శ్రీమఠం ధర్మాధికారి మృతి
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి మఠం ధర్మాధికారి రాజ.ఎస్.రాజగోపాల్చార్ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆరు రోజుల క్రితం ఈయన కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి నుంచి మైసూర్కు వెళ్తుండగా చిక్నాయక్హళ్లి దగ్గర ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ శివరాముడు అక్కడిక్కడే మృతి చెందాడు.
గాయపడిన రాజ.యస్.రాజగోపాల్చార్ను చికిత్స నిమిత్తం బెంగళూరులోని మాల్య నర్సింగ్హోంకు తరలించారు. చికిత్సపొందుతూ గురువారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కర్ణాటక రాష్ర్టం మైసూర్ నియోజకవర్గం నంజనగూడ గ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయన్నారు.రాజగోపాల్చార్కు భార్య సౌమ్య, కుమారుడు ధనుష్, కుమార్తె ధరణి ఉన్నారు.
ఈయన శ్రీమఠం పూర్వపు పీఠాధిపతి సుశమీంద్రతీర్థుల పూర్వాశ్రమంలో పుత్రుడు. తండ్రి పీఠాధిపతి కావడంతో 2001 నుంచి 2006 వరకు శ్రీ మఠం ఆప్తకార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో పేదలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు పలువురికి ఉద్యోగాలు ఇప్పించారు.
మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలనాగిరె డ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వై.సీతారామిరెడ్డి, వై.ప్రదీప్రెడ్డి, విశ్వనాథ్రెడ్డి, మండల కన్వీనర్ భీంరెడ్డి, మంత్రాలయం సర్పంచ్ తెలబండ్ల భీమయ్య తదితరులు ఫోన్ ద్వారా రాజగోపాల్చార్ కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. శ్రీ మఠంలో సంతాప సభ నిర్వహించారు. మేనేజరు శ్రీనివాసరావు, ఏఏవో మాధవశెట్టి, ఏఓ రంగారావు, వ్యాసరాజ్చార్, పీఆర్వో రాఘవేంద్రరావు తదితరులు రాజగోపాల్చార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిమళ పాఠశాలకు సెలవు ప్రకటించారు. మంత్రాలయంలో దుకాణాలు, హోటళ్ల యాజమాన్యులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.