breaking news
raithu nestam
-
‘రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదు’
హైదరాబాద్: సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీడ్ కంపెనీల ప్రతినిధులు, సీడ్ కంపెనీ అసోసియేషన్ సభ్యులు, వివిధ జిల్లాల్లో పత్తి విత్తనోత్పత్తిలో భాగస్వాములైన ఆర్గనైజర్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీడ్ రైతులకు ఆర్గనైజర్ల ద్వారా జరగాల్సిన చెల్లింపులు, అలాగే ఆర్గనైజర్లకు సీడ్ కంపెనీలు చెల్లించాల్సిన బకాయిల అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.సమావేశంలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న బకాయిలపై మంత్రి తుమ్మల సీడ్ కంపెనీల ప్రతినిధులను వివరణ కోరారు. దీనిపై స్పందించిన కంపెనీల ప్రతినిధులు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలన్నింటినీ ఈ ఏడాది ఆగస్టు నెలలోగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల కారణంగా కంపెనీల వద్ద విత్తన నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆర్గనైజర్లకు, రైతులకు చెల్లింపులు చేయడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. అవసరమైతే బ్యాంకుల నుంచి మార్ట్గేజ్ రుణాలు తీసుకొని అయినా చెల్లింపులు చేస్తామని, ఈ సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులను ఆగస్టు నుంచి ప్రారంభించి డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తామని అన్నారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సీడ్ కంపెనీలు కేవలం లాభార్జన కోణంలో కాకుండా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్గనైజర్లకు, వారి ద్వారా రైతులకు చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సీడ్ కంపెనీలు గానీ, ఆర్గనైజర్లు గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులను వెంటనే ప్రారంభించి రైతులకు సకాలంలో అందేలా కార్యాచరణ చేపట్టాలని కంపెనీలను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే సంబంధిత కంపెనీలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోదని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి, వ్యవసాయశాఖ డైరెక్టర్, సీడ్ కంపెనీ అసోసియేషన్ ప్రతినిధులు, పత్తి విత్తనోత్పత్తి కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు పాల్గొన్నారు. -
30 నుంచి కోస్తా జిల్లాల్లో డా. ఖాదర్ ప్రసంగాలు
అటవీ వ్యవసాయ, సిరిధాన్యాల నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలీ(మైసూర్) ఈనెల 30, అక్టోబర్ 1,2 తేదీల్లో కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. అటవీ చైతన్య ద్రావణంతో సిరిధాన్యాల సాగు, సిరిధాన్యాలు – కషాయాలతో సంపూర్ణ ఆరోగ్యం– అన్ని రకాల వ్యాధులను నిర్మూలించే దేశీ ఆహార పద్ధతులపై ఆయన ప్రసంగిస్తారు. 30న ఉ. 10 గం.కు గుంటూరు (బాలాజీ మండపం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, బృందావన్ గార్డెన్స్, 5వ లైను), అదే రోజు సా. 4 గం.కు విజయవాడ (సిద్ధార్థ ఆర్ట్స్–సైన్స్ కళాశాల, మొగల్రాజపురం), అక్టోబర్ 1 ఉ. 10. గం.కు రాజమండ్రి (గేదెల నూకరాజు కల్యాణ మండపం, మెయిన్ రోడ్, ఎ.సి.గార్డెన్స్, రాజమండ్రి), అదేరోజు సా. 4 గం.కు కాకినాడ (అల్యూమ్ని ఆడిటోరియం హాల్, జె.ఎన్.టి.యు, కాకినాడ)లో డా. ఖాదర్ ప్రసంగి స్తారు. 2 (మంగళవారం)న సా. 3 గం.కు విశాఖ పట్నం(సిరిపురం జంక్షన్, హెచ్.పి. పెట్రోల్ బంకు ఎదురుగా) ఏయూ కాన్వకేషన్ హాల్లో ప్రసంగి స్తారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 70939 73999. -
నేడు హైదరాబాద్ సరూర్నగర్లో డా. ఖాదర్ సదస్సు
హైదరాబాద్ సరూర్నగర్లోని కొత్తపేట బాబూ జగ్జీవన్రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం.ల నుంచి సా. 7 గం.ల వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979. -
19న కొర్నెపాడులో పత్తి, మిరప సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడు రైతు శిక్షణా శిబిరంలో ఈనెల 19(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ విధానంలో పత్తి, మిరప సాగుపై రైతులకు నాగర్కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్య శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు వై. వెంకటేశ్వరరావు తెలిపారు. పత్తిలో గులాబీరంగు పురుగు నివారణ మార్గాలపై విజయవాడకు చెందిన రహమతుల్లా అవగాహన కల్పిస్తారన్నారు. లింగాకర్షక బుట్టల పాత్ర.. కషాయాలు, మిశ్రమాల తయారీ, వాడకంపై శిక్షణ ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 83675 35439, 0863–2286255. -
నంద్యాల శాస్త్రవేత్తకు అవార్డుల పంట
నంద్యాలరూరల్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామారెడ్డికి హైదరాబాద్ విత్తన సంస్థ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు, డాక్టర్ ఐవీ సుబ్బారావు మెమోరియల్ అవార్డులు వరించాయి. రైతు నేస్తం వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆవార్డులు అందుకోవడంపై నంద్యాల ఆర్ఏఆర్ఎస్ వ్యవసాయ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈయనది కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని శంకరాపురం. ప్రాథమిక విద్య ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ టౌన్ మనోహార్ పీజీ కళాశాల ఉత్తర ప్రదేశ్లో పూర్తి చేశారు. పత్తిపై పీహెచ్డీని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కళాశాల చేశారు. 1985 నుంచి 90 వరకు అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానంలో వేరుశనగ, కంది, ఆముదంపై పరిశోధనలు చేశారు. 1990 నుంచి నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ముంగారి పత్తిలో అరవింద, శ్రీనంది, యాగంటి, అమెరికన్ పత్తిలో నరసింహ, శివనంది, శ్రీరామ, సంకర రకాల్లో హెచ్ఎస్ 390, 290 రకాలు విడుదల చేశారు. ఈ నెల 2వ తేదీ హైదరాబాద్ విత్తన సంస్థ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు, ఈనెల 11వ తేదీన హైదరాబాద్లో రైతు నేస్తం 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు మెమోరియల్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు డాక్టర్ రామారెడ్డిని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ గోపాల్రెడ్డి, సీనియర్, జూనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు.


