breaking news
Nizamabad Market Committee
-
పసుపు నాణ్యత లెక్క..2 నిమిషాల్లో పక్కా..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ఆరుగాలం కష్టపడి పండించిన పంట.అందులోనూ పొలాన్ని శ్రద్ధగా, శుచీశుభ్రంగా చూసుకుంటూ పండించే పసుపు పంట. దిగుబడి వచ్చాక మార్కెట్కు తీసుకొస్తే.. నాణ్యతపై కొర్రీలు.. ‘కర్క్యుమిన్’ శాతంపై సందేహాలు.. ల్యాబ్ల నుంచి రిపోర్టులు రావడానికి నాలుగైదు రోజులు.. వేచి ఉండలేక తక్కువ ధరకు అమ్ముకునే రైతులు..ఇన్నేళ్లుగా కనిపించిన దృశ్యమిది. మరి ఇప్పుడు.. మార్కెట్లో వెంటనే నాణ్యత పరీక్షలు.. నిమిషాల్లోనే ‘కర్క్యుమిన్’, తేమ శాతం లెక్కలు.. ఆన్లైన్లో పసుపు పంట విక్రయాలు.. రైతులకు మంచి ధరలు.. దీనంతటికీ కారణం ‘కృత్రిమ మేధ (ఏఐ)’తో కూడిన అత్యాధునిక యంత్రాలు. దేశంలోనే ముఖ్యమైన పసుపు మార్కెట్లలో ఒకటైన నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఈ సరికొత్త సాంకేతికత రైతులకు వరంగా మారింది. దేశంలోనే మొదటిసారిగా కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు ఇక్కడ ‘కర్క్యుమిన్ రీడింగ్ మెషీన్’ను ఏర్పాటు చేసింది. రెండేళ్ల కింద మొదలై.. పసుపులో కర్క్యుమిన్ ఆధారిత మార్కెటింగ్ దిశగా దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ మార్కెట్లో పునాది పడింది. రైతుల పసుపు పంటలోని కర్క్యుమిన్ శాతాన్ని స్థానికంగానే, త్వరగా తెలుసుకునేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వ సుగంధ ద్రవ్యాల బోర్డు ఇక్కడి మార్కెట్ యార్డులో ‘కర్క్యుమిన్ రీడింగ్ మెషీన్’ను ఏర్పాటు చేసింది. ‘ఏజీ–నెక్ట్స్’ సంస్థ తయారు చేసిన ఈ యంత్రం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఆధారంగా ‘క్లౌడ్ టెక్నాలజీ’తోనూ అనుసంధానం అవుతుంది. రైతులు తెచ్చిన పసుపులోని ఒక కొమ్మును పొడిచేసి, ఈ యంత్రంలో పెడితే.. కేవలం రెండు నిమిషాల్లోనే అందులోని కర్క్యుమిన్ శాతాన్ని వెల్లడిస్తుంది. ఇంతకుముందయితే.. పసుపు శాంపిల్ను ల్యాబ్కు పంపేవారు, ఫలితాలు రావడానికి రెండు, మూడు రోజులు సమయం పట్టేది. ఇక పసుపులో తేమశాతాన్ని గుర్తించే యంత్రాన్ని సైతం గత ఏడాది ఇక్కడి మార్కెట్లో ఏర్పాటు చేశారు. పసుపు కొమ్ములను దంచి ముక్కలను ఇందులో వేస్తే.. కేవలం 5 నిమిషాల్లో తేమ శాతం తెలిసిపోతుంది. రైతులకు ఉచితంగా.. నిజామాబాద్ మార్కెట్కు పసుపు పంట వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కర్క్యుమిన్ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి శాంపిల్కు రూ.140 రుసుము వసూలు చేస్తున్నారు. అయితే మార్కెట్లో పసుపు అమ్మేందుకు వచ్చిన రైతుల నుంచి మాత్రం రుసుము తీసుకోవడం లేదు. వారి పసుపు కర్క్యుమిన్ శాతం ఫలితాలను ‘ఈ–నామ్’ సైట్లో నమోదు చేసి, సంబంధిత పసుపు విక్రయ లాట్కు అను సంధానం చేస్తున్నారు. ‘ఈ–నామ్’ సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోని రైతులు అయినా.. ఇక్కడి పంటను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల కర్క్యుమిన్ శాతం ఎక్కువగా ఉన్న పసుపు రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు తెలిపారు. కర్క్యుమిన్ పరీక్ష యంత్రం, దాని సాఫ్ట్వేర్, నిర్వహణ కలిపి మొత్తం రూ.50 లక్షలు అని వెల్లడించారు. నిజామాబాద్లో ఇది విజయవంతం కావడంతో ఇటీవలే మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోనూ ఏర్పాటు చేశారని చెప్పారు. ఏమిటీ ‘కర్క్యుమిన్’? పసుపులో తేమ శాతాన్ని తెలిపే యంత్రం పసుపులో ఉండే కీలక రసాయన పదార్థమే ‘కర్క్యుమిన్’. దీనితోనే పసుపు పంటకు ఆ రంగు వస్తుంది. ఆహారం నుంచి ఔషధాల దాకా.. రంగుల తయారీ సౌందర్య ఉత్పత్తుల దాకా.. దీని ప్రయోజనాలెన్నో. కర్క్యుమిన్కు యాంటీ బయాటిక్,యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలు ఉంటాయని.. కేన్సర్ సహా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షణకు, శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. -
రూ.75 లక్షలకు టోకరా?
నిజామాబాద్ మార్కెట్లో పసుపు వ్యాపారి పరారీ లబోదిబోమంటున్న కమీషన్ ఏజెంట్లు, రైతులు నిజామాబాద్ : నిజామాబాద్ మార్కెట్ కమిటీలో పసుపు కొనుగోలుదారుడు సుమారు రూ.75 లక్షలకు టోకరా వేశాడు. యార్డులో పసుపు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా ఉడాయించినట్లు కమీషన్ ఏజెంట్లు, కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఈ వ్యాపారి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వెలుగులోకి వచ్చింది. పసుపు కొనుగోలు చేసి, డబ్బులు చెల్లించకుండా ఉడాయించడంతో కమీషన్ ఏజెంట్లు, రైతులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధిత ఏజెంట్లు, కొందరు రైతులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యాపారి నాలుగైదేళ్లుగా పసుపు కొనుగోలు చేస్తున్నాడు. ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా పసుపు కొనుగోళ్లు జరిపాడు. ఈ సీజన్ ప్రారంభం నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బులు చెల్లిస్తూ వచ్చిన ఆయన, వారం రోజుల నుంచి కొనుగోలు చేసిన పసుపునకు డబ్బుల చెల్లింపులు నిలిపివేశారు. శనివారం, ఆదివారం పసుపు కొనుగోళ్లు లేకపోవడంతో ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచి ఈ వ్యాపారి కమీషన్ ఏజెంట్లకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీయగా, కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆ వ్యాపారి పరారైనట్లు కమీషన్ ఏజెంట్లు భావిస్తున్నారు. బాధితుల్లో రైతులు ఈ వ్యాపారి బాధితుల్లో కొందరు రైతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కమీషన్ ఏజెంట్ల వద్ద పసుపు కొనుగోళ్లు చేసి, చేతులెత్తేనట్లు తెలిసింది. వీరంతా సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఎంతెంత టోకరా వేసి వెళ్లాడని చర్చించుకున్నట్లు సమాచారం. మంగళవారం బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలే.. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు టోకరా పెట్టడం ఇది కొత్తేమీ కాదు. కానీ.. ఈ పదేళ్లలో ఈ తరహా ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. 2004కు ముందు సుమారు 10 మంది వరకు వ్యాపారులు ఇలా ఉడాయించారు. అనంతరం ఐపీఈతో నిజామాబాద్ నగరానికి వచ్చి దర్జాగా ఇతర వ్యాపారాలు చేసుకున్నారు. సుమారు పదేళ్ల అనంతరం ఇప్పుడు మళ్లీ మార్కెట్ యార్డులో వ్యాపారి టోకరా వెలుగులోకి రావడంతో వ్యాపార, వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యాపారి టోకరా వేయడంపై మార్కెటింగ్శాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.