పోలీసులకు నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ!
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండల్ రెడ్డి, జిమ్మిబాబులకు కొందరు పోలీసులు, రాజకీయ నాయకులు సహకరించినట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సంపాదించారు. కొండల్ రెడ్డి, జిమ్మిబాబుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ వద్ద కొండల్ రెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తుండగా, జిమ్మిబాబు తెలుగుయువత నాయకుడు.
ఈ కేసులో కొండల్ రెడ్డి, జిమ్మిబాబులను కాపాడేందుకు కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారుల వద్ద ఆధారాలున్నట్టు సమాచారం. వీరికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏసీబీ అధికారులు రెండు మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.