breaking news
Performance test
-
టెస్టింగ్ టైమ్: బీజేపీ ఎంపీల పనితీరు మదింపు
సాక్షి, న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టిసారించిన బీజేపీ ఆ దిశగా కసరత్తు చేపట్టింది. పార్టీ ఎంపీల పనితీరును 16 అంశాల ప్రామాణికంగా మదింపు చేసేందుకు సంసిద్ధమైంది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఎంపీలకు పార్టీ టికెట్ దక్కుతుంది. రానున్న ఎన్నికల్లో ఎంపీ టికెట్ పొందాలంటే సీనియారిటీ, ప్రతిష్టలను పక్కన పెట్టి ఎంపీలంతా హైకమాండ్ మదింపులో నెగ్గుకురావాల్సిందే. పార్టీకి చెందిన 282 మంది ఎంపీల పనితీరుపై స్వతంత్ర ఆడిట్కు తొలిసారిగా బీజేపీ సన్నద్ధమైంది. పార్టీ ఎంపీల పనితీరును మదింపు చేసే బాధ్యతను ఓ ఏజెన్సీకి కట్టబెట్టారు. దేశరాజధానిలోని ఏడు బీజేపీ ఎంపీల పనితీరును విశ్లేషిస్తూ ఈ ఏజెన్సీ తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఎంపీల పనితీరుపై నివేదికలను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తారు. ఢిల్లీ ఎంపీలపై విశ్లేషణ నివేదిక త్వరలో అందనుండటంతో తదుపరి ఇతర రాష్ట్రాల ఎంపీల పైనా ఈ కసరత్తు చేపడతారు. మొత్తం ప్రక్రియ 2018, డిసెంబర్ నాటికి పూర్తవుతుంది. పార్లమెంట్కు ఎంపీల హాజరు, తమ నియోజకవర్గాల పర్యటనలు వంటి పలు అంశాల ఆధారంగా ఎంపీల పనితీరును మదింపు చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తమ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ పనితీరు, వ్యక్తిగత ప్రతిష్ట ఆధారంగా సిట్టింగ్ ఎంపీల విజయావకాశాలనూ ఈ ఆడిట్ బేరీజు వేస్తుందని వెల్లడించాయి. ప్రజల్లో సిట్టింగ్ ఎంపీకి ఇప్పటికీ ఆదరణ ఉన్నదా అనేది నిగ్గుతేల్చాలన్నది ఏజెన్సీకి ముఖ్యమైన బాధ్యతగా అప్పగించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
సీఆర్టీలకు పరీక్షే !
వచ్చే నెల 3న పెర్ఫార్మెన్స్ టెస్టు నిర్వహించాలని నిర్ణయం ► ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ► కేజీబీవీల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రెన్యువల్ గండం ► ఏడేళ్ల బోధనకు ఫలితం ఇదేనా అంటున్న సీఆర్టీలు సాక్షి, ఖమ్మం: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్)లకు ఇప్పుడు రెన్యువల్ గండం పట్టుకుంది. ఏడేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిన బోధన చేస్తున్న వీరికి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఉత్తర్వులతో దడ పుడుతోంది. సీఆర్టీలుగా పనిచేస్తున్న వారికి పెర్ఫార్మెన్స్ టెస్టు (పనితీరు అంచనా పరీక్ష) నిర్వహించాలని ఇందులో పేర్కొన్నారు. జూన్ 3న అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ టెస్టు నిర్వహించాలని డీఈఓలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశించారు. అయితే తమ బోధనతో కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని.. ఇంకా పెర్ఫార్మెన్స్ టెస్టు ఎందుకని సీఆర్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 13 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2,352 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.వీటిల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన చేసేందుకు రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. గణితం, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తోపాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సీఆర్టీలు, ఒక వ్యాయామ ఉపాధ్యాయురాలు, ఏఎన్ఎం, వంట మనుషుల, వాచ్మెన్లను నియమించారు. వీరిపై పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని కూడా నియమించారు. పీజీ, బీఈడీ అర్హత ఉన్న వారిని సబ్జెక్టు సీఆర్టీలుగా నియమించి నెలకు రూ.15వేలు వేతనం అందజేస్తున్నారు. ఇలా జిల్లాలో 91 మంది సీఆర్టీలు పనిచేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి( ప్రిన్సిపల్) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్ఎస్ఏ అధికారులు రెన్యువల్ చేస్తూ వచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి పనితీరు అంచనా పరీక్ష పెట్టాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీలు ప్రారంభించినప్పుడు అర్హతలు, డెమో పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్న సీఆర్టీలను ప్రతీ సంవత్సరం సర్వశిక్ష అభియాన్ అధికారులు ఏ అడ్డంకి లేకుండా రెన్యువల్ చేస్తూ వచ్చారు. అయితే ఈనెల 24న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో సీఆర్టీలు లబోదిబోమంటున్నారు. నిఘా నీడలో జిల్లా కేంద్రంలో.. వచ్చేనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తెరవనుండడంతో ఈప్రక్రియ అంతా పూర్తి చేయాలనే ఆలోచనతో జూన్ 3న సీఆర్టీలకు జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నారు. డీఈఓ, ఎక్స్ అఫీషియో, పీఓ, ఎస్ఎస్ఏ, సెక్టోరియల్ అధికారులకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అన్ని వసతులు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం విశేషం. పరీక్ష కేంద్రానికి నిర్దేశించిన సమయానికి గంట ముదు రావాలని, వచ్చేటప్పుడు పాఠశాల ప్రత్యేకాధికారి నుంచి పొందిన గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. పరీక్ష వ్యాసరూప, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ రూపంలో ఉంటుందని, పరీక్ష రాసేందుకు సీఆర్టీలు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు ఆధికారి జి.కిషన్ పేరున ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ టెస్టులో అర్హత సాధించని సీఆర్టీలను ఇంటిబాట పట్టించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టు రద్దు చేయాలంటున్న సీఆర్టీలు.. ఓవైపు టెస్టు నిర్వహిస్తే అర్హత సాధించకపోతే ఎలా..? అని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆందోళన.. ఏడేళ్లుగా ఏ ఇబ్బంది లేకుండా పనిచేసిన సీఆర్టీలకు ఇప్పుడు పనితీరు అంచనా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలని యూటీఎఫ్, కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగు సంఘం, ఇతర ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ఆచార్యను కలిసి సీఆర్టీల వివరాలు, వారు పనిచేస్తున్న తీరును వివరించినట్లు తెలిసింది. అయితే పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేసేలా చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘాలకు ఆయన హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీఆర్టీల పరీక్షల ఉత్తర్వు రద్దు చేయాలని, లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన బాట పడతామని డిమాండ్ చేస్తున్నారు. -
బ్యాంకులకు సామర్థ్య పరీక్ష
ముంబై: బ్యాంకుల సామర్థ్య పరీక్షకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) విడుదల చేసింది. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని నిలబడే విధంగా రూపొందించిన ఈ నిబంధనలు 2014 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. బ్యాంకులు వాటి వ్యాపారం, పరిధి, నష్టభయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సామర్థ్య పరీక్షను నిర్వహించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకోసం బ్యాంకులను వాటి వ్యాపార పరిమాణం ఆధారంగా మూడుగా విభజించింది. రూ. రెండు లక్షల కోట్ల వ్యాపారం పరిమాణం దాటిన వాటిని మొదటి తరగతి కింద, రూ.50 వేల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లలోపు రెండో తరగతి, రూ.50 వేల కోట్లు కంటే తక్కువ ఉన్న బ్యాంకులను మూడో తరగతిగా విభజించింది. ప్రస్తుతమున్న సామర్థ్య పరీక్ష ఈ మధ్య వచ్చినటువంటి అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చిట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే 2015 నుంచి బ్యాంకులు అదనంగా 0.80% వరకు టైర్-1 క్యాపిటల్ను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలపై సూచనలు, సలహాలు ఇవ్వడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించింది.