breaking news
Provisioning
-
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్కు విజ్ఞప్తి చేశారు. -
అలహాబాద్ బ్యాంకులో మరో మోసం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్ బ్యాంక్ కార్యకలాపాల తీరుపై సందేహాలు రేకెత్తించేలా తాజాగా మరో మోసం బైటపడింది. ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ (ఎస్ఈఎల్ఎం) రూ. 688.27 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు అలహాబాద్ బ్యాంకు వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రొవిజనింగ్ చేసినట్లు, ఫ్రాడ్ గురించి ఆర్బీఐకి కూడా తెలియజేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎస్ఈఎల్ఎం దివాలా పిటిషన్పై ఎన్సీఎల్టీలో విచారణ జరుగుతున్నట్లు వివరించింది. వారం రోజుల వ్యవధిలో అలహాబాద్ బ్యాంకులో ఇది రెండో ఫ్రాడ్ కేసు కావడం గమనార్హం. భూషణ్ పవర్ అండ్ స్టీల్ (బీపీఎస్ఎల్) రూ. 1,775 కోట్ల మోసానికి పాల్పడినట్లు గత శనివారమే బ్యాంకు వెల్లడించింది. -
ఆంధ్రా బ్యాంక్కు మొండిబకాయిల సెగ
ప్రొవిజనింగ్తో 72% క్షీణించిన లాభాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు మొండిబకాయిలు భారీగా పెరిగాయి. స్థూల మొండిబకాయిలు (జీఎన్పీఏ) 5.31 శాతం నుంచి 8.39 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 2.93 % నుంచి 4.61 శాతానికి పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో నికర ఎన్పీఏలు 3.89%. మొండిబకాయిలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ భారీగా పెరగడంతో మార్చి త్రైమాసికంలో నికర లాభం 72 శాతం క్షీణించింది. బ్యాంకు శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 185 కోట్లుగా ఉన్న లాభం ఈసారి రూ. 52 కోట్లకు తగ్గింది. ఆదాయం 9 % వృద్ధితో రూ. 4,699 కోట్ల నుంచి రూ. 5,124 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ రూ. 633 కోట్ల నుంచి రూ. 1,023 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్(నిమ్) 3.48%నుంచి తగ్గి 3.41%కి పరిమితమైంది. బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000కోట్ల లాభాలు సాధించాలని భావించినప్పటికీ.. అందులో సగానికే పరిమితమైంది. పూర్తి సంవత్సరానికి గాను.. కంపెనీ లాభాలు రూ. 638 కోట్ల నుంచి రూ. 540 కోట్లకు తగ్గాయి. ఆదాయం రూ. 17,868 కోట్ల నుంచి రూ. 19,199 కోట్లకు పెరిగింది. నిమ్ 3.18 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో బాండ్ల ద్వారా రూ. 800 కోట్లు బ్యాంకు సమీకరించింది. రూ. 136 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను ఎల్ఐసీకి కేటాయించింది. రూ. 378 కోట్ల అదనపు మూలధనాన్ని సమకూర్చినందుకు ప్రభుత్వానికి 49.46 కోట్ల షేర్లను కేటాయించింది. దీంతో బ్యాంకులో ప్రభుత్వ వాటా 61.02%నుంచి 61.26 %కి పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి షేరు ఒక్కింటిపై రూ. 0.50 డివిడెండు ప్రకటించింది. -
ఐసీఐసీఐపై బకాయిల బండ
♦ క్యూ4 నికర లాభం 87% డౌన్; 407 కోట్లు ♦ 11 ఏళ్ల కనిష్టస్థాయి ఇది... ♦ ఎన్పీఏలకు భారీ ప్రొవిజనింగ్, ♦ కంటింజెన్సీ రిజర్వ్కు కేటాయింపుల ప్రభావం ♦ 5.82 శాతానికి పెరిగిన స్థూల ఎన్పీఏలు ♦ షేరుకి రూ.5 చొప్పున డివిడెండ్... ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ అగ్రగామి ఐసీఐసీఐ బ్యాంకును మొండిబకాయిలు(ఎన్పీఏ) వెంటాడుతున్నాయి. గడిచిన దశాబ్దంపై కాలంలో ఎన్నడూలేనంత నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో(2015-16, క్యూ4)లో ఏకంగా 87 శాతం దిగజారి రూ.407 కోట్లకు పడిపోయింది. గడిచిన 11 ఏళ్లలో లాభాలు ఇంత తక్కువ నమోదుచేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతక్రితం ఏడాది ఇదే మార్చి త్రైమాసికంలో లాభం రూ.3,084 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా మొండిబకాయిల పెరుగుదలతో కేటాయింపులు(ప్రొవిజనింగ్) అత్యంత భారీగా ఎగబాకడం, రానున్న కాలంలో ఎదురయ్యే ఎన్పీఏ రిస్కులను తట్టుకోవడానికి వీలుగా రూ.3,600 కోట్లతో ఒక ప్రత్యేక కంటింజెన్సీ నిధి(రిజర్వ్)ని ఏర్పాటు చేయడం లాభాలు ఘోరంగా పడిపోయేందుకు దారితీసింది. మొండిబకాయిలపై సమీక్ష(ఏక్యూర్)లో భాగంగా 150 కార్పొరేట్ రుణ ఖాతాలకు సంబంధించి బ్యాంకులన్నీ ప్రొవిజనింగ్ను తప్పనిసరిగా చేయాల్సిందేనని ఆర్బీఐ గతేడాది చివర్లో ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక బ్యాంకులు డిసెంబర్, ప్రస్తుత మార్చి క్వార్టర్లో వీటికి కేటాయింపులను చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇనుము-ఉక్కు, మైనింగ్, రిగ్గులు, విద్యుత్, సిమెంట్ రంగాల్లో రానున్న కాలంలో ఎన్పీపీఏల రిస్కులు ఉండొచ్చన్న కారణంగా కంటింజెన్సీ రిజర్వును నెలకొల్పినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. కాగా, మార్చి క్వార్టర్లో కన్సాలిడేటెడ్గా బ్యాంక్ మొత్తం ఆదాయం 13% పెరిగి రూ.28,217 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.24,914 కోట్లుగా ఉంది. కాగా, మార్కెట్ వర్గాలు క్యూ4లో నికర లాభం రూ.3,770 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. కంటింజెన్సీ రిజర్వును పరిగణనలోకి తీసుకుంటే లాభం అంచనాల మేరకే ఉందని బ్రోకరేజి సంస్థ ఎంకే గ్లోబల్ అభిప్రాయపడింది. స్టాండెలోన్ లాభం 76 శాతం క్షీణత.. ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలను మాత్రమే చూస్తే(స్టాండెలోన్ ప్రాతిపదికన) ఐసీఐసీఐ నికర లాభం క్యూ4లో రూ.702 కోట్లకు దిగజారింది. అంతక్రితం ఏడాది క్యూ4లో లాభం రూ. 2,922 కోట్లతో పోలిస్తే 76 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.16,235 కోట్ల నుంచి రూ.18,591 కోట్లకు చేరింది. 14.5 శాతం పెరిగింది. భారీగా పెరిగిన మొండిబకాయిలు... మార్చి క్వార్టర్(క్యూ4)లో కొత్తగా రూ.7,000 కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారాయని ఐసీఐసీఐ వెల్లడించింది. దీంతో బ్యాంక్ స్థూల ఎన్పీఏలు 5.82%కి(రైటాఫ్లు పోను రూ.26,211 కోట్లు) ఎగబాకాయి. అంత క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 3.78%(రూ.15,095 కోట్లు) కాగా, డిసెంబర్ క్వార్టర్లో 4.72%(రూ.21,149 కోట్లు)గా ఉన్నాయి. మొండిబకాయిలకు ప్రొవిజనింగ్ రూ.1,345 కోట్ల(అంతక్రితం ఏడాది క్యూ4) నుంచి ఈ క్యూ4లో రూ.3,326 కోట్లకు పెరిగిపోయాయి. మార్చి క్వార్టర్లో కొత్తగా ఎన్పీఏలుగా మారిన రూ.7,000 కోట్ల రుణాల్లో 60%మేర ఆర్బీఐ ఏక్యూఆర్ నిబంధనల కారణంగా నమోదైనవేనని బ్యాంక్ పేర్కొంది. రూ.2,700 కోట్లు మాత్రం పునర్వ్యవస్థీకరించిన రుణాల నుంచి ఎన్పీఏలుగా మారాయని తెలిపింది. కాగా, రూ.8,573 కోట్ల విలువైన పునర్వ్యవస్థీకరణ రుణాలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇక నికర ఎన్పీఏలు కూడా మార్చి క్వార్టర్లో 1.61%(రూ.6,256 కోట్లు) నుంచి 2.98%కి(రూ.12,963 కోట్లు) ఎగబాకాయి. గతేడాది డిసెంబర్ క్వార్టర్లో ఇవి 2.28%(రూ.9,908 కోట్లు). పూర్తి ఏడాదికి చూస్తే... స్టాండెలోన్గా గతేడాది నికర లాభం కూడా 13 శాతం పడిపోయి రూ.11,175 కోట్ల నుంచి రూ.9,726 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.61,267 నుంచి రూ.68,062 కోట్లకు పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ♦ రూ. 2 ముఖ విలువైన ఒక్కో షేరుకి రూ.5 చొప్పున డివిడెండ్ను బ్యాంక్ ప్రకటించింది. ♦ జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 6 శాతం వృద్ధి తో రూ.5,404 కోట్లుగా నమోదైంది. ♦ వడ్డీయేతర ఆదాయం ఏకంగా 46 శాతం ఎగబాకి రూ.5,109 కోట్లకు దూసుకెళ్లింది. మ్యుంగా లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ అనుబంధ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా లభించిన రూ.2,131 కోట్లు దీనికి దోహదం చేసింది. ♦ నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 3.57% నుంచి 3.37%కి తగ్గింది. ♦ ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ.237 వద్ద ముగిసింది. ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓకి ఓకే.. అనుబంధ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్లో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) ద్వారా మరింత వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం మెజారిటీ వాటానే అట్టిపెట్టుకుంటుంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, కమోడిటీ ధరల తగ్గుముఖంతోపాటు దేశీయంగా వృద్ధి రికవరీ ఇంకా మందకొడిగానే ఉండటం.. రుణగ్రహీతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులు కుదుటపడాలంటే మరికొంతకాలం పట్టొచ్చు. మొండి బకాయిల కుదుపుల నేపథ్యంలో ఈ ఏడాది(2016-17)లో కార్పొరేట్ రుణా ల వృద్ధి 5-7% మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం. ప్రధానంగా రైల్వేలు, రోడ్లు, డిఫెన్స్ వంటి పనితీరు బాగున్న రంగాలపైనే దృష్టిసారిస్తున్నాం. ఇక గతేడాది రిటైల్ రుణాల వృద్ధి 16.4% కాగా, దీన్ని ఈ సంవత్సరంలో 18%కి పెంచుకోనున్నాం. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ