breaking news
Pratap Nagar
-
సూరత్లో వైభవంగా హోలీ వేడుకలు
సాక్షి, ముంబై: ప్రముఖ వాణిజ్యపట్టణమైన సూరత్లో తెలుగు ప్రజలు హోలీ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ప్రతాప్నగర్లోని శ్రీ మార్కండేయ మందిరం ఎదుట కాముని దహనాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక తెలుగు కార్పొరేటర్ రాపోలు లక్షి బుచ్చిరాములు నివాసంలో పలువురు హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో సూరత్ పద్మశాలి సమాజం అధ్యక్షుడు కూరపాటి ఐలయ్య,ప్రతాప్నగర్ సమాజం అధ్యక్షుడు జెల్ల రాంచందర్. కార్యదర్శి దాసరి సూర్యనారాయణ, మందిరం కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపల్లి లక్ష్మణ్, ఎలిగేటి నాగేష్, చిట్యాల శ్రీనివాస్, అడిగొప్పుల సత్యనారాయణ, సాదుల లక్ష్మీనారాయణ, గౌరి యతిరాజం, యెలుగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రజలు ఎక్కువగా సహజసిద్ధమైన రంగులతో హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టిబందోబస్తులను ఏర్పాటు చేశారు. పద్మశాలి సంఘ సభ్యుల విహారయాత్ర సాక్షి, ముంబై: హోలీ సందర్భంగా తూర్పు బాంద్రాలోని జ్ఞానేశ్వర్నగర్ తిరంగ వెల్ కమిటీ ఆదర్శ పద్మశాలి సేవా సంఘ సభ్యులు సోమవారం విహారయాత్రకు వెళ్లారు. దీనిలో భాగంగా లోనావాలా, ఏకవీర మాతా మందిరాన్ని దర్శించుకున్నారు. అనంతరం సభ్యులందరూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో సభ్యులు పలి వెంకటేశం, ఎనగందుల మల్లేశ్, కొంగారి వెంకట్స్వామి, దీకొండ ప్రభాకర్, వెంగల లక్ష్మణ్, బోగ సత్యనారాయణ, కొంగారి లక్ష్మీ, దీకొండ యశోద్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తాళ్లరేవు, న్యూస్లైన్ : జాతీయ రహదారి 216లోని కోరంగి పంచాయితీ సుబ్బారాయుని దిమ్మవద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం కోరంగిలోని ప్రతాప్ నగర్కి చెందిన మడికి అమ్మిరాజు (35) రొయ్యల కంపెనీలో దినసరి కూలీ. విధి నిర్వహణ నిమిత్తం సైకిల్పై వెళుతున్న అమ్మిరాజును ఉదయం 5.30 గంటల సమయంలో కాకినాడనుంచి అంతర్వేదికి రొయ్యల సీడుతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. అమ్మిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు మృతి విషయం తెలిసిన బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలంలో బైఠాయించారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచెలు వేసి దిగ్బంధించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా రామచంద్రపురం సీఐ ఎ.రాంబాబు, కోరంగి ఇన్చార్జ్ ఎస్సై రమేష్లు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. సుమారు 8 గంటల పాటు ఈ ఆందోళన సాగింది. ప్రమాదానికి కారణమైన వ్యాన్లోని వ్యక్తులు ఆర్థిక సహాయం చేసేందుకు, వాహన యజమాని నుంచి నష్ట పరిహారం చెల్లించేందుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కోరంగి హెచ్సీ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.