breaking news
Public sector bank employees
-
మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!
25 నుంచి 28 వరకూ... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. వేతనాల పెంపు విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) తాజా ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఈ నెలాఖరులో నాలుగు రోజుల పాటు సమ్మెకు దిగనున్నట్లు బ్యాంక్ యూనియన్లు మంగళవారం ప్రకటించాయి. వేతనాలను 19 శాతం పెంచాలంటూ యూనియన్లు డిమాండ్ చేస్తుండగా.. ఐబీఏ దీన్ని మంగళవారం 13 శాతానికి పెంచింది. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని.. యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఎంవీ మురళి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25-28 వరకూ సమ్మె చేయాలని నిర్ణయించినట్లు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ జనరల్ సెక్రటరీ అశ్విని రాణా చెప్పారు. కాగా, సంప్రదింపుల్లో తగిన పరిష్కారం లభించకుంటే... మార్చి 16 నుంచి నిరవధిక సమ్మెకూ వెనుకాడబోమని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. -
నేడు దక్షిణాదిలో బ్యాంకులు బంద్
వేతన సవరణపై ఉద్యోగుల సమ్మె జోన్ల వారీగా నాలుగు రోజులపాటు.. బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం ముంబై: వేతన సవరణ డిమాండ్తో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో మంగళవారం(నేడు) బ్యాంకులు పనిచేయవు. ఇరు రాష్ట్రాల్లోని 5,000 శాఖలకు చెందిన దాదాపు 80 వేల పైచిలుకు ఉద్యోగులు, అధికారులు ఇందులో పాల్గొంటున్నారని యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) ప్రాంతీయ శాఖ తెలిపింది. వేతన సవరణపై సోమవారం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్తో (ఐబీఏ) జరిపిన చర్చలు విఫలం కావడంతో యూఎఫ్బీయూ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు జోన్లవారీగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే సమ్మెకు దిగుతున్నారు. ముందుగా దక్షిణాదిన నేడు (డిసెంబర్ 2), ఉత్తరాది జోన్లో 3న, తూర్పు జోన్లో 4న, పశ్చిమ జోన్లో 5న స్ట్రయిక్ చేస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐబీఏ, యూఎఫ్బీయూ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముంబైలోని డిప్యుటీ చీఫ్లేబర్ కమిషనర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సమ్మె అనివార్యమైంది. ఇటు ప్రభుత్వం, అటు ఐబీఏ సమ్మె ప్రతిపాదన విరమించుకుని చర్చల్లో పాల్గొనాలని సూచించినట్లు యూఎఫ్బీయూ మహారాష్ట్ర కన్వీనర్ విశ్వాస్ ఉతాగి తెలిపారు. అయితే, తాము మాత్రం సమ్మె యోచన అమలుకే నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. వేతన సవరణ, వారానికి అయిదు రోజులకు పనిదినాల కుదింపు తదితర డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గత నెల 12న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, బ్యాంకు యూనియన్లు తలపెట్టిన సమ్మె అనైతికమని.. సమ్మె యోచన విరమించుకోవాలని ఐబీఏ విజ్ఞప్తి చేసింది. సిబ్బంది వ్యయాలు పెరిగి, లాభాలు క్షీణిస్తున్నందున ఉద్యోగులు కోరుతున్నట్లుగా 23% మేర జీతభత్యాలు పెంచే పరిస్థితి లేదని పేర్కొంది. ఉద్యోగులు 23% డిమాండ్ను తగ్గించుకుంటే చర్చలకు తాము సిద్ధమని తెలిపింది.