breaking news
Ramakrishna Theatre
-
కన్నెర్రజేస్తాం..ఖబడ్దార్!
సాక్షి, రాజమండ్రి :రాజమండ్రిలో రామకృష్ణ థియేటర్ వెనుక ఆవలో నిర్మించిన గృహ నిర్మాణ సముదాయంలో ఫ్లాట్ల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహించబోగా.. ఆటంకపరిచిన మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, ఇతర తెలుగుదేశం నాయకులకు ఎదురైన చేదు అనుభవమే అందుకు ఉదాహరణ. గతంలో ఎన్నడూ చోటు చేసుకోని ఈ పరిణామం నేతలకు వణుకు పుట్టించగా.. జనంలో వచ్చిన కొత్త చైత న్యాన్ని చాటి చెప్పింది.పట్టణ పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా రాజమండ్రిలో లాలాచెరువు, తాడితోట రామకృష్ణ థియేటర్ వెనుక, పేపరుమిల్లు వద్ద ధవళేశ్వరంలలో సుమారు 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఆరేళ్ల క్రితం నిర్మాణం మొదలైంది. ఆయన మరణానంతరం ప్రభుత్వం ఈ నిర్మాణాలు పూర్తి చేయడంలో తీవ్రజాప్యం చేసింది. అధికార పార్టీ ప్రతినిధులు తమ అనుయాయులకు ఇళ్లు కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు చెలరేగిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇప్పటివరకూ ఆ ఇళ్లు అందలేదు. బినామీలు, అనర్హులు ఇళ్లు సంపాదించగా అధికారులతో పోరాడలేక అర్హులైన వారు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లాలాచెరువు వద్ద ఇళ్ల కేటాయింపులు చేపట్టిన అధికారులకు లబ్ధిదారులు నిరసనల సెగ చూపించారు. తాజాగా గురువారం రామకృష్ణ థియేటర్ వెనుక ఆవలో నిర్మించిన 2256 గృహాల సముదాయానికి సంబంధించి లబ్ధిదారులకు లాటరీ ద్వారా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో ఏ నేతకూ ఈ గతి పట్టలేదు..! ఆరేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఇన్నాళ్లకు కొత్త సంవత్సరంలో కొత్త ఇల్లు సొంతం కానుందని సంతోషిస్తుంటే.. టీడీపీ నేతలు, కార్యకర్తలు లాటరీ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతును పిలిచి తమ పార్టీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ను పిలవలేదంటూ మాజీ మంత్రి గోరట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో అడ్డుపడ్డారు. ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ డ్రా తీసే స్లిప్పులను చించేశారు. దీంతో లబ్ధిదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గోరంట్లతో సహా టీడీపీ వారిని రాళ్ళతో కొట్టారు, రోడ్డు మీది దుమ్మెత్తి పోశారు. ఈ పరిణామాన్ని ఊహించని గోరంట్ల మ్లానవదనంతో, అవమానభారంతో అక్కడి నుంచి ఉడాయించాల్సి వచ్చింది. బహుశా.. ఇలాంటి దుస్థితి గతంలో జిల్లాలో ఏ నేతకూ ఎదురై ఉండదని అంటున్నారు. కొనసాగుతున్న రాజకీయ రచ్చ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రోజుకో జాబితా తయారు చేసి తమ వాళ్లకు పెద్ద పీట వేశారని, కార్పొరేటర్లకు పంపకాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో గృహ నిర్మాణానికి చాలాకాలం గ్రహణం పట్టింది. వేలాది రూపాయలు వడ్డీలకు తెచ్చి డీడీలు కట్టిన వారు జాబితాల్లో పేర్లు కనిపించక ఆవేదన చెందారు. చివరికి వివాదాలు సద్దుమణిగి ఇళ్లు కేటాయించే సమయంలో ఆ కార్యక్రమాన్ని కాస్తా రాజకీయరచ్చగా మార్చడం పట్ల పేదలు నిప్పులు కక్కుతున్నారు. ఉవ్వెతున్న ఎగసిన లబ్ధిదారుల ఆగ్రహాన్ని చూశాక కూడా టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారి వారి రాజకీయ ఎత్తుగడలు కొనసాగించారు. గృహాల కేటాయింపులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు తాడితోట సెంటర్ వద్ద ధర్నా చేసయగా ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తన అనుచరులతో మద్దతు పలికారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన రౌతు ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఇళ్ల కేటాయింపులు చేసి తీరుతామన్నారు. ప్రస్తుతం ఇళ్లు నిర్మించిన స్థలాన్ని గతంలో గోరంట్ల అమ్ముకోజూశారని ఆరోపించారు. కాగా అంతకు ముందు గోరంట్ల తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఇళ్లను అమ్ముకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతిని ఎండగడతామన్నారు. కాగా తమ దాడికి కాంగ్రెస్ నాయకులే కారణమంటూ టీడీపీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీరేం నేతలు సార్..! వడ్డీలకు తెచ్చి రూ.45 వేలు కట్టాను. ఇప్పటికీ ఇల్లు ఇవ్వలేదు. ఇన్నాళ్లకు మా ఆశలు నెరవేరుతున్నాయంటే ఈ నాయకులు రాజకీయాలు చేసి ఇళ్లు రానీకుండా చేస్తున్నారు. వీళ్లు పెట్టరు.. పెట్టనివ్వరు. వీరేం నేతలు సార్! - ధవళేశు లక్ష్మి, రాజమండ్రి పండుగ చేసుకోవాలనుకున్నాం.. కొత్త సంవత్సరం ఇళ్లు వస్తాయని ఆశపడ్డాము. మా అబ్బాయితో కలిసి ఇక్కడికి వచ్చాను. మా కాలనీలో పండుగ చేసుకోవాలని అనుకున్నాము. కానీ ఇళ్లు ఇచ్చే సమయానికి నాయకులు అడ్డుకున్నారు. వీరేం పెద్దమనుషులు? - సత్యవతి (లబ్ధిదారుడైన వికలాంగుడు రమణ తల్లి) రాజమండ్రి -
బాకీ డబ్బులివ్వలేదని దారుణం
= మారుణాయుధాలతో దాడి = అక్కడికక్కడే వ్యక్తి దుర్మరణం = అబిడ్స్లో ఘటన అఫ్జల్గంజ్,న్యూస్లైన్: అప్పుగా తీసుకున్న డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా అప్పు ఇచ్చిన వ్యక్తిని హతమార్చాలని చూస్తున్న మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మారణాయుధాలతో దాడి చేసి సదరు వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. ఈఘటనలో పోలీసులు నిందితులను 24 గంటల్లోపు అరెస్ట్చేసి కటకటాల్లోకి తరలించారు. ఈ దారుణం అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం అబిడ్స్ పోలీస్స్టేషన్లో సెంట్రల్జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి ఏసీపీ జైపాల్, సీఐ గురురాఘవేంద్రలతో కలిసి మీడియాకు వివరించారు. ఎంజేమార్కెట్ శంకర్బాగ్కు చెందిన ఉదయ్ఆనంద్(32)కు నేరచరిత్ర ఉంది. 15 ఏళ్లక్రితం అబిడ్స్ రామకృష్ణ థియేటర్లో సినిమా టికెట్లను బ్లాక్లో విక్రయించేవాడు. తర్వాత పండ్లవ్యాపారం చేసి కాస్త డబ్బుకూడ బెట్టి ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించాడు. ఇలా స్థానికంగా ఉంటున్న తోపుడుబండ్లు, ఇతర వ్యాపారులకు 5శాతం వడ్డీకి డబ్బులిచ్చేవాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన రమేష్రాజు (45) నగరానికి వలసొచ్చి ఎస్సార్నగర్ కళ్యాణ్నగర్లో స్థిరపడ్డాడు. బ్లాక్టికెట్లు విక్రయించిన రమేష్రాజుకు అప్పట్లోనే ఉదయ్ఆనంద్తో పరిచయమైంది. అయితే రమేష్రాజు తన అవసరం నిమిత్తం ఉదయ్ఆనంద్ వద్ద రూ.6లక్షలు 5శాతం వడ్డీకి అప్పు తీసుకున్నాడు. తీసుకున్న దానికి ప్రతినెలా రూ.30వేలు వడ్డీ చెల్లించేందుకు బాండ్పేపర్పై లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత బాండ్పేపర్ కనిపించకపోవడంతో ఉదయ్ఆనంద్ మరో బాండ్పేపర్ రాయాలని రమేష్రాజును అడిగాడు. ఇక అప్పటినుంచి వడ్డీ డబ్బులు కట్టడం మానేశాడు. ఇది ఇద్దరి మధ్య పలుమార్లు ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు చంపుకునే యత్నం: ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతుండడంతో ఒకరినొకరు చంపుకునేందుకు పథకం పన్నారు. రమేష్రాజు తనను చంపేందుకు యత్నిస్తున్నాడని ఇతరుల ద్వారా తెలుసుకున్న ఉదయ్ఆనంద్ తనపై దాడికి రాకముందే రమేష్రాజును మట్టుబెట్టాలని పథకం రచించాడు. ఇందులో భాగంగా పాతనేరస్తుడైన సయ్యద్సలీం, గౌలిగూడకు చెందిన డి.విజయ్, బంజారాహిల్స్కు చెందిన మహ్మద్అహ్మద్లను సంప్రదించాడు. మంగళవారం సాయంత్రం అప్పు కావాలని వచ్చిన రమేష్రాజును ప్లాన్ప్రకారం బిగ్బజార్ సమీపంలోని ఫైనాన్స్ కార్యాలయానికి రమ్మన్నాడు. అక్కడ్నుంచి టీ తాగుదామని హోటల్కు తీసుకెళ్లిన ఉదయ్ఆనంద్ అప్పటికే మాటువేసిన తన అనుచరుల సాయంతో కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హతమార్చారు. సమాచారమందుకున్న అబిడ్స్ పోలీసులు రక్తపుమడుగులో పడివున్న రమేష్రాజును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న అబిడ్స్ పోలీసులకు మృతుని వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు డాగర్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించారు. 24గంటల్లో నిందితులను అరెస్ట్చేసిన ఏసీపీ జైపాల్, సీఐ గురురాఘవేంద్ర, ఎస్ఐలు శ్రవణ్కుమార్, నాయుడు ఇతర సిబ్బందికి త్వరలో రివార్డులను అందించనున్నట్లు డీసీపీ వెల్లడించారు.