ఇద్దరు బాలికలపై లైంగికదాడి
పొల్లాచ్చిలో ఐదో తరగతి చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులపై గుర్తుతెలియని ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. హాస్టల్లో ఉన్న వీరిని బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడడం రాష్ర్టంలో కలకలం రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. మంత్రులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు.
టీనగర్ : కోయంబత్తూరు జిల్లాలోని నెగమం, పల్లడం, వాల్పారై ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాల విద్యార్థినులు పొల్లాచ్చిలో చదువుకుంటున్నారు. వీరిలో ఇరవై మంది అక్కడి టీఈఎల్సీ చర్చ్ ఆవరణలోని హాస్టల్లో ఉంటున్నారు. వీరంతా అక్కడి అతి పెద్ద హాల్లో నిద్రిస్తుంటారు. వారిలో ఇద్దరు గురువారం ఉదయం సమీపంలోని పాడుబడిన భవనంలో అత్యాచారానికి గురై పడిఉండడం వెలుగు చూసింది. ఆ ఇద్దరు విద్యార్థినులను పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించగా, వారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు విచారణ వేగవంతంచేశారు. ఆ బాలికల వద్ద జరిపిన విచారణ మేరకు తమను ఇద్దరు యువకులు భుజాన వేసుకుని వెళ్లి, కత్తులతో బెదిరించి, తమను ఇలా చేశారని విలపించారు. హాస్టల్ వద్ద జరిపిన విచారణలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకులు ప్రవేశించి తలుపు తట్టినట్టు తేలింది.
ఓ విద్యార్థిని తలుపులు తీయగా, దాహం వేస్తోందంటూ ఓ యువకుడు పేర్కొన్నట్టు, ఆ బాలిక వారికి నీళ్లు తెచ్చేందుకు వెళ్లడంతో అక్కడే నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థినులను తమ భుజాన వేసుకుని వెళ్లినట్టు గుర్తించారు. ఆ హాస్టల్కు ఎలాంటి అనుమతులు లేకపోవడం, అక్కడ విద్యార్థినులకు భద్రతకు కనీసం గార్డు కూడా లేకపోవడం గమనార్హం. పథకం ప్రకారమే విద్యార్థినులను ఎవరో తీసుకెళ్లి అత్యాచారం జరిపినట్టు భావి స్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. ఈఘటనను రాష్ట్రంలో మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాం డ్ చేస్తున్నారు.అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆ హాస్టల్ను అధికారులు సీజ్ చేశారు. ఆ హాస్టల్ చర్చికి సంబంధించినట్టు తేలడంతో నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు.
సీఎం సీరియస్: ఈ ఘటనను ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా పరిగణించారు. సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఘటన వివరాలను సేకరించారు. నింధితులను త్వరితగతిన అరెస్టు చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆ విద్యార్థినులకు మెరుగైన వైద్య అందించాలని పేర్కొంటూ, మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియో ప్రకటించారు.