breaking news
Nela Nela Telugu Vennela
-
''నెల నెలా తెలుగువెన్నెల'' 18వ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెల నెలా తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక 18వ వార్షికోత్సవం 2025 జూలై నెల 19 వ తేదీన డాలస్లోని ఇన్నోవేషన్ హబ్ మీటింగ్ హాల్లో ఘనంగా జరిగింది. తొలుత చిరంజీవి సమన్విత మాడా త్యాగరాజ కీర్తన''మనవ్యాలకించరాదటే' ప్రార్ధన గీతంతో సదస్సును ప్రారంభం కాగా, తరువాత ప్రముఖ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సంస్థ ప్రత్యేక గీతం ''నెల నెలా -తెలుగు వెన్నెలా ''ని ప్రముఖ గాయని శివాత్మిక ఆలపించారు. సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడా స్వాగత వచనాలు పలుకుతూ సాహిత్య వేదిక గత 18 ఏళ్ళుగా క్రమం తప్పకుండా ప్రతి 3 వ ఆదివారం సాహిత్య కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా, తెలుగు భాషా సాహిత్యాలని సుసంపన్నం చేసిన ఎందరో మహామహులు ఈ వేదికని అలంకరించారని, అలాగే ఎన్నో సాహిత్య ప్రక్రియల ప్రదర్శన జరిగిందని తెలియజేసారు. గత రెండేళ్లుగి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో మంది సాహితీ ఉద్దండులతో సాన్నిహిత్యాని కలిగించిందన్నారు. ముఖ్య అతిథి సంస్కృతాంధ్ర ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్ గారిని సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. సాఫ్ట్వేర్ రంగం లో ఉద్యోగం చేస్తూ గత మూడు దశాబ్దాలుగా అమెరికాలో నివాసం ఉంటున్న వీరు, ఇప్పటిదాకా 36 అష్టావధానాలు, 2 శతావధానాలు, ఒక ద్విశతావధానము చేసారు. ఈ రోజు విశిష్టమయిన సంస్కృతాంధ్ర ఏకాదశావధానం చేయబోతున్నారు.కార్యక్రమానికి సంధాతగా తొలి తెలుగు అమెరికా అవధాని ఆచార్య పుదూరు జగదీశ్వరన్ గారు వ్యవహరించి అవధాన ప్రక్రియ ని సభకు పరిచయం చేసి కార్యక్రమం ఆరంభించారు.అటు సంస్కృతం, ఇటు తెలుగు పూరణలతో, సమయోచిత సందర్భ సహిత వివరణలతో, చతురోక్తులతో ఆద్యంతం అవధాని గారు ఆహుతులను అలరించారు.పృచ్చకులుగా నిషిద్ధాక్షరి- జంద్యాల జయకృష్ణ బాపూజీ, సమస్య- ఉపద్రష్ట సత్యం, దత్తపది-చంద్రహాస్ మద్దుకూరి, వర్ణన-డా.గుర్రం మైథిలి, న్యస్తాక్షరి-సిద్దా శ్రీధర్,అప్రస్తుత ప్రసంగము-మాడాదయాకర్, పురాణము-వేముల లెనిన్, ఆశువు-పాలూరి సుజన,సంస్కృతము దత్తపది-నేమాని రాజశేఖర్, సమస్య-పేరి భార్గవి,వర్ణన-రామడుగు నరసింహాచార్యులు వ్యవహరించారు. 'కృత్స్న జ్యోత్స్నల వీడి చెప్పగదవే హృత్స్నేహమేపారగన్' అంటూ క్లిష్టమైన ప్రాసలతో కూడిన సమస్యను వారు పూరించిన తీరు, 'రసాభాసోజాతః కవికులగురోః కావ్యనిచయే' సంస్కృత సమస్యాపూరణము ఆహుతులను అలరించింది. అవధానానంతరము సభికుల కరతాళ ద్వనుల మధ్య సంస్థ అవధాని గారిని ఘనంగా సత్కరించింది.విశిష్ట అతిథులుగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం పొందిన పర్వ నవలానువాద అనుభూతులను పంచుకుంటూ 'అనువాద పర్వం' పై ప్రసంగించారు. తరువాత హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని అనువర్తిత భాషాశాస్త్రం మరియు అనువాద అధ్యయనాల కేంద్రానికి నిర్దేశకుడిగా పదవీ విరమణ చేసిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారు ' యంత్రానువాద వ్యవస్థల ' పై సోదాహరణముగా ప్రసంగం గావించారు. ఈ ఇరువురి ప్రధాన ప్రసంగాలు ఆహుతులని చాలా అలరించాయి. భాషకి సంబంధించిన కొత్త కోణాలని పరిచయం చేసాయి.చివరగా కాలార్చన డాక్టర్ రాళ్ల బండి కవిత ప్రసాద్ శాస్త్రీయ నృత్య రూపకం, దేవి భాగవతం ఆధారంగా చేసుకుని కాలాన్ని నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ఈ విశిష్టమైన సాహిత్యం, శ్రవ్యమైన సంగీతంతో 40 మంది నర్తకి నర్తకులతో కనుల పండుగగా ఈ నృత్య రూపకాన్ని కళా రత్న కెవి సత్యనారాయణ నృత్య దర్శకత్వం వహించారు. డాలస్ నగరంలోని ప్రముఖ నృత్య సంస్థల నుండి నాట్య గురువులు, నాట్య కళాకారులు ఈ నృత్య రూపకంలో పాత్రను పోషించారు. అనంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ కార్యవర్గ బృందము మరియు పాలక మండలి, సంస్థ తరపున అతిథులందరికీ సన్మాన పత్ర జ్ఞాపికలు శాలువాలతో సత్కరించారు.ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి వందన సమర్పణ చేసి, సహకరించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభా వేదికను ఇచ్చి సహకరించిన విజయ్ బొర్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమములో సంస్థ ఉత్తరాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి,పాలక మండలి అధిపతి డా కొండా తిరుమల్ రెడ్డి, సభ్యులు డా శ్రీనాథ్ రెడ్డి పల్వల, సురేష్ మండువ, జ్యోతి వనం, కార్యవర్గ బృందం ఉదయ్ నిడిగంటి, దీప్తి సూర్యదేవర, సునీల్ సూరపరాజు, నరసింహ పోపూరి, శివారెడ్డి వల్లూరు, లెనిన్ తుళ్ళూరి సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి ,చిన్న సత్యం వీర్నాపు,చంద్ర కన్నెగంటి మరియు ప్రముఖ రచయితలు వంగూరి చిట్టెం రాజు, అత్తలూరి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
TANA: నెల నెలా తెలుగు వెలుగు.. సినీ గీతాల ధ్రువతారలకు అక్షరాంజలి
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో - ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం - 70వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శనివారం, ఆదివారం రెండురోజుల ప్రత్యేక కార్యక్రమంగా ఘనంగా జరిగింది.“సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి” అనే పేరున నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధప్రతిష్టులైన పాతికమందికి పైగా సినీగీత రచయితలు సృష్టించిన సాహిత్యంపై చాలామంది ప్రముఖులు హాజరై విశ్లేషణ చేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ- “ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంగ్లశబ్దచిత్రం “ద జాజ్ సింగర్” అని, మొదటి భారతీయ హిందీ శబ్దచిత్రం “ఆలం ఆరా” అని, మొట్టమొదటి తెలుగు శబ్దచిత్రం “భక్త ప్రహ్లాద” అని పేర్కొంటూ ఆయా చిత్రాల విశేషాలు, వాటిలోని పాటల వివరాలను పంచుకున్నారు. డా. తోటకూర ముఖ్యఅతిథిగా పాల్గొన్న వి.ఏ.కె రంగారావు గార్ని సభకు పరిచయం చేస్తూ ... వివిధ తెలుగు, ఆంగ్ల పత్రికలలో సినిమాలపై ఎన్నో వ్యాసాలు రాసిన రచయిత, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 52 వేలకు పైగా ‘78 ఆర్ పి మ్’ రికార్డ్లు సేకరించిన వారు, ప్రపంచంలోని వివిధ భాషల్లో లక్షా పాతిక వేల వరకు ట్రాక్స్ కల్గిఉన్న వ్యక్తి, సినీ సంగీత, సాహిత్యాలపై విశేషమైన ప్రతిభ, లోతైన అవగాహన కల్గిన విశ్లేషకుడు, రచయిత, కాలమిస్ట్, నాట్యకారుడు, రికార్డ్ కలక్టర్, జంతు ప్రేమికుడు, ఒక విజ్ఞాన భాండాగారం వి.ఏ.కె అంటూ అభివర్ణించారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సినీ సంగీత, సాహిత్య విశ్లేషకులు శ్రీ వేంకట ఆనంద కుమార కృష్ణ (వి.ఏ.కె) రంగారావు, చెన్నై నుండి హాజరై సినిమా పాటలు ముఖ్యంగా పాత పాటలు ఇప్పటికీ సజీవంగా ఉంటూ మనం ఎప్పుడు విన్నా మన మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి అంటే అది కేవలం అంత గొప్ప సాహిత్యం సృష్టించిన గీతరచయితల గొప్పదనమే అన్నారు. తన మనసుకు బాగా నచ్చిన చిత్రాలు, పాటలపై సోదాహరణ ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకున్నారు. శనివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న - రోచిష్మాన్ (చెన్నై) - “తెలుగు సినిమా పాట విశేషం”పై ప్రసంగించగా; డా. శ్రీదేవి శ్రీకాంత్ (బోట్స్వానా, ఆఫ్రికా) - తొలి సినీగీత రచయిత చందాల కేశవదాసు; ఆవాల శారద (విజయవాడ) - పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి; జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (హైదరాబాద్) - దైతా గోపాలం; డా. వి. వి. రామారావు (హైదరాబాద్) - పింగళి నాగేంద్రరావు; పి.వి శేషారత్నం (విశాఖపట్నం) - వెంపటి సదాశివ బ్రహ్మం; డా. వోలేటి పార్వతీశం (హైదరాబాద్) - మల్లాది రామకృష్ణశాస్త్రి; మద్దుకూరి విజయ చంద్రహాస్ (డాలస్) - కొసరాజు రాఘవయ్య చౌదరి; లెనిన్ బాబు వేముల (డాలస్) - శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ); డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి (విజయవాడ) - ఆచార్య ఆత్రేయ; డా. రెంటాల జయదేవ (హైదరాబాద్) - సముద్రాల (జూనియర్) రామానుజాచార్య; చెన్నూరి సీతారాంబాబు (హైదరాబాద్) - మైలవరపు గోపీకృష్ణ లు సృష్టించిన సాహిత్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ఆదివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న ఎస్. వి రామారావు (హైదరాబాద్) - సముద్రాల (సీనియర్) వేంకట రాఘవాచార్యులు; మహాకవి దాశరథి గారి తనయుడు దాశరథి లక్ష్మణ్ (హైదరాబాద్) - దాశరథి కృష్ణమాచార్య; శారద ఆకునూరి (హ్యుస్టన్) – ఆరుద్ర; గజగౌరి (చెన్నై) - వీటూరి; రాజశ్రీగారి తనయుడు, రాజశ్రీ సుధాకర్ (చెన్నై) – రాజశ్రీ; ఎస్.పి వసంత (చెన్నై) - అనిసెట్టి సుబ్బారావు; తుర్లపాటి నాగభూషణ రావు (హైదరాబాద్) - ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి; జాలాదిగారి కుమార్తె, డా. జాలాది విజయ (విశాఖపట్నం) - డా. జాలాది రాజారావు; వేటూరి గారి తనయులు, వేటూరి రవిప్రకాష్ (హైదరాబాద్) – వేటూరి సుందర రామమూర్తి; కలగా కృష్ణమోహన్ (హైదరాబాద్) - ఇంద్రగంటి శ్రీకాంత శర్మ; వేదవ్యాస రంగభట్టర్ గారి సహోదరులు జె.కె భారవి (హైదరాబాద్) - వేదవ్యాస రంగభట్టర్; సిరివెన్నెల గారి సోదరులు చేంబోలు వెంకట్రామశాస్త్రి (విశాఖపట్నం) - పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి; వెన్నెలకంటి గారి తనయుడు, శశాంక్ వెన్నెలకంటి (హైదరాబాద్) – వెన్నెలకంటి గార్ల సినీ సాహిత్యంపై ఎంతో లోతైన, ఆసక్తిదాయకమైన చేసిన విశ్లేషణ అందరినీ అలరించింది.శనివారం, జూలై 27న జరిగిన పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.https://youtube.com/live/GT2hkXvKc1Yఆదివారం, జూలై 28న జరిగిన పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును. https://www.youtube.com/live/SxVnbW1FBGAతానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సభలో పాల్గొన్న అందరికీ, విజయవంతంగావడానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీ సాహితీ చరిత్రలో ఈ సాహిత్యసభ ఒక చరిత్ర అన్నారు. -
ఘనంగా ‘టాంటెక్స్ నెలనెలా తెలుగువెన్నెల’
డాలస్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెన్నెల’ సాహిత్య సదస్సు ఆదివారం (డిసెంబర్17న) ఘనంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పాల్గొని.. జయప్రదం చేసారు. ప్రవాసంలో నిరాటంకంగా 125 నెలల పాటు సాహితీవేత్తల నడుమ ఈ సదస్సు నిర్వహించటం విశేషం. కార్యక్రమంలోముందుగా ప్రముఖ సినీ గాయని నూతన, మోహన్ ప్రార్థనాగీతం ఆలపించారు. కొరివిచెన్నారెడ్డి కంకటిపాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని ‘అన్నదానఫలమహాత్యం’ పురాణపఠనంచేశారు. పాలపర్తి ఇంద్రాణి125వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగువారి ఉత్తమ జీవనవిధానం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పాలపర్తి ఇంద్రాణి రచించిన మూడోకవితాసంకలనం,'ఇంటికొచ్చిన వర్షం'; తల్లీపిల్లల హృద్యమైన సంభాషణలపుస్తకం 'చిట్టిచిట్టిమిరియాలు', మొదటినవలిక 'ఱ' ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ‘సింహావలోకనం’ లో 2017సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు నెలనెలా జరిగిన సాహిత్యసదస్సులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, శీలం కృష్ణవేణి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వీర్నపు చినసత్యం, కోడూరు కృష్ణారెడ్డి, తెలకపల్లిజయ, కర్రిశశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా టాంటెక్స్ 114వ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు జనవరి 15న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేశారు. ప్రవాసంలో నిరాటంకంగా 114 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. ఈ సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ స్వాగతం పలికారు. 2017 ఏడాదికిగానూ సమన్వయకర్తగా శారద సింగిరెడ్డిని సభకు పరిచయం చేస్తూ వేదికమీదికి ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డిని పరిచయం చేస్తూ ఎం.వి.ఎల్.ప్రసాద్ వేదిక మీదకు ఆహ్వానించగా డా.సి.ఆర్.రావు, కలవలరావులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో ముందుగా చిరంజీవి కమ్మంకర్ శ్రీతన్ ప్రార్థనా గీతాన్ని ఆలపించాడు. భగవద్గీత నేర్చుకుంటున్న శ్రీతన్ మొదటి, ఎనిమిదో అధ్యాయాలలో ఏ పద్యం అడిగినా పద్యం చెప్పి, అర్ధం వివరించి అందరి మెప్పు పొందాడు. గతంలో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన పిస్కా సత్యనారాయణ.. ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడిని, కలియుగంలోని శ్రీకృష్ణదేవరాయలని అనుసంధానిస్తూ కొన్ని పద్యాలను ఉదహరించారు. సాహిత్యవేదిక సభ్యులు డా.కలవగుంట సుధ క్షేత్రయ్య పదసాహిత్యంతో సాహితీ ప్రేక్షకులను అలరించారు. మద్దుకూరి చంద్రహాస్ 'నేనొక ప్రేమ పిపాసిని' అనే పాటలో రెండు చరణాలు పాడి, మూడో చరణంలో అందమైన సాహిత్యం దాగిఉందో వివరించారు. జువ్వాడి రమణ శాతవాహనులకి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ సందర్భంగా తెలిపారు. వేముల లెనిన్ కొన్ని నన్నయ పద్యాలను పాడి వినిపించారు. డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి 'జానపదం మరియు భావకవిత్వం'పై దాదాపు తొంభై నిమిషాలపాటు ప్రసంగించారు. జానపదంలో వేర్వేరు ప్రాంతాల యాసలను, ఆయా పాటల లక్షణాలను చెబుతూ, కవులు, రచయితల కలాల నుంచి ఎలా వెలువడ్డాయో వివరించారు. 2016ఏడాదికి సంస్థ అధ్యక్షుడిగా వ్యవహరించిన జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నెలనెలా తెలుగువెన్నెల సదస్సును విజయవంతంగా నిర్వహిస్తున్న బృంద సభ్యులను, సమన్వయకర్తలను అభినందించారు. మూడు దశాబ్దాల చరిత్రగల సంస్థలో బాధ్యతలు చేపట్టం అదృష్టమని అధ్యక్షుడు ఉప్పలపాటి కృష్ణారెడ్డి అన్నారు. ముఖ్య అతిథిని టాంటెక్స్ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, పాలకమండలి అధిపతి రొడ్డ రామకృష్ణలు శాలువాతో, కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృందసభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు శీలం కృష్ణవేణి, ఉపాధ్యక్షులు వీర్నపు చినసత్వం, కోశాధికారి గోవాడ అజయ్, సంయుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలకమండలి సభ్యులు కన్నెగంటి చంద్ర, కార్యవర్గసభ్యులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, దండ వెంకట్, సింగిరెడ్డి శారద, పార్నపల్లి ఉమామహేష్, తోపుదుర్తి ప్రభంధ్, లంకా భాను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, మీడియాకు బిళ్ళా ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా టాంటెక్స్ 112వ సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు నవంబర్ 20న దేశీప్లాజా టీవీ స్టూడియోలో సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. డాలస్లోని భాషాభిమానులు, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేశారు. 112వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు బిళ్ళా ప్రవీణ్ స్వాగతం పలికారు. స్వాతి అన్నమయ్య కీర్తన గానంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంజాబ్కు చెందిన శ్రీ కుల్దీప్ సింగ్, డాలస్కి చెందిన కాజా సురేష్ తమ అనుభవాలను పంచుకున్నారు. గతంలో ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన పిస్కా సత్యనారాయణ మహాకవి శ్రీనాధుని శ్లేష చమత్కారం గురించి ప్రసంగించారు. టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి తెలుగు భాషలోని జాతీయాలు, సామెతలను సభికులకు గుర్తు చేశారు. ప్రతి నెల అట్లూరి స్వర్ణ నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం సందడిగా జరిగింది. ఆర్జే శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సుని తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేముల లెనిన్ బాబుని మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, ప్రొఫెసర్ దంతు రాం ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. తొంభై నిముషాల పాటూ అనర్గళంగా దాశరథి గారి పాటలనే కాకుండా మహాకవి శ్రీశ్రీ పద్యాలను లెనిన్ ఆలపించారు. లెనిన్ను టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువాతో, బిళ్ళా ప్రవీణ్, సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, తోట పద్మశ్రీ , పాలేటి లక్ష్మి పాల్గొన్నారు. సదస్సుకు విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, మీడియాకు బిళ్ళా ప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
అత్యద్భుతంగా నెల నెలా తెలుగు వెన్నెల
టెక్సస్ : అమెరికా తెలుగు వీధికి శాశ్వత చిరునామా అయిన డాలస్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 'నెల నెలా తెలుగు వెన్నెల' ఘనంగా నిర్వహించారు. నెల నెలా తెలుగు వెన్నెల 9వ సాహిత్య వేదిక వార్షికోత్సవంతో పాటు108వ సదస్సు ఆదివారం సెయింట్ మేరీ మలంకారా చర్చి ఆడిటోరియంలో నభూతో న భవిష్యతి అన్న రీతిలో అత్యంత శోభాయమానంగా జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ ఇలా వివిధ తెలుగు ప్రాంతాల నుండి వచ్చిన ప్రముఖులు, ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను, వ్యావహారిక శైలిని కళ్ళకు కట్టినట్లు వివరించి, ప్రాంతాలు వేరైనా , యాసలు వేరైనా మనమంతా తెలుగు తల్లి బిడ్డలం అని ఘనంగా చాటిచెప్పారు. ఇంతకు ముందెన్నడూ జరిగని ఈ అపురూప సమాగమం, అత్యద్భుత వ్యాఖ్యాన సుందరదృశ్యకావ్యం మనసుకు హత్తుకుని మైపరిచిపోయేలా చేశాయి. టాంటెక్స్ కమిటీ సభ్యులు , సాహిత్య వేదిక సభ్యులు జ్యోతి ప్రజ్వలనం గావించగా, ఎల్ఎంఏ మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు మధురంగా గానం చేయగా 9వ వార్షిక ఉత్సవం ప్రారంభమైంది. సాహిత్య వేదిక సమన్వయకర్త ప్రవీణ్ బిళ్ళా మాట్లాడుతూ, 108 నెలల క్రితం నాటిన సాహిత్య వేదిక విత్తనం దిన దిన ప్రవర్ధమానం చెంది, ఈనాడు ఒక వట వృక్షమై ఎందరో తెలుగు అభిమానులకు మధుర ఫలాలు అందిస్తోందని, ఇది సంగీత సాహిత్యాలు ఒకటిగా పెనవేసుకున్న మణిహారమన్నారు. టాంటెక్స్ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ , 2007 లో మొదలు పెట్టిన నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఇన్ని నెలలుగా నిరాటంకంగా కొనసాగుతూ ఉత్తర అమెరికాలో మొట్టమొదటి సుదీర్ఘ తెలుగు కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన గొప్ప రచయితలు,వక్తలు ప్రసంగించారు.