breaking news
PPP method
-
పీపీపీ ముసుగులో ఏపీ ఫర్ సేల్..!?
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి నివేదిక విడుదల చేసిన సందర్భంలో చెప్పిన విషయాలు రానున్న ప్రమాదానికి సంకేతమా అన్న అభిప్రాయం అప్పుడే కలిగింది. సరిగ్గా వారం తిరగకముందే అసలు విషయం బయటకు వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం 16 శాఖలకు సంబందించి వివిధ కార్యక్రమాలను పీపీపీ పద్దతిలో ప్రైవేటువారికి అప్పగించబోతున్నట్లు మార్గదర్శకాలు విడుదల అయ్యాయి.టీడీపీ, జనసేనలు కలిసి మానిఫెస్టో విడుదల చేసినప్పుడు కాని, ఆ తర్వాత బీజేపీతో కలిసి ఎన్నికల ప్రచారాలు నిర్వహించినప్పుడు కాని తాము పీపీపీ విధానంలో వివిధ రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తామని, యూజర్ చార్జీలు వసూలు చేస్తామని ఎక్కడా చెప్పలేదు. పైగా గత ప్రభుత్వం పట్టణాలలో పారిశుధ్ద్యం నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఏభై నుంచి వంద రూపాయల చార్జీలు వసూలు చేస్తే అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు నానా యాగీ చేశారు. చెత్తపన్నువేసే చెత్త ప్రభుత్వం అని ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే చెత్తపన్ను తొలగించామని అన్నారు. అయినా పిఠాపురం తదితర చోట్ల యధాప్రకారం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.నిజానికి దీనివల్ల ప్రజలపై పెద్దగా భారం పడింది లేదు. అయినా అంత రచ్చ చేసిన చంద్రబాబు ఇప్పుడేమో విద్య, వైద్యం, రవాణా మొదలైన 16రంగాలలో యూజర్ చార్జీలు వసూలుకు రంగం సిద్దం చేస్తున్నారు. దీనిని ఏ తరహా ప్రభుత్వం అని జనం అనుకోవాలి?ప్రజలకు సంపద సమకూర్చి పెడతానని పదే, పదే ఊదరగొట్టిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టేమో కాని, ఉన్న ప్రజల సంపదను ప్రైవేటువారికి కట్టబెట్టడానికి తయారవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.విపక్షంలో ఉన్నప్పుడు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తివేస్తామని చెప్పారు. లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి మీటర్లను పగలకొట్టండని పిలుపు ఇచ్చారు. పవర్లోకి వచ్చాక వాటిని తొలగించలేదు సరికదా.. ఇళ్లకు కూడా కొత్త మీటర్లు పెడుతూ జనానికి చిర్రెత్తిస్తున్నారు. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన రోజున ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో వచ్చిన 23 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలలో 11.37 లక్షల కోట్ల పెట్టుబడుల పనులు ఆరంభం అయ్యాయని, వీటిలో అధిక భాగం పీపీపీ మోడల్ అని అన్నారు. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలలో 1.23 లక్షల కోట్ల ప్రాజెక్టులు పీపీపీ విధానంలో ఉన్నాయని తెలపడం విశేషం. దేనిని నమ్మాలో తెలియదు.అదలా ఉంచితే పీపీపీ వ్యవస్థలో భవిష్యత్తులో యూజర్ చార్జీల రూపేణా లక్షల కోట్ల మేర ప్రజలపై భారం వేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారనుకోవాలా! ఈ ప్రైవేటు కంపెనీలకు వయబిలీటి గ్యాప్ ఫండ్ ఇస్తారట. వడ్డీ లేని రుణం ఇస్తారట. వయబిలిటి ఫండ్ కోసం ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీల మూలధనంలో ప్రభుత్వం 20 నుంచి నలభై శాతం గ్రాంట్గా కూడా ఇస్తుందట. జగన్ ప్రభుత్వం పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వపరంగా నిర్మిస్తే, వాటిని ప్రైవేటువారికి అణాకు, బేడాకు ఆ సంపదను అప్పగించే కుట్ర జరుగుతోందన్నది వైఎస్సార్సీపీ నేతల విమర్శగా ఉంది.వేల కోట్ల పెట్టుబడి పెట్టిన తర్వాత, దానిపై ఏ ప్రభుత్వమైనా ఆదాయం పొందాలని చూస్తుంది. కాని చిత్రంగా కూటమి ప్రభుత్వం దానిని వదలుకుని, ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల రూపేణా ప్రజలపై అదనపు భారం వేయడానికి రెడీ అయిందన్నమాట.భోగాపురం విమానాశ్రయం ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడాన్ని, మెడికల్ కాలేజీలు ప్రైవేటువారికి అప్పగించడాన్ని ఒక రీతిలో చంద్రబాబు చూడడాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపట్టారు. విమానాలు ఎక్కేవారు, ఆరోగ్యం కోసం వచ్చే పేదవారు ఒకటేనా అని ఆయన ప్రశ్నించి, చంద్రబాబు ఆలోచన ధోరణి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని అన్నారు. పీపీపీ ముసుగులో వనరుల దోపిడీ జరగబోతోందని సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పీపీపీ కాదు.. ఏపీ ఫర్ సేల్, అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అన్న కొత్త విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఇదంతా పెద్ద స్కామ్ అని ఆయన ఆరోపించారు.కాగా ఈనాడు మీడియా మాత్రం ప్రైవేటుకు ప్రోత్సాహం ప్రజలకు ప్రయోజనం అన్న శీర్షిక పెట్టి తెలుగుదేశంపై తన భక్తిని ప్రదర్శించింది. అంతే తప్ప విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సేవలకు యూజర్ చార్జీలేమిటి అని ప్రశ్నించలేదు.2004 కి ముందు కూడా చంద్రబాబు ఇదే విధానం అమలు చేయాలనుకునేవారు. ప్రభుత్వ ఆస్పత్రులలో యూజర్ చార్జీలను కూడా కొన్నిచోట్ల పెట్టారు. నష్టాలలో ఉన్నాయని పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటువారికి కారుచౌకగా కట్టబెట్టారు. వాటిలో పెక్కు సంస్థలు అక్కడ పరిశ్రమలు నడపడం లేదు. ఆ పరిశ్రమల భూమిని ప్రైవేటు యాజమాన్యాలు రియల్ ఎస్టేట్కు వాడుకుని భారీగా లబ్ది పొందాయని అంటారు. చంద్రబాబు అప్పట్లో ఏది ఉచితం కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని అనేవారు. ఆ రోజుల్లో జన్మభూమి పేరుతో ఏభైశాతం ఖర్చు పెట్టే వారి ప్రాంతంలోనే రోడ్లను వేసేవారు.2004లో ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ పద్దతులకు గుడ్ బై చెప్పి, ప్రజల సాధారణ అవసరాలకు ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించే విధానం అమలు చేశారు. చంద్రబాబు విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన మైండ్ సెట్ ఎప్పుడూ ఆ రకంగానే ఉంటుందని వైఎస్సార్సీపీ వారు వ్యాఖ్యానిస్తుంటారు. ప్రస్తుతం తీసుకువచ్చిన పీపీపీ విధానం కూటమి ప్రభుత్వానికి మరణశాసనం అయినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొందరు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు ప్రజలకు ఆందోళన కలిగించేదిగా ఉందన్నది వాస్తవం.ప్రైవేటువారు అభివృద్ది చేసుకునే రాజధాని అమరావతిలో ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించడానికి సిద్దం అవుతూ, ప్రభుత్వపరంగా పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలందించే కార్యక్రమాలను ప్రైవేటువారికి అప్పగించి యూజర్ చార్జీల భారం మోపడానికి తయారవుతున్న వైనం చూస్తే ఇదంతా రివర్స్ ప్రభుత్వం అన్న భావన కలగదా! సామాజిక రంగాలలో సేవలన్నిటిని ప్రైవేటుకు అప్పగించాక ప్రభుత్వ బాధ్యత ఏమి ఉంటుంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం తప్ప అని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అది నిజమేకదా అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబు నిర్వాకం.. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నాయి. ఏపీలోని ఆసుపత్రులను అన్నింటినీ పీపీపీ విధానంలోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.కాగా, సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలకు మరో షాకిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రతీ నియోజకవర్గంలో పీపీపీ పద్దతిలో ఆసుపత్రి ఉండాలని చంద్రబాబు.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులను ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలిచ్చారు. దీంతో, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దూరం కానుంది. వైద్యం మెత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది.ఇక, ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో నిర్వహించేందుకు ‘గుజరాత్ పీపీపీ మోడల్’ను అధ్యయనం చేయాలని చంద్రబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయి ఆసుపత్రులను పీపీపీ పద్దతిలో పెట్టాలని నిర్ణయించారు. -
ప్రభుత్వ ఆస్పత్రులు ప్రవేటుకు..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీలతో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అనుసంధానించాలని, తద్వారా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో వాటిని నిర్వహించాలని నీతి ఆయోగ్ సూచించింది. ఈ మేరకు ప్రజాభిప్రాయం కోరింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటే, దానికి అనుబంధ ఆసుపత్రిని నెలకొల్పడం అత్యంత కష్టమైన వ్యవహారం. ఎంతో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పైగా రోగులను ఆయా ప్రైవేటు బోధనాసుపత్రులకు తీసుకురావడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య నాసిరకంగా ఉంటుందన్న భావన అందరిలోనూ నెలకొంది. ఈ పరిస్థితుల నుంచి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విముక్తి కలిగించే నూతన ప్రతిపాదనను నీతి ఆయోగ్ ముందుకు తెచ్చింది. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటకల్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రులను అప్పగించిన విషయాన్ని నీతి ఆయోగ్ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసే విషయాన్ని చర్చకు తీసుకువచ్చింది. వైద్యుల కొరతను తీర్చేందుకేనంటూ... అర్హత కలిగిన వైద్యుల కొరతను తీర్చడమే పీపీపీ పద్ధతి లక్ష్యమని నీతి ఆయోగ్ తెలిపింది. ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా 600 పడకలతో బోధనాసుపత్రి ఏర్పా టు చేయడం ఖర్చుతో కూడుకున్నది. దీంతో అనేకమంది ఔత్సాహికులు ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో మెడికల్ సీట్ల కొరత వేధిస్తుందనేది నీతి ఆయోగ్ ఉద్దేశమని వైద్య నిపుణులు అంటున్నారు. తెలంగాణలో అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అవసరంలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. -
లాహిరి లాహిరి లాహిరిలో..
కృష్ణానదిలో విహారం.. నల్లమల మధ్య పర్యాటక విడిది * కొల్లాపూర్ ఎకో టూరిజం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా * సోమశిల-శ్రీశైలం బోటింగ్ ఏర్పాటు.. అక్కమహాదేవి గుహలకు కొత్త హంగులు * చీమల తిప్ప దీవి, శ్రీవారి సముద్రం రిజర్వాయర్ల అభివృద్ధి * రూ.350 కోట్లతో బృహత్తర ప్రాజెక్టు.. కేంద్రం నుంచి రూ.100 కోట్లు సాక్షి, హైదరాబాద్: పాపికొండలు.. ప్రకృతి రమణీయత అంతా ఒకేచోట కొలువుదీరినట్లు అనిపించే సుందర ప్రాంతం. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్లో భాగం. అలాంటి పర్యాటక స్వర్గధామం ఇప్పుడు తెలంగాణలోనూ కనువిందు చేయనుంది. ఇందుకోసం మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ కేంద్రంగా ఒక బృహత్తర ప్రాజెక్టు సిద్ధం కాబోతోంది. దాదాపు రూ.350 కోట్లతో రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తన వంతుగా రూ.100 కోట్ల వరకు ఇచ్చేందుకు ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆధ్యాత్మికం, వినోదం ప్రధానాంశాలుగా రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ఎకో టూరిజం ప్రాజెక్టును తీర్చిదిద్దబోతోంది. సోమవారం ఢిల్లీలో జరిగిన కీలక భేటీలో కేంద్ర పర్యాటక శాఖ దీనికి ఆమోదం తెలిపింది. కొత్తగా ప్రారంభించిన పర్యాటక పథకం ‘స్వదేశ్ దర్శన్’ కింద నిధులు కేటాయించేందుకు సుముఖత తెలిపింది. ఏం చేస్తారు?: నల్లమలలోని సోమశిల ప్రాజెక్టు వద్ద ప్రకృతి సౌందర్యాన్ని ఒడిసిపట్టి పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా తీర్చిదిద్దబోతున్నారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో బోటింగ్ ఏర్పాటు చేస్తారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పర్యాటకులు విహరించొచ్చు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరువలో ఉన్న అక్క మహాదేవి గుహలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారు. అక్కడ లైటింగ్తోపాటు పర్యాటకులకు కాటేజీలను నిర్మిస్తారు. శ్రీశైలం-సోమశిల నీటిమార్గం ఏర్పాటు ఇది. ఇక సోమశిల ద్వాదశ జ్యోతిర్లింగాలయం (లలితాంబిక సోమేశ్వరాలయం), జటుప్రోలు మదనగోపాల స్వామి ఆలయం, శాతవాహనకాలంలో 20 ఆలయాల సమూహంగా రూపుదిద్దుకున్న మూక గుడులు, సింగోటం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలను ఈ ప్రాజెక్టులో చేర్చారు. కృష్ణా నది మధ్యలో ప్రశాంతంగా ఉండే చీమల తిప్ప దీవిని పర్యాటకుల విడిది కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. శ్రీవారి సముద్రం రిజర్వాయర్ను కూడా పర్యాటకులు సందర్శించేలా హంగులు అద్దుతారు. సురభిరాజుల బంగ్లా లాంటి చారిత్రాక కట్టడాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రధాన దేవాలయాలు, సందర్శనీయ స్థలాలు కాకుండా మరో పది విడిదులను ఈ ఎకో టూరిజం ప్రాజెక్టులో చేర్చారు. దీన్ని పీపీపీ పద్ధతిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను మరికొద్ది రోజుల్లో రూపొందించనున్నారు.


