breaking news
pdcc bank
-
పీడీసీసీబీ కొత్త చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం..!
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) కొత్త చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈదర మోహన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 11న ఈదర తన చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 12న సహకార శాఖ రిజిస్ట్రార్ ఈదర రాజీనామాను ఆమోదించారు. చైర్మన్ రాజీనామా నేపథ్యంలో నిబంధనల మేరకు 15 రోజుల్లో కొత్త చైర్మన్ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈదర రాజీనామాతో ఈ నెల 13న వైస్ చైర్మన్ కండె శ్రీనివాసులు తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. 15 రోజుల్లో కొత్త చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అథారిటీని నియమించాలని ఆర్సీఎస్ను కోరాలని సోమవారం సమావేశమైన పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఆర్సీఎస్కు లేఖ పంపనున్నారు. అనంతరం ఆర్సీఎస్ ఎన్నికల అథారిటీని నియమించే అవకాశం కనిపిస్తోంది. దీంతో 15 రోజుల లోపు కొత్త చైర్మన్ ఎంపికకు ఆర్సీఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 20నే కొత్త చైర్మన్ ఎన్నిక ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కొత్త చైర్మన్గా మస్తానయ్య..? కొత్త చైర్మన్ ఎన్నికకు సహకార శాఖ సిద్ధమైన నేపథ్యంలో డైరెక్టర్లలో చైర్మన్ పదవి కోసం పోటీ నెలకొంది. గతంలో వైస్ చైర్మన్గా చేసిన అధికార పార్టీకి చెందిన బల్లికురవ పీఏసీఎస్ అధ్యక్షుడు మస్తానయ్య చైర్మన్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు జె.వి.పాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు యలమందరావు, కారుమంచి పీఏసీఎస్ అధ్యక్షుడు ఆర్.వెంకట్రావులు సైతం చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పీడీసీసీబీ వ్యవహారంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈయన ఆది నుంచి పాత చైర్మన్ ఈదర మోహన్తో విభేధించారు. ఇరువురి మధ్య గొడవ రోడ్డెక్కింది. ఈదర మోహన్ను దించేందుకు అప్పట్లో వైస్ చైర్మన్గా ఉన్న మస్తానయ్య గట్టిగా ప్రయత్నించారు. మెజార్టీ డైరెక్టర్లు ఈదర మోహన్కు మద్ధతు పలకడంతో ఆయన పోరాటం ఫలించలేదు. చివరకు మెజార్టీ డైరెక్టర్లు మోహన్కు వ్యతిరేకంగా మారడంతో ఎట్టకేలకు ఆయన పదవీచ్యుతుడయ్యారు. ప్రస్తుతం మస్తానయ్యకు దామచర్ల మద్ధతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్లు కూడా ఎమ్మెల్యే సూచనల మేరకు మస్తానయ్యను చైర్మన్ను చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చైర్మన్ ఎన్నికకు తేదీ ఖరారైతే ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి. -
తిక్కముదిరింది ... లెక్కే లేదంది
‘శిష్యా ఏమి చేస్తున్నావ్ ’ అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నానని గురువుకు సమాధానమిచ్చాడట వెనుకటికో శిష్యుడు. తప్పులు దిద్దుకోవడం మంచిదే కానీ చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు కాబట్టే ఈ సామెత పుట్టుకొచ్చినట్టుంది. ఈ చందంగానే చంద్రబాబు రుణమాఫీ తయారైంది. ‘నేనే మోనార్క్ని ... ఆర్థిక శాస్త్రం అవపోసన పట్టేశాను ... రుణమాఫీ అమలు నాకే సాధ్యమంటూ’ డాంబికాలు పలికి ఆచరణలో బోర్లా పడ్డారు. అయినా నేనే గెలిచానంటూ రెండు వేళ్లు విజయ సంకేతంగా గాలిలో ఊపుతున్న నారా నైజం అర్థం కాక రుణ మాఫీ బాధితులు జుత్తు పీక్కుంటున్నారు. హైటెక్ జాబితాల్లో ఈ తప్పులేమిటని ప్రశ్నిస్తున్నారు రైతన్నలు. ఒంగోలు వన్టౌన్: ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసిన మొదటి విడత రుణమాఫీ జాబితాలు తప్పుల తడకగా తయారవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రుణం పొందిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం అమల్లో ఉన్న స్కేలు ఆఫ్ ఫైనాన్స్ను (ఎస్.ఒ.ఎఫ్) ప్రాతిపదికగా తీసుకోవడంతో తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశంలో ప్రకటించిన విషయాలకు ఆచరణలో రుణమాఫీ జాబితాల్లో పేర్కొన్న అంశాలకు అసలు పొంతనే లేకుండా పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీడీసీసీ బ్యాంకు ఆర్థిక సాయంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ద్వారా వ్యవసాయ రుణాలు పొందిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధానంగా కందుకూరు ప్రాంతంలోని ఐదు సొసైటీల రైతులను రాయలసీమ జిల్లాలకు చెందిన వారుగా జాబితాలో పేర్కొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వివిధ పంటల సాగుకు అక్కడి జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించిన ఎఫ్.ఒ.ఎస్.కు జిల్లాలోని జిల్లా కమిటీ ఆమోదించిన స్కేలు ఆఫ్ ఫైనాన్స్కు తేడా ఉంది. ఇతర జిల్లాలకంటే జిల్లాలో పంట సాగుకే అధిక వ్యయమవుతోంది. కందుకూరు ప్రాంతంలోని ఐదు సొసైటీల్లో 773 మంది రైతులను వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతులుగా జాబితాల్లో పేర్కొనడంతో ఈ రైతులందరూ ఆయా జిల్లాల స్కేలు ఆఫ్ ఫైనాన్స్కు అనుగుణంగా రుణమాఫీకి అర్హులు కావడంతో రూ.1.53 కోట్ల రుణాల మాఫీని నష్టపోతున్నారు. - పోకూరు సొసైటీలో 210 మంది రైతులను అనంతపురం జిల్లాకు చెందిన వారిగా, 9 మంది రైతులను వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన వారిగా రుణమాఫీ జాబితాలో పేర్కొన్నారు. - యర్రారెడ్డిపాలెం సొసైటీలో 100 మంది రైతులను చిత్తూరు జిల్లావాసులుగా జాబితాలో చూపించారు. - మోపాడు సొసైటీలో 109 మంది రైతులను కర్నూలు జిల్లా రైతులుగా చూపించారు. తూనుగుంట సొసైటీలో 58 మంది, ధారకానిపాడు సొసైటీలో 287 మందిని చిత్తూరు జిల్లా రైతులుగా పేర్కొన్నారు. ఈ జాబితాలను చూసిన రైతులు విస్తుపోతున్నారు. ఈ విషయమై ఇక్కడి జిల్లా రైతులను రాయలసీమ జిల్లా రైతులుగా రుణమాఫీ జాబితాల్లో పేర్కొన్న విషయమై పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదరమోహన్ బాబును వివరణ కోరగా పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలిసి రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరించి సవరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.