breaking news
mptc election results
-
టెన్షన్.. టెన్షన్
సాక్షి, ఒంగోలు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం... ఆ తర్వాత 16వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇలా వరుసగా, ఎన్నికల ఫలితాల వెల్లడి క్రమంలో రాజకీయ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఊరూరా రాజకీయ చర్చలే నడుస్తున్నాయి. ఏపార్టీ గెలుస్తోంది.. ఏఅభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తోందనే విషయంపై చిన్నా,పెద్దా లెక్కలు కడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరు గెలవనున్నారో తేలేముందు .. మున్సిపల్, ప్రాదేశిక స్థానాలు ఏపార్టీ పరం కానున్నాయోననే విషయంపై అందరి దృష్టిపడింది. ఈ రెండింటి ఫలితాలను బట్టి సార్వత్రిక అంచనాలు కొలిక్కిరానున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆరు మున్సిపాలిటీల ఓట్లలెక్కింపు.. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. చీరాల, గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీనే ఇచ్చారు. అయితే, అన్నిచోట్లా సామాజికవర్గ ఓటింగ్, మహిళలు, యువత అధికంగా వైఎస్ఆర్ సీపీకే మొగ్గు చూపినట్లు రాజకీయ పరిశీలకులు ఇప్పటికే అంచనా వేశారు. పట్టణాల్లో టీడీపీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోగా.. ఓటర్లలో విశ్వసనీయతను ఆపార్టీ సంపాదించుకోలేకపోయిందనే విశ్లేషణలు వినిపించాయి. జెడ్పీచైర్మన్గిరీ ఎవరి పరం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు దశలుగా జరిగాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ 8, టీడీపీ 7, స్వతంత్రులు 6 చోట్ల ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దీంతో 769 ఎంపీటీసీ, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఓసీ జనరల్ కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమపార్టీ తరఫున జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా బీసీ సామాజికవర్గ నేతకు కేటాయించారు. ఆమేరకు నూకసాని బాలాజీని వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది. టీడీపీ నుంచి మన్నె రవీంద్ర, ఈదర హరిబాబును ప్రకటించారు. మంగళవారం తేలే ఫలితాల్లో వీరి భవితవ్యంతో పాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది వెల్లడికానుంది. అటు మున్సిపల్, ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు 16న జరిగే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాతకాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. గెలుపు ధీమాపై ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. రాజకీయ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. -
మే 12న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
మరుసటిరోజే తేలనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల భవితవ్యం కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వచ్చే నెల 12వ తేదీన మున్సిపల్, 13వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల అనంతరమే ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికలు అడ్డువచ్చాయి. సార్వత్రిక ఎన్నికలపై వీటి ఫలితాల ప్రభావం పడుతుందని సుప్రీం కోర్టు సూచన మేరకు మే నెల 7వ తేదీ తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. ఫలితాలు వాయిదా పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికలు మార్చి 30వ తేదీన జరగగా, వాటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడించాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరగగా వాటి ఫలితాలపై ముందే నిర్ణయం తీసుకున్నారు. మూడు ఎన్నికలకు సంబంధించి మే నెల 7వ తేదీ తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. అయితే ఖచ్చితమైన ప్రకటన వెలువడకపోవడంతో సాధారణ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యాకే ఈ మూడు ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారని భావించారు. ఈసీ కూడా మున్సిపల్ చైర్మన్, నగర మేయర్, జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక కోసం న్యాయ సలహాను కూడా కోరింది. శాసనసభ కొలువుదీరక ముందు చైర్మన్లు, మేయర్ల ఎంపిక చేయవచ్చా లేదా అనే సందిగ్ధంలో పడింది. శాసనసభ కొలువుదీరాకే ఫలితాలు వెల్లడవుతాయనే వాదనలు వినిపించాయి. సంప్రదింపుల అనంతరం ఈసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు నిర్ణయం తీసుకుంది.