breaking news
money policy review
-
ఆర్బీఐ పాలసీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) 2021–22 తొలి ద్వైమాసిక మూడురోజుల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్–19 కేసులు పెరుగుతుండటం, 2–6 శాతం మధ్య ద్రవ్యోల్బణ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటూ కేంద్రం నిర్దేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం కీలక నిర్ణయాలు బుధవారం వెల్లడవుతాయి. తాజా పాలసీ సమీక్షలోనూ కీలక వడ్డీ రేటు రెపో యథాతథ స్థితి కొనసాగించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే రెపో యథాతథ స్థితి వరుసగా ఐదవసారి అవుతుంది. రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఎకానమీ రికవరీలో అసమానతలు ఉన్నాయని, కనిష్ట స్థాయి నుంచి కోలుకునే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని ఎడెల్వీజ్ రీసెర్చ్ తెలిపింది. తాజాగా కోవిడ్ కేసులు విజృంభిస్తుండటం మరో కొత్త సవాలుగా మారిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇటు వృద్ధికి, అటు ద్రవ్యోల్బణ కట్టడికి ఎప్పటికప్పుడు విధానపరమైన చర్యల తోడ్పాటు అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని వివరించింది. ఒకవైపు కోవిడ్–19 కేసులు, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ పరిస్థితి సంక్లిష్టంగా మారిందని హౌసింగ్డాట్కామ్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాలా చెప్పారు. దీనితో తాజా ద్వైమాసిక సమీక్షలో రెపో రేటును మార్చకపోవచ్చని పేర్కొన్నారు. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించిన సెంట్రల్ బ్యాంక్, గడచిన (2020 ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి 2021 నెలల్లో) నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం భయాలను ఇందుకు కారణంగా చూపుతోంది. 18 పైసలు తగ్గిన రూపాయి ముంబై: ఫారెక్స్ మార్కెట్లో సోమవారం రూపాయి విలువ 18 పైసలు కరిగిపోయి 73.30 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్ పతనం రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 73.28 – 73.45 రేంజ్లో కదలాడింది. ఆర్థిక వ్యవస్థ రికవరీకి తోడ్పడే సంస్కరణలేవీ లేకపోవడం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో రూపాయి రానున్న రోజుల్లో బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మర్ తెలిపారు. -
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు తగ్గుతాయా?
ముంబై: కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రకటించనున్న పాలసీ రివ్యూలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశంపై ఆర్థికవర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన జరగనున్న రిజర్వుబ్యాంకు ద్వైమాసిక పరపతి సమీక్షా సమావేశాల్లో రెపో రేటు ను 0. 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తెలిపింది. కీలక వడ్డీరేట్లను 25 పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు తాజా నివేదికలో వెల్లడించింది. అటు వేసవి రబీపంట దెబ్బతినడం వల్ల పప్పుల ద్రవ్యోల్బణం 27 శాతం పెరిగిందని తన నివేదికలో తెలిపింది. ప్రస్తుతం వర్షాలు సాధారణం కంటే అధికంగా ఉంటాయన్న అంచనాతో ఖరీఫ్ సీజన్లో పంటలు 39 శాతం అధికంగా వేసారని పేర్కొంది. దీంతో మార్చి చివరికి పప్పుల ధరలు 20 శాతం వరకు తగ్గముఖం పట్టనున్నాయని పరిశోధన తేల్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల ను 5.7నుంచి 5.1 శాతానికి కుదించుకున్న సంస్థ ఇవి దిగిరావచ్చునని బీఓఎఫ్ఏ -ఎంఎల్ తన పరిశోధనా పత్రంలో వెల్లడించింది. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయని మెరిల్ లించ్ పేర్కొంది. ఒకటి.. రుతుపవనాలు అనుకూలంగా ఉంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవొచ్చు. రెండవది. జూన్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం కాస్తా అదుపులోకి వచ్చింది. మూడోది వడ్డీరేట్లు అధికంగా ఉండటంతో మే నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు పేలవంగా నమోదయ్యాయని.. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ వచ్చే నెలలో 25 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. కాగా జూన్లో జరగిన పరపతి సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించారు. దీనికి ఆయన చెబుతున్న కారణాలు ద్రవ్యోల్బణం ఒత్తిడి ఎక్కువగా ఉందని.. ఒక వేళ రుతుపవనాలు అనుకూలంగా ఉంటే వడ్డీరేట్లు తగ్గిస్తామని చెప్పారు. మరోవైపు జూన్ మాసపు టోకు ధరల సూచీ 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. మరి ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..