Our Culture
-
World Theatre Day: రాజుల కాలం నుంచి హవా సాగుతోంది..!
రాజుల కాలం నుంచి విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటకరంగం... మరింతమందికి ఈ రంగాన్ని చేరువ చేయడానికి కృషి చేస్తున్నవారు ఎందరో. ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చదువుకు సాధనంగా, సామాజిక మార్పు కోసం ప్రభావంతంగా పనిచేసే నాటకం ప్రాముఖ్యత, మన సంస్కృతిలో ఎంతగా మమేకం అయ్యిందో తెలియజేస్తున్నారు కళాకారులు సురభి లలిత, ఆర్.రేఖ, ఇరిగి త్రివేణి.నైపుణ్యాలకు మెరుగుఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకరంగంలోకి వచ్చాను. 28 ఏళ్లుగా నాటకరంగంలో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. నెలలో 4 నుంచి 8 వరకు ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ నెల 29న హైదరాబాద్లో మూడు రోజుల పాటు స్వేచ్ఛ నాటక ప్రదర్శన ఉంది. ఒక నాటకం చూడటానికి 500 నుంచి 800 మంది హాజరవుతుంటారు. లైవ్ ఫెర్ఫార్మెన్స్ కాబట్టి ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికివస్తుంది. ఒక్కొక్క నాటిక 50 నుంచి వందసార్లు కూడా ప్రదర్శిస్తుంటాం. ఎంత ఇబ్బంది ఉన్నా, రాత్రిళ్లు నిద్ర లేకపోయినా సరే ఒకసారి మేకప్ వేసుకొని, వేదిక ఎక్కగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ‘గడి’ అనే నాటికకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కిందటేడాది వేసిన స్వేచ్ఛ, నిశి.. నాటికలలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నాటక ప్రదర్శనలు లేనప్పుడు సినిమా ఆడిషన్స్కి వెళుతుంటాను. ఆ విధంగా ‘బలగం’ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కొన్ని వెబ్సీరీస్లలోనూ నటిస్తున్నాను. – సురభి లలిత, హైదరాబాద్ఎన్నో అవకాశాలకు దారి చూపిందిమా నాన్న వారసత్వంగా నాటక, హరికథా కళాకారిణిగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఆ ఇష్టంతోనే ఎం.ఎ. థియేటర్ ఆర్ట్స్ చేశాను. సీతారాముల కళ్యాణంలో సీత పాత్ర, చరణ్దాసు నాటకంలో రాణి పాత్రలతో నాటకరంగానికి పరిచయం అయ్యాను. డా.బిఆర్ అంబేడ్కర్ రాజ గృహప్రవేశం నాటకంలో రమాబాయి పాత్రకు మంచి పేరు వచ్చింది. జాతీయ బహుమతి పొందిన రేడియో తెలుగు నాటకాలు– ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. గాయనిగా వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటాను. సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ పనిచేస్తున్నాను. ఇవన్నీ నాటకం నాకు ఇచ్చిన వరాలుగా చెప్పవచ్చు. గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్గా చేస్తున్నాను. – ఆర్.రేఖ, హైదరాబాద్వెక్కిరించినవారే మెచ్చుకున్నారుమాది గ్రామీణ నేపథ్యం. తెలుగు యూనివర్శిటీలో జానపదం, అక్కడే థియేటర్ ఆర్ట్లో పీజీ చేశాను. వర్క్షాప్స్ చేస్తూ, నాలుగేళ్లుగా నాటకాలు వేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, వి ఆర్ ఇండియన్స్.. ఇలా నాటకాల జాబితా ఎక్కువ. ఇప్పుడు చాలా థియేటర్ గ్రూప్స్ వస్తున్నాయి. సినిమాల వాళ్లు కూడా థియేటర్లో నటిస్తున్నవారికిప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి పది రాష్ట్రాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాను. మన వారసత్వం, సంప్రదాయాలు మన ముందు తరాలకు పరిచయం చేయాలని టీచింగ్ వైపుకు వచ్చాను. డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్.. టీచర్గా కిందటి నెలలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు ఈ నాటకాలు, డ్యాన్సులు ఏంటి.. పెళ్లి చేసుకోకుండా అనేవారు. ఇప్పుడు ‘సాధించావు’ అంటుంటారు. – ఇరిగి త్రివేణి, దేవరకొండ, నల్లగొండ– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వేదాల పునాదిపై జాతి సంస్కతి
– ఆర్య సమాజ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రయ్య మహబూబ్నగర్ కల్చరల్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ సంస్కతి వేదాల పునాదిపై నిర్మంచబడిందని ఆర్యసమాజ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ చంద్రయ్య అన్నారు. ఆర్య సమాజ్ ఆద్వర్యంలో స్థానిక బ్రాహ్మణవాడిలోని సమాజం మందిరంలో మూడు రోజులపాటు నిర్వహించిన యజుర్వేద పారాయణ మహాయజ్ఞం శనివారం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ యజ్ఞాల వల్ల వాతావరణంలోని కాలుష్యం అంతరిస్తుందని, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రాలు, వేదపురాణాలు తెలుపుతున్నాయని అన్నారు. «ధర్మప్రబోధాల ద్వారా శాంతియుత సహజీవనాన్ని కొనసాగించవచ్చని అన్నారు. తమ సంస్థ పలు ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో పాపభీతి, దైవభక్తి పెంచుతున్నదని వెల్లడించారు. ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు విఠల్రావు ఆర్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ధార్మికవేత్తలు ఆచార్య విశ్వ, కేవీరెడ్డి యాగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సమాజం ప్రతినిధులు నర్సింహరెడ్డి, జయపాల్ సులాఖే, కిషన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.