breaking news
presidential guards
-
ఆఫ్రికా దేశం నైగర్లో సైనిక కుట్ర
నియామె: పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్లో సైనిక కుట్ర జరిగింది. బుధవారం ఉదయం ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ నివాసాన్ని చుట్టుముట్టారు. బజౌమ్ను, ఆయన భార్యను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ టీవీ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకుని, తమను తాము నేషనల్ కౌన్సిల్గా గురువారం ప్రకటించుకున్నారు. శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించినందునే దేశ రక్షణ బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్మీయే దేశ రక్షణ బాధ్యత వహిస్తుందని, బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి హస్సౌమి మస్సౌదౌ స్పందించారు. ‘సైనిక కుట్ర జరిగింది. కానీ, మేం దానిని అంగీకరించం. అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి. తిరుగుబాటును ప్రజలు తిప్పికొట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు వెనుక ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఈయన్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు అధ్యక్షుడు బజౌమ్ ప్రయత్నించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తిరుగుబాటుకు సైన్యం కూడా మద్దతు ప్రకటించింది. ఇలా ఉండగా పొరుగుదేశం బెనిన్ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ఫ్రాన్సుకు వలసదేశంగా ఉన్న నైగర్కు 1960లో స్వాతంత్య్రం వచ్చింది. ఎట్టకేలకు 2021లో మహ్మద్ బజౌమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
ట్యునీషియాలో ఎమర్జెన్సీ..
- రాజధాని నడిబొడ్డున బస్సు పేలుడు.. ఉగ్రదాడిగా అనుమానం - దేశాధ్యక్షుడి దక్షణ దళానికి చెందిన 15 మంది అంగరక్షకుల దుర్మరణం - నెలరోజుల అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు బెంజీ ఎసెప్సీ ట్యునిష్: ఉత్తర ఆఫ్రికా దేశం ట్యునీషియా రాజధాని ట్యూనిష్ నగరం బాంబు పేలుడుతో దద్దరిల్లింది. అధ్యక్షుడి కాన్వాయ్ కి చెందిన బస్సును గుర్తుతెలియని దుండగులు పేల్చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళావారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటనలో 15 మంది సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, పేలుడు సమయంలో అధ్యక్షుడు అక్కడ లేకపోవటంతో పెను ముప్పు తప్పినట్లయింది. రాజధాని నగరం నడిబొడ్డులో జరిగిన పేలుడుతో ఉలిక్కిపడ్డ ట్యునీషియా ప్రభుత్వం.. ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు బెంజీ ఖాయిద్ ఎసెబ్సీ వెల్లడించారు. కాగా, దాడికి పాల్పడింది ఉగ్రవాదులే అయిఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి లక్ష్యం అధ్యక్షుడే అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ తర్వాత అత్యయిక పరిస్థితి ప్రకటించిన దేశం ట్యునీషియానే కావటం గమనార్హం.