పేదల ఇళ్లపై పంట రుణాలు
ఇదో విచిత్ర మాయాజాలం
► ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది..
► అదే భూమిపై బ్యాంకు పంట రుణాలిచ్చింది
► రెవెన్యూ అధికారుల అండదండలతో నకిలీ పత్రాల సృష్టి
► భూమిని పరిశీలించకుండానే రుణాలిచ్చిన బ్యాంకు
► ఆందోళన వ్యక్తం చేస్తున్న నస్కల్ దళితులు
రామాయంపేట: 60 ఏళ్ల క్రితం పేదలు నిర్మించుకున్న గృహాల సముదాయాన్ని వ్యవసాయ భూమిగా చూపి రెవెన్యూ అధికారుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి రుణం పొందిన వ్యక్తి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నా దీన్ని కప్పి పుచ్చడానికి యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విస్మయం కలిగించే ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామం 1622, 1623 సర్వేనంబర్ల పరిధిలో మూడున్నర ఎకరాల భూమిలో 60, 70 ఏళ్ల క్రితమే గ్రామానికి చెందిన దళితులు ఇళ్లు నిర్మించుకున్నారు.
దళితుల కబ్జాలో ఉన్న ఈ స్థలం అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించినది. అయితే 2003లో ఆ స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కబ్జాలో ఉన్న దళితులకు ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు అందజేసింది. ఈ మేరకు లేఔట్ ఏర్పాటు చేసి అప్పట్లో 51 మందికి పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా పేదలకు పంపిణీ చేసిన ఈ భూమికి సంబంధించిన వివరాలు రికార్డుల్లో మాత్రం మార్చలేదు. దీంతో సదరు భూమి దళితుల పేరుతో కాకుండా భూమి అమ్మిన వ్యక్తి పేరిట రికార్డుల్లో కొనసాగుతోంది. ఇదే అదనుగా గతంలో ఇక్కడ వీఆర్వోగా పనిచేసిన వ్యక్తి అవినీతికి తెరలేపాడు.
సదరు స్థలంలో దళితులు కాకుండా భూమి అమ్మిన వ్యక్తి వ్యవసాయం చేస్తున్నట్లు రికార్డులు, పాసుపుస్తకాలు సృష్టించారు. దీంతో భూమి అమ్మిన వ్యక్తి గత ఏడాది నిజాంపేటలోని ఒక బ్యాంకులో రుణం పొందాడు. ఇందుకుగాను రెవెన్యూ శాఖవారి మద్దతుతోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాము ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న స్థలంపై కొందరు రుణం పొందినట్లు తెలుసుకున్న గ్రామ దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వారు తహసీల్ కార్యాలయానికి వెళ్లి విచారించగా, సదరు భూమి రికార్డుల్లో పాత భూ యజమాని పేరిటే ఉన్నట్లు తెలుసుకున్నారు.
తెల్వకుండా మా ఇళ్లపై లోన్లు తీసుకున్నరు
60, 70 ఏళ్ల కిందనే మేం ఇళ్లు కట్టుకొని ఉంటున్న జాగపై మాకు తెల్వ కుండనే లోన్లు తీసుకున్నరు. బ్యాంకోళ్లు జాగ చూడకుండా మా ఇళ్ల జాగపై లోన్లు ఎట్టా ఇచ్చిండ్రో తెల్వ దు. వాళ్లు తీసుకున్న ఈ లోన్లు ఎవరు కట్టాలె. ఇందుల రెవెన్యూవోళ్ల చెయ్యున్నది. మాకు న్యాయం చేయాలె. – కుమ్మరి నర్సవ్వ, నస్కల్
నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి లోన్లు
నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి మాకు తెలియకుండా మా ఇళ్ల స్థ«లాలపై రుణాలు తీసుకున్న విషయం ఈ మధ్యనే తెలిసింది. ఈ స్థలానికి సంబంధించి పాసు బుక్కులు, సర్టిఫికెట్లు ఎవరు ఇచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తి ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది. ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. – కాంబోజ రవి, నస్కల్
మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యం
అధికారుల సపోర్టుతో తెల్వకుండా మా ఇళ్ల స్థలాలపై లోన్లు తీసుకున్నారు. ఇందుకు ఎవరెవరు సహకరించారనే విషయమై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యం. – కొమ్మాట రాజయ్య, నస్కల్
అధికారి వివరణ
విచారణ జరిపి చర్యలు తీసు కుంటాం. ఈ విషయం నాదృ ష్టికి రాలేదు. రికార్డులు పరిశీ లించి దళితులైన నస్కల్వాసులకు న్యాయం చేస్తాం. నకిలీ పత్రాలు సృష్టించి లోన్లు తీçసుకుంటే చర్యలు త ప్పవు. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ఆనందరావు, నిజాంపేట తహసీల్దార్