిలాంటి అవకాశమిచ్చిన గుణశేఖర్గారికి థ్యాంక్స్’’ అని అల్లు అర్జున్ అన్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ముఖ్య పాత్రల్లో శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మించిన చిత్రం ‘రుద్రమదేవి’. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ- ‘‘కమర్షియల్... ఆర్ట్.. ఏదైనా కావచ్చు.. ఏ సినిమా అయినా నాకిష్టమే. కరెక్ట్గా చెప్పాలంటే ‘మంచి సినిమాలు’ ఇష్టం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత మంచి సినిమా అందించడానికి తపించిన దర్శకుడు గుణశేఖర్కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు చే యడం అనుష్కకే సాధ్యం. ‘అరుంధతి’ సినిమా తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేయగలనని నిరూపించుకున్నారు. ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడ్డారు. ఆమెలా ఎవరూ కష్టపడలేరు. ఇలాంటి జోనర్ మూవీస్ వస్తేనే ఇండస్ట్రీకి బాగుంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రాన్ని ఎంత పేషనేట్గా స్టార్ట్ చేశామో, అంతే ఉత్సాహంతో పూర్తి చేశాం. ఇది మా రెండున్నరేళ్ల కష్టం’’ అని అనుష్క అన్నారు. రుద్రమదేవి కథే నాకు గుప్తనిధి - గుణశేఖర్ గుణశేఖర్ మాట్లాడుతూ- ‘‘కాకతీయుల చరిత్రను ఏ మాత్రం వక్రీకరించకుండా తీశాం. ప్రముఖ చరిత్రకారులను కలిసి, పరిశోధన చేశాం. అన్ని పుస్తకాల్లో చరిత్ర ఒకేలా లేదు. ఒక్కో పుస్తకంలో ఒక్కోలా ఉంది. అందుకే శిలా శాసనాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇంత అద్భుతమైన చరిత్రను రెండు గంటల 37 నిమిషాల్లో చెప్పడం సాహసంగా అనిపించింది. 800 ఏళ్ల క్రితం ఓ 40 ఏళ్ల పాటు ఓ స్త్రీ రాజ్యాన్ని ఎలా పాలించింది? దాని వెనకాల ఆమె చేసిన కృషి, త్యాగాలను చూసి స్ఫూర్తి పొందాను. రుద్రమ కథ అనే గుప్తనిధి నాకు దొరికింది. అందుకే ఈ సాహసానికి పూనుకున్నాను’’ అని అన్నారు. రానా మాట్లాడుతూ- ‘‘చరిత్రను అద్భుతంగా చెప్పాలంటే సినిమా ప్రధాన సాధనం. నాకు చరిత్ర నేపథ్యంలో వచ్చే సినిమాలంటే చాలా ఇష్టం. 2005లో నేను విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న సమయంలోనే గుణశేఖర్గారు నాకీ కథ చెప్పారు. ఈ సినిమాలో ఓ నటుడిగా నేనూ భాగం అయినందుకు సంతోషంగా ఉంది. రాణీ రుద్రమదేవి అంటే అనుష్క అనే విధంగా ముందు తరాలకు గుర్తుండిపోతుంది’’ అని చెప్పారు.