breaking news
Peter Getz
-
'మీ ముందున్న నాకు ప్రాణం పోసింది ఆయనే..'
వాషింగ్టన్: కీడుచేసిన వాళ్లను మరిచినా పెద్దగా నష్టం లేదు ఎందుకంటే ఆ మరుపు ఔన్నత్యాన్ని చాటుతుంది. కానీ, మేలు చేసిన వారిని మరిచిపోరాదు ఎందుకంటేవారు మనల్ని ఓ మెట్టు ఎక్కించినవారు.. ఆగిపోతున్న మన ఉనికికి కాస్త ఊపిరిపోసినవారు. అందుకే పైకి వ్యక్తీకరించే అవకాశం లేకపోయినా చాలామంది మాత్రం తప్పకుండా తాము పొందిన మేలును, ఆ మేలు చేసిన వ్యక్తిని మనసులో పెట్టుకుంటే ఇంకొందరు మాత్రం పైకి చాటుకుంటారు. కనెక్టికట్కు చెందిన ఓ బాలిక ఇప్పుడదే చేసింది. తాను పొందిన మేలు మరిచిపోకుండా అభిమానం చాటుకుంది. ఎందుకంటే ఆమె పొందిన మేలు మాములుది కాదు. దాదాపు ప్రాణదానం. 1998 జూన్ 25న వాషింగ్టన్ స్ట్రీట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కనెక్టికట్లోని హార్ట్ఫోర్డ్లో అగ్నిమాపక దళంలో పీటర్ గెట్జ్ అనే వ్యక్తి పెట్రోలింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు. రేడియో ద్వారా సమాచారం అందుకున్న ఆయన ఇతర సిబ్బందితో కలిసి అక్కడి చేరుకున్నారు. అనంతరం నేరుగా అగ్నిప్రమాదం చోటు చేసుకున్న భవనంలోకి ఎంతో సాహసంతో వెళ్లి ఐదేళ్ల జోసిబెల్క్ అపోంటే అనే బాలికను రక్షించాడు. ఆ సమయంలో గాయాలతో స్పృహలేకుండా పడిపోయిన ఆ బాలిక దాదాపు చనిపోయిందని అనుకున్నారు. కానీ, ఆ ఆఫీసర్ కారణంగా శరవేగంగా ఆస్పత్రిలో చేర్పించగా తిరిగి ఊపిరిపోసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఆమె అంకుల్ మాత్రం చనిపోయాడు. అయితే, వారిని అలా వదిలేయకుండా వారికి కావాల్సిన వస్తువుల సేకరణ, డబ్బు సేకరణ చేసిన పీటర్.. వెన్నుదన్నుగా నిలిచి వారిని పంపించారు. అయితే, ఆమెకు దూరంగానే ఉంటూ ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా ఆ బాలిక యోగక్షేమాలు పరిశీలిస్తుండేవాడు పీటర్. అయితే, కనెక్టికట్లోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న జోసిబెల్క్ తన గతం తెలిసి ఎలాగైనా ఆయనను కలుసుకోవాలని ఫేస్బుక్ ద్వారా తీవ్రంగా శ్రమించింది. ఎట్టకేలకు ఆయనను తెలుసుకొని నేరుగా తాను డిగ్రీ అందుకునే కార్యక్రమానికి ఆహ్వానించింది. డిగ్రీ అందుకునే సమయంలో ఆయన వల్లే తాను నేడు బతికి ఉన్నానంటూ వర్సిటీ సాక్షిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంది. దీంతో ఆ కార్యక్రమంలో అంతా పీటర్ను అభినందిస్తూ చప్పట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు వారి రెండు కుటుంబాలు కూడా మంచి సన్నిహితంగా మారాయి. -
ఆ చిన్నారే.. ఇప్పుడు గ్రాడ్యుయెట్!
అది 1998నాటి మాట. అమెరికా కనెక్టికట్లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చుట్టుముట్టాయి.అగ్నిమాపక శాఖ ఉద్యోగి పీటర్ గెట్జ్ తన సిబ్బందితోపాటు కూడా అక్కడికి వచ్చాడు. మంటల్లో ఇద్దరు చిక్కుకొని ఉన్నారు. అందులో ఒకరు మరణించగా.. ఐదేళ్ల చిన్నారి సృహతప్పి పడిపోయింది. అగ్నిప్రమాదం వల్ల షాక్తో ఆ చిన్నారి గుండె ఆగినంత పనైంది. దీంతో ఆ చిన్నారికి నోటి ద్వారా శ్వాస అందిస్తూ.. సీపీఆర్ ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్ వచ్చేదాక వేచి చూడకుండా వెంటనే తన బైకు మీద ఆస్పత్రికి తీసుకెళ్లాడు పీటర్ గెట్జ్.. అలా మృత్యుకోరల నుంచి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్న జోసిబెల్క్ అపోంటె.. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఈస్టర్న్ కనెక్టికట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. 23 ఏళ్ల జోసి పట్టా అందుకుంటుంటే.. ఆ దృశాన్ని చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన పీటర్ గెట్జ్ కళ్లలో కూడా ఆనందంతో నీళ్లు మెదిలాయి. ప్రస్తుతం రిటైరై విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న గెట్జ్.. తాను కాపాడిన చిన్నారి జోసిబెల్క్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ కావడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పాడు. 'ఆనాడు నేను చేసింది నా డ్యూటీ మాత్రమే. అందుకు నాకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు జోసిని చూస్తే ఎంతో గర్వకారణంగా ఉంది. తన ఎన్నో కష్టాలను అధిగమించింది. అగ్నిప్రమాదంలో ఆత్మీయుల్ని కోల్పోయింది. శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభ అనుభవించింది. అయినా వాటన్నింటినీ తట్టుకొని తను నిలదొక్కుకుంది. ఇప్పుడు ఉజ్వలమైన తారగా ఇప్పుడు మన ముందు నిలిచింది' అని గెట్జ్ ఆనందం వ్యక్తం చేశాడు. అటు జోసిబెల్క్ కూడా గెట్జ్ పట్ల ఎంతో కృతజ్ఞాతభావాన్ని ప్రకటించింది. 'నేను దాదాపు చనిపోయాను. కానీ నాకు పునర్జన్మ దక్కింది. అందుకు కారణం పీటర్ గెట్జ్. ఆ రోజు నాకు సహాయంగా వచ్చిన ఇతర అగ్నిమాపక సిబ్బంది' అని జోసి చెప్పింది. తనకు పునర్జన్మను ఇచ్చిన గెట్జ్ను ఫేస్బుక్లో వెతికి పట్టుకొని మరీ ఆయనను తమ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానించింది. ఆమె పంపిన తొలి మెసేజ్ చదివినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని గెట్జ్ చెప్పాడు.