breaking news
Peking
-
రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే! ఆసక్తికర అధ్యయనం
ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్ కోర్ ఉంటాయి. ఇన్నర్ కోర్ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద. ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్ కోర్ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్ కోర్ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్ కోర్ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. అధ్యయనం చేసిందిలా... భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు. భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్ కోర్ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు. 1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్ కోర్ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది. 2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్ కోర్ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్ కోర్పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్ కోర్ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 70 ఏళ్లకోసారి రివర్స్ ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్ కోర్ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్ కోర్ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్ కోర్ వేగం తగ్గినప్పుడు మాంటెల్ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్ కోర్ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
COVID-19: చైనాలో కరోనా కేసులు ఏకంగా 90 కోట్లు!
బీజింగ్: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్–19 వైరస్ బారినపడ్డారు. పెకింగ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు వర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్ సోకిందని వెల్లడించింది. అత్యధికంగా గాన్సూ ప్రావిన్స్లో 91 శాతం మందికి కరోనా సోకింది. యునాన్ ప్రావిన్స్లో 84 శాతం మంది, కింఘాయ్ ప్రావిన్స్లో 80 శాతం మంది వైరస్ ప్రభావానికి గురయ్యారు. చైనాలో కొత్త సంవత్సరం ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది జనం పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంటువ్యాధుల నిపుణుడొకరు హెచ్చరించారు. కరోనా కొత్త వేవ్ ఉధృతి రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ అధిపతి జెంగ్ గువాంగ్ తెలిపారు. -
మావో వేడుకలపై చైనా ఉక్కుపాదం
బీజింగ్: స్వతంత్ర చైనా తొలి చైర్మన్ మావో జెండాంగ్ 125వ జయంతి వేడుకలపై షీ జిన్పింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మావో జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైన పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థి, వర్సిటీ మార్క్సిస్ట్ సొసైటీ చీఫ్ క్వీ హంక్సువాన్ను అరెస్ట్ చేసింది. పెకింగ్ విశ్వవిద్యాలయం ప్రవేశద్వారం వద్దకు సాధారణ దుస్తుల్లో వచ్చిన 8మంది పోలీసులు నల్లటికారులో క్వీని బలవంతంగా ఎక్కించారు. ఈ సందర్భంగా అతను ‘నేను క్వీ హాంక్సువాన్ను. నేను చట్టాన్ని ఉల్లంఘించలేదు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు’ అని అధికారులతో పెనుగులాడాడు. చైనాలో 1989లో తియానన్మెన్ కూడలిలో ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ఉద్యమంలో పెకింగ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. అయితే కొన్నేళ్ల క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షీ జిన్పింగ్, చైనా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, వాటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. తాజాగా క్వీ అరెస్టుపై చైనా ప్రభుత్వం, పెకింగ్ విశ్వవిద్యాలయం ఇంకా స్పందించలేదు. -
భారత్లో అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆఫర్లు
న్యూఢిల్లీ: భారత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థలు విమాన చార్జీలపై డిస్కౌంట్లు... కొత్త కొత్త సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ విమాన చార్జీల్లో 20% డిస్కౌంట్ను ప్రకటించింది. దక్షిణ అమెరికాకు వెళ్లే విమానాల్లో బిజినెస్ క్లాస్(క్లబ్ వరల్డ్) టికెట్లపై 20 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్కు నేటి నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే నెల 31లోపు ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇక లుఫ్తాన్సా సంస్థ బెంగళూరు-లండన్ మార్గంలో తొలిసారిగా ఈ నెల 22 నుంచి ప్రీమియం ఎకానమీ క్లాస్ను పరి చయం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్ను ఫ్రాంక్ఫర్ట్-బెంగళూరు మార్గంలో అంది స్తున్నామని పేర్కొంది. మలేసియా ఎయిర్లైన్స్ యెస్ ఆఫర్లు ఇక మలేషియా ఎయిర్లైన్స్ సంస్థ ఇయర్ ఎండ్ స్పెషల్ (యెస్) ఆఫర్లను అందిస్తోంది. భారత్ నుంచి మలేషియాకు ఎకానమీ క్లాస్ రాను, పోను చార్జీ రూ.11,860, ఇండోనేసియాకు రూ. 15,890, చైనాకు రూ.20,830, ఆస్ట్రేలియాకు రూ.39,660 అని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయని, వచ్చే నెల 2 వరకూ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది.