breaking news
mythological movie
-
అడవి పిలిచింది!
‘అడవి పిలిచింది... నేను సమాధానం చెప్పాను’ అని అంటున్నారు హీరోయిన్ తమన్నా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అరుణభ్ కుమార్–దీపక్ మిశ్రా దర్శకత్వంలో ‘వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, ది వైరల్ ఫీవర్ మోషన్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో తమన్నా నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆమెపాత్ర తాలూకు ప్రీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. రాత్రి వేళ ఎర్రటి చీర ధరించిన తమన్నా కారు దిగి, అడవిలోకి వెళ్లి, అక్కడ ఓ దీపం వెలిగించడం, అక్కడ ఏదో దృశ్యాన్ని చూసి కళ్లు పెద్దవి చేయడం వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి. ‘‘అడవి పిలిచింది. నేను సమాధానం చెప్పాను. ‘వ్వాన్’లో భాగం కావడం థ్రిల్లింగ్గా ఉంది’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు తమన్నా. ఈ సినిమా 2026లో విడుదల కానుంది. -
ఎన్టిఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి
ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి. నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి. ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె. పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా! గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు. అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు– రాకుమారిని తెగించి వరించే తోట రాముడు– అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు– పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు... విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు? వారి ఎదురుచూపు ఫలించింది. తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది. ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది. తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది. వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు. ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు. తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం. నేడు ఎన్టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్.. క్యాంటిన్లో మీరు నాకు ఇవ్వమని అలాట్ చేసిన టిఫిన్ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్ అని నిర్దేశించారు. ఎన్.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర. ‘మాయాబజార్’ తర్వాత ఎన్.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్. రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. బి.ఎన్. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్. నెరేషన్ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది. రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్ మూల పడేశారు. ఎన్.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో. ‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సింగింగ్ స్టార్స్ అయ్యారు. బెరుకు లేకుండా స్లీవ్లెస్ జాకెట్ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్ స్టార్లుగా వెలిగారు. సీహెచ్ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్పాట్ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్ సౌత్లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్.టి.ఆర్ చేసినవన్నీ చేయలేదు. ఎన్.టి.ఆర్ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్స్టార్లలో రాజ్కపూర్, దేవ్ ఆనంద్ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్. దిలీప్ కుమార్ మాత్రమే ఫోక్లోర్, హిస్టారికల్ (మొఘల్ ఏ ఆజమ్) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్ కపూర్ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్ జోకర్’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్.టి.ఆర్ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా. పిల్లలకు నచ్చాలి ఫస్ట్. జేమ్స్బాండ్ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్మేన్, స్పైడర్మేన్ వంటి సూపర్ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్.టి.ఆర్తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్.టి.ఆర్ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం). చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్.టి.ఆర్ స్టూడియో కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే ఎన్.టి.ఆర్ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్.టి.ఆర్ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు. ఆ కృష్ణబలం ఎన్.టి.ఆర్దే. ఇక ఆ పిల్లలు ఎన్.టి.ఆర్ని వదల్లేదు. ఎన్.టి.ఆర్ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్ నైట్స్ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ... అరేబియన్ నైట్స్ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్మేన్ ఆయనే (సూపర్ మేన్). టార్జాన్ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్.టి.ఆర్ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్హిట్స్ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా? ‘డ్రైవర్ రాముడు’ వంటి మాస్ హిట్ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి. అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన. భారతంలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్పోర్ట్లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్.టి.ఆర్ ‘బ్రదర్... దుర్యోధనుడికి డ్యూయెట్ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్ ఎదుట పడితే ఒట్టు. ఎన్.టి.ఆర్ దుర్యోధనునికి డ్యూయెట్ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్.టి.ఆర్కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్’కు మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్.టి.ఆర్. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్.టి.ఆర్ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్ ఈ డైలాగ్. ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్స్తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్ చేస్తూ ఎన్.టి.ఆర్ కొనసాగారు. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్కు పేటెంట్ ఎన్.టి.ఆర్ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్.టి.ఆర్ ‘అక్బర్ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్.టి.ఆర్ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్.టి.ఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్’ చిన్న రసాలు.. పెద్ద రసాలు. నిజం చెప్పాలంటే ఎన్.టి.ఆర్కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్.టి.ఆర్ తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్.టి.ఆరే సూట్ అయ్యారు. అమితాబ్ ‘జంజీర్’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్’ – ‘యుగంధర్’గా, రాజేష్ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు. 39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్.టి.ఆర్కు బలం దొరికింది. కె. రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి భారీ హిట్స్ ఇవ్వడం ఎన్.టి.ఆర్ను లైఫ్టైమ్ అచీవ్మెంట్కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్.టి.ఆర్ కెరీర్ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్.టి.ఆర్ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్.టి.ఆర్ కెరీర్ చూసినా అర్థమవుతుంది. ఎన్.టి.ఆర్ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి. కాని ఈ అపజయాలు చూసిన ఎన్.టి.ఆర్ సినిమా కథ గ్రామర్లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్హిట్ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్.టి.ఆర్లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి. ఎన్.టి.ఆర్ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్.టి.ఆర్ అమరుడు. -
సవాల్కి సై అంటున్న టాప్ హీరోయిన్స్
చిట్టిపొట్టి దుస్తులు... రెండు మూడు పాటలు... హీరోని ప్రేమలో పడేయడానికి పడే పాట్లు... కథానాయికల పాత్రలు దాదాపు ఇలానే ఉంటాయి. అందుకే నిండైన దుస్తులు... మెండైన నటన కనబరిచే అవకాశం వస్తే ఎడారిలో ఒయాసిస్సులా భావిస్తారు. అది కూడా పౌరాణిక పాత్రలంటే చెప్పక్కర్లేదు.. పెద్ద సవాల్. ఆ సవాల్ని స్వీకరించారు కొందరు నాయికలు. ఏరికోరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అసలు సిసలైన పురాణ స్త్రీల్లా ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యారు. గ్లామర్, లేడీ ఓరియంటెడ్, నెగటివ్ షేడ్స్ (‘సూపర్ డీలక్స్’ సినిమా, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్).. ఇలా తన యాక్టింగ్లోని భిన్న కోణాలను ఆవిష్కరించారు సమంత. యాభైకి పైగా సినిమాలు చేశారామె. కానీ కెరీర్లో తొలిసారి మైథాలజీ ఫిల్మ్ ‘శాకుంతలం’ చేశారు. దుష్యంతుడు, శకుంతల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. ‘‘శకుంతల పాత్రను నేను జీవితాంతం మర్చిపోలేను’’ అని ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా పేర్కొన్నారు సమంత. దీన్నిబట్టి ఈ పౌరాణిక పాత్ర చేయడంపట్ల ఆమె ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మహా సాధ్వి సీత పాత్రను అంగీకరించి, పెద్ద సాహసమే చేశారు కంగనా రనౌత్, కృతీ సనన్. సీత పాత్ర అంటే కత్తి మీద సామే. ఎందుకంటే ఆ పాత్ర అంటే అంజలీ దేవినే గుర్తొస్తారు. ఆ తర్వాత సీత పాత్రలో నయనతార మెప్పించగలిగారు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’లో సీత పాత్ర చేస్తున్నారు కృతీ సనన్. తన కెరీర్లో ఇంతకుముందు ‘కళంక్’ వంటి పీరియాడికల్ ఫిల్మ్ చేసినప్పటికీ మైథలాజికల్ బ్యాక్డ్రాప్ చేయడం ఇదే తొలిపారి. అందుకే వేషధారణ, హావభావాల పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారట కృతీ సనన్. ఇక బాలీవుడ్లో బయోపిక్స్ అండ్ లేడీ ఓరియంటెడ్ ఫిలింస్కు ఓ కేరాఫ్ అడ్రస్గా మారారు కంగనా రనౌత్. ఇప్పటికే స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీభాయ్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత (తలైవి)గా నటించిన కంగన తాజాగా భారత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ (ఎమర్జెన్సీ) పాత్ర చేస్తున్నారు. అలాగే పౌరాణిక చిత్రం ‘సీత: ది ఇన్కార్నేషన్’లో సీతగా నటించనున్నారు. ఇంకోవైపు సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ కూడా పురాణ స్త్రీగా కనిపించనున్నారు. 2018లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ చిత్రంలో రాణీ పద్మావతిగా దీపికా పదుకోన్ అభినయం అద్భుతం. పద్మావతి పాత్రలో దీపిక ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. ఆ ఉత్సాహంతోనే మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ద్రౌపది పాత్రలో నటించేందుకు ఇటీవల పచ్చజెండా ఊపారు దీపికా పదుకోన్. ద్రౌపది కోణంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రాన్ని రెండు లేదా మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నారు.ఈ నాయికలే కాదు.. రామాయణం, మహాభారతాల ఆధారంగా రూపొందుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్లలో మరికొందరు తారలు పురాణ స్త్రీలుగా కనిపించనున్నారు. -
పురాణ పురుషులు
హీరోలు ఎలాంటి పాత్ర చేయాలన్నా కుదురుతుంది. యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ట్రాజడీ. కానీ పౌరాణిక పాత్ర చేయాలంటే మాత్రం కలసి రావాలి. కథ కుదరాలి. బడ్జెట్ కుదరాలి. ఫిజిక్ కుదరాలి. ప్రస్తుతం కొందరు హీరోలకు అవన్నీ కుదిరాయి. పౌరాణిక సినిమాలతో సిద్ధమవుతున్నారు. పురాణ పురుషులుగా మారబోతున్నారు. ఆ పురుషుల వివరాలు. ఆది పురుష్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీ రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం విలు విద్య నేర్చుకుంటున్నారు ప్రభాస్. అలానే తన శరీరాకృతిని కూడా మార్చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. హిరణ్య కశ్యప గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పౌరాణిక చిత్రం ‘హిరణ్య కశ్యప’. సుమారు 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా టైటిల్ రోల్ పోషించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఏడాదిన్నరగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు గుణశేఖర్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మహావీర్ కర్ణణ్ విక్రమ్ హీరోగా తమిళ–హిందీ భాషల్లో ‘మహావీర్ కర్ణణ్’ అనే ప్రాజెక్ట్ను గత ఏడాది ప్రకటించారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్రలో విక్రమ్ నటించనున్నారు. ఆర్.ఎస్ విమల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. రండామూళం... మహాభారతాన్ని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు మలయాళ దర్శకుడు వాసుదేవ్ నాయర్. భీముడి పాత్ర కోణం నుంచి భారతాన్ని చెప్పబోతున్నట్టు ‘రండామూళం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో భీముడి పాత్రలో మోహన్లాల్ నటించనున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్. అల్లు అరవింద్ నిర్మాణంలో బాలీవుడ్లో రామాయణం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా 1500 కోట్లతో తెరకెక్కనుంది. నితేష్ తివారీ, రవి ఉడయార్ ఈ చిత్రాలను డైరెక్ట్ చేయనున్నారు. నటీనటులను ఇంకా ప్రకటించలేదు. అలానే మహాభారతాన్ని సినిమాగా తీయాలనుందని ఆమీర్ ఖాన్ చాలాసార్లు ప్రకటించారు. అందులో ఆయన శ్రీకృష్ణుడి పాత్ర చేయాలనుకుంటున్నారని టాక్. -
ఈ రెండు కోరికలు తక్క!
బీయే సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణంరాజు...నటించిన ఒక పౌరాణిక సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... భార్య చేతుల్లో ఉన్నాడు భర్త. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.‘‘నేను ఉండగా నీకే గండం రానివ్వను’’ భర్తకు ధైర్యం చెబుతుంది సావిత్రి.ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వు.‘‘ఎవరునువ్వు?’’ రెట్టించి అడిగింది ఆమె.‘‘మృత్యువును’’ అని సమాధానం వచ్చింది.‘‘మృత్యువా? ధర్మరాజా అభివందనం. నీ దివ్యసందర్శనం ప్రసాదించు’’ అని వేడుకుంది సావిత్రి.అదిగో ఆయన దివ్యమంగళరూపం!‘‘ధన్యోస్మి ప్రభూ! ధర్మప్రభూ నీ కర్తవ్య నిర్వాహణకు వచ్చావా?’’ అని అడిగింది సావిత్రి.‘‘అవును తల్లీ’’ అన్నాడు యమధర్మరాజు.‘‘నా పతిప్రాణాలు తీసుకొనిపోక తప్పదా?’’ అని అడిగింది దీనంగా.‘‘తప్పదమ్మా. కాని నవ్వు మహాప్రతివతవు’’ అన్నాడు ఆయన చల్లగా! నీ ఒడిలో ఉన్నంత వరకు నీ పతి ప్రాణాలను తీసుకోలేను. అతనిని భూశయనం చేయించు’’ అన్నాడు యమధర్మరాజు.ఈమాటతో ఆమెలో ఒకింత ఆగ్రహం తొంగి చూసింది...‘‘ధర్మపాలన నీకే కాదు నాకూ ఉన్నది. పతిప్రాణాలను మృత్యువుకు అర్పించుట సతికి ధర్మమా?’’ అని ఆవేశంగా అడిగింది.‘‘ఇందులో మీరు అర్పించినది ఏమియును లేదు. నీ భర్త ఆయుఃకాలం తీరింది. మృత్యువు ఆవశ్యం. అనివార్యం!’’ గట్టిగా అన్నాడు ధర్మరాజు.‘‘అనివార్యమైనప్పుడు నేను భూశయనం చేయించవలసిన అవసరంఏమిటి?’’ అన్నది ఆమె.‘‘నన్ను పరీక్షిస్తున్నావా?’’ గొంతు పెద్దది చేశాడు యమధర్మరాజు.‘‘నా సతీధర్మాన్ని పాటిస్తున్నాను’’ అన్నది ఆమె.‘‘దాహం...దాహం...’’ అంటున్నాడు ఆమె భర్త.‘‘తెస్తాను ప్రభూ’’ అంటూ నీళ్ల కోసం వెళ్లింది సావిత్రి.ఇదే అదునుగా అతడిలోని ప్రాణజ్యోతిని మృత్యుదండంతో లాగాడు యముడు.సావిత్రి వచ్చే సరికి భర్త చనిపోయి ఉన్నాడు. ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.ప్రభూ! నన్ను విడిచి వెళ్లిపోయావా? నా పసుపు కుంకుమలను తుడిచి వెళ్లిపోయావా? నా తపస్సు వృథా చేసి వెళ్లిపోయావా? మీరు కట్టిన మాంగల్యాన్ని తెంచివేసి వెళ్లిపోయావా?....యమధర్మరాజు అక్కడినుంచి మాయమయ్యాడు. అతడిని అనుసరిస్తూ ఆకాశమార్గంలోకి వెళ్లింది సావిత్రి.‘ఈ శూన్యం కంటే శూన్యమా నీ హృదయం?నా ధైన్యం కన్నా ఘనమా నీ ధర్మం?’ అని యమధర్మరాజుని ప్రశ్నించింది.‘‘తండ్రీ! నీ బిడ్డ వంటి దానను. నాతో పంతమా. వద్దు తండ్రీ వద్దు! నన్ను కరుణించు. నా పతిని నాకు ప్రసాదించు’’ అని వేడుకుంది.‘‘సావిత్రీ...ఎంత చెప్పినను నీ మొండిపట్టుదల విడువలేకున్నావు. దేవర్షి నిన్ను నాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధురాలిని చేసి పంపినట్టున్నాడు. ఆ ధైర్యంతోనే నన్ను అనుసరిస్తున్నావు. ఏమైనా నీ కోరిక నెరవేరదు. మరలిపో’’ అని మాయమయ్యాడు యమధర్మరాజు. ‘‘ధర్మరాజా! నువ్వు అదృశ్యం కాగలవు కాని అసాధ్యుడవు మాత్రం కాదు. అమృత హృదయుడవు. దయాధర్మ గుణశీలుడవు. నిన్ను నేను విడవను’’ అంటూ యముడిని అనుసరించింది సావిత్రి. ‘‘నిష్ఠుర కాల నియమ నిష్ఠా గరిష్ఠ. ప్రకృతి ధర్మ పరిరక్షణా దక్ష...సకల జీవరాశీ జీవనదాత...అనంత తేజోరాశీభూత....నమోవాకములు...నమోవాకములు’’ అని ప్రార్థించాడు యమదర్మరాజు.‘‘కుమరా, ఏమిటి విశేషం?’’ అడిగాడు సూర్యుడు.‘‘విశేషం కాదు తండ్రీ వైపరీత్యం! మృత్యువును జయించి మృతుడైన తన భర్తను బతికించుకోవాలనే సంకల్పంతో అతిలోకశక్తిని సాధించి ఒక సామాన్య మానవాంగన సావిత్రి నన్ను వెంటాడి వచ్చుచున్నది. చండప్రచండ మార్తాండ రూపం ధరించి మీరే ఆమె గమనమును అవరోధించవలెను. ధర్మమును కాపాడవలెను’’ అని వేడుకున్నాడు యముడు.‘‘కుమరా! కాలచక్ర క్రమబద్ధుడనైన నాకు అది కర్తవ్యం’’ అని అభయమిచ్చాడు సూర్యభగవానుడు.‘‘ఉజ్వల ఉగ్రరూపాయ దినకర! శుభకర! ధన్మోస్మి’’ అని ఆ భగవానుడిని ప్రార్థిస్తూనే ‘‘ధర్మరాజా! ఆగు ఆగు’’ అంటూ యముడి వెంట వెళ్లింది సావిత్రి.తన వెనకనే వస్తున్న సావిత్రిని చూసి....‘‘ఏమి ఈ సాహసము! సావిత్రి...ఇది రెక్కలకు అందని రిక్కల కూటమి. కోటి సూర్యప్రభాతమైన ఈ ప్రదేశమునకునీవు రాలేవు. ఆ నక్షత్ర కాంతిని భరించే శక్తి మర్త్యులకు లేదు. వెళ్లు...వెనుతిరిగి వెళ్లు’’ ఆదేశించాడు యముడు.‘‘దేవా! నీ దివ్యతేజస్సును వీక్షించిన నా కనులకు ఈ చుక్కలు ఒక లెక్కా!’’ అన్నది సావిత్రి. అంతేకాదు...‘‘నక్షత్రమండలాన్ని అధిష్టించిన తేజోమూర్తులారా, గ్రహములారా, పతి ప్రాణాల కోసం పయనించి వచ్చిన నన్ను అడ్డగించకండి. నా ఆర్తి బాపండి. నాపై జాలి చూపరా, నా సంకల్పబలం వమ్ము కావల్సిందేనా’’ అన్నది.ఆ సమయంలోనే అరుంధతి ప్రత్యక్షమై...‘‘సావిత్రి! సత్యసంకల్పానికి ఎప్పుడూ విఘాతం కలగదమ్మా. తల్లీ! ఏకాగ్రతను మించిన తపస్సు, ఆత్మశక్తిని మించిన శక్తి లేదమ్మా’’ అని ధైర్యం చెప్పింది.‘‘తేజోమూర్తులారా! ఖగోళాల్లారా! క్షణకాలం పాటు మీ పరిభ్రమణ ఆపండి. సావిత్రికి దారి ఇవ్వండి’’ అని సావిత్రికి ఆటంకం లేకుండా చేసింది. ‘‘ఏది ఏమైననూ కోరరాని కోరికలే కోరుతున్నావు. నీ భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వడం ఎంత అసంభవమో, నీ ప్రాణములు తీసుకుపోవుట అంతే అసంభవం. ఈ రెండు కోరికలు తక్క... మరేమన్నా కోరుకో ఇస్తాను’’ అన్నాడు యమధర్మరాజు.‘‘సతికి పతి కన్నా విలువైనది ఏమున్నది?’’ అన్నది ఆమె.‘‘అయితే మీ అత్తమామలకు దృష్టి ఇస్తా...’’ ‘‘మీ అత్తమామలు కోల్పోయిన రాజ్యసంపదలను తిరిగి ఇస్తా....’’ ఇలా వరాల చిట్టా విప్పుతున్నాడు యమధర్మరాజు.సావిత్రి మాత్రం ఈ వరాలను కాదంది.భర్త ప్రాణాలు మాత్రమే కావాలంది.‘‘ఇవ్వదలచినవి కాదంటావు– ఇవ్వకూడనిది కావాలంటావు. ఏమి నీ మూర్ఖత్వం’’ అని విసుక్కున్నాడు యమధర్మరాజు.‘‘సమవర్తి! ధర్మమార్గాన్ని నమ్ముకున్న నాకు ధర్మమే దారి చూపుతుంది’’ అన్నది సావిత్రి.ఆ మాటల్లో తాను గెలుస్తాననే నమ్మకం ప్రతిధ్వనిస్తుంది. -
250 కోట్ల బడ్జెట్తో సూర్య సినిమా
సౌత్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తరువాత ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధంగా ఉండే స్టార్ హీరో సూర్య. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అదే సమయంలో ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నాడు సూర్య. తాజాగా 24 సినిమాతో మంచి విజయం సాధించాడు. కాలంలో ప్రయాణించటం అనే వెరైటీ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు, తమిళ భాషలతో పాటు ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం సింగం సీరిస్లో తెరకెక్కుతున్న సింగం 3 సినిమాలో నటిస్తున్న సూర్య, మరో ప్రతిష్టాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్షన్లో భారీ పౌరాణిక చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తెండ్రల్ ఫిలింస్ తమ వందో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది.