breaking news
Ramadan 2022
-
SPSR Nellore: అజీజ్ భాయ్ ఏ క్యా హై!
సాక్షి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అలాంటిది పవిత్ర రంజాన్ రోజున టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వైఖరి ముస్లిం వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ విస్మయాన్ని కలిగించాయి. సహనం, ఓర్పు, క్షమాగుణానికి ప్రతీక రంజాన్ పండగను ముస్లిలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆత్మీయతతో నిర్వహిస్తారు. ఈ పవిత్ర పర్వదినం రోజున శత్రువులను సైతం క్షమించాలని ఇస్లామిక్ మత బోధనలు వివరిస్తున్నాయి. మంగళవారం బారా షహీద్ దర్గాలో ముస్లిలు ప్రార్థనల అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను ఆలింగనం చేసుకోబోతుంటే తిరస్కరించారు. అజీజ్ చర్యను ముస్లిం మత పెద్దలు సైతం తప్పు పట్టారు. దైవం కారుణ్యం చూపిస్తారని, సాటి మనిషిని ఆదుకునే అవకాశం కలుగుతుందని, జన్మకు సాఫల్యం లభిస్తోందని ఏడాది పాటు ముస్లిలు ఎదురుచూసే పండగ రంజా¯న్. ఈ మాసం ప్రారంభం కాగానే, అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలతో ప్రత్యేక ప్రార్థనలతో ముస్లిలు నైతిక విలువలతో మెలగడం ఆనవాయితీ. ఈ నెలంతా పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. పవిత్ర రంజాన్ పండగ రోజున ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఒకరిని మరొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు, సంఘీభావం చెప్పుకోవడం ఆనవాయితీ. ఇలాంటి సందర్భంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బారాషహీద్ దర్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కూడా హాజరయ్యారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా ఇరువురు ప్రజా ప్రతినిధులు సహచర ముస్లింలతో ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు, సంఘీభావం తెలియజేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ను ఆలింగనం చేసుకోబోగా అబ్దుల్అజీజ్ ఎమ్మెల్యే గుండెలపై చేతులు వేసి తోశారు. దీన్ని ప్రత్యక్షంగా గమనించిన ముస్లి మత పెద్దలు, సహచరులు వారించినా అబ్దుల్ అజీజ్ లెక్క పెట్టలేదు. అజీజ్ వైఖరిని ముస్లిం మత పెద్దలతో పాటు ముస్లింలు సైతం తప్పుపట్టారు. పవిత్ర రంజాన్ మాసంలోనే కాకుండా రంజాన్ పర్వదినం రోజున కుల,మతాలకు అతీతంగా ముస్లింలు అందరిని ఆహ్వానించి తమ పవిత్ర భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం ఆనవాయితీ. ఇన్ని దశాబ్దాల్లో రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి వైఖరి విధానాలు ఎప్పుడూ చూడలేదని మత పెద్దలు నివ్వెరబోయారు. పార్టీలు వేరైనా ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరిని గౌరవించుకోవడం గౌరవనీయంగా సాగింది. అబ్దుల అజీజ్ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించారు. ముస్లింల తరఫున కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. అజీజ్ ఇస్లామ్ ధర్మాన్ని ధిక్కరించాడు పవిత్ర రంజాన్ పండగ అంటేనే శాంతి, సహనం, త్యాగానికి ప్రతీక. అలాంటి పవిత్ర పర్వదినంన ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని టీడీపీ నేత అజీజ్ నెట్టి వేయడం దుర్మార్గ చర్య. ఇది ఇస్లాం ధర్మాన్ని ధిక్కరించడమే. ఇస్లాం ధర్మం కూడా తెలియకుండా అజీజ్ ప్రవర్తించడం ఆయన అనైతికతకు నిదర్శనం. ముస్లింల మనోభావాలను గౌరవించే కోటంరెడ్డికి టీడీపీ నేత అబ్దుల్ అజీజ్ బహిరంగ క్షమాపణ చెప్పితేనే ఆయన్ను అల్లా క్షమిస్తాడు. – సయ్యద్సమీ, మైనార్టీ నేత, నెల్లూరు -
Ramadan 2022: రమజాన్ విశిష్టత.. సంప్రదాయం.. మరిన్ని విశేషాలు!
సృష్టిలోని విభిన్న జీవరాశులకు విభిన్నమైన పేర్లు ఉన్నట్లుగానే, మానవ సంతతిని మనిషి లేక మానవుడు అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనిషివేరు, మానవత్వం వేరు. మనిషి అనబడే ప్రతివారిలోనూ మానవత్వం ఉండాలన్న నిబంధనేమీ లేదు. ప్రాణులుగా, జీవులుగా అంతా సమానమే! మానవులైనా, జంతువులైనా లేక మరే జీవి అయినా... కనుక జీవం కలిగి ఉండడం అనేది జంతుజాలంపై మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమీ కాదు. జంతువూ ఒక ప్రాణే మనిషి కూడా ఒక ప్రాణే అయినప్పుడు జంతువుపై మనిషికి ఏ విధంగానూ ప్రత్యేకత, శ్రేష్ఠత, ప్రాధాన్యతా ఉండవు. జంతువులపై మనిషికి విశిష్ఠత, ప్రత్యేకత ప్రాప్తం కావాలంటే మనిషిలో మానవత్వం, మానవీయ విలువల సుగంధం ఉండాలి. ఇవి మాత్రమే మానవుడికి ప్రత్యేకతను ప్రసాదించి, మానవ ఔన్నత్యాన్ని పెంచుతాయి. మనిషిలో మానవీయ విలువలు లేకపోతే, అతడు మానవ సంతతి అయినప్పటికీ, మానవ సమాజంలోనే ఉంటున్నప్పటికీ అలాంటి వాణ్ణి మనం మనిషి అని సంబోధించడానికి వెనుకాడతాం. లోలోపల ఎక్కడో ఏహ్యభావం పాదుకొని ఉంటుంది. అలాంటివాణ్ణి మానవ రూపంలోఉన్న దానవుడు అనుకోవచ్చు. మరి మానవత్వం అంటే ఏమిటి, మానవీయ విలువలు అంటే ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానంగా చాలామంది చాలా అభిప్రాయాలు చెబుతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కొలమానం, ఒక్కొక్క ప్రమాణం. కాని మానవత్వం, మానవీయ విలువల అసలు కొలమానం దైవ గ్రంథంలో, ప్రవక్తవారి జీవితంలో మనకు లభిస్తుంది. సమాజంలో మానవత్వాన్ని జాగృతం చేయడానికి, మానవుల హృదయాల్లో దాన్ని పాదుగొల్పడానికి దైవం కొన్ని నియమాలను ఏర్పరచాడు. ఆ దైవదత్తమైన మార్గదర్శక తరంగాల్లోంచి పెల్లుబికి వచ్చేదే అలౌకికమైన మానవీయ ఆధ్యాత్మిక ఆనందం. నిత్య నూతనత్వాన్ని, మానసిక ఆనందాన్ని పొందడం కోసం, మనిషి మనిషి కలిసి, సామూహిక నైతికతను సమాజంలో పాదు గొల్పడానికే వ్రతాలు, నోములు, పండుగలు, పబ్బాలు. కొద్దికాలంపాటు మనిషి తన శరీరంలో, దైనందిన జీవనక్రమంలో కొన్ని అనూహ్యమైన మార్పులను ఆహ్వానించి తద్వారా నూతనోత్తేజ ఆధ్యాత్మిక భావ తరంగాల్లో తేలిపోతాడు. పవిత్ర రమజాన్ పండుగను మనం ఆ దృష్టికోణం నుంచి చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింసోదరులు జరుపుకొనే రెండు ప్రధాన పండుగల్లో ‘ఈదుల్ ఫిత్ర్ ’ మొట్టమొదటిది, అత్యంత ప్రాముఖ్యం కలది. ఇస్లామీయ కేలండరు ప్రకారం, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెలగా ఉన్న ‘రమజాన్’ ముప్పయి రోజులు ఉపవాస దీక్షలు పాటించి పదవ నెల అయిన షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే పండుగే ఈదుల్ ఫిత్ర్ . సాధారంగా దీన్ని రంజాన్ పండుగ అని వ్యవహరిస్తుంటారు. రమజాన్ పేరువింటూనే ప్రతి ఒక్కరికీ సేమియా, షీర్ ఖుర్మా గుర్తుకు వస్తాయి. పట్టణ వాసులకైతే ‘హలీమ్’, ‘హరీస్’లాంటి వంటకాలూ నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లింలు ఇంత నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులపాటు ఆనందంగా, ఆరాధనా భావతరంగాల్లో తేలియాడుతూ జరుపుకొనే ముగింపు ఉత్సవం. ఈనెల రోజులూ ముస్లింల ఇళ్లు, వీధులన్నీ సేమియా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీల ఘుమఘుమలతో, అత్తరు పన్నీర్ల పరిమళాలతో, ఉల్లాస పరవళ్ల హడావిడితో కళకళలాడుతూ ఉంటాయి. సహెరి, ఇఫ్తార్ల సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, అహ్లాదాల సమ్మేళనాన్నే ‘పండుగ’ అనడం సమంజసం. ఇలాంటి అపూర్వ, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. అదే రమజాన్ పండుగ. ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, విలువలకు లోబడి, హద్దులను అతిక్రమించకుండా, దుబారాకు పాల్పడకుండా, విశృంఖలత్వానికి, అనైతికత, అసభ్యతలకు చోటీయ కుండా, దైవానుగ్రహాలను స్మరించుకుంటూ, ఆయన ఘనతను కీర్తిస్తూ సంతోషాన్ని వ్యక్తంచేయడం, హర్షాతిరేకంతో సంబరాలు జరుపుకోవడమే పండుగ. నిజానికి పండుగలు మానవ జీవన స్రవంతిలో భాగమై, సమైక్యతకు, సంస్కృతీ సంప్రదాయ వికాసాలకు దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మత ధర్మానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం, ఒక స్ఫూర్తి ఉంటుంది. పండుగ మానవాళి హితం కోరుతుంది, హితం బోధిస్తుంది. ముస్లిములు అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకొనే ఈదుల్ ఫిత్ర్ (రమజాన్) పర్వం సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ప్రాచీనకాలం నుంచి ప్రతిదేశంలోనూ, ప్రతిజాతిలోనూ పండుగల సంప్రదాయం చలామణీలో ఉంది. మానవులకు ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, వ్యక్తిగతంగా కాని, సామూహికంగా కాని ఏదైనా మేలు జరిగినప్పుడు, ప్రయోజనం చేకూరినప్పుడు వారి అంతరంగాల్లోంచి ఆనందం తన్నుకొచ్చి బహిర్గత మవుతుంది. ఇది చాలా సహజం. అలాంటి మానవ సహజ భావోద్రేకాల ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే. అసలు రమజాన్ పేరు వినగానే ఎవరికైనా ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుంది. మనసు, తనువు తన్మయత్వంతో పులకిస్తాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. గుండెలనిండా ఆనందం ఉప్పొంగుతుంది. ఆనందం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. భక్తి ముక్తిని ప్రసాదిస్తుంది. మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ముఖ్యమైనవి. మనిషికి ఏదైనా మేలు జరిగినప్పుడు అంతరంగం ఆనందంతో పులకించడం, హృదయం ఉల్లాసభరితమవడం, మదిలో మధురానుభూతులు సుడులు తిరగడం సహజం. అసలు రమజాన్ అన్నది పండుగ పేరుకాదు. అదొక నెల పేరు. సంవత్సరంలోని పన్నెండునెలల్లో తొమ్మిదవది రమజాన్. అయితే దైవం పవిత్ర ఖురాన్లాంటి మానవ సాఫల్య గ్రంథరాజాన్ని అవతరింప జేయడానికి, అత్యుత్తమ ఆరాధనా విధానమైన ‘రోజా’ను విధిగా చేయడానికి ఈనెలను ఎన్నుకున్నాడు. అందుకే దీనికి ఇంతటి ఔన్నత్యం ప్రాప్తమైంది. మానవుల మార్గదర్శక గ్రంథమైన ఖురాన్తోను, ఆనవాయితీగా పాటించే రోజాలతో ఈనెలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఈ విషయాన్ని దైవం ఇలా ప్రకటించాడు: ‘ఖురాన్ అవతరించిన నెల రమజాన్ నెల. ఇది సమస్త మానవాళికీ సంపూర్ణ మార్గదర్శిని. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి (2 – 185). మనం ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తే, మానవులపై దేవుని అనుగ్రహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆయన తన అపార ప్రేమానురాగాలతో మానవ మనుగడకోసం అనేక ఏర్పాట్లు చేశాడు. శిశువు మాతృగర్భం నుంచి భూమిపై పడగానే అతని/ ఆమె ఊడిగం చెయ్యడానికి సృష్టి మొత్తం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు సృష్టి సమస్తం మానవుడి కోసమేనంటే అతిశయోక్తికాదు. అపారమైన ఆయన కారుణ్యానుగ్రహాలను వర్ణించడం ఎవరివల్లా అయ్యేపనికాదు. సృష్టిలోని వృక్ష సంపదనంతా కలాలుగా మార్చి, సముద్ర జలాలన్నింటినీ సిరాగా చేసి దైవానుగ్రహాలను రాయదలచినా, వృక్షాలు అంతరించిపోతాయి, జలాలన్నీ ఇంకిపోతాయి కాని ఆయన కారుణ్యానుగ్రహాలు ఇంకా అనంతంగా మిగిలే ఉంటాయి. ఇంతటి అనుగ్రహశీలి కనుకనే దేవుడు మానవుల ఆధ్యాత్మిక వికాసం కోసం, నైతిక, మానవీయ విలువల మార్గదర్శనం కోసం పవిత్ర ఖురాన్ లాంటి మహదానుగ్రహాన్ని ప్రసాదించాడు. రోజా లాంటి మహత్తర ఆరాధనను పరిచయం చేశాడు. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాలను, నైతిక సుగుణాలను, మానవీయ విలువలను జనింపజేయడానికి నెల్లాళ్లపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్ధునిగా చేయడమే రమజాన్ శిక్షణలోని అసలు ఉద్దేశం. నెల్లాళ్లపాటు నియమబద్ధంగా, నిష్ఠగా సాగే ఆరాధనా విధానాలు మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి, బాధ్యతాయుత జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడిన జీవన విధానానికి అలవాటు చేస్తాయి. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే రమజాన్ దీక్షలను పరాత్పరుడైన దైవం తమకు అనుగ్రహించినందుకు, వాటిని వారు శక్తివంచన లేకుండా చిత్తశుధ్ధితో ఆచరించగలిగినందుకు సంతోషంగా, దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రవక్త మహనీయుల వారి సంప్రదాయం వెలుగులో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. దైవ ప్రసన్నతను చూరగొనడానికి వ్రతం పాటించడంతోపాటు, ఫర్జ్, సున్నత్, నఫిల్, తరావీహ్ నమాజులు ఆచరిస్తూ, అనేక సదాచరణలను ఆచరిస్తారు. ఆర్థికంగా కలిగిన వాళ్లు ఈ రోజుల్లోనే జకాత్ చెల్లిస్తారు. నిల్వ ఆదాయంలోంచి రెండున్నర శాతం చొప్పున ప్రతి సంవత్సరం జకాత్ చెల్లించాలి. ఇస్లామ్ మూలసూత్రాల్లో ఇది ఒక మౌలిక విధి. రమజాన్ శుభాల కారణంగా ఇది కూడా ఈ నెలలోనే నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. ఫిత్రాలు చెల్లిస్తారు. ఫిత్రా కచ్చితంగా పండుగకు ముందే చెల్లించాలి. ఫిత్రాలకు ఆర్థిక స్థోమతతో సంబంధంలేదు. కాస్తోకూస్తో కలిగిన వాళ్లు తమ నిరుపేద సోదరులను ఆదుకోడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ జరుపుకునే స్థోమతలేని వారికి ఫిత్రాలు ఎంతగానో తోడ్పడతాయి. ఫిత్రా పైకంతో వారుకూడా పండుగ సామగ్రో, కొత్తబట్టలో కొనుక్కుని పండుగ సంతోషంలో పాలు పంచుకో గలుగుతారు. ఉపవాసం పాటించినా, పాటించక పోయినా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది తరఫునా ఫిత్రాలు చెల్లించాలి. ముస్లిం, ముస్లిమేతర అన్న తారతమ్యం లేకుండా అర్హులైన పేదసాదలకు ఇవ్వాలి. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర కార్యక్రమాల్లో, వినోదాలకు, భోగవిలాసాలకు ధనం వృథా చేయకుండా నలుగురికీ మేలు జరిగే మంచి పనుల్లో ఖర్చుపెట్టాలి. సత్కార్యాలకు, సమాజ సంక్షేమానికి వినియోగమయ్యే ధన వ్యయాన్నే దైవం స్వీకరిస్తాడు. ఈ విధంగా రమజాన్ నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాస దీక్షలు నిరంతరాయంగా నెలరోజులపాటు కొనసాగి షవ్వాల్ చంద్రవంక దర్శనంతో ముగుస్తాయి. ‘షవ్వాల్ ’ మొదటి తేదీన జరుపుకునే పండుగే ‘ఈదుల్ ఫిత్ర్ ’. నిజానికిది దేవుని మన్నింపు లభించే మహత్తరమైన రోజు. మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే అలాంటి వారిని దైవం తన కారుణ్యఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయము అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం సత్యం. ఈ అశాశ్వత దేహం నుంచి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పులను సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ముస్లిములందరూ పండుగపూట పెందలకడనే లేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు ఆచరిస్తారు. అనంతరం నూతనవస్త్రాలు ధరించి, అత్తరు పన్నీరులాంటి సుగంధ పరిమళం వినియోగించి, ఆనందోత్సాహాలతో ఈద్ గాహ్కు వెళతారు. అందరూ ఒకచోట గుమిగూడి తమకు రోజావ్రతం ఆచరించే మహాభాగ్యం కలగజేసి, మానవుల మార్గదర్శనం కోసం, సమాజంలో విలువల విస్తృతి కోసం పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరింప జేసినందుకు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ రెండు రకతులు నమాజ్ చేస్తారు. తరువాత ఇమామ్ ఖురాన్, హదీసుల వెలుగులో నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తాడు. అందరూ కలిసి అల్లాహ్ గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తారు. తమ కోసం, తమ కుటుంబం కోసం, బంధుమిత్రుల కోసం, తమ దేశం కోసం, దేశవాసుల సుఖ సంతోషాల కోసం, యావత్ ప్రపంచ శాంతి సంతోషాల కోసం ఆయనను ప్రార్థిస్తారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అభివాదాలు, ఆలింగనాలు చేసుకుంటూ తమ అంతరంగాల్లోని ఆనందాన్ని పంచుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపి వంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్ ’ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ విధంగా ‘ఈదుల్ ఫిత్ర్ ’ పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొదిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం , త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. కనుక రమజాన్ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెల్లాళ్ల శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రమజాన్ వరకు ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. అల్లాహ్ సమస్త మానవాళినీ సన్మార్గ పథంలో నడిపించాలని, పుడమిపై శాంతి వర్ధిల్లాలని, యావత్ ప్రపంచం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఈద్ రోజు సంప్రదాయం రమజాన్ నెల పూర్తి రోజాలను నెరవేర్చడమంటే, దైవాదేశ పాలనలో ఒక గురుతరమైన బాధ్యతను నెరవేర్చడం. ఇలాంటి సందర్భంలో ఒక మనిషిగా అతని హృదయం ఆనందంతో పొంగిపోవడం, ఒక విశ్వాసిగా అల్లాహ్ పట్ల కృతజ్ఞతా భావంతో నిండిపోవడం సహజం. ఈ సహజ భావోద్రేకాలే ‘ఈదుల్ ఫిత్ర్’ రూపంలో బహిర్గతమవుతాయి. ఈ పండుగలో విశ్వాసి తాను రోజా విధి నెరవేర్చిన సందర్భంగా తన హృదయంలోని సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాడు. మరోవైపు ఒకవిధిని నియమానుసారం నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించినందుకు దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తాడు. ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలు పూర్తిచేసుకున్నందుకు కాక, ఒక ఆరాధనా విధి నెరవేర్చి పరలోక మోక్షానికి అర్హత సంపాదించుకున్నామన్న సంతోషంలో ముస్లింలు ఈసంబరాలు జరుపుకుంటారు. పండుగనాడు ఇలా చేయడం సున్నత్ గుసుల్ చేయడం: ముహమ్మద్ ప్రవక్త (స)సంప్రదాయాన్ని అనుసరించి, ఈద్ గాహ్కు వెళ్లే ముందు గుసుల్ (స్నానం) చేయాలి. సుగంధ ద్రవ్యాలు వాడడం: ఉన్నంతలోనే అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలు వాడాలి. మంచివస్త్రాలు ధరించడం: పండుగ సందర్భంగా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో మంచి వస్త్రాలు ధరించాలి. ఈద్ గాహ్కు వెళుతూ బిగ్గరగా తక్బీర్ పలకడం: ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ , లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్’ అని బిగ్గరగా పలుకుతూ ఉండాలి. కాలినడకన ఈద్ గాహ్కు వెళ్ళడం: నమాజు కోసం ఈద్ గాహ్కు కాలినడకన వెళ్లాలి. ఒకదారిన వెళ్లి, మరోదారిన తిరిగి రావాలి. ఖర్జూరాలు తినడం: ఈద్ గాహ్కు వెళ్లే ముందు బేసిసంఖ్యలో ఉండేలా పచ్చి, లేక ఎండు ఖర్జూరాలు తినాలి. ఖర్జూరం లేని పక్షంలో ఏదైనా తీపివస్తువు తినవచ్చు. 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినే ప్రవక్త మహనీయులు ఈద్ గాహ్కు వెళ్లేవారు. ఈదుల్ ఫిత్ర్ ఇలా.. పండుగ నమాజును ముహమ్మద్ ప్రవక్త (స) వారు ఈద్ గాహ్లో చేసేవారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించి ‘ఈద్ ’ నమాజును ఊరిబయట బహిరంగ ప్రదేశంలో (ఈద్ గాహ్లో) నెరవేర్చడం శుభదాయకమని ప్రపంచదేశాల ధార్మిక విద్వాంసుల ఏకాభిప్రాయం. అయితే అనివార్య పరిస్థితుల్లో ఈద్ నమాజును మస్జిద్లోనే చేసుకోవచ్చు. ప్రవక్తవారు, ఒకసారి వర్షం కారణంగా ఈద్ నమాజును మసీదులోనే చేశారు. కాబట్టి ఈద్ గాహ్లో పండుగ నమాజు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. పండుగనాడు ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించడంతో పాటు, సుగంధ ద్రవ్యాలు వాడడంకూడా ప్రవక్త సంప్రదాయమే. ఈద్ గాహ్కు వెళ్ళేముందు కొద్దిగా అల్పాహారం తీసుకోవాలి. బక్రీద్ పండుగకు మాత్రం అసలు ఏమీ తినకుండానే ఈద్ గాహ్కు వెళ్లాలి. ఈదుల్ ఫిత్ర్ (రమజాన్ )నమాజును కాస్త ఆలస్యంగా, ఈదుల్ అజ్ హా (బక్రీద్ ) నమాజును చాలా తొందరగా చేయాలి. ఈదుల్ ఫిత్ర్లో సదఖా, ఫిత్రా.. ఈదుల్ అజ్ హాలో ఖుర్బానీ ముఖ్యవిధులు. యావత్ ప్రపంచంలో ఈ పండుగను అత్యంత భక్తిప్రపత్తులతో, ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. ఇదిలా ఉంటే, కొందరు నిరుపేదలు, అభాగ్యులు ఈ పండుగ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తారు. ఎందుకంటే, సంపన్నులు, స్థితిమంతులు సదఖా, జకాత్, ఫిత్రా తదితర దానధర్మాల పేరుతో తమలాంటి పేదవారిని ఆదుకుంటారనే కొండంత ఆశతో. కనుక కలిగినవారు, స్థితిమంతులు సమాజంలోని నిరుపేద సోదరుల పట్ల తమ బాధ్యతను గుర్తెరగాలి. పండుగ పేరుతో మితిమీరిన విలాసాలకు తమ సంపదను ఖర్చు చేయకుండా అభాగ్యులు, అగత్యపరులకు సహాయం చేసివారి ఆర్థిక స్థితిని మెరుగుపరచే ప్రయత్నం చెయ్యాలి. దీనివల్ల లబ్ధిదారుల సంతోషం, వారి దీవెనలతో పాటు, దేవుని ప్రసన్నత, పరలోక సాఫల్యం సిధ్ధిస్తుంది. పేదసాదల దీవెనలూ తోడుగా నిలుస్తాయి. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం ధన దుబారాను తీవ్రంగా గర్హించింది. దుబారా ఖర్చు చేసేవారు షైతాన్ సోదరులని చెప్పింది. అవసరార్థులకు, పేదసాదలకు ధనసహాయం చేయడాన్ని ప్రోత్సహించింది. అందుకని పండుగ నమాజు కంటే ముందు కుటుంబ సభ్యులందరూ ఫిత్రాలు చెల్లించాలని ఆదేశించింది. స్వీయ ఆనందంతోపాటు, సమాజమంతా ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నది ముహమ్మద్ ప్రవక్త(స) వారి ఉపదేశాల సారం. ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఈవిధమైన సంతోషాన్ని, శాంతిని, సోదరభావాన్ని, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. సేమియా, షీర్ ఖుర్మాల తీపితోపాటు, కులమతాలకు అతీతంగా, అందరిమధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగం, అనుబంధాలను ప్రోదిచేస్తుంది. (అందరికీ ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు.) -యండి. ఉస్మాన్ ఖాన్ -
కేంద్రానికి రోగం వచ్చింది, చికిత్స చేయాలి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహ్ముద్ అలీ, తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్, కే కేశవరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఏకే ఖాన్, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మత పెద్దలు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరైన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చదవండి: రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం! ఇఫ్తార్ విందు సందర్భంగా చిన్నారులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్రానికి రోగం వచ్చిందని, చికిత్స చేయాలని అన్నారు. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. కూల్చివేతలు సులువు కానీ దేశాన్ని నిర్మించడం కష్టమన్నారు. ఇక్కడ అల్లరి చేసేవాళ్ల ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ లేవని, ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ప్రస్తుతం దేశమంతా చీకటి అలుముకుంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని పేర్కొన్నారు. -
రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం!
రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ విందు కానిస్తారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ ఇఫ్తార్ లో వడ్డించే వంటకాలు అద్భుతమైన రుచులతో ఉంటాయి. వీటిలో 10 వెరైటీల గురించి కలినరీ స్పెషలిస్ట్ పల్టి హరినాథ్ వివరిస్తున్నారు. సాధారణంగా రంజాన్ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, నిమ్మరసంతో ముగిస్తారు. అయితే ఈ పండుగ విందుల్లో ఆరగించే టాప్ 10 వంటకాల్లో... ► హలీమ్ – ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్ వెరైటీ ఇది. మటన్ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్లో నిదానంగా ఉడికించి తయారుచేస్తారు. ఈ ఫుడ్ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ► కెబాబ్స్:మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం ఫ్రై చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా వీటిని వండుతారు. ► చికెన్ షావార్మా – అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్ ఇది. సన్నగా కోసిన చికెన్ లేదా మటన్ ముక్కలను బ్రెడ్ లోపల కూరగాయలు, సాస్ కలిపి ఆరగిస్తారు. ► కీమా సమోసా – గోధుమ పిండి, మటన్తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి. ► మటన్ రెసాలా – ఇది పూర్తిగా బెంగాలీ డిష్. బోన్ మటన్ పీస్లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ► దమ్ బిర్యానీ – దక్షిణ భారతదేశంలో దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్ లేదా చికెన్, మసాలాలు నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది. ► ఫలాఫెల్ –అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్ ఒకటి. బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్ లేదా పట్టీ ఫలాఫెల్. వీటిని సాధారణంగా హమ్మస్తో పాటుగా తహినీ సాస్తో కలిపి ఇఫ్తార్ సమయంలో సర్వ్ చేస్తారు. . ► షీర్ ఖుర్మా – మొఘలాయ్ వంటకం ఇది. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. రెండింటి మేళవింపే ఈ షీర్ఖుర్మా దీని ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ► అఫ్లాటూన్– ప్రత్యేక తియ్యని వంటకం అఫ్లాటూన్ . స్వచ్ఛమైన నెయ్యి, నట్స్తో తయారుచేస్తారు. రంజాన్ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్ ఇది. రూ అఫ్జా – రంజాన్ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్ ఎఫెక్ట్ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్ను కుల్ఫీ ఐస్క్రీమ్లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఐకమత్యం పెంచే రుచులు... ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాటయ్యే ఇఫ్తార్ విందులు అందర్నీ ఆకట్టుకుంటాయి. –మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్–మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
పాతబస్తీలో ఉచిత పార్కింగ్ సౌకర్యం
చార్మినార్: పాతబస్తీలో ఓవైపు పర్యాటకులు..మరోవైపు రంజాన్ షాపింగ్ రద్దీతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు సైతం ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్ మరింత క్లిష్టంగా మారగా... ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ► రంజాన్ మాసంలో చివరి పది–పన్నెండు రోజులు పాతబస్తీలోని మార్కెట్లు రద్దీగా మారుతాయి. ముఖ్యంగా చార్మినార్ ప్రాంతం కిటకిటలాడుతుంది. ► అలాగే మక్కా మసీదులో ప్రతి రోజు నిర్వహించే ఐదు నమాజ్లకు ముస్లింలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ► దీనిని దృష్టిలో పెట్టుకొని నగర ట్రాఫిక్ ఉన్నతాధి కారులు తాత్కాలిక పార్కింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పార్కింగ్ సౌకర్యం కల్పించిన ప్రాంతాలివే.. ►చార్మినార్ సమీపంలో.. ► యునానీ ఆసుపత్రి ప్రాంగణం ► కుడా స్టేడియం ► మోతీగల్లీ పెన్షన్ ఆఫీసు ► కోట్ల అలీజాలోని ముఫిదుల్లానామ్ హైస్కూల్ ప్రాంగణం ►పంచమొహల్లాలోని కూలగొట్టిన ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలం పార్కింగ్ ఉచితమే.. రంజాన్ మాసంలోని చివరి పది–పన్నెండు రోజులు ఎంతో కీలకం. పాతబస్తీ రద్దీగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమీపంలోని ఆరు ప్రాంతాల్లో వాహనదారుల కోసం ఉచిత పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశౠం. ఇక్కడ పార్కింగ్ ఉచితం. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే..మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్రెడ్డి, దక్షిణ మండలం ట్రాఫిక్ ఏసీపీ -
ధరల కొలిమిలో హలీం.. తినే ఉత్సాహం, మూడు మాటాష్!
చార్మినార్: రంజాన్ మాసం వచ్చిందంటే చాలు హలీం రుచులు ఉవ్విళ్లూరిస్తాయి. ఇంటిల్లిపాదీ ఆ రసాస్వాదనకు ఫిదా కావాల్సిందే. మరి ఈసారి హలీం తినాలంటే కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే.. ఈ ఏడాది హలీం ధరలు పెరిగాయి. ఉక్రెయిన్– రష్యా దాడుల నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం హలీం ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు హలీం తయారీదారులు. ఇవి వాడతారు? ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చి మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, వేపుడు ఉల్లిగడ్డ, కాజు తదితర 21 వస్తువులతో హలీంను తయారు చేస్తారు. ఇందులో రిఫైండ్ ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి, గోధుమలు, పొట్టేలు మాంసాన్ని అధిక మోతాదులో వినియోగిస్తారు. వీటి ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయని హలీం తయారీదారులు అంటున్నారు. ఇలా పెరిగాయి.. ► ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి ముందు రూ.2 వేలు ఉన్న 15 లీటర్ల రిఫైండ్ ఆయిల్ ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. నెయ్యి, మాంసం ధరలు కూడా పెరగడంతో ఈసారి ప్లేట్ హలీం ధర రూ.20 పెరిగి రూ.240కు చేరింది (పిస్తా హౌస్– 350 గ్రాములు)గా ఉంది. ఇక షాదాబ్ హలీం గతేడాది రూ. 200 ఉండగా.. ప్రస్తుతం రూ.30 పెంచి రూ.230కు (250 గ్రాములు) విక్రయిస్తున్నారు. షాగౌస్ హలీం గతేడాది కన్నా రూ.20 పెంచి రూ.220కి అమ్ముతున్నారు. అంటే ఒక కిలో హలీంకు రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. గత రెండేళ్లలో కరోనా ప్రభావం.. 2020తో పాటు 2021లో హలీం అమ్మకాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దీంతో గణనీయంగా హలీం గిరాకీ తగ్గింది. 2020 లో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా హైదరాబాద్ హలీం మేకర్స్ అసోసియేషన్ హలీం తయారీ నిలిపివేసింది. హలీంను నగరంలో ఎక్కడా తయారీ చేయ లేదు. దీంతో రంజాన్ మాసంలో హలీం అందుబాటులోకి రాలేదు. 2021లో హలీం తయారీ జరిగినప్పటికీ.. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా హలీం ప్రియులు నిరాశకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా హలీం తయారీ దారులు తక్కువ మోతాదులో హలీం తయారు చేశారు. దీంతో హలీం అమ్మకాలు తగ్గిపోవడంతో నష్టాలను భరించాల్సి వచ్చిందని హలీం తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గిన గిరాకీ.. పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా రంజాన్ మాసంలో పాతబస్తీకి వచ్చి మరీ హలీం తినడం అలవాటు. దీంతో పాత బస్తీలోని హాలీం హోటళ్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడతాయి. ప్రస్తుతం హలీం ధరలు పెరగడంతో హలీం తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. రెండ్రోజులకోసారే.. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా రోజుకు రెండు ప్లేట్ల హలీం తినేవాడిని. ధరలు పెరగడంతో తినడానికి కాస్త ఆలోచించాల్సివస్తోంది. రెండు రోజులకోసారే తింటున్నా. – షేక్ నదీం, శాలిబండ తినడం మానేశా.. ప్రతి రంజాన్లో హలీంను తప్పనిసరిగా తింటాను. ఇప్పుడు రేట్లు పెరగడంతో మానేసిన. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లు రంజాన్లో హలీం తినలేదు. పెరిగిన రేట్లకు తోడు అలవాటు తప్పింది. – ఫహీం, అలీనగర్ -
అత్తర్ ఉందిగా అని ఎప్పుడు పడితే అప్పుడు.. ఏదీ పడితే అది వద్దు!
చార్మినార్: రంజాన్ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో అత్తర్ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్ వాడతారు. అత్తర్ తయారీ విధానం.. గులాబీ రేకులు, మల్లెపువ్వులు, మొఘలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్ కావాలో దాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన బట్టిలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలు సిసలు ‘అత్తర్’. తయారు చేసే ప్రాంతాలు.. ఉత్తర్ప్రదేశ్లోని కన్నోజ్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్తో పాటు అసోం, కంబోడియాలలో కూడా దీని తయారీ కేంద్రాలున్నాయని చార్మినార్లోని షా ఫెర్ఫ్యూమ్స్ యజమాని సయ్యద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. అత్తర్ను ఎంత ఎక్కువ కాలం భద్రపరిస్తే అంత సువాసన వెదజల్లుతుందన్నారు. నకిలీదైతే కొంత కాలంలోనే వాసనలో వ్యత్యాసం తెలుస్తుందన్నారు. ఎప్పుడు.. ఏదీ..? అన్ని రకాల అత్తర్లను అన్ని సమయాల్లో వాడలేం. వాడే పద్ధతి తెలియక సమయం కాని సమయంలో ఒంటికి పూస్తే, వాసనను పీలిస్తే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. వేసవికాలంలో ఖస్, ఇత్రేగిల్ చాలా మంచిది. ఇవి రెండు చల్లదనాన్ని ఇస్తాయి. ఇత్రేగిల్ మట్టి వాసనను ఇస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. చలి, వర్షాకాలాల్లో షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటివి వాడాలి. ఇవి వెచ్చదనాన్ని ఇస్తాయి. వేసవి కాలంలో దహనల్ ఊద్ వాడితే ముక్కు నుంచి రక్తం కారడం ఖాయం. అత్తర్/పర్ఫ్యూమ్.. అత్తర్లో స్వచ్ఛమైన పువ్వులు, గంధపు చెక్కలు వంటి వాటిని వాడతారు. పర్ఫ్యూమ్లలో ఆల్కాహాల్ కూడా ఉంటుంది. ఇది మత్తును తెప్పిస్తుంది. ఆల్కాహాల్కు ఇస్లాం(మక్రూ) వ్యతిరేకం. అత్తర్లో అయితే ఆల్కాహాల్ ఉండదు. ఇది పూర్తి స్వచ్ఛంగా ఉంటుంది. అనేక రకాలు.. జన్నతుల్ ఫిర్దోస్, మజ్మ, షాజహాన్, తమన్నా, నాయబ్, హోప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమామతుల్ అంబర్, హీన, జాఫ్రాన్, దహనల్ ఊద్ తదితర అనేక రకాలున్నాయి. కృత్రిమంగా తయారుచేసేవి ఎన్ని ఉన్నా.. పెట్టిన మరుక్షణమే వాసనపోయేవి ఉన్నాయి. అసలు అత్తర్ అంటే వేశాక రెండు మూడుసార్లు దుస్తులు ఉతికినా వాసన అలాగే ఉంటుంది.