breaking news
pushpagiri peetham
-
మహిమాన్వితం... ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం
పూర్వం తన తల్లి దాస్య విముక్తికోసం దేవలోకం నుంచి గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతూండగా దేవేంద్రుడు ఎదిరించాడు. అప్పుడు ఇద్దరి మధ్యనా ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరాటంలో అమృతబిందువు ఒకటి చింది, భూలోకంలో ఇప్పుడు ఆ మడుగు ఉండేచోటున పడిందట. దాని ఫలితంగా అప్పట్లో ఆ మడుగులో స్నానం చేసిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగానూ, యవ్వనవంతులుగానూ మారిపోవడంతోపాటు అమరత్వం కూడా పొందేవారట. దాని మహిమను ప్రత్యక్షంగా చూసిన నారదుడు బ్రహ్మదేవుడికి నూరిపోసిన మీదట, అమరత్వం యిచ్చే ఇటువంటి మడుగు భూలోకంలో ఉండకూడదు అని బ్రహ్మకు అనిపించింది. వెంటనే బ్రహ్మ, హనుమంతుని రప్పించి, ‘‘హనూ! ఒక పర్వతం తెచ్చి పడవేసి, పినాకినిలో ఉండే ఆ మడుగును కప్పెట్టివేసెయ్యి‘ అన్నాడు. చెప్పటమే తడవుగా ఆంజనేయుడు బ్రహ్మాండమైన పర్వతం ఒకటి తెచ్చి దభీమని ఆ మడుగులో పడవేశాడు. కాని, ఆ పినాకినీ జల మహిమ యేమిటో కాని, హనుమంతుడు పడవేసిన పర్వతం మడుగును కప్పి వేయటానికి బదులు బెండు లాగా నీటిపైన తేలి ఆడుతూ వుంది.ఈ చిత్రం చూచి బ్రహ్మకు కంగారుపుట్టింది. నారదుణ్ణి వెంటబెట్టుకుని, సరాసరి శివుని వద్దకు వెళ్లాడు. శివునికి కూడా ఈ విషయంలో ఏమీ పాలు΄ోక, ఆ ముగ్గురూ కలిసి వైకుంఠంలో వుండే విష్ణుమూర్తి వద్దకు ΄పోయి జరిగిన వైనాలన్నీ పూసగుచ్చినట్టు ఆ జగన్నాటక సూత్రధారుడికి విన్నవించారు. విష్ణుమూర్తి అంతా విని, ‘‘నాకూ, శివునికి ఎప్పుడూ ఇటువంటివే చిక్కులు తగులుతూ ఉంటాయి. తిన్నగా ఉండడు కదా ఈ నారదుడు!‘ అని చెప్పి, బ్రహ్మనూ నారదుణ్ణి పంపివేశాడు. తరువాత శివకేశవులు మానవరూపంతో భూలోకానికి దిగివచ్చి, ఆ మడుగు పైన తేలి ఆడుతూ వున్న పర్వతాన్ని ఒక వైపున శివుడూ, రెండోవైపున కేశవుడూ అదిమిపట్టి అణిచివేశారు. అప్పుడు వారి ప్రభావంవల్ల ఆ పర్వతం భూమి పైన అణిగి వుండి, మడుగు మూసుకు΄ోయింది.అస్తికలను పువ్వులుగా మార్చగల మహిమ గలిగింది– పినాకినీ నది జలం. అటువంటి నీటిలో ఆంజనేయుడు పర్వతాన్ని తెచ్చి పడవేశాడు. ఈ రెండు కారణాలవల్ల ఆ పర్వతానికి ‘పుష్పగిరి’ అనే పేరు వచ్చిందంటారు. శివకేశవులు ఇద్దరూ దిగివచ్చి ఆ పర్వతాన్ని అణచటంచేత, కొండకు రెండు పక్కలా ఆ ఇద్దరి ఆలయాలూ వెలిసి, అది ఈనాడు ఒక దివ్య క్షేత్రమై వెలుగొందుతోంది. ఇక్కడ యేటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది జనం స్వాముల దర్శనానికి వస్తుంటారు. ఇది చెప్పదగిన పుణ్య క్షేత్రం గనకనే పుష్పగిరి స్వాములవారు ఇక్కడ మఠం ఏర్పరచుకొన్నారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది.కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు పక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ’మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు.హరిహరాదుల క్షేత్రంశివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.జనమేజయుడు చేసిన సర్పయాగ పాపరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది.కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండ మీదే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవస్వామికి పూజలు జరుగుతాయి. పాతాళగణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.(చదవండి: లాల్బాగ్చా నిమజ్జనంలో ఏం జరిగింది..? మండిపడుతున్న భక్తులు..) -
శ్రీనృసింహ భారతి దైవ సమాధి
వల్లూరు (వైఎస్సార్ జిల్లా) : శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించిన పుష్పగిరి పీఠం పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి పార్థివ దేహాన్ని భక్తుల అశ్రు నయనాల మధ్య మంగళవారం దైవ సమాధి చేశారు. తీవ్ర గుండెపోటుతో ఆదివారం ఆయన హైదరాబాద్లో తనువు చాలించిన విషయం విదితమే. వైఎస్ఆర్ జిల్లాలోని పుష్పగిరి పీఠం సంప్రదాయాల మేరకు తొలుత చంద్రమౌళీశ్వరుని స్పటిక లింగానికి రుద్రాభిషేకం నిర్వహించాక అంతిమ సంస్కార కార్యక్రమాలను ప్రారంభించారు. జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గంభీరానందస్వామి పర్యవేక్షణలో స్వామీజీ శిష్యులు శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠం పీఠాధిపతి కమలానంద భారతి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నూతన పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి చేతుల మీదుగా దైవ సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి పార్థివ దేహానికి అభిషేకం నిర్వహించిన అనంతరం దివంగత పీఠాధిపతుల సమాధుల సరసన గర్తం పూజ నిర్వహించారు. స్వామివారి పార్థివ దేహాన్ని భక్త జన సందోహం మధ్య ఊరేగింపుగా సమాధి స్థలం వద్దకు తీసుకు వచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి సమాధి ప్రవేశం పూర్తి చేశారు. నివాళులర్పించిన ప్రముఖులు స్వామి వారి పార్థివ దేహం వద్ద మంగళవారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆయన శిష్యులు, భక్తులు పుష్పగిరికి చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, కమలాపురం శాసన సభ్యుడు పీ.రవీంధ్రనాథరెడ్డి, జిల్లా కలెక్టర్ కేవీ రమణ, జాయింట్ కలెక్టర్ -2 కృష్ణ భారతి, కడప ఆర్డీవో చిన్న రాముడు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర బాలాజీ, తదితరులు స్వామి వారికి నివాళులర్పించారు. -
విద్యానృసింహ స్వామికి వైఎస్ జగన్ నివాళి
హైదరాబాద్: పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యానృసింహ భారతీస్వామి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం శ్రద్ధాంజలి ఘటించారు. బేగంపేటలో పుష్పగిరి భారతి వేద పాఠశాలలో ఉంచిన భారతీస్వామి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం 3.45కి బషీర్బాగ్ అపోలో ఆస్పత్రిలో భారతీస్వామి తుది శ్వాస విడిచారు. కడప జిల్లా పుష్పగిరిలోని కేంద్ర స్థానంలోమంగళవారం శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు జరుగుతాయని స్వామి వ్యక్తిగత కార్యదర్శి ఎన్.భారతీస్వామి తెలిపారు. కడపజిల్లా చెన్నూరులో 1940లో జన్మించిన భారతీస్వామి 1957లో పుష్పగిరి పీఠం బాధ్యతలు చేపట్టారు. దక్షిణ భారత దేశంలోనే సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు కొనసాగిన ఏకైక పీఠాధిపతిగా ఘనతకెక్కారు. పీఠాధిపతిగా అరవయ్యో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘షష్ట్యబ్ది ఉత్సవం’ చేయాలని పూనుకున్న తరుణంలో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు.