breaking news
Pavala vaddi
-
AP: ఇళ్లకు పావలా వడ్డీ రుణాలు
సాక్షి, అమరావతి: ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులైన పేదలకు పావలా వడ్డీ కింద రుణాలు ఇప్పించేలా బ్యాంకర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులకు పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్ చేశామని, అత్యవసర సమయాల్లో వీటి మీద రుణం తెచ్చుకునేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పావలా వడ్డీ మాత్రమే లబ్ధిదారుడికి పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మరింత ఊపందుకుంటుందన్నారు. కొన్ని జిల్లాల్లో సెర్ప్, మెప్మా సహకారంతో లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారని తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ, గృహ నిర్మాణంతో పాటు ఖరీఫ్ సన్నద్ధత, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష, పరిశ్రమలపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం స్పందన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పది రోజుల్లో ప్లాట్ల మ్యాపింగ్ హౌసింగ్ లే అవుట్లలో లబ్ధిదారుల ప్లాట్ల మ్యాపింగ్ 10 రోజుల్లోగా పూర్తిచేయాలి. దీనివల్ల అర్హులైన వారికి మిగిలిన ప్లాట్లను వెంటనే కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి అర్హులుగా గుర్తించిన వారికీ ఇంటిపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్లో ఉన్న సుమారు 8 వేల దరఖాస్తుల వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. ప్రస్తుత లే అవుట్ల ద్వారా 45,212 మందికి పట్టాలు ఇవ్వబోతున్నాం. కొత్త లే అవుట్లలో 10,801 మందికి పట్టాలు ఇస్తాం. మరో 1,43,650 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ తొలిదశలో 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. ఇప్పటివరకు 10.11 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఇళ్ల నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రతి ఇంటి నిర్మాణ ప్రగతిపై ఆన్లైన్ స్టేజ్ అప్డేషన్ చేయాలి. హౌసింగ్పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి. అక్టోబర్ 25 నుంచి ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణం ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం అక్టోబర్ 25 నుంచి మొదలవుతుంది. ఆప్షన్ 3 లబ్ధిదారుల సంఖ్య 3.25 లక్షలు కాగా ఇప్పటికే 1.77 లక్షల ఇళ్లకు సంబంధించి 12,855 గ్రూపులు ఏర్పాటయ్యాయి. మిగిలిన చోట్ల గ్రూపుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలి. అక్టోబరు 25లోగా అన్ని సన్నాహాలు పూర్తి కావాలి. నీరు, కరెంట్ సదుపాయాలను సెప్టెంబర్ 15లోగా కల్పించేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ధరలు పెంచితే కఠిన చర్యలు కొన్ని జిల్లాల్లో మెటల్ ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోంది. కలెక్టర్లు దీనిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే రేట్లు నిర్ణయించాలి. ధరలు పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపాలి. లే అవుట్ల సమీపంలోనే ఇటుకల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల రవాణా ఖర్చు తగ్గుతుంది. వారానికి ఒకసారి కలెక్టర్లు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి. ఇ–క్రాపింగ్ చాలా కీలకం.. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మండలాలు మినహా సాధారణ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాగు లక్ష్యం 92.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకూ 59.07 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో 37.25 లక్షల ఎకరాల్లో ఇ–క్రాపింగ్ పూర్తైంది. మిగిలిన చోట్ల కూడా ఇ–క్రాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు 10% ఇ– క్రాపింగ్ను తనిఖీ చేయాలి. జేడీఏలు, డీడీఏలు 20 శాతం ఇ–క్రాపింగ్ను తనిఖీ చేయాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు 30 శాతం తనిఖీ చేయాలి. సీజన్తో సంబంధం లేకుండా ఇ– క్రాపింగ్ జరగాలి. ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లను రైతుల నుంచి డిమాండ్ చేయకూడదు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, పంట సేకరణ, పంట రుణాలు, విత్తనాలు, ఎరువులు సరఫరా ఇలా అన్నింటికీ ఇ–క్రాపింగ్ చాలా కీలకం. వ్యవసాయ సలహా మండళ్లు వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాలు కొనసాగాలి. వీటిని కలెక్టర్లు పర్యవేక్షించి సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. నెలలో మొదటి శుక్రవారం ఆర్బీకేల్లో, రెండో శుక్రవారం మండల స్థాయిల్లో, ప్రతి 3వ శుక్రవారం జిల్లాల స్థాయిలో సలహా మండళ్ల సమావేశాలు జరగాలి. జిల్లాస్థాయి సమావేశాలకు కలెక్టర్ హాజరు కావాలి. కల్తీపై కొరడా.. ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువుల తదితరాల పంపిణీ, నాణ్యతపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ఎక్కడా కల్తీలకు చోటు ఉండకూడదు. ప్రైవేట్ దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలి. రైతులకు రుణాలతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలు అప్పుడే సక్రమంగా అందించగలుగుతాం. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం. కలెక్టర్ల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. భూ వివాదాల్లేని రాష్ట్రం దిశగా ఏపీలో ఈ సర్వేను నిర్వహిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు 3న ప్రోత్సాహకాలు ఎంఎస్ఎంఈలకు సెప్టెంబరు 3న ప్రోత్సాహకాలు విడుదల చేయబోతున్నాం. కలెక్టర్లు నెలలో ఒకరోజు ఎంఎస్ఎంఈలకు, మరో రోజు ఇతర పరిశ్రమలకు కేటాయించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. అప్పుడే పారిశ్రామిక రంగం ప్రగతి సాధిస్తుంది. కలెక్టర్ చైర్మన్గా ఉన్న ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ నెలలో ఒకరోజు సమావేశం కావాలి. దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాల విడుదలకు మార్గం సుగమమవుతుంది. భూముల కేటాయింపులు, కాలుష్య నివారణ తదితర అంశాలపై కూడా దృష్టి సారించవచ్చు. 75% ఉద్యోగాలు స్థానికులకే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పించే చట్టం అమలుపైనా కలెక్టర్లు సమీక్షించాలి. పరిశ్రమలకిచ్చే రాయితీలకు ఈ చట్టంతో సంబంధం ఉంది. 75 శాతం స్ధానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే రాయితీలకు అర్హత ఉండదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలపైనా దృష్టి పెట్టాలి. విజయదశమి రోజున వీటి నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను పెండింగ్లో పెట్టారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దిష్ట తేదీ ప్రకటించి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్, ఇతర పరిశ్రమలకు కరెంటుపై రాయితీతోపాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాం. అప్పుడే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. నెలకు మూడు రోజులు కలెక్టర్లు సమయం కేటాయిస్తే పారిశ్రామిక వేత్తలకు భరోసా కలిగి ముందుకు వస్తారు. -
20 శాతం సబ్సిడీతో పెంపకం దారులకు రుణాలు
సాక్షి, పెదవాల్తేరు (విశాఖతూర్పు) : రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకం దార్లకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) ద్వారా రూ.275కోట్ల మేర రుణాలు విడుదల చేసిందని గొర్రెలు–మేకల అభివృద్ధి సమాఖ్య రాష్ట్ర చైర్మన్ వై.నాగేశ్వరరావు వెల్లడించారు. నగరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ 20 శాతం సబ్సిడీతో రుణాలు జిల్లా యూనియన్ల ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. లబ్ధిదారులు రుణాలపై పావలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. 20 గొర్రెలు, పొట్టేలుకు రూ.లక్ష , 50 గొర్రెలు, రెండు పొట్టేళ్లకు రూ.5లక్షలు, వంద గొర్రెలు, 25 పొట్టేళ్లకు రూ.50లక్షలు వంతున బ్యాంకులతో సంబంధం లేకుండా జిల్లా యూనియన్ల ద్వారా రుణాలు అందజేస్తున్నామన్నారు. టీడీపీ లీగల్ సెల్ మాజీ చైర్మన్ డాక్టర్ నర్రా వెంకటరమణమాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తరువాత గొర్రెలు, మేకల పెంపకం దారుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ గంటా శ్రీరామ్, తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఆర్.సత్తిబాబు, డాక్టర్ నీలం శారద, బమ్మిడి అప్పలనాయుడు, జి.నరసింహమూర్తి పాల్గొన్నారు. -
రాజన్నకు రక్షాబంధన్!
సోదరీ సోదరుల అనురాగం, అప్యాయతలు, అనుబంధం, రక్షణకు ప్రతీక... రాఖీ పౌర్ణమి (రాక్షాబంధన్). ఆ పర్వదినం నేడే. ఈ నేపథ్యంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ స్మరించుకుంటుంది. కుటుంబంలో ఓ మహిళ ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని మనసా వాచా కర్మణ నమ్మె వ్యక్తి వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఓ సోదరుడిగా ఆయన తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వులు చిందించాలని ఆకాంక్షించారు. అందుకు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులోభాగంగా అభయహస్తం, పావల వడ్డీకే రుణాలు, వితంతువులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్తోపాటు పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు లబ్ది పొందారు. ఆ మహిళల ఇంట ఆనందం తాండవమాడింది. అంతలో ఆ మహానేత ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఆ పథకాలను నిర్లక్ష్యం చేశారు. దాంతో మహిళల ఇళ్లలో చీకట్లు అలముకున్నాయి. వైఎస్ఆర్ ఉండిఉంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తమకు కొండంత అండగా ఉండేవని మహిళలంతా అనుకుంటున్నారు. ఓ సోదరుడిగా తమ కుటుంబాలలో వెలుగులు నింపినందుకు రాఖీ పౌర్ణమి రోజైన ఈ రోజు (ఆదివారం) తెలుగునేలపై ఉన్న మహిళలంతా ఆ మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి తిలకం పెట్టి, రక్షాబంధన్ ఉంచారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్దకు ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన సమాధి వద్ద రాఖీలని ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి మహానేత చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.