breaking news
Paddy prices
-
ధాన్యం ‘ధర’పై రైతన్న ఆక్రోశం!
భానుపురి (సూర్యాపేట): వ్యాపారులు కుమ్మక్కై ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారంటూ శనివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు లో రైతులు ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందు సన్నరకానికి రూ.1,800 ఉన్న ధరను ఒక్కసారిగా రూ.1,200 తగ్గించారని, దొడ్డురకాలను రూ.1,120 ధరకే కొనడం ఏమిటని మండిపడ్డారు. దాదాపు గంటపాటు మార్కెట్ కార్యాలయం గేటు మూసేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా ధాన్యం రావడంతో.. సూర్యాపేట జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు వ్యవసాయ మార్కెట్కు ధాన్యం తెస్తున్నారు. 2 రోజులుగా 25 వేల బస్తాల మేర ధాన్యం రావడంతో ట్రేడర్లు, మిల్లర్లు ధరలు తగ్గించేశారు. సన్న రకాల ధాన్యానికి తొలుత కొందరు రైతులకు రూ.1,600 నుంచి రూ.1,800 వరకు చెల్లించారు. తర్వాత రూ.1,200 నుంచి రూ.1,400కు తగ్గించేశారు. దొడ్డురకాలకు మరింత తక్కువ ధర ఇస్తామన్నారు. దీనితో రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి సాయంత్రం మార్కెట్ యార్డుకు వచ్చారు. రైతులు, ట్రేడర్లతో మాట్లాడారు. తేమ, తాలు అధికంగా ఉండటం వల్లే కొందరు రైతులకు తక్కువ ధర ఇవ్వాల్సి వచ్చిందని ట్రేడర్లు వివరించారు. అయితే రూ.1,400కు తగ్గకుండా ధర ఇవ్వాలని, రాత్రయినా కాంటా వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు సిబ్బంది ఏర్పాట్లు చేసినా.. ట్రేడర్లు ధర తక్కువే ఇస్తున్నారంటూ రైతులు మళ్లీ ఆందోళన చేశారు. కలెక్టర్ రాత్రి వరకు మార్కెట్లోనే ఉండి కొనుగోళ్లను పరిశీలించారు. -
వా(వ)రి గోస ఎవరికెరుక! మిల్లర్లు కొనరాయే.. అరిగోస పడి అగ్గువకు అమ్ముడాయే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. మిల్లర్లు తమ ఇష్టానుసారంగా ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. నాలుగు రోజుల కిందటి వరకు బాగానే ధర చెల్లించిన మిల్లర్లు ఒక్కసారిగా తగ్గించేశారు. శుక్ర, శనివారాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో క్వింటాల్పై రూ.300 నుంచి రూ.450 వరకు తగ్గించి కొనుగోలు చేశారు. నాలుగు రోజుల కిందటి వరకు సన్నరకం (చింట్లు) ధాన్యం క్వింటాల్కు రూ.2,200 చెల్లించగా, మిర్యాలగూడ ప్రాంతంలోని కొన్ని మిల్లుల్లో సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.1,900 నుంచి రూ.1,850 చెల్లించారు. ఇక త్రిపురారంలోని ఓ మిల్లులో శనివారం క్వింటాల్కు కేవలం రూ.1,750 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులు పడిగాపులు.. నల్లగొండ జిల్లాలో ముందస్తు నాట్లు వేసిన ప్రాంతాల్లో సన్నాల కోతలు 15 రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. దీంతో పది రోజులుగా రైతులు మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముతున్నారు. మొదట్లో ధాన్యం తక్కువగా రావడంతో ఎక్కువ ధర చెల్లించిన మిల్లర్లు, ఇప్పుడు ధాన్యం రాక ఎక్కువ కావడంతో ధరను తగ్గించేశారు. అంతేకాక రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో రెండు, మూడు రోజల పాటు కొనుగోలు చేయకుండా పెండింగ్ పెడుతున్నారు. రైతులు విసిగిపోయి తక్కువ ధరకైనా అమ్ముకొని వెళ్తారనే ఉద్దేశంతోవారు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకోక తప్పడం లేదు. కొనుగోళ్లలో జాప్యం వల్ల త్రిపురారం మండలంలోని ఒక్కో మిల్లు వద్ద 20 నుంచి 30 ట్రాక్టర్లలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 25 శాతం ఉమ్మడి జిల్లా నుంచే.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ధాన్యం దిగుబడిలో 25 శాతం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే వస్తోంది. అత్యధింగా 250 రైస్ మిల్లులు ఉన్నది ఇక్కడే. నల్లగొండ జిల్లాలో 130, సూర్యాపేట జిల్లాలో 83, యాదాద్రి జిల్లాలో 37 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్నాలు, దొడ్డు ధాన్యం కలిపి దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో సన్నాలు 2,34,752 ఎకరాల్లో సాగు చేయగా, 4,59,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు ధాన్యం 2,09,226 ఎకరాల్లో సాగు చేయగా అందులో 6,54,157 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, మొత్తం 4,43,973 ఎకరాల్లో వరి సాగు చేయగా, సన్న, దొడ్డు ధాన్యం కలిపి 11,13,604 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 4,61,532 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అందులో 3,45,081 ఎకరాలలో సన్న రకాలు, 1,16,449 ఎకరాలలో దొడ్డు రకాలను సాగు చేశారు. తద్వారా 8,28,196 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 3,26,058 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్లు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.. ధర స్థిరంగా ఉండేలా చూడాలి నాకున్న 8 ఎకరాల్లో హెచ్ఎంటీ రకం సాగుచేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మిల్లుకు వెళుతున్నారు. మొదట్లో ధర బాగానే పెట్టినా ఇప్పుడు క్వింటాల్కు రూ.1,870 మాత్రమే చెల్లిస్తున్నారు. ధర స్థిరంగా ఉండేలా చూడాలి. – చల్లా ప్రదీప్కుమార్, అన్నపరెడ్డిగూడెం ధర తగ్గించారు మొన్నటి వరకు మిల్లర్లు రూ.2,200 పెట్టినా ఇప్పుడు ధర తగ్గించారు. నాకున్న 2.1 ఎకరాల్లో చింట్లు సాగు చేయగా 65 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.1,850 ఇస్తామంటున్నారు. – ధీరావత్ తుకారాం, ఏడుకోట్ల తండా రూ.1,750 ఇస్తున్నారు ఈసారి పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు ధర తగ్గించారు. మొదట రూ. 2,200 ఉందని సంతోష పడ్డాం. ఇప్పుడు మిల్లుకు వచ్చేసరికి క్వింటాలుకు రూ.1,750 ఇస్తున్నా రు. గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – యేమిరెడ్డి వెంకట్రెడ్డి, త్రిపురారం -
పెరగని జిలకర మసూర ధరలు
ముత్తుకూరు : జిలకర మసూర ధాన్యం ధరలకు రెండు నెలలుగా కదలిక లేకుండాపోయింది. దీంతో మద్దతు ధర కోసం రైతులు వందలాది పుట్ల ధాన్యం నిల్వ చేసుకొని, నిరీక్షిస్తున్నారు. మొదటి పంట కింద దిగుబడి జరిగిన ధాన్యం ధర ప్రస్తుతం పుట్టి రూ.17,500 నుంచి రూ.18 వేల వరకు ఉంది. ఈ ధర పెరగక, తగ్గకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితికి గురయ్యారు. ఈ ధరకు అమ్మకాలు జరగకపోవడంతో పొట్టెంపాడు, బ్రహ్మదేవి, డమ్మాయపాళెం ప్రాంతాల్లో వందలాది పుట్ల జిలకర మసూర ధాన్యం కుప్పలు మద్దతు ధరకు నిరీక్షిస్తున్నాయి. ఎండకు, వానకు నాణ్యత దెబ్బతినకుండా ప్లాస్టిక్ పట్టలు కట్టి, జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు. ప్రైవేటు గిడ్డంగుల్లో దాచుకొన్నారు. ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు.