breaking news
Owners arrested
-
మరో గోల్డ్ స్కీమ్ స్కాం: యజమానుల అరెస్ట్
సాక్షి, ముంబై: బంగారు ఆభరణాల విక్రయాల ప్రమోషన్ల పేరుతో ఆభరణాల సంస్థలు తీసుకొస్తున్న గోల్డ్ స్కీమ్లు వినియోగదారులను నట్టేట ముంచుతున్నాయి. ఇటీవల ముంబైలో కోట్లాది రూపాయల మేర వినియోగదారులను ముంచేసిన గుడ్విన్ స్కాం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే రసిక్లాల్ సంకల్చాంద్ జ్యువెల్లరీ (ఆర్ఎస్జే) అనే మరో జ్యువెల్లరీ సంస్థ కుంభకోణం బహిర్గతమైంది. దీంతో భారీగా నష్టపోయిన కస్టమర్లు లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్కు క్యూ కట్టారు. గుడ్విన్ తరహాలోనే గత నెల (అక్టోబర్) 28న ఆర్ఎస్జే దుకాణాలను తాళాలు వేయడంతో వినియోగదారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా తాజాగా ఆర్ఎస్జే దుకాణం యజమానులు జయేష్ రసిక్లాల్ షా(55), నీలేష్ రసిక్లాల్ షా (53)ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసింది. మొత్తం రూ.300 కోట్ల వరకు వినియోగదారులను మోసగించినట్టుగా ప్రాథమికంగా తేలిందని పోలీసు అధికారి మంగళవారం చెప్పారు. ఫిర్యాదు చేస్తున్న ఆర్ఎస్జె ఉద్యోగులు డిపాజిట్ పథకాలపై వినియోగదారులకు మంచి రాబడిని వస్తుందని నమ్మబలకడంతో చాలామంది అనేక నెలలుగా ఈ గోల్డ్ స్కీంలలో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టారని తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420 (మోసం), 406 (క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన), మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ (ఎంపిఐడి) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అలాగే గత వారం కొంతమంది ఉద్యోగులు కూడా సంస్థ తమకు ఆరు నెలలుగా వేతనాలివ్వడలేదని లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
నకిలీ ‘సెల్కాన్’ ఫోన్ల గుట్టు రట్టు
గుజరాత్గల్లీ, జగదీష్మార్కెట్లపై పోలీసుల దాడి ఐదు సెలఫోన్ దుకాణాల సీజ్ - యజమానుల అరెస్టు వందల సంఖ్యలో నకిలీ ‘ సీ-343’ మోడల్ ఫోన్ల స్వాధీనం సిటీబ్యూరో: ‘సెల్కాన్ సీ-343’ మాడల్ సెల్ ఫోన్ను కాపీ చేసి... నకిలీ ఫోన్లను మార్కెట్లోకి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. మంగళవారం అబిడ్స్లోని జగదీష్మార్కెట్, గుజరాత్ గల్లీలోని ఐదు సెల్ఫోన్ దుకాణాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు. భారీగా నకిలీ సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయా షాపులను సీజ్ చేయడంతో పాటు యజమానులనూ అరెస్టు చేశారు. వివరాలు... సెల్కాన్ కంపెనీ సీ-343 మాడల్ ఫోన్ను గతంలో విడుదల చేసింది. ఈ మాడల్ పాతబడటంతో తయారీ నిలిపివేసి మరో మాడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే కంపెనీ బంద్ చేసిన సీ-343 మాడల్తో రింకు రాజేష్ (30) అనే వ్యక్తి నకిలీ సెల్కాన్ ఫోన్లను తయారు చేయించి, వీటికి ఐఎంఈఐ నెంబర్ సైతం వేయిస్తున్నాడు. నగరంలోని వందల సెల్ఫోన్ దుకాణాలకు రూ.600కే సరఫరా చేశాడు. ఇది గుర్తించని చాలా మంది వినియోగదారులు ఈ మొబైల్ ఫోన్లను ఖరీదు చేసి మోసపోయారు. సర్వీసింగ్ కోసం నిజమైన సెల్కాన్ కంపెనీకి వినియోగదారులు బారులు తీరడంతో కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని పసిగట్టింది. ఈ మేరకు సెల్కాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రేతినేని మురళి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అబిడ్స్లోని జగదీష్ మార్కెట్లో గల అంకిత్ మొబైల్స్, మధుటైల్స్, శుక్రుమొబైల్స్, జగదాంబ మొబైల్ షాపులతో పాటు గుజరాత్ గల్లిలోని శ్రీలక్ష్మి మొబైల్స్పై దాడి చేశారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో నకిలీ సెల్ కాన్ సీ-343 మాడల్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ సెల్ఫోన్ల తయారీకి సూత్రధారి అయిన రింకు రాజేష్ పరారీలో ఉన్నాడు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాగే వీరు నకిలీ సెల్కాన్ ఫోన్లు తయారు చేయించి విక్రయించినట్లు తెలిసింది. సెల్కాన్ ఫోన్లు ఖరీదు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా నకిలీ సెల్కాన్ ఫోన్లు విక్రయిస్తే పోలీసులుకు గానీ, తమకు గానీ సమాచారం ఇవ్వాలని సెల్కాన్ కంపెనీ ప్రతినిధి రేతినేని మురళి వినియోగదారులకు సూచించారు.