Ram Miriyala
-
నెర్రెలిస్తున్న నేలతల్లికై... అక్షర చైతన్య యాత్ర!
అంతకంతకూ క్షీణిస్తున్న భూసారాన్ని మనకు మనమే తక్షణం కాపాడుకోవాలి. లేదంటే, మరో నాలుగైదు దశాబ్దాల్లో మానవ జాతికి మనుగడే ఉండదు. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు... ప్రపంచ వ్యాప్తంగా భూసార పరీక్షలు సాగించిన పరిశోధకుల మాట. కానీ, అత్యంత కీలకమైన ఈ అంశం పట్ల ఎంతమందికి చైతన్యం ఉంది? పెరుగుతున్న భూతాపం, అంతకంతకూ ఎక్కువవుతున్న చెట్ల నరికివేత లాంటి అంశాలపై జనంలో ఎంతో కొంత అవగాహన కలిగించే ప్రయత్నం జరుగుతోంది. మరి, మనకు ఆహారం అందించే పుడమి తల్లి చేవ చచ్చి, చేష్టలుడిగి, జీవచ్ఛవమవుతున్న దుఃస్థితి గురించి ఎవరికి పడుతోంది? భవిష్యత్ మానవ జాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పరిస్థితిపై సాగిన ఓ ప్రజా ఉద్యమమే... ‘సేవ్ సాయిల్’. ఉద్యమ స్థాయిలో సాగిన ఈ ప్రజా చైతన్య కార్యక్రమం.. ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీవాసుదేవ్ మానస పుత్రిక.100 రోజులు.. 27 దేశాలు.. 30 వేల కిలోమీటర్లు...‘సేవ్ సాయిల్’ ఉద్యమం చేపట్టిన ఆయన అందులో భాగంగా నాలుగేళ్ళ క్రితం 2022లో 100 రోజుల పాటు 27 దేశాల మీదుగా దాదాపు 30 వేల కిలోమీటర్లు మోటార్ సైకిలుపై ప్రయాణించారు. భారతదేశంతో పాటు ఐరోపా, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యాల మీదుగా ఆ యాత్ర సాగింది. అదో ప్రపంచవ్యాప్త బృహత్తర ప్రయత్నం. అయితే, వివిధ దేశాల్లోని వైవిధ్యభరితమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులతో ముడిపడిన ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, కొన్ని పదులు, వందలమంది తెర వెనుక ఉండి శ్రమిస్తే కానీ సాధ్యం కాదు.యాత్రలో భాగంగా మొత్తం 691 కార్యక్రమాలుగా సాగిన ‘సేవ్ సాయిల్’ (Save Soil) విషయంలోనూ అదే జరిగింది. ఈ ప్రజాచైతన్య ఉద్యమంలో తెర వెనుక హీరోలు ఎందరో. అలాంటి పదుల మంది స్వచ్ఛంద సేవకులు, కార్యకర్తల వ్యక్తిగత అనుభవాలు, అనుభూతులు, ఆ వంద రోజుల ప్రయాణంలో జరిగిన పలు సంఘటనలు... అన్నీ అనేక విధాలుగా మానవాసక్తికరమైన కథనాలే. ‘సేవ్ సాయిల్’ ఉద్యమంలోని అలాంటి తెలియని తెర వెనుక కథలు తాజాగా పుస్తకరూపం సంతరించుకున్నాయి. ‘సేవ్ సాయిల్ – 100 డేస్ దట్ మూవ్డ్ ది వరల్డ్’ అన్న పేరుతో పెంగ్విన్ బుక్ హౌస్ వారు ప్రచురించారు.నాలుగేళ్ళలో.. 410 కోట్ల మందికి...హైదరాబాద్లో ఏప్రిల్ 14వ తేదీ, మంగళవారం సాయంత్రం వినూత్న రీతిలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సద్గురు కుమార్తె అయిన రాధే జగ్గీ (Radhe Jaggi) ఈ సంకలన గ్రంథానికి సంపాదకత్వం వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు – సంగీత దర్శకుడు రామ్ మిరియాల, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ – మోడల్ శిల్పారెడ్డితో కలసి పుస్తక సంపాదకురాలి చర్చా గోష్ఠి ఫక్కీలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. “ప్రపంచవ్యాప్తంగా గత నాలుగేళ్ళలో దాదాపు 410 కోట్ల మందికి చేరువైన ‘సేవ్ సాయిల్’ ఇవాళ అతి పెద్ద ప్రజా చైతన్య ఉద్యమం” అని రాధే వివరించారు.‘సేవ్ సాయిల్’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అనుభవం రాధేది. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ, ప్రచారం కోసం స్థాపించిన ‘ప్రాజెక్ట్ సంస్కృతి’తో కలిసి ఆ యాత్రలో అనేక వేదికలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చారు. మట్టితో ముడిపడిన కథాంశంతో రాధే బృందం చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఉద్యమ సందేశాన్ని మరింత వ్యాపింపజేశాయి. అలా యాత్రలో ప్రత్యక్ష భాగస్వామి అయిన రాధే తన అనుభవంతో పాటు పలువురు స్వచ్ఛంద సేవకుల అనుభూతులనూ, వారు ఎదుర్కొన్న సంఘటనలనూ సంకలించారు. వెరసి, విభిన్న వర్గాలకు చెందిన 86 మంది వేర్వేరు వ్యక్తుల విభిన్న అనుభవాల సమాహార రూపం... ‘సేవ్ సాయిల్’ గ్రంథం. ఆ వాలంటీర్ల కథలు, అప్పటి ఫోటోలతో పుస్తకాన్ని ఆసక్తిగా తీర్చిదిద్దారు. ఎక్కడ, ఏ పేజీ అయినా తీసుకొని చదువుకొనేలా అనుభవాలను రాశిపోసిన ఈ రచన నేలతల్లి పరిరక్షణ ఉద్యమం వెనుక ఉన్న విస్తృతి, ఉత్సాహం, సవాళ్లను పరిచయం చేస్తుంది.ఎండకు ఎండి, వానకు తడిసి, మంచులో వణికి... యూరోపియన్ ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ, ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో గడ్డకట్టే చలిలో వణుకుతూ, ఎర్రటి ఎండలో ఎడారి తుపానులకు ఎదురొడ్డుతూ సాగిన ఉద్యమ యాత్ర ఇది. ఐక్యరాజ్య సమితి హాళ్ళ నుంచి రోడ్డు పక్క టీ షాపుల దాకా ఆగిన ప్రతిచోటా నేలతల్లిని కాపాడుకోవాలన్నదే ప్రధాన సందేశం. ఓ దేశంలో అసలు కార్యక్రమానికి ముందు కిచెన్లో ఇరుక్కుపోయిన క్షణాలు, డ్రోన్ను నోట కరుచుకొని ఓ వాలంటీర్ చెట్టెక్కిన సంగతులు, వాహనం క్లచ్ పాడైపోయి బాగు చేయాల్సిన క్షణంలో చిమ్మచీకటి వేళ అపరిచిత వ్యక్తులు అందించిన సాయాలు, ఈ ఉద్యమం కోసం తెలుగునాట ఓ వ్యక్తి కాలినడకన కొన్ని పదుల కి.మీ.లు నడక సాగించడం... ఇలా ఎన్నెన్నో కథలు ఈ పుస్తకంలో చదవవచ్చు.“పలువురిని ఇంటర్వ్యూ చేసి, వారి అనుభవాలను వారి మాటల్లోనే అందించాం. ఈ పుస్తకం చదువుతుంటే, ఆ సంఘటలన్నీ కళ్ళ ముందు కదలాడి, ‘సేవ్ సాయిల్’ ప్రపంచ యాత్రలో మీరూ స్వయంగా పాల్గొన్న అనుభూతి కలుగుతుంది’’ అని రాధే వివరించారు. “రైతులు తమ జీవనోపాధి కోసం పోరాడుతుంటారు. అలాంటి సమయంలో పర్యావరణ బాధ్యతను కూడా వాళ్ళ మీదే పెట్టడం సరైంది కాదు. మనందరం సహజసిద్ధంగా మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచాలి. రైతులకు అండగా నిలవాలి. అదే సమయంలో ప్రభుత్వాలు సైతం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని, కట్టుదిట్టంగా అమలు చేస్తేనే, నేలతల్లి సంరక్షణ నిజంగా సాధ్యమవుతుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.ఏం చేస్తున్నామని సిగ్గేసింది: రామ్ మిరియాల ‘వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని కనీసం 3 నుంచి 6 శాతానికి పెంచే విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నేలతల్లి ఎదుర్కొంటున్న సార సంక్షోభాన్ని ఎదుర్కోవడం ‘సేవ్ సాయిల్’ ఉద్యమ లక్ష్యం. శాస్త్రవేత్తలు, రైతులు, అంతర్జాతీయ సంస్థలు, సామాన్య పౌరుల నుంచి పాలకుల దాకా అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఆహార భద్రత, నీటి భద్రత, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వానికి నేలలో జీవం ఎంత ముఖ్యమైనదో చాటుతోంది. ఈ లక్ష్యాలన్నీ నచ్చి దీనిలో నేనూ భాగమయ్యాను’ అని సినీ గాయకుడు రామ్ మిరియాల వివరించారు.“వయసు మీద పడినవారే ఎంతో చేస్తుంటే, వయసులో ఉన్న మనం ఏం చేస్తున్నామని నాకే సిగ్గేసింది. అందుకే, నా వంతుగా ఈ ప్రజా చైతన్య ఉద్యమం కోసం స్వయంగా ఓ పాట రాసి, స్వరపరిచి పాడాను” అని రామ్ చెప్పుకొచ్చారు. మనిషికీ, మట్టికీ ఉన్న బంధాన్నీ, అలాగే మనం మట్టిని కాపాడుకోవలసిన అవసరాన్నీ చెప్పిన “నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ...” అనే ఆ పాట పాడి, వినిపించారు. “దేశమంటే మట్టేనోయ్... మట్టి లేకపోతే మనిషెక్కడోయ్...” అంటూ వినూత్న ధోరణితో ఆలోచింపజేశారు. మట్టిని ప్రాణమున్న బంగారంగా వర్ణిస్తూ సాగిన రామ్ మిరియాల పాట ఆహూతులను అలరించడమే కాక, మట్టిపై ప్రేమను మరింత పెంచేలా సాగింది.అందుకే... సమంతను భాగస్వామిని చేశా: శిల్పారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, “సేవ్ సాయిల్ ఉద్యమం తాలూకు లక్ష్యం నన్నెంతో ప్రేరేపించింది. ఇప్పుడు మనం కళ్ళు తెరవకపోతే, మహా ఉపద్రవం తప్పదు. అందుకే, మానవాళి భవిష్యత్తు కోసం నా వంతుగా ఇందులో నేనూ భాగమయ్యాను. సినీ నటి సమంత లాంటి నా ఆత్మీయ మిత్రులనూ, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులనూ ఈ కృషిలో భాగం చేశాను. స్వయంగా స్విట్జర్లాండ్ వెళ్ళి, యాత్రలో పాల్గొన్నాను. మహా సముద్రం లాంటి ఈ ప్రయత్నంలో నేను ఓ నీటిబిందువును మాత్రమే” అని వినయంగా పేర్కొన్నారు. ఆహూతుల సందేహాలకు సైతం సమాధానాలిస్తూ, చర్చా గోష్ఠిగా సాగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జంట నగరాలలోని వివిధ వర్గాల ప్రజలు పెద్దయెత్తున పాల్గొనడం విశేషం.చదవండి: వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యంఏమైనా, ‘మనం ఈ నేల నుంచి పుట్టాం. ఈ నేలపైనే జీవిస్తాం. ఇక్కడే కన్నుమూస్తాం. చివరకు ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఆ వాస్తవం ఇప్పటికైనా గుర్తించి, మన నేలతల్లి జవజీవాలను మనమే పరిరక్షించుకోవాలన్న ఆలోచన ఇప్పటికైనా తెచ్చుకుందాం. లేదంటే భావితరానికి బతుకే లేదు’. ఈ సద్గురు సందేశం ఆలోచించి తీరాల్సిందే కాదు... తక్షణమే ఆచరణలోకి దిగాల్సినది. ‘సేవ్ సాయిల్’ పుస్తకంలోని విభిన్న అనుభవాలు అక్షరాలా అందుకు మరో ప్రేరణ.- రెంటాల జయదేవ -
రామ్ మిరియాల నోట ‘సంతాన ప్రాప్తిరస్తు’ పాట
రామ్ మిరియాల పాడితే ఆ పాట ఛాట్ బస్టర్ కావాల్సిందే. 'చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..', 'టిల్లు అన్న డీజే పెడితే..', 'ఛమ్కీల అంగీలేసి..', 'ఊరు పల్లెటూరు..', 'టికెట్ ఏ కొనకుండా..', 'సుఫియానా...' ఇలా రామ్ మిరియాల పాటలన్నీ మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్స్ అయ్యాయి. ఈ వెర్సటైల్ సింగర్ "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు.ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు...సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ, ఆల్ ది బెస్టు, నెత్తిన జిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్లోన కట్టు, లక్షలు వోసి దావత్ వెట్టు, కొత్తగ వేరే కాపురమెట్టు, నీదేమో నైట్ షిఫ్టు, నీ వైఫుది మార్నింగ్ షిఫ్టు, వీకెండ్ లో రొమాన్స్ కు ప్లానింగ్ చేసి లెక్కలుగట్టు...' అంటూ ప్రస్తుత కాలంలో యూత్ మ్యారీడ్ లైఫ్ స్టైల్ ను చూపిస్తూ సాగుతుందీ పాట.విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
'టిల్లు స్క్వేర్' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ విడుదల
డీజే టిల్లుకు సీక్వెల్గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్కు బాగా దగ్గరైంది. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు. -
రామ్ మిరియాల లేకపోతే డీజే టిల్లు లేడు ఎందుకంటే..!
-
నా పాట కాపీ కోటేసారు...
-
యూత్కి కనెక్ట్ అయ్యేలా విశ్వక్సేన్ 'మావా బ్రో' సాంగ్ అవుట్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ సేన్ దర్శకత్వంలో వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్పై కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మావా బ్రో...’ అంటూ సాగే రెండో పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామ్ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘‘ప్రతి సామాన్యునికి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంటుంది. విశ్వక్ డ్యాన్స్ విజువల్ ట్రీట్లా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: దినేష్ కె. బాబు. -
తెలుగు పాటకు వెస్ట్రన్ జోడించే రామ్మిరియాలా.. చౌరస్తా బ్యాండ్ కథ ఇదే!
గొంతు విప్పితే డీజే తలొంచాల్సిందే. యువతను ఉర్రూతలూగిస్తున్న గాత్రం. గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడిగా రాణిస్తున్న కోలంక ..యువకుడు రామ్ మిరియాల. పిఠాపురం: ఆయన పాడితే అది పక్కా లక్ష్మీపటాస్ బాంబ్లా పేలుతుంది. గళం విప్పితే డీజేను మించి రీసౌండ్ వస్తుంది. పల్లె నుంచి పట్నం వరకూ అందరూ మెచ్చే పాట అతనిది. చౌరస్తాలో గట్టిగా కేక వేస్తే జనం గుమ్మిగూడాల్సిందే. ఒక్కసారి ఆయన పాట వింటే ఫిదా అవ్వాల్సిందే. ఆయనే వర్ధమాన సింగర్ రామ్ మిరియాల. చిట్టి నీ నవ్వంటే.. అని గొంతు విప్పితే అందరూ కోరస్ పాడారు. మాయా.. అంటూ పాడితే పాటల అభిమానులు ఆయన మాయలో పడిపోయారు. డీజే టిల్లు... అని రాగం అందుకుంటే తీన్మార్ స్టెప్లు వేశారు. బీమ్లా నాయక్ వంటి టైటిల్ సాంగ్తో కుర్రకారును ఒక ఊపు ఊపేశాడు. తెలుగు పాటకు వెస్ట్రన్ జోడించే తీరును చూసి మంత్రముగ్దులయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కోలంకలో రైతు కుటుంబంలో పుట్టిన రామ్ ఇంటర్ వరకు పిఠాపురంలో చదివారు. బీకాం హైదరాబాద్లో చదివారు. సొంత ఊరిలో వేరే పేర్లతో పిలిచినా సినిమా రంగానికి రామ్ మిరియాలగానే పరిచయమయ్యారు. చదువు పూర్తయ్యాక ఒక కార్పొరేట్ కంపెనీలో ట్యాక్స్ కన్సల్లెంట్గా చేరారు. పాటే ప్రాణమైన రామ్ తర్వాత తన అభిరుచికి తగ్గట్టుగా రేడియో మిర్చిలో ప్రోమో ప్రొడ్యూసర్గా చేరారు. స్నేహితులతో కలిసి చౌరస్తా బ్యాండ్ను ప్రారంభించారు. రెండు యాసల్లో సునాయాసంగా.. ఇది యువతను ఉర్రూతలూగించింది. యూట్యూబ్లో కోట్ల వ్యూస్ను సంపాదించి పెట్టింది. అందరితో స్టెప్పులేయించింది. అనతి కాలంలోనే రామ్ మంచి సింగర్గా రాణించారు. ప్రస్తుతం పెద్ద పెద్ద బ్యానర్ సినిమాల్లో పాటలు పాడే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఫ్లూట్ వాయించడంలో ఈయనకు మంచి ప్రావీణ్యముంది. ఎవరైనా తమది కాని యాసలో మాట్లాడాలన్నా.. పాట పాడాలన్నా కష్ట పడాలి. రామ్ మాత్రం ఆంధ్ర, తెలంగాణ మాండలికాల్లో సునాయాసంగా పాటలు పాడుతున్నారు. హైదరాబాద్ వెళ్లి సుమారు 20 ఏళ్లు ఉండడంతో పాటు అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఎక్కువ కాలం ఉండటంతో రెండు యాసల్లోనూ పాటలు పాడడం కొంత సులభమైందంటారు రామ్. చిట్టి నీనవ్వంటే. సాంబశివా నీదు మహిమ, సిలకా ఎగిపోయావా అంటూ ఈ మూడు పాటలు పాడింది ఆయనే. కానీ మూడు పాటల్లో మూడు వేర్వేరు గొంతులు వినిపించినట్టుంటాయి. పాటకు తగ్గట్టుగా గొంతును ట్యూన్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ప్రతీ పాట ఆణిముత్యామే.. ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా’ అంటూ రామ్ కరోనా సమయంలో పాడిన పాట జనం గుండెలను హత్తుకుంది. హైదరాబాద్ నుంచి ఖమ్మం, మారేడుమిల్లి మీదుగా కోలంక వస్తూ మార్గంలో ఎదురయ్యే పరిస్థితులను ‘ఊరెళ్లి పాతా మామా.. ఊరెళ్లి పోతా.. ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా’ అంటూ పాటగా మలిచారు. ‘చూపుకేమో శ్రీదేవి.. వగలుపోయే వయ్యారి.. భాషలన్నీ ఇడిసేసి.. నన్ను ఒగ్గేసిపోనాది’ అంటూ ఓ ప్రేమికుడి వ్యధను గొంతులో పలికించి కేరీర్లో తొలి పాటకు శ్రీకారం చుట్టారు. గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు రాసిన పాటలు పాడి మైమరిపింపజేశారు. పేరొందిన సింగర్లతో కలిసి పాడే అవకాశాలను దక్కించుకుంటున్నారు. సంగీతమంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సంగీతంపై మమకారం. ఈ ఉత్సాహంతోనే ప్త్రెవేటు సాంగ్స్పాడాను. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి హీరోల సినిమాలకు పాటలు పాడాను. డీజే టిల్లు–2 సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాను. సినిమా పాటల అవకాశాలు పెరుగుతున్నాయి. ఎవరు ఏ రంగంలో ఏది సాధించాలన్నా ముందు పట్టుదల ఉండాల్సిందే. అందరి సహకారంతో ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్నా . ‘ఊరెళ్లి పాతా మామ..పాట నాకు చాలా ఇష్టం. మనసు పెట్టి రాశాను. చాలా మంచి గుర్తింపు తెచ్చింది. – రామ్ మిరియాల, సంగీత దర్శకుడు, సింగర్ -
రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి సాంగ్ వచ్చేసింది..
ఐదు వేరు వేరు కథలతో తెరకెక్కుతున్న చిత్రం `పంచతంత్ర కథలు`. గంగనమోని శేఖర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో విడుదలకి సిద్దంగా ఉన్న ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మొదటి పాట `మోతెవరి` లిరికల్ వీడియో సాంగ్ ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. 'నేనేమో మోతెవరి.. నువ్వేమో తోతాపరి... నా గుండెల సరాసరి.. కుర్సియేసి కూసొబెడతనే... నీ అయ్యా పట్వారి.. నీ చిచ్చా దార్కారి... ఏదైతే ఏందే మరి... నిన్నుఎత్తుకొనిబోతనే...' అంటూ ఆహ్లాదరకరంగా సాగుతోంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు కమ్రాన్ క్యాచీ ట్యూన్తో స్వరపరిచాడు. లేటెస్ట్ సెన్సేషన్ రామ్ మిరియాల ఈ పాటను తనదైన శైలిలో ఆలపించి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్లో చేర్చారు. ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'పంచతంత్ర కథలు సినిమాలోని `నేనేమో మోతెవరి` సాంగ్ నా ఫేవరేట్. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ విన్నాను. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్. తప్పకుండా వైరల్ అవుతుందని నా నమ్మకం. ఈ సినిమాలో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సర్ప్రైజింగ్గా మా అమ్మగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయించారు. ఈ సినిమా కోసం ఎగ్జయిటింగ్గా ఉన్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మిస్తున్నారు. చదవండి: భార్యకు ఏడువారాల నగలు కొనిచ్చిన బుల్లితెర నటుడు -
ఆటా వేడుకలు: ముచ్చటగా మూడు రోజులు సందడే సందడి
వాషింగ్టన్ డీసీ వేదికగా జరగబోతున్న 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు తన వేడుకలకు రంగం చేసింది. మొత్తం మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఏ రోజు ప్రత్యేకత దానికే ఉంది. ఆ వివరాలు.. జులై 1 మొదటి రోజు కన్వెన్షన్ సెంటర్లోని గ్రాండ్ లాబీలో వెల్కం రిసెప్షన్తో వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. అదే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన తెలుగు ప్రముఖులకు అమెరికన్ తెలుగు అసొసియేషన్ అవార్డులందించనుంది. బాంకెట్ వేడుకల్లో సింగర్ రామ్ మిరియాల స్పెషల్ మ్యూజిక్ నైట్తో అలరించబోతున్నారు. జులై 2 రెండో రోజు ఉదయం నుంచే ఆటా పరేడ్ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. ఇదే రోజు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్ సద్గురు జగ్గీ వాసుదేవన్ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్లో భాగంగా హార్ట్ఫుల్నెస్ సంస్థ రామచంద్రమిషన్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న రామచంద్రమిషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రెషన్స్ నిర్వహిస్తారు. రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్.థమన్ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు. జులై 3 మూడో రోజు ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అమెరికా చేరుకున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం గ్రాండ్ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయరాజా తన 32 మంది ట్రూప్తో అతిథులను అలరించనున్నారు. దీంతో పాటు ఆహుతుల కోసం ప్రత్యేక ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆటా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన అతిథులు.. ఎప్పటికీ మరిచిపోలేని విధంగా వేడుకలను డిజైన్ చేశారు. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, వివాహా వేదికలు, మాటా ముచ్చట్లు.. చెప్పుకుంటూ పోతే.. మూడు రోజులు వాషింగ్టన్ డిసిలో పండగ వాతావరణం ఏర్పాటు కానుంది. ఆటా వేదికగా ఆట-పాట భారతీయులకు క్రికెట్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. అందుకే ఆటా నిర్వాహకులు ఇద్దరు లెజెండ్ క్రికెట్ క్రీడాకారులను ఈ కన్వెన్షన్కు తీసుకొస్తున్నారు. టాప్ క్లాస్తో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన సునీల్ గవాస్కర్, సిక్సర్ల మెరుపులతో అలరించే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్.. యూత్ క్రికెట్ సరదాగా ఆడబోతున్నారు. అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ కూడా కనువిందు చేయబోతున్నాడు. ఆటా సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో భాగంగా కపిల్ దేవ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫర్ సాహిత్ రెడ్డి తీగల ఆటా వేడుకల్లో సందడి చేయనున్నారు. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేస్తున్నారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, అర్జున్రెడ్డి ఫేం సందీప్ వంగా, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, నివేదా థామస్, డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్, వీజే సన్నీ, సింగర్ రాం మిరియాల, సింగర్ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అష్టవధానంతో అలరించబోతున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి


