breaking news
New insurance
-
ఎల్ఐసీ కొత్త పాలసీలు..
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తాజాగా నవ జీవన్ శ్రీ, నవ జీవన్ శ్రీ - సింగిల్ ప్రీమియం పేరుతో రెండు కొత్త సేవింగ్ పాలసీలను ప్రారంభించింది. ఇవి నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, లైఫ్ కవరేజ్ కలిగిన వ్యక్తిగత సేవింగ్ ప్లాన్లు. బీమా రక్షణతో పాటు పెట్టుబడికి భద్రత, వడ్డీ రాబడి కోరుకునేవారికి ఇవి అనువుగా ఉంటాయి. ఈ పాలసీలు 2025 జూలై 4 నుంచి 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎల్ఐసీ తెలిపింది. నవ జీవన్ శ్రీ - రెగ్యులర్ ప్రీమియం (ప్లాన్ నెం.912) ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా ప్రీమియం చెల్లించే వారికి అనువైన ప్లాన్. కనీస సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలు, గరిష్ఠ పరిమితి లేదు. వయస్సు పరిమితి 30 రోజుల నుంచి 75 ఏళ్ల వరకు. మెచ్యూరిటీ నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు కాగా గరిష్ట వయసు 75 ఏళ్లు. 6, 8, 10 లేదా 12 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధులను ఎంచుకోవచ్చు. పాలసీ టర్మ్ కనీసం 10 సంవత్సరాలు. 15, 16, 20 ఏళ్ల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. గ్యారెంటీడ్ అడిషన్లు: 10-13 ఏళ్ల పాలసీకి - 8.50 శాతం, 14-17 సంవత్సరాలకు 9 శాతం, 18-20 ఏళ్ల కాలానికి 9.50 శాతం చొప్పున గ్యారెంటీడ్ అడిషన్లు లభిస్తాయి.డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - కనీస సమ్ అష్యూర్డ్తోపాటు వార్షిక ప్రీమియానికి 7 రెట్లు, ఆప్షన్ 2 కింద - వార్షిక ప్రీమియానికి 10 రెట్లు + బేసిక్ సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు.దీనికి కూడా యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ వంటి వాటిని జోడించుకునే వెసులుబాటు ఉంది. మెచ్యూరిటీ తర్వాత లేదా రిస్క్ జరిగినప్పుడు చెల్లింపు: మొత్తం డబ్బును ఒకేసారి లేదా నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన పొందవచ్చు. ప్రీమియం చెల్లింపును కూడా ఇదే విధంగా ఎంపిక చేసుకోవచ్చు.నెలకు రూ.10 వేలతో రూ.26 లక్షలుఒక వ్యక్తి రూ.10 లక్షల సమ్ అష్యూర్డ్తో 20 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకుంటే.. ఆప్షన్ 2 కింద 10 సంవత్సరాల ప్రీమియం చెల్లింపు వ్యవధిని ఎంచుకుంటే వార్షిక ప్రీమియం రూ.1,10,900 కట్టాలి. అదే నెలవారీ అయితే రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇలా పదేళ్లకూ చెల్లించే మొత్తం సొమ్ము: రూ.11,09,000 అవుతుంది. పాలసీ వ్యవధి 20 సంవత్సరాలు పూర్తయ్యాక రూ.16,58,786 గ్యారెంటీడ్ అడిషన్ రూపంలో లభిస్తాయి. మొత్తం కలుపుకొంటే మెచ్యూరిటీ తర్వాత రూ.26,58,786 లభిస్తుంది.నవ జీవన్ శ్రీ- సింగిల్ ప్రీమియం (ప్లాన్ నం.911) ఈ పాలసీ ఒకేసారి ఏకమొత్తం పెట్టుబడి పెట్టదలచుకున్న వారికి అనువుగా ఉంటుంది. ఈ పాలసీని 30 రోజుల నుండి 60 ఏళ్ల వయస్సు వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఆప్షన్ 2 కింద మాత్రం గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు మాత్రమే. మెచ్యూరిటీ సమయానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠంగా 75 ఏళ్లు (ఆప్షన్ 2లో 60) ఉండాలి. పాలసీ వ్యవధి కనీసం 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు. కనీస హామీ మొత్తం (Sum Assured) రూ.1 లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. డెత్ బెనిఫిట్: ఆప్షన్ 1 కింద - సింగిల్ ప్రీమియానికి 1.25 లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్లో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఆప్షన్ 2 కింద - సింగిల్ ప్రీమియానికి 10 రెట్లు రిస్క్ కవరేజీ లభిస్తుంది.గ్యారెంటీడ్ అడిషన్: ప్రతి వెయ్యి రూపాయల బేసిక్ సమ్ అష్యూర్డ్పై రూ.85 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ లభిస్తుంది. యాక్సిడెంట్ డెత్ & డిజేబిలిటీ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ వంటి అదనపు రైడర్లను కూడా జోడించుకోవచ్చు.రిస్క్ లేదా మెచ్యూరిటీ సమయంలో చెల్లింపు: మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షిక పద్ధతిలో పొందే అవకాశముంది. రూ.5 లక్షలకు రూ.7.12 లక్షలు18 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల వ్యవధికి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్తో పాలసీ తీసుకుంటే.. సింగిల్ ప్రీమియం రూ.5,39,325 చెల్లించాలి. దీనికి ప్రతి ఏడాది గ్యారెంటీడ్ అడిషన్గా రూ.42,500 వస్తుంది.(మొత్తం రూ.2,12,500). ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.7,12,500 లభిస్తుంది. ఒకవేళ చివరి సంవత్సరంలో రిస్క్ జరిగితే గరిష్టంగా రూ.9.17 లక్షలు ఎల్ఐసీ నుంచి లభిస్తాయి. -
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారి కోసం తమ యాప్ ద్వారా తక్కువ ప్రీమియంలతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జెన్ఎస్ లైఫ్ ఫౌండర్ మీనాక్షీ మీనన్ తెలిపారు. సిల్వర్ ప్లాన్ కింద కేవలం రూ. 990కే రూ. 2.5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ప్రమాదం బారిన పడి ఆస్పత్రిలో చేరితే రూ. 50 వేల నగదు లభిస్తుందని పేర్కొన్నారు.ప్రత్యేక రేట్లపై రూ. 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్లు, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలను పొందవచ్చని తెలిపారు. ఇక గోల్డ్ ప్లాన్లో రూ. 4,900 వార్షిక ప్రీమియంకు రూ. 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్పత్రిలో చేరితే రూ. 1 లక్ష నగదు, రూ. 5 లక్షల వరకు సైబర్ ఇన్సూరెన్స్ లభిస్తుందని మీనాక్షి వివరించారు. -
పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్..
అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
జీవిత బీమా ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీలు సెప్టెంబర్ నెలకు మంచి పనితీరు చూపించాయి. నూతన పాలసీల ద్వారా ప్రీమియం (న్యూ బిజినెస్ ప్రీమియం) 17 శాతం పెరిగి రూ.36,366 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే నెలకు ప్రీమియం ఆదాయం రూ.31,001 కోట్లుగా ఉంది. ప్రభుత్వరంగ ఎల్ఐసీ నూతన ప్రీమియం ఆదాయంలో మంచి వృద్ధిని చూపించింది. 35 శాతం అధికంగా రూ.24,991 కోట్ల ప్రీమియం ఆదాయం సంపాదించింది. 2021 సెప్టెంబర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.18,520 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ నెల గణాంకాలను ఐఆర్డీఏఐ విడుదల చేసింది. ఇక 23 ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీలు ఉమ్మడిగా రూ.11,375 కోట్ల నూతన ప్రీమియం ఆదాయం సంపాదించాయి. 2021 సెప్టెంబర్ నెలకు ఇవే సంస్థలు సంపాదించిన కొత్త పాలసీల ప్రీమియం రూ.12,481 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణించింది. ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 15 శాతం తగ్గి రూ.2,471 కోట్లుగా ఉంటే, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆదాయం 22 శాతం తగ్గి రూ.2,166 కోట్లకు పరిమితమైంది. బజాజ్ అలియాంజ్ ఆదాయం కూడా 38 శాతం తగ్గి రూ.670 కోట్లుగా నమోదైంది. -
శ్రీరామ్ లైఫ్ నుంచి అష్యూర్డ్ ఇన్కమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్’ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాత ఒకేసారిగా లేదా ఏటా కొంత మొత్తం చొప్పున గ్యారంటీ ఇన్కమ్ అందుకునే విధంగా ఈ పాలసీని రూపొందించారు. ఈ పథకం వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఇది ఒక విధంగా పెన్షన్ ప్లాన్ కింద పని చేసేదే అయినా... 30 ఏళ్లు దాటిన వారికి కూడా ఏటా హామీతో కూడిన ఆదాయాన్ని పొందవచ్చన్నారు. పాలసీకి 8 లేదా 10 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన వార్షిక ప్రీమియానికి గరిష్టంగా 10 రెట్లు బీమా రక్షణ లభిస్తుంది. ఈ పాలసీని 30 రోజుల వయస్సు ఉన్న వారి నుంచి 50 ఏళ్ల వారి వరకు తీసుకోవచ్చు. వచ్చే మూడు నెలల కాలంలో 10,000 అష్యూర్డ్ ఇన్కమ్ ప్లాన్స్ను విక్రయించడం ద్వారా రూ.15 కోట్ల ప్రీమియం వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.