breaking news
over time
-
నల్ల చట్టాలను విరమించుకోవాలి!
139 సంవత్సరాల క్రితం కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా ఎనిమిది గంటల పని దినాలు సాకారం అయ్యాయి. ఆ పని గంటలతో పాటు అనేక ఇతర కార్మిక ప్రయోజనాలూ నేటి పాలకుల నల్ల చట్టాల కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర పాలకులు తీసుకువచ్చారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల అమలు ఆ యా రాష్ట్రాల ఇష్టానికి వదిలి గెజిట్ విడుదల చేశారు. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ప్రభుత్వాలు కొత్తగా కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు జరుపుతున్నాయి. దీనిలో భాగంగా 10 నుంచి 12 గంటల పని దినాలు అమలు జరిపేందుకు ఇటీవల కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్ దీనికి ఆమోదముద్ర వేసింది. ఫలితంగా ఏపీలో పనిదినాన్ని 9–10 గంటలుగా నిర్ణయించారు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి కూడా ఈ సవ రణ అనుమతిస్తున్నది. చట్ట రూపంలో అమలు అయితే ఓవర్ టైమ్ కూడా 75 గంటల నుండి 144 గంటల వరకు ఇవ్వొచ్చు. ప్రభుత్వం మహిళలకు సమాన అవకాశాల పేరిట రాత్రిపూట పని చేయడా నికి చేసే సవరణ వల్ల, అందుకు అంగీకరించని మహిళల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆంధ్రప్రదేశ్ బాటలో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అధిక పని గంటలు అమలు జరిపేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వాణిజ్య సంస్థల కార్మికులు, ఉద్యోగులు రోజుకు 10 గంటలు పనిచేయాలి. అయితే వారా నికి 48 గంటల కన్నా ఎక్కువ పని చేయడానికి వీలు లేదనీ, అంతకుమించి పనిచేస్తే ఓవర్ టైం వేతనాలు చెల్లించాలనీ... కార్మిక శాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఓవర్ టైం పనిచేయడానికి పరిస్థితులు సహకరించని వాళ్ళను పని నుంచి తొలగించే అవకాశాలు ఏర్పడతాయి. యాజమాన్యాలు తమ అధిక లాభాల కోసం ఓవర్ టైం చేయాలని కార్మికులు, ఉద్యోగుల మీద ఒత్తిడి చేసే అధికారం నూతన లేబర్ కోడ్లు ఇస్తున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 2020 పారిశ్రామిక సంబంధ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయడానికి అనేక ఆటంకాలు ఉన్నాయి. 100 మంది కంటే తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నసంస్థల నుండి వారిని తొలగించడం యాజమాన్యాలకు సులభం అవుతుంది. కార్మిక సంఘాల ఏర్పాటు చేసుకోవడం క్లిష్టంగా తయారవుతుంది. 10 మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య సంక్షేమం వంటి హక్కులు కోల్పోతారు. నాలుగో లేబర్ కోడ్ అమలు ద్వారా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న కోటి మందికి పైగా కార్మికులకు ఈ కోడ్ వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం వంటి రకరకాల పేర్లతో వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలు కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి శాశ్వత ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నప్పటికీ వారికి కాంట్రాక్ట్ ప్రాతి పదికన తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్లు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు జరిగితే వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగుల జీవి తాలు దుర్భరంగా దిగజారిపోతాయి. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పాతర వేసేందుకు బీజేపీ తహతలాడుతున్నది. ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలి గిస్తూ ఆ యా రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలను ఇరుకున పెట్టే చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రాలు స్వయం నిర్ణయాధికారం కలిగిన అంశాల్లో కూడా గవర్నర్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు సముచితంగా అందాల్సిన వాటాను ఇవ్వకుండా నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నారు. రాష్ట్రాల అధికారాల్లో వేలు పెడుతూ ఆ యా రాష్ట్రాలను స్థానిక సంస్థల స్థాయికి కుదించే విధంగా కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ దేశ ప్రజల భవిష్యత్తుని కార్పొరేట్లకు తాకట్టు పెట్టే పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి. ఈ నేపథ్యంలో వామ పక్ష, ప్రజాతంత్ర, సెక్యులర్ పార్టీలూ, ప్రజాసంఘాలూ, కార్మిక ఉద్యోగ సంఘాలూ జూలై 9న (నేడు) దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి!కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గం హక్కులు ప్రమాదంలో పడతాయి.-జూలకంటి రంగారెడ్డిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కమిటీ -
Telangana: రోజుకు 10 గంటలు పనిచేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం కోసం వాణి జ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య సంస్థల్లో (దుకాణాలు మినహా) పనిచేసే ఒక ఉద్యోగి రోజుకు పది గంటల వరకు విధులు నిర్వర్తించే అవకాశం కల్పించింది. అయితే వారంలో 48 గంటలకు మించి పనిచేయకూడదనే నిబంధన విధించింది. రోజుకు 10 గంటల పనికి అవకాశం ఇచ్చినా, ఆరుగంటల తర్వాత అరగంట పాటు విశ్రాంతి ఇవ్వాలి. ఓవర్ టైమ్ పనిచేసే ఉద్యోగి ప్రత్యేక సందర్భాల్లో ఆరుగంటలకు మించి పనిచేయొద్దు. ఈ లెక్కన ప్రత్యేక సందర్భాల్లో ఒకరోజుకు గరిష్టంగా 12 గంటలు దాటి పనిచేసే అవకాశం లేదు. వారంలో 48 గంటల కంటే అధిక గంటలు పనిచేసినప్పుడు.. అందుకు తగిన అదనపు భత్యం చెల్లిస్తూనే.. ఒక త్రైమాసికంలో 144 పనిగంటలు దాటకూడదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమిస్తే సదరు వాణిజ్య సంస్థకు ప్రభుత్వం నుంచి అందుతున్న మినహాయింపులు, రాయితీలను ఎలాంటి నోటీసు లేకుండానే రద్దు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. -
సునీతకు ట్రంప్ సొంత డబ్బు ఇస్తానని ఎందుకు ప్రకటించారు?
వాషింగ్టన్: అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయి.. ఎట్టకేలకు నాసా-స్పేస్ఎక్స్ ప్రయోగం ద్వారా తిరిగి భూమ్మీదకు రాగలిగారు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు. బైడెన్ హయాంలో వాళ్లను వెనక్కి రప్పించడంలో నాసా విఫలం కాగా.. ఆ పనిని తాము చేశామంటూ ట్రంప్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. అయితే వాళ్లకు చెల్లించాల్సిన జీతభత్యాలపై విమర్శలు రావడంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది.వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు అంతరిక్షంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు గడిపారని.. అందుకుగానూ వాళ్లకు జీతభత్యాలేవీ అందలేదని పాత్రికేయులు తాజాగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. అవసరమైతే తన సొంత డబ్బును వాళ్లకు చెల్లిస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్కు కృతజ్ఞతలు తెలిపారు.నాసా ఎంత జీతం ఇస్తోందంటే.. నాసా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగుల కిందకు వస్తారు. శాలరీలు, అలవెన్స్లు.. ఇలాంటి వాటి విషయంలో వ్యోమగాములు భూమ్మీద విధుల్లో ఉన్నప్పుడు, అలాగే అంతరిక్ష ప్రయోగాల టైంలో నాసా ఒకేలా చూస్తుంది. ఈ లెక్కన ఐఎస్ఎస్లో సునీత, విల్మోర్లకు ఒకే తరహా జీతాలు ఉంటాయి. అదనంగా వాళ్లకు చెల్లించేది ఏదైనా ఉంటే.. అది డెయిలీ స్టైఫండ్ కొంత మాత్రమేనని(రోజుకి 4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.347) మాత్రమేనని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. కాబట్టి.. 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్కు శాలరీ ప్రత్యేకంగా నాసా ఏమీ చెల్లించదు. కాకుంటే.. ఇరువురికి డెయిలీ స్టైఫండ్ కింద 1,148 డాలర్లు(లక్ష రూపాయలు) చెల్లిస్తారంతే.ఇప్పుడు వాళ్లకు వచ్చేది ఎంతంటే..అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA)లో బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్లు జీఎస్(General Schedule)-15 పే గ్రేడ్ ఉద్యోగులుగా ఉన్నారు. నాసాలో అత్యధిక జీతం అందుకునే ఉద్యోగులు ఈ గ్రేడ్ కిందకే వస్తారు. వీళ్లకు ఏడాదికి 1,25,133 - $1,62,672 డాలర్ల జీతం (మన కరెన్సీలో Rs 1.08 కోట్ల నుంచి Rs 1.41 కోట్ల దాకా) ఉంటుంది. ఈ 9 నెలలు ఐఎస్ఎస్లో గడిపినందుకు రూ.81 లక్షల నుంచి రూ.కోటి 5 లక్షల దాకా ఇద్దరికీ అందుతుంది. అది డెయిలీ స్టైఫండ్ కలిపి చూస్తే రూ.82 లక్షల నుంచి రూ.కోటి 6 లక్షల దాకా ఉండొచ్చు. అయితే..నాసా డ్యూటీ అవర్స్ 8 గంటలు మాత్రమే. కానీ, అనివార్య పరిస్థితుల్లో ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్లు అదనపు పని గంటలు చేయాల్సి వచ్చింది. అయితే ఫెడరల్ ఉద్యోగుల మార్గదర్శకాల ప్రకారం.. వాళ్లకు ఆ అదనపు పని గంటలకుగానూ ఎలాంటి జీతం చెల్లించడానికి వీల్లేదు. దీనిపై విమర్శలు రావడం మొదలైంది. అందుకే ట్రంప్ ఆ సమయాన్ని ఓవర్ టైం కింద చెల్లిస్తానని ఇప్పుడు ప్రకటించారు.కిందటి ఏడాది జూన్లో నాసా మిషన్ కింద సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి రాగా.. నాసా క్రూ 10 మిషన్ ప్రయోగం ద్వారా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ వాళ్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను కూడా సేఫ్గా భూమ్మీదకు తీసుకొచ్చింది. -
ఎక్కువ పనిచేస్తే.. హెచ్చరించే డ్రోన్!
టోక్యో: ఆఫీసులో కునుకు తీస్తున్నారంటే అది గవర్నమెంట్ ఆఫీసై ఉంటుందంటూ చమత్కరిస్తారు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. మనదేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ఆఫీసర్లు కునుకు తీస్తున్న, ముచ్చట్లు చెప్పుకుంటున్న దృశ్యాలు కనిపిస్తాయి. అయితే జపాన్ మాత్రం ఇందుకు భిన్నం. అక్కడ వారికి పనే ప్రపంచం. కనీసం నిరసన తెలపాలన్నా కూడా అక్కడివారు ఆందోళనలకు బదులుగా ఎక్కువ పనిచేసి, నిరసన తెలుపుతారట. దీంతో అక్కడి ప్రభుత్వం కార్యాలయాల నుంచి ఉద్యోగులను ఇంటికి పంపడానికి డ్రోన్లను రంగంలోకి దించింది. టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆఫీసులోనే ఉంటూ పనిచేస్తుంటే ఈ డ్రోన్ పసిగట్టేస్తుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు పరిశీలించి, సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నారు. జపాన్ చట్టాల ప్రకారం ఓ ఉద్యోగి నెలలో 100 గంటలకు మించి పని చేయకూడదు. కానీ జపాన్ మాత్రం తీవ్రమైన ‘కరోషి’ సమస్యతో బాధపడుతోందట. కరోషీ అంటే పనిచేస్తూ ఆఫీస్లోనే చనిపోవడం. దీనికి పరిష్కారంగానే డ్రోన్లను రంగంలోకి దించి, ఉద్యోగులను వేళకు ఇంటికి పంపేస్తున్నారు. -
పాతికేళ్లుగా ఓటీ ఎగ్గొట్టారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఊహించని షాక్ తగిలింది. ట్రంప్పై ఆయన మాజీ డ్రైవర్ సోమవారం ఓ దావా వేశాడు. వెట్టిచాకిరీ చేయించుకుని తనకు సరైన వేతనం చెల్లించలేదని పిటిషన్లో సదరు వ్యక్తి ఆరోపించాడు. పైగా ఓటీ వేతనం ఎగ్గొట్టారని ఆరోపిస్తూ... 2 లక్షల డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్ను డిమాండ్ చేస్తున్నాడు. వాషింగ్టన్: ట్రంప్ దగ్గర నోయెల్ సింట్రోన్(59) ఇరవై ఏళ్లుగా డ్రైవర్గా విధులు నిర్వహించారు. 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా నామినేషన్ వేశాక.. ఆయన దగ్గర నోయెల్ పని మానేశారు. అయితే ఆ ఇరవై ఏళ్ల కాలంలో ట్రంప్ తనకు ఏనాడూ ఓటీ సొమ్మును చెల్లించలేదని, ట్రంప్ కుటుంబం మొత్తం తనతో వెట్టిచాకిరీ చేయించుకుందని ఆరోపిస్తున్నారు. పైగా న్యూయార్క్ చట్టాలను ఉల్లంఘించి అధిక గంటలు పని చేయించుకున్నారని.. ఓటీ జీతం చెల్లించలేదని నోయెల్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఓటీ వేతనం కింద 2 లక్షల డాలర్లు.. కోర్టు ఖర్చులు, అటార్నీ ఫీజు అన్నీ కలుపుకుని మొత్తం 3,50,000 డాలర్లు చెల్లించాలంటూ ట్రంప్పై నోయెల్ దావా వేశారు. ఈ వ్యవహారంపై ట్రంప్ కంపెనీల కార్యదర్శి ఒకరు స్పందిస్తూ.. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. కోర్టులోనే వ్యవహారం తేల్చుకుంటామని వారు చెబుతున్నారు. తెలంగాణలో ట్రంప్ ఫ్యాన్.. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ !
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ షాకిచ్చింది. ఇకపై ఉద్యోగులపై ఇచ్చే ఓవర్ టైం అలవెన్సును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పర్సనల్ మినిస్ట్రీ ఒక ఉత్తర్వు చేసింది. దీని ప్రకారం కార్యనిర్వాహక సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులకు చెల్లించే ఓవర్ టైం అలవెన్సును రద్దు చేసింది. ఏడవ పే కమిషన్ సిఫారసులకనుగుణంగా ఈ చర్య తీసుకుంది. దీని ప్రకారం, అన్ని మంత్రివర్గ విభాగాలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషనల్ స్టాఫ్ జాబితాను తయారు చేయవలసిందిగా సంబంధిత విభాగాలను కోరింది. అత్యవసరమైన సమయంలో అతని/ఆమె సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగి (లు)ను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్యనిర్వాహక సిబ్బంది అంటే నాన్ మినిస్ట్రీరియల్ గెజిటెడ్ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్ లేదా యాంత్రిక పరికరాల సహాయంతో పనిచేసే ఉద్యోగులు. అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం భత్యం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఓవర్ టైం అలవెన్స్ లేదా ఓటీ రేటును సవరించేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. -
డ్యూటీ కన్నా ఓటీ పైనే ప్రేమ
గంట పనికి మరో గంట వేతనం అదనం సింగరేణి సంస్థపై పెరుగుతున్న ఆర్థిక భారం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి సంస్థలో సాధారణంగా నిర్వహించే డ్యూటీ కన్నా ఆ తర్వాత వచ్చే ఓవర్టైమ్ (ఓటీ) పైనే కొందరు ఉద్యోగులు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల అదనంగా వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. భూగర్భ గనులు, ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల్లో యంత్రాలు పనిచేసే చోట, వర్క్షాపులు, సంబంధిత విభాగాల్లో ఓటీ డ్యూటీలు ఎక్కువగా ఉంటున్నాయనేది స్పష్టమవుతోంది. గనుల్లో ఏదైనా యంత్రం నిలిచిపోతే మరమ్మతు పేరుతో ఉన్న సమయాన్ని సదరు టెక్నీషియన్లు వెచ్చిస్తున్నారు. అయితే తిరిగి ఆ యంత్రానికి అవసరమైన పరికరాన్ని తీసుకెళ్లి బిగిస్తేనే అది నడుస్తుంది. ఆ తర్వాతనే అది బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామ్యమవుతుంది. అయితే నిలిచిపోయిన యంత్రాలకు తక్కువ సమయంలో మరమ్మతు చేయాల్సి ఉన్నప్పటికీ కొందరు టెక్నీషియన్లు కావాలనే కాలక్షేపం చేస్తూ తన డ్యూటీ సమయం అయిపోయిందని వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో సంబంధిత సెక్షన్ సూపర్వైజర్లు, అధికారులు సదరు టెక్నీషియన్ను బతిమిలాడి యంత్ర మరమ్మతులు పూర్తిచేయడానికి ఓవర్టైమ్ కేటాయిస్తున్నారు. ఇందుకోసమే వేచిచూసే వారు ఆ యంత్రానికి మరమ్మతులు చేపట్టి ఓవర్టైమ్ పొందుతున్నట్లు తెలుస్తోంది. గంట సమయం అదనంగా పనిచేస్తే రెండు గంటల ఓవర్టైమ్ వేతనాన్ని యాజమాన్యం చెల్లిస్తోంది. దీంతో సాధారణ డ్యూటీ కన్నా ఓటీ పనులపైనే దృష్టి పెడుతున్నట్లు గుర్తించిన యాజమాన్యం ఓటీల సంఖ్యను తగ్గించి డ్యూటీ సమయంలోనే యంత్రాల మరమ్మతులు చేయించేలా ఆయా గనులు, ఓసీపీల అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఓటీలను ఇవ్వడాన్ని ప్రోత్సహిం చకూడదని క్షేత్రస్థాయి అధికారులకు సూచించినట్లు తెలిసింది. అయితే యంత్రాలు మరమ్మతులకు గురైనపుడు అవసరమైన స్పేర్పార్ట్స్ అందుబాటులో ఉంచాల్సిన యాజమాన్యం అలా చేయకపోవడం వల్లనే ఓటీలలో పనిచేయాల్సి వస్తున్నదనే వాదన సైతం వినిపిస్తోంది. ఈ విధానంపై పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగితేనే ఓటీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సీనియర్లు పేర్కొంటున్నారు.