breaking news
Percentage Point
-
కోవిడ్ ముందస్తు స్థాయికి నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నియామకాలు కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకున్నాయని జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ఉద్యోగ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వివరించింది. ‘నియామకాలు 2020 ఫిబ్రవరి స్థాయికి చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే జూలైలో ఐటీ టెక్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రకటనలు 19 శాతం అధికమయ్యాయి. ప్రాజెక్ట్ హెడ్, ఇంజనీర్ వంటి ఇతర ఐటీ ఉద్యోగాలకు ప్రకటనలు 8–16 శాతం పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమవడం, కోవిడ్ –19 సవాళ్ల చుట్టూ పనిచేయడానికి వ్యాపార సంస్థలు చేసే ప్రయత్నాలు భారతీయ జాబ్ మార్కెట్ను రికవరీ వైపు నెట్టా యని ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ శశి కుమార్ తెలిపారు. టెక్ జాబ్స్ జోరు ఎక్కువగా కొనసాగుతున్నప్పటికీ, రిటైల్, ఫుడ్ రంగంలో తిరిగి డిమాం డ్ రావడం వృద్ధిని మరింతగా పెంచడంలో వినియోగ ఆర్థిక వ్యవస్థ కీలకంగా ఉందన్నారు. ప్రాధాన్యతలలో మార్పు.. కంపెనీలు, ఉద్యోగార్ధులకు పరిశుభ్రత ప్రధాన ప్రాధాన్యతగా మారింది. హౌజ్కీపర్స్, కేర్టేకర్స్, క్లీనర్స్ ఉద్యోగాలు 60 శాతం దూసుకెళ్లాయి. వెటెరినరీ, థెరపీ, పర్సనల్ కేర్, చైల్డ్ కేర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. ఉద్యోగార్ధుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును సూచించే ధోరణి ఇది. అభ్యర్థుల్లో ఆసక్తి విషయంలో విమానయానం 25 శాతం, అకౌంటింగ్ 8, కస్టమర్ రిలేషన్స్ 7, అడ్మిన్ 6 శాతం తగ్గాయి. ఉద్యోగ వృద్ధి వేగవంతం అవుతూనే ఉంది. ఎక్కువ మంది కార్మికులు ఉద్యోగాలు వెతుకుతున్నారు. కార్మిక మార్కెట్ పునర్ ప్రారంభంతో ముడిపడి ఉన్న రంగాలు ముందంజలో ఉన్నాయి’ అని ఇండీడ్ వివరించింది. ఈ ట్రెండ్ రాబోయే నెలల్లో కొనసాగవచ్చన్న ఆశను కలిగిస్తున్నాయని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
నేడు ఆర్బీఐ పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంగళవారం ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. రేట్లకు సంబంధించి గవర్నర్ రఘురామ్ రాజన్ యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రేట్ల విషయంలో సోమవారం తన తాజా అంచనాలను వెలువరిస్తూ, రెపో రేటు తగ్గింపునకు అవకాశం లేదని పేర్కొంది. యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత రిటైల్ ద్రవ్యోల్బణం (ఫిబ్రవరిలో 8.1 శాతం) స్థాయి ఆమోదనీయంకాదని, ఇంకా తగ్గాలని ఆర్బీఐ భావించే అవకాశాలు ఉండడమే దీనికి కారణమని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 8 శాతంగా ఉంది. రేట్లు పెంచితే వృద్ధికి విఘాతం రేట్లలో ఎటువంటి మార్పూ ఉండకపోవచ్చని డన్ అండ్ ఏఎంపీ బ్రాడ్షీట్ సీనియర్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరగడానికే అవకాశాలు ఉండడం దీనికి కారణమని ఆయన అంచనావేశారు. అయితే రేటు పెంచితే మాత్రం అది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రతికూలమవుతుందని స్పష్టం చేశారు.