Printers
-
బీ‘టెక్’ చోరుడు!
చిత్తూరు అర్బన్: మహేష్ బాబు బీటెక్. వయసు 22. బెట్టింగుల వ్యసనం అతడిని చోర శిఖామణిగా మార్చేసింది. పగలంతా కళాశాలకు వెళ్లి చదువుకోవడం.. రాత్రివేళ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్న అతగాడు చివరకు పోలీసులకు చిక్కాడు. చిత్తూరు ఎస్పీ తుషార్డూడీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ పురం మండలం కన్యకాపురానికి చెందిన మహేష్ బాబు తిరుపతిలో ఉంటూ అక్కడే ఓ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగుల ఉచ్చులో చిక్కుకున్న అతడు తెలిసినవాళ్లు, స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని మరీ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు.అయినా ఆ వ్యసనం నుంచి బయటకు రాలేకపోయాడు. పందేలు కాయడానికి డబ్బులు లేకపోవడంతో చివరకు దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు చేస్తే పెద్దగా పట్టించుకునే వ్యవస్థ లేదని గ్రహించి.. గ్రామ, వార్డు సచివాలయాల్లో చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. రాత్రివేళ సచివాలయాల్లోకి ప్రవేశించి ప్రింటర్లు, ఎల్రక్టానిక్ వస్తువులు చోరీ చేసేవాడు. ఇలా ఎస్ఆర్ పురంలో 5, వెదురుకుప్పంలో 3, గుడిపాలలో 2, జీడీ నెల్లూరులో 2, తిరుపతి జిల్లాలో 5, అన్నమయ్య జిల్లాలో ఒక కేసులో మొత్తం కలిపి 18 కేసుల్లో మహేష్ కుమార్ను నిందితుడిగా గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు అమ్మేసేవాడు. వేలిముద్రలే పట్టించాయి చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడి వేలిముద్రలను సేకరించిన పోలీసులు ఆధార్ కార్డు నమోదైన వేలి ముద్రలతో సరిపోల్చి నిందితుడిని గుర్తించారు. సోమవారం చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై మఠం క్రాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహేష్ బాబును అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.8.10 లక్షల విలువ చేసే ప్రింటర్లు, ద్విచక్ర వాహనం, ఇనుప తలుపులు కత్తిరించే భారీ కట్టర్, ల్యాప్టాప్లను స్వాదీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కార్వేటి నగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఆర్ పురం ఎస్ఐ సుమన్, సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందచేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఐపీఎస్ తరుణ్ పహ్వా, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, నగరి ఇన్చార్జి పోలీసు అధికారి రాంబాబు, ఎస్బీ సీఐ మురళి ఉన్నారు. -
ఇక కెమెరాలు, ప్రింటర్లు.. మరిన్ని కీలక ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు!
పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల దిగుమతులకు లైసెన్స్ తప్పనిసరి చేసిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా అలాంటి ఆంక్షలు విధించే ఆలోచనలో ఉంది. ఈ ఉత్పత్తులలో కెమెరాలు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్లు, టెలిఫోనిక్, టెలిగ్రాఫిక్ పరికరాల భాగాలు ఉండవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆ నివేదిక ప్రకారం, స్థానిక మార్కెట్లో ఈ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉండటంతో విదేశాల నుంచి పెద్డఎత్తున దిగుమతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఉత్పత్తి అవకాశాలను ప్రోత్సహించాలంటే ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని దీనిపై అవగాహన ఉన్న వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వస్తువుల దిగుమతులు 2023 ఆర్థిక సంవత్సరంలో 10.08 బిలియన్ డాలర్లను అధిగమించాయి. ఇతర వస్తువులపైనా సమీక్ష! పైన పేర్కొన్న ఉత్పత్తులతో పాటు, అధిక దిగుమతి అవుతున్న ఇతర వస్తువులను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. వీటిలో యూరియా, యాంటీబయాటిక్స్, టర్బో-జెట్లు, లిథియం-అయాన్ అక్యుమ్యులేటర్లు, శుద్ధి చేసిన రాగి, యంత్రాలు, యాంత్రిక ఉపకరణాలు, సోలార్, ఫొటోవోల్టాయిక్ సెల్స్, అల్యూమినియం స్క్రాప్, పొద్దుతిరుగుడు విత్తన నూనె, జీడిపప్పు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో, భారత్ మొత్తం సరుకుల దిగుమతులు 16.5 శాతం పెరిగి 714 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు పెరగడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2 శాతానికి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 1.2 శాతంగా ఉండేది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్-1 (ITA-1) పరిధిలోకి వచ్చే 250 ఉత్పత్తుల దిగుమతులపై ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఐటీఏ-1 జాబితాలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, కంప్యూటర్లు, టెలికాం పరికరాలు, సెమీకండక్టర్లు, సెమీకండక్టర్ తయారీ, యాంప్లిఫైయర్లు, టెస్టింగ్ పరికరాలు, సాఫ్ట్వేర్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్లు సహా అనేక రకాల హై-టెక్నాలజీ వస్తువులు ఉన్నాయి. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
♦ ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చాలి ♦ కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, పాలేరు ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కేంద్రాన్ని కోరింది. ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చాలంది. ఈ విధానం ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా దోహదపడుతుందని పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీతో పాటు ఎన్నికల కమిషనర్లను కలిసి వినతిపత్రం అందించింది. బృందంలో పార్లమెంటు సభ్యులు వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్రెడ్డి, నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్దనరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్రెడ్డి, దాసోజు శ్రవణ్, గురిజాల వెంకట్, నిరంజన్, కైలాష్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించుకోవడానికి ఇచ్చిన అనుమతిని వెనక్కితీసుకోవాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అదనపు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని, ధనప్రవాహాన్ని అడ్డుకోవాలని కోరారు. వరంగల్ లోక్సభ, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీతో పాటు మరో రెండు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యాయన్నారు. ప్రజాప్రతినిధులను కొంటున్నారు... తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తోందని ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ తొత్తుగా మారిందన్నారు. -
ఖమ్మం ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుకు సంబంధించి పలు అనుమానాలు, ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపధ్యంలో ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 35 డివిజన్లలో ప్రింటర్లతో కూడిన ఏవీఎంల ద్వారా ఓటింగ్ అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈవీఎంలలో ఓటర్లు ఓటు వేయగానే రశీదులు వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు.


