breaking news
papanna peta
-
జజ్జనకరి జనాలే..
పాపన్నపేట, న్యూస్లైన్: శివసత్తుల సిగాలు.. పోతరాజుల విన్యాసాలు.. బోనాలతో నృత్యాలు.. దుర్గమ్మనామస్మరణలతో రెండో రోజైన శుక్రవారం ఏడుపాయల జాతర హోరెత్తింది. రవికలు, చీరలు, కొబ్బరి మట్టలు, దేవతామూర్తుల చిత్రపటాలు, గాలి గుమ్మటాలు, మెరుపు కాగితాలతో అలంకరించిన ఎడ్లబండ్లు గణగణ గంటలతో పరుగులు తీస్తుండగా..శకట భ్రమణోత్సవం కన్నుల పండువగా జరిగింది. కాగా అకాల వర్షం భక్తజనులను ఆగమాగం చేసింది. అడపా దడపా కురిసిన చిరు జల్లులతో భక్తులు చెల్లా చెదురయ్యారు. బండ్లు తిరిగే సమయానికి ఒకేచోటుకు చేరుకొని ఉత్సవాన్ని తిలకించారు. కాగా ఉదయం 5గంటలకు పాలక వర్గ చైర్మన్ పబ్బతి ప్రభాకర్రెడ్డి పూజలుచేసి దుర్గమ్మ దర్శనాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ మంత్రి సునీతారెడ్డి ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రే భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. తెల్లవారుజామునుంచే మంజీర నదిలో స్నానాలుచేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకుని ఉపవాస దీక్షలు విరమించారు. గంట గంటకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. దుర్గా భవానికి జై అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఏడుపాయల్లోని కొండా కోనాలు ప్రతిధ్వనించాయి. మెదక్ డీఎస్పీ గోద్రూ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ మల్లప్ప, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలుగౌడ్, డీసీసీబీ డెరైక్టర్ మోహన్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమృతరావు, పాలక వర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. బోనంతో ఆకట్టుకున్న నృత్యాలు నెత్తిపై బోనం పెట్టుకుని.. చేతిలో చెర్న కోళాలు పట్టుకొని డప్పుచప్పుళ్లకనుగుణంగా శివసత్తులు చేసిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కన్నుల పండువగా బండ్ల ఊరేగింపు జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జానపదులు తమ బండ్లను అందంగా అలంకరించారు. వాటిపై వేపకొమ్మలు చేతపట్టుకున్న శివసత్తులు సిగాలు ఊగుతుండగా ఎడ్లు పరుగులు తీశాయి. మొదట ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి పాలక వర్గ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఈఓ వెంకటకిషన్రావులు స్వాగతం పలికారు. బండి ముందు డప్పుచప్పుళ్లకనుగుణంగా వందలాది యువకులు నృత్యం చేశారు. చెట్టు, గుట్ట భక్తులతో నిండిపోయి ఈ అపురూప దృశ్యాన్ని తిలకించారు. నేడు రథోత్సవం ఏడుపాయల జాతరలో మూడో రోజైన శనివారం అర్ధరాత్రి రథోత్సవం జరుగుతుంది. రంగు రంగుల మెరుపు కాగితాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాన్ని భక్తులు తాళ్లతో లాగుతారు. ఆదివారం తెల్లవారు జాము వరకు ఈ ఉత్సవం నిర్వహిస్తారు. -
సింగూరు బిరబిర ఘనపురం గలగల
పాపన్నపేట, న్యూస్లైన్: సింగూరు నుంచి నీరు విడుదల కావడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వరి నాట్లకోసం ఎదురు చూస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రబీపంటల కోసం మంజీరా బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,340 క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదటి విడతగా 0.3 టీఎంసీల నీటిని 13.30 గంటలపాటు ఏకధాటిగా వదిలారు. మంగళవారం ఉదయానికి ఆ నీరు ఘనపురం ఆనకట్టకు చేరుకుంది. మధ్యాహ్నం నుంచి ఆనకట్ట పొంగిపొర్లుతోంది. మరోవైపు మహబూబ్ నహర్, ఫతేనహర్ కెనాళ్ల నుంచి నీటిని వదిలారు. దీంతో రైతులు వరినాట్లు ముమ్మరం చేశారు. మరో 5 విడతలపాటు మొత్తం 1.9 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పరిధి కింద మొత్తం 21వేల ఎకరాలు సాగు భూమి ఉంది. సింగూరు నీటి విడుదలతో సుమారు 15వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరనుంది. కాగా చివరి ఆయకట్టు కాలువలు శిథిలంకావడంతో ఆ ప్రాంతానికి నీరు చేరే అవకాశం లేదు. జైకా పనులు పూర్తయితే.. తమకు కూడా సాగు నీరు అందేందని చివరి ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి జైకా పనులు సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎంఎన్ కెనాల్కు సాగునీరు విడుదల కొల్చారం: సింగూరు నీరు రావడంతో మండల పరిధిలోని మహబూబ్ నహర్(ఎంఎన్) కెనాల్కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో చిన్నఘణాపూర్, పొతంశెట్టిపల్లి, కిష్టాపూర్,రాం పూర్ గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో ఘనపురం ఆనకట్టకు పెద్ద ఎత్తున వరదనీరు చేరుకోవడంతో ఆ నీటితోనే రైతులు పంటలు సాగుచేసుకున్నారు. అప్పట్లో సింగూర్ ప్రాజెక్ట్నుంచి చుక్కనీరు విడుదల కాలేదు. కాగా రబీ పంటలకు సాగునీరు అవసరం కావడంతో ప్రభుత్వ జీఓ ప్రకారం సాగునీరు విడుదల చేస్తున్నారు. మంగళవారంస్థానిక నాయకులు మెదక్ సీడీసీ చైర్మన్ నరేందర్రెడ్డి, జిల్లా ఆప్కో డెరైక్టర్ రమేష్, ఏడుపాయల దేవస్థానం డెరైక్టర్లు యాదయ్య, సంగమేశ్వర్, ఎంఎన్ కెనాల్ చైర్మన్ నారాయణ, మండల కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డిలు ఘణాపురం ఆనకట్ట నుంచి ఎంఎన్ కెనాల్కు సాగునీటిని విడుదల చేశారు. దీంతో వరినాట్లు ముమ్మరం కానున్నాయి.