breaking news
one hundred days
-
తొండాట
కడప సెవెన్రోడ్స్: జిల్లా ప్రజలకు మరోమారు నిరాశే ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కుదుర్చుకున్న పది ఎంఓయూలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇవ్వలేదనిపించుకోకుండా గాలివీడు సమీపాన ఒక అల్ట్రా మెగా సోలార్ పార్కును విదిల్చారు. మిగిలిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కడప కంటే అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉన్న ప్రాంతాలకు మళ్లించారు. విభజన చట్టంలోనే ఉన్న ఉక్కు ప్యాక్టరీ ఊసే లేదని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 11జాతీయ స్థాయి సంస్థల్లో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించలేదని ఇప్పటికే అసంతృప్తితో ఉన్న జిల్లా వాసులు దీంతో మరింత రగిలిపోతున్నారు. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద ఉన్న ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ పార్కు భూముల్లో డిఫెన్స్ రీసెర్చి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ల్యాబ్ (డీఆర్డీఓ) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందంటూ ఇటీవల వచ్చిన వార్తలతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈనెల 10వ తేదీన డీఆర్డీఓ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కొప్పర్తి భూములను కేటాయించాలని కోరారు. ఇందువల్ల ప్రత్యక్షంగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలతోపాటు పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తుందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీఐఐసీ సుమారు ఏడు వేల ఎకరాల భూమిని సేకరించి సిద్దంగా ఉంచడం, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నందున కడపకు డీఆర్డీఓ రావడం ఖాయమని అందరూ భావించారు. అయితే రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టును చిత్తూరుజిల్లాకు తరలించడం, 1103 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఎంఓయూ కుదుర్చుకోవడం ఒకేసారి జరిగిపోయాయి. అలాగే హీరో మోటో కార్ప్నూ అదేజిల్లాలో ఏర్పాటు చేసేందుకు 600 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చి సెంటర్, ఏర్పేడు వద్ద ఎన్ఐఎంఎల్, ఐటీ హబ్, మెట్రో రైల్ వంటి పలు ప్రాజెక్టులను ఇప్పటికే ప్రకటించారు. మళ్లీ కొత్తగా డీఆర్డీఓ, హీరో మోటోకార్ప్లను కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదర్చుకోవడం జిల్లా వాసులను నిరాశకు గురి చేస్తోంది. అభివృద్ధిలో జిల్లాల మధ్య ఉన్న అసమానతలకు ముఖ్యమంత్రి విధానాలు ఆజ్యం పోసేలా ఉన్నాయనే విమర్శలు జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అభివృద్దిలో ముందంజలో ఉన్నజిల్లాలకే పెట్టుబడులను తరలించడం సహేతుకం కాదంటున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం, పెట్టుబడులు అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఒక జిల్లా లేదా రాష్ట్ర అభివృద్దిని అంచనా వేస్తున్నారు. వీటితో పోల్చి చూస్తే కడప కంటే చిత్తూరు ఎంతో ముందంజలో ఉందనే విషయాన్ని సోషియో ఎకనమిక్ సర్వే 2013-14 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీడీడీపీలో... వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసు సెక్టార్లలో అభివృద్ధిని లెక్కించి జీడీడీపీని రూపొందిస్తారు. ఈ అంశంలో విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల కంటే కడప వెనుకబడి ఉంది. 2012-13 ప్రస్తుత ధరల ప్రకారం కడప జీడీడీపీ 21,440 కోట్లు, స్థిర ధరల ప్రకారం 12,057 కోట్ల రూపాయలు ఉంది. ఇదే చిత్తూరుజిల్లాలో 30,593 కోట్లు, 16144 కోట్ల రూపాయలు ఉండడం గమనార్హం. పెట్టుబడులు భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను పరిశీలిస్తే చిత్తూరుజిల్లా ముందంజలో ఉంది. 2013 మార్చి వరకు గణాంకాలను పరిశీలిస్తే చిత్తూరుజిల్లాలో 149 యూనిట్లు, 2400 కోట్ల పెట్టుబడులు, 30,906 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. 2013-14 గణాంకాల మేరకు ఆరు యూనిట్లు, 544 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2519 మందికి ఉద్యోగాల కల్పన జరిగాయి. మొత్తంగా చూస్తే ఆ జిల్లాలో 2944 కోట్ల రూపాయల పెట్టుబడి, 33425 మందికి ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇక కడపజిల్లా విషయానికి వస్తే మార్చి 2013 మార్చి నాటికి 42 పరిశ్రమల్లో 5940 కోట్ల రూపాయల పెట్టుబడి, 16469 మందికి ఉపాధి లభించింది. 2013-14 సంవత్సరంలో ఒక్క యూనిట్ గానీ, ఒక్క రూపాయి పెట్టుబడిగానీ, ఒక్కరికీ ఉద్యోగ అవకాశం గానీ జిల్లాలో లభించలేదు. ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదనే రాజకీయ కోణంతో ఆలోచించకుండా జిల్లా సమగ్రాభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞులు సూచిస్తున్నారు. -
నమ్మించి.. వంచించి!
బాబు పాలనకు వంద రోజులు ఎన్నికల ముందు నుంచే ఎన్నెన్నో హామీలు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అధికారంలోకి రావడమే ధ్యేయంగా నమ్మ బలికారు. అరచేతిలో వైకుంఠం చూపి ఎట్టకేలకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. ఇలా వంద రోజులు గడిచిపోయాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్పిస్తే.. చేతల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారు. ప్రభుత్వ తీరు చూస్తే అవన్నీ కార్యరూపం దాలుస్తాయో లేదోననే సందిగ్ధం ప్రజల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: టీడీపీ ప్రభుత్వ వంద రోజుల పాలనలో జిల్లా ప్రజలకు ఒరిగింది శూన్యం. స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు అనుగుణంగా నిధుల విడుదలలో విఫలమయ్యారు. రైతులు.. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టినా ఇప్పుడు వెనుకంజ వేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. రోజుకో నిబంధనను తెరపైకి తీసుకొస్తూ.. మెలికలు పెడుతుండటం మొదటికే మోసం తీసుకొస్తారేమోననే భావన కలిగిస్తోంది. మొదటి సంతకంతో మాయ చేసి.. కమిటీ పేరిట కాలయాపన చేసి.. రీషెడ్యూల్ పేరిట ఊరించి.. తాజాగా ఆధార్, రేషన్ కార్డులకు లింకు పెట్టడం రుణ మాఫీ అమలుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక డ్వాక్రా రుణాల మాఫీ లేదని తేలిపోయింది. రివాల్వింగ్ ఫండ్తో సరిపెట్టడం మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలను టీడీపీ సర్కారు అటకెక్కిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం.. ఉర్దూ విశ్వవిద్యాలయం మాటే మరిచారు. అసంపూర్తి రిజర్వాయర్లను పూర్తి చేస్తామని ప్రకటించినా.. బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధులు మరమ్మతులకు కూడా సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని విషయంలోనూ జిల్లాకు అన్యాయం జరిగింది. ఉద్యమాలు చేసినా.. దీక్ష బూనినా.. గొంతెత్తి నినదించినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. లక్షలాది మంది సీమ ప్రజల ఆత్మఘోషను కాదని.. కార్పొరేటర్లకు తొత్తుగా వ్యవహరించారు. విజయవాడ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి సీమ అభివృద్ధి అవకాశాలను చేజేతులా కాలరాశారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ నేతలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బి.సి.జనార్దన్రెడ్డి, బి.వి.జయనాగేశ్వరరెడ్డిలు సైతం రాజధాని విషయంలో నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల్లో అభద్రత టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక పాలనలో స్తబ్దత నెలకొంది. అభివృద్ధిలో కీలకమైన అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. చెప్పినట్లు నడుచుకోవాలని తెలుగుతమ్ముళ్లు హుకం జారీ చేస్తుండటం.. లేదంటే బదిలీలకు సిద్ధమవ్వాలని హెచ్చరించడం పరిపాటిగా మారింది. సెలవు రోజుల్లోనూ మంత్రి, ఎమ్మెల్యేలు తమ ఇళ్లకు పిలిపించుకుని ఆదేశాలు జారీ చేస్తుండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటి మీద కునుకు కరువైంది. మైనింగ్, ఇసుక అక్రమ రవాణా: ప్రకృతి వనరులను దోచుకునేందుకు కొందరు టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. మైనింగ్, ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. లీజుదారులపైనా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయితీ తమకే ముట్టజెప్పాలని దౌర్జన్యం చేస్తున్నారు. రేషన్ డీలర్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. వంద రోజులు గడిచిపోయినా ప్రజలను మభ్యపెట్టడం మినహా ఏమీ చేయలేకపోవడం టీడీపీ ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తోంది.