breaking news
Palakova
-
వారెవ్వా.. అదిరేటి రుచి! పసందైన.. పాలకోవా
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్/ఉండవెల్లి: ఒక వృత్తి జీవనోపాధికి జీవం పోస్తుంది. అదే వృత్తిలో నైపుణ్య సాధిస్తే ఆ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు సొంతం అవుతాయి. అది తినబండారమైతే మరింత ప్రాచుర్యం లభిస్తుంది. అందులోనూ మిఠాయి అయితే ఈ ప్రాంతం గురించి చెప్పన్నక్కర్లేదు. అలాంటి పసందైన పాలకోవాకు పెట్టింది పేరుగా ఉండవెల్లి మండలం బొంకూరు పేరొందింది. ఇక్కడ ఆరు దశాబ్దాలుగా ఒక కుటుంబం పాలకోవా తయారీతో గుర్తింపు దక్కించుకుంది. ఒకప్పుడు జీవనోపాధి కోసం పాలకోవాను తయారు చేశారు. ఇప్పటికీ అదే వ్యాపారంలో రాణిస్తూ ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ–ఏపీ–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని పట్టణాల్లో బొంకూరు పాలకోవా ప్రసిద్ధిగాంచింది.చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?ఆరు దశాబ్దాలుగా తయారీ గ్రామానికి చెందిన ఒక కుటుంబం పాలకోవా తయారీతో జీవనోపాధి పొందుతుంది. మూడు తరాలుగా ఇదే వ్యాపారంతో ఉపాధి పొందుతున్నారు. పాలకోవా తయారీ ఆ కుటుంబానికి ఉపాధి లభిస్తుండగా ఏళ్ల తరబడి నైపుణ్యం ఆ గ్రామానికే పేరు తెచ్చింది. 60 ఏళ్ల క్రితం సలాం మియ్యా–అమిర్ బీ దంపతులు జీవనోపాధి కోసం పాలకోవా తయారీని ఎంచుకున్నారు. పాలకోవాను తయారు చేసి పట్టణాలకు తరలించి రోజువారీ ఆదాయంతో ఉపాధి లభించింది. ఆ దంపతులకు నజీర్ మియ్యా, కాశీం మియ్యా, శాలిమియ్యా, రసూల్ మియ్యా నలుగురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు నజీర్ మియ్యా కుటుంబంతో కలిసి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. మిగిలిన ముగ్గురు కుమారులు తండ్రితో కలిసి పాలకోవా తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయించారు. ఆ తర్వాత కుటుంబాలు వేర్పడినా ఎవరికి వారు పాలకోవాతోనే జీవనం సాగిస్తున్నారు. ఇలా మూడు తరాలుగా పాలకోవా తయారు చేస్తూ అందులో రాణిస్తున్నారు.ఇదీ చదవండి: గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గానాణ్యతలో రాజీలేకుండా.. మూడు తరాలుగా పాలకోవాతో ప్రసిద్ధి గాంచిన ఆ కుటుంబం నాణ్యతలో రాజీపడకుండా స్వచ్ఛమైన పాలకోవాను తయారు చేస్తున్నారు. పాలకోవాకు పాలపాకెట్లు కాకుండా గ్రామంలో పాడిరైతుల నుంచి బర్రెపాలను సేకరిస్తారు. ఆ తర్వాత కట్టెల పొయ్యిపైనే తయారు చేస్తారు. బర్రెపాల ఖరీదు పెరిగినప్పటికీ తమ లాభాలు తగ్గించుకొని స్వచ్ఛమైన పాలకోవాను సిద్ధం చేస్తున్నారు. పాలకోవ తయారీలో కుటుంబం మొత్తం భాగస్వాములవుతారు. ఇంట్లో తయారీ.. పట్టణాల్లో విక్రయం పాలకోవాను ఇంట్లోనే సిద్ధం చేస్తారు. ఉదయం పాలసేకరణ అనంతరం కట్టెలపొయ్యిపైనే పాలకోవాను తయారు చేస్తారు. ఆ తర్వాత కర్నూల్, అయిజ, శాంతినగర్, అలంపూర్ వంటి ప్రాంతాల్లో విక్రయిస్తారు. మిఠాయి, ఇతర దుకాణాలకు సైతం పాలకోవాను సరఫరా చేస్తున్నారు. ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలకోవాను విక్రయిస్తారు. ఇళ్లు అలంపూర్– రాయచూరు రోడ్డుమార్గంలో ఉండడంతో ఈ మార్గాన ప్రయాణించేవారు కొనుగోలు చేస్తారు. పట్టణాల్లో సైతం వీళ్లు తయారు చేసే పాలకోవాను నిరంతరం కోనుగోలు చేసే వినియోగదారులు, ఉద్యోగులు ఉన్నారు.60 ఏళ్ల క్రితం ప్రారంభించాం : 60 ఏళ్ల క్రితం నా భర్త సలాం మియ్యా పాలకోవా తయారీని ప్రారంభించారు. వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు. దీంతో తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేద్దామని పాలకోవాను తయారు చేశాం. అప్పటి నుంచి పాలకోవాతోనే నా కుమారులు ఉపాధి పొందుతున్నారు. - అమీర్ బీ, బొంకూరు నాణ్యతగా తరయారు చేస్తాం: మూడు తరాల నుంచి పాలకోవాను విక్రయిస్తున్నాం. మా మామ దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వారసత్వంగా మేం కొనసాగిస్తున్నాం. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. పాలకోవాకు డిమాండ్ పెరిగిందే తప్పా.. తగ్గలేదు. మా మూడు కుటుంబాలు పాలకోవాతోనే జీవనం సాగిస్తున్నాం. ఎవరికి వారు తయారు చేసుకోని వాటిని విక్రయిస్తుంటారు. – కాశీంబీ, బొంకూరు పట్టణాల్లో విక్రయిస్తాం: గ్రామంలో పాలకోవా సిద్ధం చేసి కుటుంబ సభ్యులంతా కలిసి కిలో, అర కిలో, పావు కిలో డబ్బాల్లో నింపుతాం. ఆ తర్వాత పెద్ద పట్టణాలు, మిఠాయి దుకాణాలు, హోల్సేల్గా విక్రయిస్తాం. ఇంటి వద్దకు వచ్చే వారికి పాలకోవా అందుబాటులో ఉంటుంది. – రసుల్ బాషా, బొంకూరు -
Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్!
సాక్షి రాయచోటి: గువ్వలచెరువు పాలకోవా.. నోటి తీపికే కాదు.. ఊరూరా గుర్తింపు పొందింది. రాష్ట్రాలే కాదు.. ఖండాతరాలు దాటి వెళుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ కూడా గువ్వలచెరువు పాలకోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల కాలం నుంచి ఇక్కడివారు పాలకోవా తయారు చేస్తూ రుచిలో శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గువ్వల చెరువు మెయిన్రోడ్డు మీద ఉండే 60 షాపులే కాకుండా గ్రామంలో పాలకోవాను తయారు చేసే బట్టీలు 15 వరకు ఉన్నాయి. కోవా అనగానే గువ్వలచెరువు నుంచి తెచ్చారా? అనడం చూస్తే ఆ కోవాకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఐదు వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా... 2000 కిలోల వరకు పాలకోవాను తయారు చేసి విక్రయిస్తుంటారు. గువ్వల చెరువు గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది. అధికభాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు నాయుళ్లు, వడ్డెర, గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. గ్రామంలో తరతరాల నుంచి అంటే దాదాపు వందేళ్లకు పైగా కోవా తయారు చేస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం 100 కుటుంబాల వారు కోవా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్ కావడంతో జీవనోపాధిని వదులుకోలేక కొనసాగిస్తున్నారు. తయారు చేసే సమయంలో కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయి. గోలాల్లో పాలు పోసి ఐదు గంటలపాటు వేడి చేసే సమయంలో విపరీలమైన వేడి పొగతో కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, మంటకు గురికావడం జరుగుతుంది. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైన గ్రామం ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు గువ్వల చెరువు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో పదుల సంఖ్యలో లారీలో ఆగి ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీల వారు పాలకోవాను ఆర్డర్లపై తీసుకెళుతుంటారు. అంతేకాకుండా కువైట్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, బెహరీన్ తదితర దేశాలకు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా పాల కోవాను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. పాలకోవా సుదీర్ఘకాలంపాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశానికి తరలిస్తుంటారు. దీని తయారీకి అవసరమైన పాలను తయారీదారులు ప్రత్యేకంగా ఆటోల ద్వారా పీలేరు, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పాలకోవాను గ్రామంలో బట్టీల వద్ద తయారు చేసిన అనంతరం పెద్దపెద్ద పాత్రలలో రోడ్డుపై ఉన్న షాపులకు సరఫరా చేస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా రుచికరంగా మంచి గుర్తింపు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళుతుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు 15 ఆటోల ద్వారా వివిధ జిల్లాలకు కూడా తీసుకెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళుతున్న జాతీయ నేతలైన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతోపాటు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సైతం గువ్వుల చెరువు పాలకోవా రుచిచూసి మెచ్చుకున్నట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. తయారీ విధానం పాలకోవాను తయారీదారులు ముందుగా పాలను తీసుకొచ్చి పెద్ద గోలాల్లో వేసిసుమారు ఐదు గంటలపాటు మరగబెడతారు. ఒకవైపు గరిటెతో కలియబెడుతూ చిక్కదనం కోసం పొంగు రాకుండా చూసుకుంటారు. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర, ఇతర పదార్థాలు వేసి మరో అరగంట నుంచి గంటపాటు వేడి చేస్తారు. తద్వారా పాలకోవా రూపుదిద్దుకుంటుంది. అవసరమైన కట్టెలనుకూడా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తారు. గోలంలో పాలు ఉడికిస్తున్న ఇతని పేరు షేక్ జమాల్వలి. గువ్వలచెరువు గ్రామం. ఎన్నో ఏళ్ల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి పాలను ప్రత్యేకంగా ఆటోలో క్యాన్ల ద్వారా పీలేరు, మదనపల్లె, రాయచోటిలకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఇతర దేశాల్లో చాలా మంది ఉండడంతో అక్కడకి తీసుకెళ్లేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు, ప్రొద్దుటూరు, కడప, మదనపల్లె, రాజంపేట, రాయచోటితోపాటు వివిధ ప్రాంతాల్లోని బేకరీలకు కూడా గువ్వలచెరువు నుంచే పాలకోవాను పంపిస్తుంటారు. (క్లిక్: వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!) కల్తీ లేని కోవా కల్తీ లేకుండా నాణ్యమైన పాలకోవా అందిస్తాం. ఇక్కడి పాలకోవా మంచి రుచికరంగా ఉంటుంది. గ్రామంలో తయారు చేసి దుకాణాలకు ఆర్డర్లపై అందజేస్తారు. సుమారు 100 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సరుకు తీసుకెళుతుంటారు. – అబ్దుల్ మతిన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు వ్యాపారం బాగుంది పాలకోవాను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఆగుతాయి. కార్లలో ప్రత్యేకంగా వచ్చి కోవాను తీసుకెళుతుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా తీసుకెళతారు. ప్రతిరోజు మా షాపులో రూ. 4 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పదిహేనేళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాం. – పఠాన్ అజీజ్ఖాన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు