breaking news
online medicines
-
టాటా గ్రూప్ కిట్లో 1ఎంజీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ హెల్త్కేర్ మార్కెట్ప్లేస్.. 1ఎంజీ టెక్నాలజీస్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టాటా డిజిటల్ తాజాగా పేర్కొవాటా విలువను వెల్లడించలేదు. కంపెనీ ఇటీవలే ఫిట్నెస్ సంబంధ సేవలందించే క్యూర్ఫిట్ హెల్త్కేర్లో 7.5 కోట్ల డాలర్లు(రూ. 550 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా క్యూర్ఫిట్లో వాటాను సొంతం చేసుకోనుంది. కాగా.. విభిన్న విభాగాలలో వినియోగదారుడి అవసరాలను ఒకే గొడుగు కింద అందించేందుకు వీలుగా డిజిటల్ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నట్లు టాటా డిజిటల్ వివరించింది. ఈ ప్రణాళికల్లో భాగంగానే 1ఎంజీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. డిజిటల్ వ్యవస్థలో ఈఫార్మసీ, ఈడయాగ్నోస్టిక్స్, టెలి కన్సల్టేషన్ కీలక విభాగాలుగా నిలవనున్నట్లు వెల్లడించింది. ఇవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా కరోనా మహమ్మారి కారణంగా హెల్త్కేర్ విభాగం మరింత జోరు చూపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ విభాగంలో 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) మార్కెట్ ఉన్నట్లు తెలియజేసింది. వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి సాధిస్తున్నట్లు వివరించింది. 1ఎంజీ బ్యాక్గ్రౌండ్ 2015లో ప్రారంభమైన 1ఎంజీ ఈహెల్త్ విభాగంలో మెడిసిన్స్, వెల్నెస్ ప్రొడక్టులు, డయాగ్నోస్టిక్ సర్వీసులు, టెలి కన్సల్టేషన్ తదితర పలు సేవలు అందిస్తోంది. ఆధునిక డయాగ్నోస్టిక్ ల్యాబ్లతోపాటు.. మెడిసిన్స్, ఇతర ఆరోగ్య పరిరక్షణ ఉత్పత్తుల పంపిణీ నిర్వహిస్తోంది. కాగా.. ఈ వారం మొదట్లో రూ. 550 కోట్లతో క్యూర్ఫిట్లో వాటా కొనుగోలు చేస్తున్నట్లు టాటా సన్స్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా క్యూర్ఫిట్ వ్యవస్థాపకుడు, సీఈవో ముకేశ్ బన్సల్కు టాటా డిజిటల్లో ప్రెసిడెంట్గా ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలియజేసింది. -
ఆన్లైన్లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!
డాక్టర్ రాసిన మందుల చీటిని ఫోన్ కెమెరా నుంచి క్లిక్ మనిపించి, దాన్ని మొబైల్ యాప్ నుంచి అప్లోడ్ చేసి, చిటికెలో ఆర్డర్ చేసేయడం... ఆ తర్వాత 24 నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల నుంచి మెట్రోల వరకు ఈ ఫార్మసీ వ్యాపారం విస్తరిస్తోంది. దీనివల్ల మందుల ధరలపై ఎక్కువ తగ్గింపు లభించడంతోపాటు, డాక్టర్ సూచించిన మందుల్లో ఏదో ఒక రకం లేకపోవడమన్న సమస్య కూడా దాదాపుగా ఉండడం లేదు. దేశంలో ఔషధ మార్కెట్ రూపు రేఖలను మార్చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీ మార్కెట్కు సంబంధించి లాభ, నష్టాలపై అవగాహన కోసమే ఈ కథనం... ఈ–ఫార్మసీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడం.. సంప్రదాయ ఔషధ దుకాణాలు సేవల గురించి ఆలోచించే విధంగా దారితీసింది. ఈ పోటీ కారణంగా ఆర్డర్ చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నాయి సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు. కస్టమర్లను కాపాడుకునేందుకు వారికి అవసరమైన ఔషధాలు తమ వద్ద లేకపోయినా కానీ, ఆర్డర్ చేసి మరీ తెప్పిస్తున్నాయి. గతంతో పోలిస్తే పరిస్థితుల్లో మార్పు లు రావడానికి దోహదం చేసింది కచ్చితంగా ఈ ఫార్మసీలేనని చెప్పుకోవాలి. ఇక వైద్యులు తప్పనిసరిగా ఔషధం బ్రాండెడ్ పేరును కాకుండా, జనరిక్ పేరునే సూచించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా వినియోగదారులకు ఏ కంపెనీ ఉత్పత్తి కొనుగోలు చేసుకోవాలనే విషయంలో స్వేచ్ఛను కల్పించనుంది. ధరలు ఈ ఫార్మసీలు సాధారణంగా ఔషధ ధరలపై 10 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తుంటాయి. ఆయా ఉత్పత్తులను బట్టి డిస్కౌంట్ వేర్వేరుగా ఉంటుంది. పోషక ఉత్పత్తులపై చాలా వరకు ఆన్లైన్ ఫార్మసీలు తక్కువే డిస్కౌంట్ ఇస్తున్నాయి. ప్రిస్క్రిప్షన్ మందులపై (వైద్యులు రాసినవి) ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో ఈ ఫార్మసీల నుంచి కొనుగోలు చేసే వారికి కొంత ఆదా అవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పుకోవాలి. అంతేకాదు, ఈ ప్రభావంతో సంప్రదాయ ఫార్మసీ స్టోర్లు కూడా దిగొచ్చి, ఎంఆర్పీపై తగ్గింపు ఇస్తున్నాయి. అయినప్పటికీ ఆన్లైన్ ఫార్మసీల్లోనే డిస్కౌంట్ ఎక్కువ లభిస్తోంది. ఔషధ ధరలపై తగ్గింపులు, ఆర్డర్ చేసే విషయంలో ఆన్లైన్ ఫార్మసీలకే ఎక్కువ మార్కులు పడతాయి. కాకపోతే డెలివరీకి తీసుకునే సమయంలోనే సవాలు నెలకొని ఉంది. ఈ ఫార్మసీ స్టార్టప్ సంస్థలు దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, రవాణా పరమైన సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. ఓ ఔషధం వెంటనే తీసుకోవాల్సి ఉంటే సమీపంలోని ఫార్మసీ స్టోర్కు వెళ్లి కొనుగోలు చేయడమే పరిష్కారం. ఇటువంటి వారు ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేసి, అవి వచ్చే వరకు వేచి ఉండడం సాధ్యపడదు. కాకపోతే క్రమం తప్పకుండా కొన్ని రకాల జీవనశైలి సమస్యలకు మందులు వాడే వారు మాత్రం తమకు కావాల్సిన మందులను ముందుగానే ఆన్లైన్ ఫార్మసీల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఎక్కువ డిస్కౌంట్ పొందొచ్చు. కాకపోతే కనీస ఆర్డర్ విలువకు తక్కువ కొనుగోలు చేస్తే, డెలివరీ చార్జీలను వసూలు చేస్తున్నాయి. భిన్న రకాలు... ఈ ఫార్మసీల్లో మూడు రకాలు ఉన్నాయి. మొదటిది ఆన్లైన్లో మాత్రమే ఫార్మసీలను విక్రయించే నమూనా. సంబంధిత ఫార్మసీ స్టోర్ పోర్టల్ లేదా యాప్లో లాగిన్ అయి, కావాల్సిన మందులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఔషధాలను ఇంటికి డెలివరీ చేస్తారు. నెట్మెడ్స్, మెడ్లైఫ్, 1ఎంజీ, ఎంకెమిస్ట్, ఫార్మ్ఈజీ ఇవన్నీ కూడా ఈ కోవలోనివే. ఇక రెండో నమూనాలో అటు సంప్రదాయ ఫార్మసీ స్టోర్లతో పాటు, ఆన్లైన్లోనూ ఔషధ విక్రయాలను నిర్వహించే సంస్థలు కూడా ఉన్నాయి. తద్వారా రెండు మార్గాల్లోనూ కస్టమర్లను సంపాదించుకోవడం లక్ష్యం. మెడ్ప్లస్ ఈ తరహాలోనే పనిచేస్తోంది. మెడ్ప్లస్ సంస్థ 20 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్లపై తగ్గింపు ఇస్తోంది. మెడ్ప్లస్ స్టోర్కు వెళ్లి రూ.1,000లోపు ఆర్డర్ చేస్తే 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంటే, అదే ఆన్లైన్లో ఆర్డర్పై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తుండడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ ఆఫర్ చేయడంతోపాటు, ఇంటికి డెలివరీ చేయడం లేదా సమీపంలోని మెడ్ప్లస్ స్టోర్కు స్వయంగా వెళ్లి తీసుకునే ఆప్షన్లను కూడా ఇస్తోంది. కస్టమర్లు తమ సౌకర్యం కొద్దీ నచ్చినది ఎంచుకోవచ్చు. ఇక మూడో రకం.. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుని కస్టమర్ నివాసం/కార్యాలయం సమీపంలోని ఫార్మసీ స్టోర్కు ఆ ఆర్డర్ను బదిలీ చేసేవీ ఉన్నాయి. వీఫార్మాసిస్ట్ ఇలానే చేస్తోంది. కావాల్సిన ఔషధాన్ని ఆన్లైన్లో ఆర్డర్ తీసుకుంటూ.. ఆ తర్వాత అదే ఆర్డర్ను కస్టమర్ లొకేషన్ సమీపంలోని ఫార్మసీ స్టోర్కు బదిలీ చేస్తుంది. ఆ తర్వాత సంబంధిత స్టోర్ ప్రతినిధి కస్టమర్ నివాసానికి ఔషధాలను డెలివరీ చేస్తారు. డెలివరీ సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు. చట్టం ఏం చెబుతోంది... ఆన్లైన్ ఫార్మసీలు తమ వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తుండడంతో సంప్రదాయ ఔషధ వర్తకులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వీరి ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లోనే ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణకు సంబంధించి ఓ నమూనా విధానాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానంలో ఆన్లైన్లో ఫార్మసీ నిర్వహించాలంటే సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ వద్ద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేకుండా ఎవ్వరూ ఆన్లైన్లో ఔషధాలను ప్రదర్శించడం, పంపిణీ, విక్రయాలు చేయడం నిషిద్ధం. అలాగే, నార్కోటిక్, సైకోట్రాపిక్ ఔషధాలపై నిషేధానికి సంబంధించిన నిబంధనలూ వీటికి వర్తిస్తాయి. రోగుల సమాచారం గోప్యంగా ఉంచడం, ఈ తరహా సమాచారం ఎవరికీ లీక్ అవకుండా, పంచుకోకుండా ఉండాలి. ఇక ఆన్లైన్ ఫార్మసీలను సవాలు చేస్తూ గతేడాది మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ఒక్కోటి చొప్పున రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్లో విడుదల చేసిన ముసాయిదా నిబంధనలకు అనుగుణంగా.. ఈ ఫార్మసీ ప్రాజెక్టును అమల్లోకి తీసుకురానున్నట్టు ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రం బదులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానం అమల్లోకి వస్తే... లోపాలను నివారించడంతోపాటు, ఆన్లైన్, ఆఫ్లైన్ ఫార్మసీల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉంటుందని ఈ రంగానికి చెందిన పరిశీలకులు భావిస్తున్నారు. -
నేడు మెడికల్ షాపుల బంద్
సాక్షి, అమరావతి : ఆన్లైన్లో మందుల విక్రయాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నేడు మందుల షాపులను మూసివేస్తున్నట్లు డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలు చేసుకోవచ్చని డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్లో చేర్చడం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి కలిగే ఇబ్బందులను తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 8 లక్షల మంది కెమిస్ట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ (ఎస్ఏడీడీఏ)లు మందుల షాపులను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్లో 35 వేల షాపులు నేడు మూసివేస్తున్నట్టు సంఘం తెలిపింది. మందుల షాపుల అభ్యంతరాలు.. ♦ ఆన్లైన్లో మందుల అమ్మకం వల్ల నాసిరక మందులు మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ♦ డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా మందుల వాడకంతో అనేక దుష్పరిణామాలు తలెత్తుతాయి. ♦ ఇ–ఫార్మసీ ద్వారా మత్తు మందుల వాడకం ఎక్కువై యువత పెడతోవ పట్టే ప్రమాదం ఉంది. ♦ గర్భ నిరోధకానికి సంబంధించి మందులు సులభంగా లభిస్తే, విచ్చలవిడితనం మరింత పెరుగుతుంది. ♦ యాంటీ బయోటిక్స్ మందుల వాడకం పెరిగి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ♦ గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో మందుల లభ్యత కనుమరుగయ్యే ప్రమాదం. ♦ దేశవ్యాప్తంగా 8 లక్షల మంది కెమిస్ట్లు, వారి వద్ద పనిచేస్తున్న 80 లక్షల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం. -
ఆన్లైన్ మందులకు నిరసనగా 14న బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో మందుల వ్యాపారానికి అనుమతిచ్చిన కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14న జాతీయ స్థాయిలో కెమిస్టులు బంద్ నిర్వహిస్తున్నట్లు ఆలిండియా కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.ఎస్.షిండే తెలిపారు. మందుల విక్రయాలకు సంబంధించి దేశంలో అనేక సమస్యలున్నాయని, ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా ఆన్లైన్లో మందుల విక్రయాలు జరుగుతున్నా కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.