breaking news
NCLP
-
విద్యార్థుల వివరాలతోనే నిధుల విడుదల!
►ఆన్లైన్లో విద్యార్థుల నమోదుకు ఇదివరకే కేంద్రం ఆదేశాలు ►అయినా స్పందించని మదర్సాలు, ఎన్సీఎల్పీ కేంద్రాలు ►నిధుల దుర్వినియోగంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు ►నెలాఖరులోగా వివరాలు నమోదు చేయాలని ఎస్ఎస్ఏ గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, మదర్సాలు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ) కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే నిధుల విషయమై ఇకనుంచి విద్యాశాఖ పక్కాగా వ్యవహరించనుంది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగానే నిధులను కేటాయించనుంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నిధుల దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలు! సర్వశిక్ష అభియాన్ ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో 500 వరకు మదర్సాలు, ఎన్సీఎల్పీ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. వాటి నిర్వహణ కింద ఒక్కో విద్యార్థికి ఎస్ఎస్ఏ రూ. 6,500 వరకు నిధులను చెల్లిస్తోంది. ఇవికాకుండా సబ్జెక్టులు బోధించే వలంటీర్లకు ఒక్కొక్కరికి వేతనాలను కూడా ఎస్ఎస్ఏ ఇస్తోంది. ఇలా మొత్తంగా వాటి నిర్వహణకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే ఇన్నాళ్లూ వాటిల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం, మదర్సాల్లో వలంటీర్లను నియమించకుండానే నిధులను మింగేసినట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విద్యాశాఖ విచారణ కూడా జరిపింది. హైదరాబాద్లో ఈ అక్రమాల విషయంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు సస్పెండ్ కూడా అయ్యారు. మదర్సాల మౌనం... విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు మదర్సాలు ముందుకు రావడం లేదు. గతేడాది (2015–16) లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మదర్సాల్లో 57,321 మంది విద్యార్థులు ఉన్నట్లు నిర్వాహకులు వివరాలిచ్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా అంతే మంది ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 17,836 మంది వివరాలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. ఇంకా 39,485 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేదు. వారంతా ఉన్నట్టా? లేనట్టా? అన్నది ప్రశ్నగా మారింది. నిజంగా లేకపోతే ఇన్నాళ్లూ పేపరుపై లెక్కలు చూపించి, నిర్వహణ సంస్థలు నిధులను మింగేశారా? అన్న అనుమానాలు అధికారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీలోగా విద్యార్థులు అందరి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సర్వశిక్ష అభియాన్ తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆన్లైన్లో విద్యార్థుల వివరాలను నమోదైన 17,836 మందికి సంబంధించి ఆధార్ లింకు కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు అందులో కేవలం 8,804 మందికి సంబంధించి మాత్రమే ఆధార్ లింకు పూర్తయింది. ఇక ఆధార్తో అనుసంధానం చేస్తే విద్యార్థుల తాలూకు పూర్తి వివరాలు బయటపడునున్నాయి. -
ఎన్సీఎల్పీ నిధులు పక్కదారి
* అవినీతి ఊబిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం * పిల్లలసంఖ్యను అధికంగా చూపి సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు * పట్టించుకోని ఉన్నతాధికారులు బాలకార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో అవి పక్కదారి పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ నేరుగా సమీక్షించాల్సిన జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం (ఎన్సీఎల్పీ) జిల్లాలో అవినీతిమయంగా మారింది. ఎవరికి వారు అందినకాడికి దండుకుంటూ పిల్లల నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు. ఈ విధంగానైతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గుంటూరు వెస్ట్ : జాతీయ బాలకారిృక వ్యవస్థ నిర్మూలన పథకం(ఎన్సీఎల్పీ)లో భాగంగా జిల్లాలో నడుస్తున్న శిక్షణ కేంద్రాలు అవినీతిమయంగా మారాయి. జిల్లాలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. పిల్లల సంఖ్యను అధికసంఖ్యలో చూపించి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రాజñ క్టు అమలు బాధ్యతలు రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. తమను ప్రశ్నించేవారే లేరనే ధీమాతో సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 22 శిక్షణ కేంద్రాలు... జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథకం(ఎన్సీఎల్పీ) జిల్లాలో 1996 నుంచి అమలులో ఉంది. కేరళ మినహా దేశవ్యాప్తంగా 272 జిల్లాలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, డీఆర్డీఏ పీడీ సెక్రటరీగా ఉండే ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన. జిల్లా వ్యాప్తంగా వినుకొండ, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పిడుగురాళ్ల, తెనాలి, రెంటచింతల, సత్తెనపల్లి, రాజుపాలెం, బొల్లాపల్లి తదితర మండలాల్లో 22 శిక్షణా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో 1,112 మంది పిల్లలు ఉన్నట్లు పథకం నిర్వాహకులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఒక్కొక్క సెంటర్లో ఇద్దరు శిక్షకులు, అకౌంటెంట్, ఆయా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుసెంటర్లకు కలిపి ఒక ఒకేషనల్ శిక్షకుడు ఉంటున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో సెంటర్లో 50 నుంచి 60 మంది పిల్లలు ఉంటున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు నగరంలో ఐదు సెంటర్లు ఉండగా పొన్నూరు రోడ్డులోని సాయిబాబా కాలనీలో మినహా ఏ ఒక్క సెంటర్లో కూడా పిల్లలు లేక సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నల్లచెరువు 23వ లైన్లోని శిక్షణా కేంద్రంలో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవంగా అక్కడ 20 మందికి మించి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితులే జిల్లాలోని అన్ని సెంటర్లలో ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్న భోజనం మినహా సౌకర్యాలు శూన్యం.. 1,112 మంది పిల్లలకు సై్టఫండ్ నిమిత్తం నెలకు రూ.1.66 లక్షలు అందిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా అదే సంఖ్యలో పిల్లలకు వడ్డిస్తున్నట్లు లెక్కలు తయారుచేస్తూ నిధులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. విద్యార్థులకు యూనిఫాం కూడా ఇంతవరకు అందించిన దాఖలాలులేవు. మధ్యాహ్న భోజనం మినహా ఇతర సౌకర్యాలేవీ పిల్లలకు కల్పించలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. శిక్షణా కేంద్రాలకు సమీపంలోని పిల్లలను పిలిచి మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎన్సీఎల్పీ జాతీయ కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరుతున్నారు. తెనాలిలో.... తెనాలి ఐతానగర్లోనూ ఎన్సీఎల్పీ కేంద్రం ఉంది. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలను ఎన్సీఎల్పీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు వయస్ను 50 మంది విద్యార్థులు ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో చూపెడుతున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవానికి అక్కడ విద్యనభ్యసిస్తున్న సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.