breaking news
Nobel shanti award
-
నోబెల్ శిఖరమెక్కిన జాణపదం!
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా టాగోర్ గీతరచనను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.పరిపూర్ణమైన కౌశలంతో నిండివుండే టాగోర్ కవితావేశం ఆయన (ఆంగ్ల) గీతాలను పాశ్చాత్య సాహితిలో భాగంగా మార్చిందని స్వీడిష్ ఎకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. నాటికి నూట మూడేళ్ళు మరో పదమూడు రోజుల్లో పూర్తి అవుతాయనగా– 2016, అక్టోబరు 13న– మరో గీతరచయిత బాబ్ డిలాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు అదే ఎకాడెమీ ప్రకటించింది. ‘మహత్తరమైన అమెరికన్ గీతరచన సంప్రదాయ పరిధిలోనే కొనసాగుతూ, సరికొత్త కవితాత్మక భావప్రకటనలు చేసినందుకు’ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ తన అభినందన సందేశంలో ప్రకటించింది. అలా, నూరేళ్ళ తర్వాత, గీతరచనకు రెండోసారి నోబెల్ పురస్కారం సంపాదించిపెట్టిన వాగ్గేయకారుడిగా బాబ్ డిలాన్ చరిత్ర సృష్టించాడు.కెనడా సరిహద్దుల్లో వుండే అమెరికన్ స్టేట్ మిన్నెసోటా. అక్కడి ఆదివాసుల జానపద గీతాలు చరిత్రప్రసిద్ధాలు. పద్దెనిమిదో శతాబ్ది చివర్లో, జంతువుల చర్మాల కోసం ఇక్కడికి వచ్చే ఫ్రెంచ్ యాత్రికులు తమ గీతాల బాణీలతో ఇక్కడి స్థానిక గీతాలను మేళవించి కొత్తరకం జానపద గీతాల సంప్రదాయం సృష్టించారంటారు. బాబ్ డిలాన్ కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది ఈ జానపద గీతాలు పాడే! సాధారణంగా జానపద బాణీలో రాసిన గీతాలనగానే, మనకి విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలూ’, నండూరి ‘ఎంకి పాటలూ’, కొనకళ్ళ ‘బంగారిమామ పాటలూ’ గుర్తుకురావడం సహజం.అయితే, బాబ్ డిలాన్ గీతసాహితి ఆ బాపతు కాదు. 1960 దశకం మొదట్లో, 22 యేళ్ళ బాబ్ ‘ఉత్తరాది పల్లెటూరి పడుచు పిల్లా’, ‘కుండపోతగా వాన కురవనుంది పిల్లా’ లాంటి పాటలు రాసి పాడకపోలేదు. కానీ బాబ్ డిలాన్ బాణీకి పేరుతెచ్చిపెట్టినవి అలాంటి పాటలు కావు. అమెరికాలో యుద్ధ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో బాబ్ పాడిన ‘పెనుగాలి వీస్తోంది’, ‘కాలం మారుతోంది’ లాంటివే బాబ్ డిలాన్ బాణీ ఇలాంటిదనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ పాటల్లో డిలాన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఆ రోజుల్లో సామాన్య పౌరులందరి మనస్సులనూ కలవరపరుస్తున్నవే! వాటికి ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదనే విమర్శ లేకపోలేదు. అయితే, అది కవిగారి పని కాదనే వాదన కూడా వినవచ్చింది! పాయింటేమిటంటే, అప్పట్లో– 1965 నాటికి– బీజప్రాయంగా మాత్రమేవున్న ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ (కౌంటర్ కల్చర్) చాయలు ఆ పాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అదీ అసలు విశేషం! బాబ్ డిలాన్ అనేది కవిగారి పెట్టుపేరు– రాబర్ట్ యాలెన్ జిమ్మెర్మన్ అతగాడి పుట్టుపేరు. దాన్నిబట్టి, బాబ్ యూదు మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టి పెరిగాడని అర్థమవుతుంది. అతని తండ్రి రష్యన్ జాతీయుడు కాగా, తల్లి లిథువేనియా జాతీయురాలు. (ఈ రెండు జాతులూ 1918 మొదలుకొని 1990 వరకూ సోవియెట్ యూనియన్లో భాగంగా వున్న సంగతి ఆధునిక రాజకీయ చరిత్ర తెలిసినవారికి వేరే చెప్పనవసరంలేదు! ఆ తర్వాత అవి తిరిగి ‘స్వతంత్ర’ దేశాలుగా ఆవిర్భవించాయి) రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో బాబ్ తల్లితండ్రులు అమెరికా చేరి అక్కడే మనువాడారు. మతానికి సంబంధించి, బాబ్ డిలాన్ అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1970–’80 మధ్యకాలంలో బాబ్ క్రైస్తవమతంలోకి మారి, కొద్దికాలానికే తిరిగి యూదుమతంలోకి మారిపోయారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి– వాటినలా వదిలేయండి!దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర, అమెరికన్ జానపద– రాక్ సంగీత సంప్రదాయానికి చెందిన ఈ వాగ్గేయకారుడి సొంతం. పన్నెండున్నర కోట్ల రికార్డులను అమ్మి, బాబ్ డిలాన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. అమెరికాకు పన్నెండో నోబెల్ సాహిత్య పురస్కారం సంపాదించి పెట్టిన అతగాడు. (అమెరికన్ రచయిత్రి లూయీజ్ గ్లిక్ –2020లో– పదమూడోసారి ఇదే పురస్కారాన్ని గెల్చుకున్న సంగతి చదువుకున్న మిత్రులకు తెలిసిన విషయమే!) ‘ప్రామాణిక సాహిత్యం అందించే మేధాసంపదతో సమృద్ధమైన సంస్కారం కలిగినవాడు బాబ్ డిలాన్. ఆయన 1960 దశకంలోనే, అమెరికన్ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశార’ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా శ్లాఘించింది. 85 సంవత్సరాల వయసున్న ఈ సుప్రసిద్ధ వాగ్గేయకారుణ్ణి, ఆధునిక పాఠక–శ్రోతలకు ఇప్పుడు పరిచయం చేయాలనుకోవడం దుస్సాహసమే!- మందలపర్తి కిషోర్ -
సిస్టర్ నిర్మల కన్నుమూత
* మదర్ థెరిసా అనంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథి * అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన నిర్మల * మదర్ హౌస్కు భౌతికకాయం... నేడు అంత్యక్రియలు * రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, సోనియా, రాహుల్ల సంతాపం కోల్కతా: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిస్టర్ నిర్మలా జోషి మంగళవారం కోల్కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. సిస్టర్ నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పరిస్థితి క్షీణించటంతో మంగళవారం ఉదయం కన్నుమూశారని మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రతినిధి కలకత్తా ఆర్చిబిషప్ ఫాదర్ థామస్ డిసౌజా పేర్కొన్నారు. ఆమె భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం మదర్ హౌస్కు తీసుకువస్తామని.. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. సిస్టర్ అస్తమించిన వార్త తెలియగానే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్ జాన్స్ చర్చికి వెళ్లి నివాళులర్పించారు. సిస్టర్ జీవితమంతా మానవాళి సేవకు అంకితంచేశారని మమత కొనియాడారు. మదర్ థెరిసా మరణించిన తర్వాత ఆరు నెలలకు 1997 మార్చి 13న సిస్టర్ నిర్మల మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్గా ఎంపకయ్యారు. ఆమె వారసురాలిగా సిస్టర్ మేరీ ప్రేమను 2009 ఏప్రిల్లో కోల్కతాలో జరిగిన జనరల్ చాప్టర్ సమావేశంలో ఎన్నుకున్నారు. సిస్టర్ నిర్మల మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. పేదలకోసం అంకితం చేసిన ఆమె జీవితం స్ఫూర్తి దాయకమని ప్రణబ్ పేర్కొన్నారు. ‘పేదలు, అణగారిన వారి సేవకు, పరిరక్షణకు సిస్టర్ నిర్మల తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మానవాళికి సేవలో భాగంగా ఆమె కలుసుకున్న లక్షలాది ప్రజలకు ఆమె లేని లోటు తీర్చలేనిదని సోనియా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మదర్ థెరిసా కృషిని సిస్టర్ నిర్మల అంకితభావంతో, గౌరవప్రదంగా కొనసాగించారని రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు. స్ఫూర్తి ప్రదాత.. కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అనేక చారిటీ సంస్థలను నిస్వార్థ సేవా దృక్పథంతో నిర్వహించిన నిర్మల స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శ్లాఘించారు. చరితార్థురాలు: చంద్రబాబు సిస్టర్ నిర్మల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మదర్ థెరిసా సేవామార్గంలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న నిర్మల చరితార్థురాలని కొనియాడారు. పేదల పాలిట పెన్నిధి: వైఎస్ జగన్ సిస్టర్ నిర్మల మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నిరుపేద లు, అణగారిన వర్గాలతో పాటు బాధల్లో ఉన్న వారి సేవలకే తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నిర్మల మృతి చెందడం తీరని దుఃఖాన్ని కలుగ జేసిందని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.


