breaking news
pendlam
-
పెండలం దుంప సాగుతో ఊహించని లాభాలు.. ఎకరాకు ఆదాయం ఎంతంటే?
దేవరపల్లి(పశ్చిమగోదావరి): కష్టాన్ని నమ్ముకున్న రైతుకు ఈ ఏడాది పెండలం దుంప సాగు ఊహించని లాభాలు తెచ్చింది. జూలైలో పంట విక్రయించిన వారికి కాసులు కురిపిస్తోంది. ఈ పంట దిగుబడులు తగ్గినా ధర బాగుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మెట్ట ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో పెండలం దుంపను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి మండలం పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో, కొవ్వూరు మండలం పెనకలమెట్ట, దొమ్మేరు, వాడపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా పెండలం సాగు జరుగుతోంది. చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా? పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో దాదాపు 25 ఏళ్లుగా పెండలం సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. మూడు గ్రామాల్లో సుమారు 220 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఖరీఫ్లో పంట వేయగా, జనవరి, ఫిబ్రవరి నెలల్లో దుంప తయారు అవుతోంది. మే, జూన్, జూలై నెలల్లో ఎగుమతి చేస్తారు. ఒక్కో దుంప రెండు నుంచి 5 కిలోల బరువు ఉంటోంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. రికార్డు స్థాయిలో ధర ప్రస్తుతం పెండలం ధర రికార్డు స్థాయిలో ఉంది. మొన్నటి వరకూ టన్ను ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల ఉండగా, జూలైలో రికార్డు స్థాయికి చేరింది. టన్ను ధర రూ.39 వేలు పలుకుతోంది. ధర పెరగడంతో పెండలం సాగు చేసిన రైతులకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర గతంలో ఎన్నడూ లేదని వారంటున్నారు. అయితే అమ్మకాలు ముమ్మరంగా ఉన్న సమయంలో టన్ను ధర రూ.15 వేలు పలకడంతో ముందుగా అమ్ముకున్న రైతులు నష్టపోయారు. ఈ నెలలో విక్రయించిన రైతులకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చింది. పల్లంట్ల దుంపకు డిమాండ్ దేవరపల్లి మండలం పల్లంట్లలో పండించిన పం టకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దుంప సైజు, నాణ్యత ఉంటుంది. 2 కిలోల నుంచి 5 కిలోలు దుంప తయారు అవుతుంది. దుంప పంట కావడంతో భూమిలో పెరుగుతుంది. దుంప తయా రైన తర్వాత భూమిలో నుంచి దుంపను తవ్వితీసి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. పెండలం పంట సాగుకు పెట్టుబడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఎకరం కౌలు రూ.50 వేలు ఉండగా, పెట్టుబడి మరో రూ.70 వేలు అవుతుంది. ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువ కావడంతో నిఖర ఆదాయం తగ్గిందని రైతులు తెలిపారు. ఒడిశాకు ఎగుమతులు జిల్లాలో పండించిన పెండలం దుంపను ఒడిశాకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలో పెండలాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వివాహాలు, శుభకార్యాల సమయంలో పెండలాన్ని ఇంటింటికీ 10 కిలోల చొప్పున సారెగా పంపిణీ చేస్తారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన వ్యాపారులు పల్లంట్ల పరిసర గ్రామాలకు వచ్చి దుంపను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటారు. పది టన్నుల లారీ రూ.3.90 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు వివరించారు. మార్కెట్లో ధర పెరిగింది.. పెండలం దుంపకు మార్కెట్ బాగుంది. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో సుమారు 100 మంది రైతులు దాదాపు 220 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రెండేళ్లు మార్కెట్ బాగోక నష్టపోయారు. గత ఏడాది 10 టన్నుల ధర రూ.70 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.3.90 లక్షలు వస్తోంది. దిగుబడులు తగ్గడంతో పెండలానికి డిమాండ్ ఏర్పడింది. నెల రోజుల నుంచి మార్కెట్లో ధర పెరిగింది. – నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల -
దుంప తెంపింది..!
- తగ్గిన ధర.. దిగుబడి పతనం - నష్టాల పాలవుతున్న పెండలం రైతులు - ఎకరానికి రూ.60 వేల నష్టం - ఇక పంటలు సాగుచేయలేమంటున్న రైతులు - చేదెక్కిస్తున్న చేమ పిఠాపురం: పెండలం సాగు రైతును నిండాముంచేసింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి తగ్గిపోవడంతో రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు రావడంతో ఇక పంటలు సాగు చేయడం సాధ్యం కాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం మండలంలోని రేవడి నేలల్లో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పొలాల్లో సాగుచేసిన ఈ పంటను గత వారం రోజుల నుంచి తవ్వుతున్నారు. ఈ ఏడాది ఈ పంటసాగులో దిగుబడి నిరాశాజనకంగానే ఉండగా ధర రెండు వంతులకు పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. గత ఏడాది పది టన్నుల పెండ్ల ధర రూ. 1.60 లక్షలుండగా ఈ ఏడాది రూ.లక్షకు పడిపోవడంతో కోలుకోలేని నష్టాలను చవిచూడాల్సి వస్తోందంటున్నారు. పిఠాపురం మండలం విరవాడ, విరవ, మంగితుర్తి, కోలంక, కుమారపురం, జల్లూరు, ఎఫ్కేపాలెం తదితర గ్రామాలతోపాటు జిల్లాలో కోనసీమ ఏరియాలోని రావులపాలెం పరిసర గ్రామాల్లోనూ, మెట్ట ప్రాంతాలైన ధర్మవరం, ఉత్తరకంచి, లంపకలోవ, లింగంపర్తి, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండల గ్రామాల్లోనూ సుమారు 3,500 ఎకరాల్లో çసాగు చేశారు. ప్రస్తుతం పెండలం పంట తుది దశకు చేరుకోవడంతో దాన్ని తవ్వి తీస్తున్నారు. ఈ పంటకి వరి, చెరుకు పంటలకన్నా ఎక్కువ పెట్టుబడి ఎకరానికి రూ.లక్షకు పైగా అవ్వగా ధర పతనం కావడంతోపాటు దిగుబడి భారీగా తగ్గిపోవడంతో ఎకరానికి రూ.40 మాత్రమే ఆదాయం వస్తుండడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దిగుబడి పతనం ఎకరానికి 14 టన్నులు దిగుబడి రావల్సిన పెండ్లం దిగుబడి ఈ ఏడాది ఐదు నుంచి ఆరు టన్నులకు పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే ధర పతనం కాగా దిగుబడి సైతం పడిపోవడంతో ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టం వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు వ్యవసాయశాఖ పట్టించుకోకపోవడం వంటి కారణాలతో నష్టాలు చూడాల్సి వస్తోందంటున్నారు. ఆగిన ఎగుమతులు ఇదిఇలా ఉంటే ఒడిశాలో స్థానిక ప్రజలకున్న ఆనవాయితీ ప్రకారం వివాహాల సమయంలో ఒక్కో కుటుంబం 100 కేజీల వరకూ పెండలం వినియోగిస్తుంటారు. అందువల్ల మన జిల్లాలో ఉత్పత్తయిన పెండలంలో 80 శాతం ఒడిశా రాష్ట్రానికి ఎగుమతవుతోంది. ప్రసుతం ఒడిశాలో సీజన్ కాకపోవడంతో పెండలం కొనుగోలుకు వ్యాపారులెవరూ రాకపోవడంతో ఇక్కడ అమ్మకాలు నిలిచిపోయాయి. తద్వారా ధర పాతాళానికి పడిపోయింది. ఒడిశాలో తప్ప ఈ కూర పెండలం దుంపలను ఎక్కడా ఎక్కువగా వినియోగించకపోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా ఏకంగా టన్నుకు రూ.6 వేలకు పైగా ధర పడిపోవడం ఇదే మొదటిసారని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అంతరపంటగా చేమ దిగుబడి నిరాశాజనకమే... పెండలంలో అంతరపంటగా సాగు చేసిన చేమ పంట సైతం ఆశాజనకంగా లేకపోవడంతో కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. అంతరపంటగా సాగు చేసిన చేమ ఎకరానికి టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దుంప సక్రమంగా ఊరకపోవడంతోపాటు ధరకూడా కిలో రూ.2 వరకు మాత్రమే పలుకుతుండడంతో ఏమాత్రం ఆదాయం వచ్చే మార్గం కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఆదుకునే వారు లేరు మేము రైతులమేనన్న విషయం ఎవరూ గుర్తించరు. మాకు రుణమాఫీ వర్తించదు. ఏవిధంగానూ సాయం అందదు. ప్రస్తుతం ఎకరానికి రూ.60 వేలకు పైగా నష్టాలు పాలై అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కు తోచనిస్థితిలో ఉన్నాం. దిగుబడి దెబ్బతీసి ధర లేక కొనేవారు రాక ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అడబాల పాపారావు, పెండలం రైతు, విరవాడ, పిఠాపురం మండలం వ్యాపారం లేదు గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణంగా ధర పడిపోవడం చూడలేదు. దిగుబడి తగ్గిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కొనేవారు రావడం లేదు. దీంతో మేము కొనుగోలు చేయడం లేదు. అలాఅని ఇక్కడి వ్యాపారులు కొనడం లేదు. ఇక పెండలం వ్యాపారం చేయడం మనేయాలని నిర్ణయించుకున్నాం. బాలిరెడ్డి వెంకటేశ్వరరావు, పెండలం వ్యాపారి, ధర్మవరం , ప్రత్తిపాడు మండలం.